పిల్లనగ్రోవి కధ!


పిల్లనగ్రోవి కధ!

.

అనగనగా అవి సీతారాముల వనవాసపు రోజులు. సీతమ్మవారొక రోజు చెరువులో జలకాలు ఆడుతున్నదట. స్నానం కానిచ్చి ఒడ్డుకి వచ్చి పర్ణశాలకి దారి తీస్తుండగా, దార్లో ఓ ముల్లు ఆవిడ కాల్లో గుచ్చుకుందట. బహు సుకుమారి. కళ్లంట జివ్వున నీళ్ళు చిప్పిల్లాయి.

అల్లంత దూరాన ఉన్న రాముల వారిని " స్వామీ..!" అని పిలిచి, పక్కనే ఉన్న రాయి మీద కూర్చుండిపోయిందట.

పరుగున వచ్చిన రాముల వారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట.

ఇంకొకింత ఎర్రగా కందిన అరికాలిని చూసి బెంబేలు చెందారట. ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా

ఆ ముల్లును బయటకు లాగి, సీత మొహం వైపు చూసారట.ముల్లు దిగిన కంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందేమో! జలజలా నీటి బొట్లు ఎర్రటి చెక్కిళ్ళ మీద జారిపోతుండగా "వచ్చేసిందా?" అన్నట్టు చూస్తోందట ఆయన వైపు.

ఏడు మల్లెలెత్తు రాకుమారిని అడవులంట తిప్పుతున్నానే అనే బాధలో అసలే మునిగి ఉన్నారేమో రాముల వారు, చేతిలో ఉన్న ముల్లు వైపు క్రోధంగా చూసారట.

అది చూపా? అనల బాణమా? ముల్లు భగ్గున మండి బూడిదైపోయిందట.

ఇదంతా చూస్తున్న సీతమ్మ వారు " అయ్యో, ఏలే దొరలే కినుక చూపితే ఇంక దిక్కెవరు ప్రాణులకు? మండుట అగ్ని లక్షణం. అలాగే గుచ్చుట ముల్లు లక్షణం. ఇంత పెద్ద శిక్షా ప్రభూ?" అని వాపోయిందట.

మహాత్ముల కోపం తాటాకు మంట కదూ! చప్పున చల్లారిన రామయ్య నొచ్చుకున్నాడు. బూడిదయిన ముల్లుని దయగా చూసాడు. కాల్చిన చూపే కరుణించి ఏం వరమిచ్చిందయ్యా ముల్లుకి అంటే.. మరుజన్మలో వెదురై పుట్టి కృష్ణుడి చేతిలో పిల్లనగ్రోవి అయిందట. సంతోషంతో మధురంగా మ్రోగిందిట.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!