Posts

Showing posts from November, 2014

అన్నమాచార్య కీర్తనలు.!

Image
అన్నమాచార్య కీర్తనలు ఈ పాదమే కదా యిల యెల్ల( గొలిచినది యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది !!పల్లవి!! ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది యీ పాదమే కదా యీ గగన గంగ పుట్టినది యీ పాదమే కదా యెలమి( బెంపొందినది యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది !!ఈ పా!! యీ పాదమే కదా యిభరాజు దల(చినది యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది యీ పాదమే కదా బ్రహ్మ కడిగినది యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది !!ఈ పా!! యీ పాదమే కదా యిహపరము లొసగెడిది యీ పాదమే కదా యిల నహల్యకు( గోరికైనది యీ పాదమే కదా యీక్షింప దుర్లభము యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది !!ఈ పా!! బ్రహ్మ కడిగిన –పాదము బ్రహ్మము దానె నీ పాదము !!పల్లవి!! 1.చెలగి వసుధ గొలి చిన నీ పాదము బలితలమోపిన పాదము తల(కక గగనము దన్నిన పాదము బలరిపు(గాచిన పాదము !! బ్రహ్మ!! 2.కామిని పాపము గడిగిన పాదము పాము తలనిడిన పాదము ప్రేమపు శ్రీపతి పిసికెడి పాదము పామిడి తురగపు( బాదము !!బ్రహ్మ!! 3.పరమ యోగులకు( బరిపరి విధముల పరమొస(గెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము

దేవాదిదేవ.!..........కరుణశ్రీ.

Image
దేవాదిదేవ.!..........కరుణశ్రీ. . తెల వారకుండ మొగ్గలలోనజొరబడి వింత వింతల రంగు వేసి వేసి తీరికే లేని విశ్వ సంసారమందు అలసి పోయితివేమొ దేవాదిదేవ ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు కూర్చుండ మా యింట కురిచీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి x

ప్రాభాతి.!............(కరుణశ్రీ.)

Image
ప్రాభాతి.!............(కరుణశ్రీ.) . . రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్ ప్రోగులు వోయగా నిదురపోవు దయామయి! నా యెడందలో ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెతో దాగుడు మూత లాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా! x

మన గిరీశం.:---

Image
మన గిరీశం.:--- . నువ్వు "టెల్గూ" వాడివి కావూ ? " అయినవారికి ఆకుల్లో , కానివారికి కంచాల్లో" అన్న అచ్చ "టెల్గూ" సామెతను గౌరవించవూ ? ఆ నానుడికి ఆర్ధమేమిటిట !..  విసిరిపారేసే విస్తర్లలో అయినవారికి, కడిగి దాచుకొనే కంచాల్లో కానివారికి వడ్డించాలనే కదా !  మరి ఆ సామెతకు పట్టం కట్టాలన్న "సత్సంకల్పం"తోనే కదూ , మీ "కొత్త మేస్టార్లు"న్నూ .. స్కూళ్లల్లో నుంచి మనదైన తెలుగును ఆవలకు నెట్టి , మనది కాని ఇంగ్లీషును అందలమెక్కిస్తుంట !.  జాగ్రఫీ, గీగర్ఫీ, ఆల్జీబ్రా , ఇంగ్లీషుతోపాటు తెలుగులోనూ నా వద్ద శిష్యరికం చేసిన నీకు ఇంత చిన్న విషయం అర్ధం కాకపోవడమేమిటోయ్ !  అసలు నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్. అటువంటిది ఎడ్యుకేషన్ లో నా దగ్గర తర్ఫీదైన నువ్వు ఇలా మాట్లాడటమేమిటి!  "సున్నా" గొప్పదనాన్ని గుర్తించకుండా ఎంతసేపూ ఒకట్లు , పదులూ అంటూ నువ్వు అంకెల్నే పట్టుకుని వేలాడింది చాలక , నా సావాసం చేయడం చేతనే నిన్ను మీ కొత్త మేస్టార్లు పక్కన పెట్టారని అభాండం వేస్తావ్ ?  "ది ఎలెవన్ కాజెస్ టు అడోర్ ది జీరో" విషయమై నేనిచ్చిన లెక్చర్లు వంట

పెళ్లి అయిన కొత్తలో.:--

Image
పెళ్లి అయిన కొత్తలో.:-- మా పెళ్లి అయిన కొత్తలో ఒక రోజు మా అత్తగారు నన్ను ప్రక్కకి పిలిచి ఒక కాగితం ఇచ్చారు. అందులో ఈ గేయం ఉంది.  . పాపాయి కన్నులు కలువ రేకుల్లు పాపాయి జుంపాలు పట్టు కుచ్చులు పాపాయి దంతాలు మంచి ముత్యాలు . నాకు ఏమి అర్ధం కాలేదు. మీ ఆవిడ ఏడుపు మొదలు పెడితే ఒక పట్టాన ఆపదు. చిన్నప్పుడు ఏడుపు మొదలు పెట్టగానే నేను ఇది పాడేదాన్ని. అంతే ఏడుపు మానేసింది అని చెప్పారు. మీ పిన్ని కాపరానికి వచ్చిన వారం రోజులకి వాళ్ళ అమ్మ మీద బెంగ పడింది. నాకేమో సెలవు లేదు.ఆ మాట అన్నాను అని ఏడ్చేసింది.నాకు చాలా ఖంగారుగా అనిపించింది.ఏం చేయాలో అర్ధం కాక వెంటనే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన కాగితం తీసుకుని ఉండుండు ఏడవకు అని గబా గబా ఆ గేయం చదివేసాను. ఇక మీ పిన్ని అటు సంతోషం, ఇటు ఆశ్చర్యం ,మళ్లి అంతలోనే దిగులు.. కాసేపటికి మామూలు మనిషి అయ్యింది." మా అమ్మలా పాడలేదు మీరు ఊరికే పాఠం అప్పచెప్పినట్టు చెప్పారు "అని పోట్లాట మొదలు పెట్టింది. సరే మీ పిన్ని బాధ కన్నా పోట్లాట మంచిది అనిపించి నేను కూడా "పోనిలే అని పాడితే వంకలు పెడతావ ?"అని అన్నాను. మొత్తానికి చాలాసార్లు ఈ

సంపదలో మరుపులు ఆపదలో అరుపులు....

Image
సంపదలో మరుపులు ఆపదలో అరుపులు........ దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు అని దాశరధి గారు ధైర్యం తెచ్చుకుంటే దేవుడికేం హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు అంటూ శ్రీ శ్రీ గారు బాధపడతారు దేవుడ్ని గురించిన నిరంతర చింతన సృష్ట్యాది నుండీ జరుగుతూనే ఉంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేవుణ్ణి గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. పాలకడలిపై శేషతల్పం మీద పడుకున్నావా దేవా అని ఒక భక్తుడు దేవుడి సౌఖ్యాన్ని చూచి పులకరించిపోతాడు. అఖిల జగతిని సృష్టి జేసి, ఆడి పాడి అంతలోనే ఈ బొమ్మలాట ఆపుతావు నటన సూత్రధారీ అని ఒక కవి చమత్కరిస్తాడు. అసలు దేవుడనే వాడు ఉన్నాడా అని మనిషికి సందేహం కలిగితే, మనుషులనే వారున్నారా అని దేవుడికే అనుమానం వచ్చిందని ఒక సందేహాల స్వామి సెలవిస్తాడు. పండితులంతా దేవుణ్ణి గురించి పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తుంటే జాన పదులు గూడా దేవుడి మీద పరిశోధనలు చేసి పద్యాలల్లారు. పళ్ళు ఊడిన ముసలోళ్ళు మాత్రం దంతాలు పటపటా కొరుకుతున్నారు. సి. నారాయణ రెడ్డి కూడా అట్లాంటి దేవుడి నీడలో వేదన మరచి పొమ్మంటాడు. అయితే ఆరుద్ర, ఆత్రేయ లాంటి వాళ్ళకు దేవుడు ఒక్కడే అన

ఆచార్య ఆత్రేయ....

Image
ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు.  అందుకనే ఆయన రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో.  ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, .  డాక్టర్ చక్రవర్తి సినిమాలోని "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి శ్రీశ్రీ గా లబ్ధప్రతిష్టుడైన శ్రీరంగం శ్రీనివాసరావు. . వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే ...... సినిమాలో "కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిచాన" పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.

దంపతులు..:-

Image
దంపతులు..:- నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు.  . నేనేం మాట్లాడుతున్నానో నీకు బోధపడడం లేదు. . అయినా కొన్ని దశాబ్దాలుగా మాట్లాడుకొంటూనే ఉన్నాం "  ఎదుటివారి గురించి పట్టించుకోవాలంటే ముందు మనమేమిటో మనకి తెలియాలిగా?  . "ఏ వ్యక్తీ జీవిత భాగస్వామిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అందుకే అర్థం చేసుకొనే విషయం లో ఆరాటాలొద్దు. మనం చేయవలసిందల్లా ఒక్కటే... తక్కువగా అర్థం చేసుకోవడం. ఎక్కువగా ప్రేమించడం" మనకన్నీ పున్నములే.... వెన్నెల పూల పున్నాగలే... అందుకే ప్రేమిద్దాం...  . ప్రేమ కోసం జీవిద్దాం... జీవితాన్ని ఆద్యంతం ఆస్వాదిద్దాం....

కార్యేషు దాసీ కరణేషు మంత్రీ:--

Image
"కార్యేషు దాసీ కరణేషు మంత్రీ...భోజ్యేషు మాతా శయనేషు రంభా. .అపురూపమైనదమ్మ ఆడజన్మ.... ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా..." అని ఓ పక్కన రాస్తూనే ఉంటారు...ఇంకో పక్కన ఇల్లాళ్ళు అగచాట్లు పడుతూనే ఉంటారు. . ఏమైనా ఎదురు ప్రశ్నిస్తే.... "నీ సాధింపు తట్టుకోలేకపోతున్నా" అంటూ తాగి వస్తారు. "తాగేప్పుడు మీకు ఇల్లాలు జ్ఞాపకం ఉండదా" ??? అంటూ ప్రశ్నిస్తుందా అమాయక ఇల్లాలు.. "నిజం చెప్పమంటావా ? తాగినప్పుడు నేను ప్రతి బాధనూ మరిచిపోతాను" అంటాడు భర్త. పెళ్ళికి ముందు "నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం" అన్న వ్యక్తి పెళ్ళైన తరువాత ఇలా ఎలా మాట్లాడేస్తాడు ? అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.  ఇదేదో బలవంతపు పెళ్ళో లేక పెద్దలు కుదిర్చి చేసిన సాంప్రదాయాల పెళ్ళిళ్ళ విషయంలోనోనే కాదు జరుగుతున్నది... "నీకు నేనూ, నాకు నువ్వూ...ఒకరికొకరం నువ్వూ నేనూ..." అనుకొంటూ పెద్దలను, సమాజాన్ని సైతం ఎదిరించి పెళ్ళి చేసుకొన్న ప్రేమైక జీవుల వ్యధ కూడా.... "ఎందుకిలా ?" అని అడగడం కూడా అనవసరమే... దానికి సమాధానం ప్రతి ఒక్కరికీ తెలుసు... కాకపోతే ఎవరి చేదు వారిది.....

భూషణములు వాణికి నఘ పేషణములు .....

Image
పోతన - శ్రీమద్భాగవతం ! . భూషణములు వాణికి నఘ పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ త్తోషణములు గల్యాణవి శేషణములు హరిగుణోపచితభాషణముల్! . పదవిభాగం:  భూషణములు, వాణికిని, అఘ, పేషణములు, మృత్యు, చిత్త, భీషణములు, హృత్తోషణములు, కల్యాణ, విశేషణములు, హరిగుణోపచిత, భాషణముల్. . భావం: విష్ణుమూర్తిని వర్ణిస్తూ, ఆయనలో ఉన్న సుగుణాలను కీర్తిస్తూ పలికే పలుకులు  సరస్వతీదేవికి అలంకారం అవుతాయి. అంతేకాదు సకల పాపాలను పోగొడతాయి. మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మృత్యువును నివారిస్తాయి. శుభాలు కలుగచేస్తాయి.

‘పాడుతా తీయగా సల్లగా...’

Image
నా పాట నీ నోట పలకాల సిలకా’ పాటలో  ‘నా నీడ సూసి నువు కిలకిలా నవ్వాల’ అంటూ నవ్వు గురించి రాసి;  . ఆచార్య ఆత్రేయ మరో మూడు పాటలను మాత్రం కన్నీటితో తడిపారు. ఈ మూడు పాటల్లోని భావాలూ, వ్యాఖ్యానాలూ సినిమా పాత్రల పరిమిత పరిధిని దాటిపోయాయి. అందరికీ అన్వయించే స్థాయిలో తెలుగులో స్థిరపడిపోయాయి. సందర్భానుసారం కోట్ చేసే పంక్తులుగా మారాయి. ‘ముద్దబంతి పూవులో మూగకళ్ళ వూసులో ’ పాటలో - నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా మనసును పైపైన కాకుండా లోతుగా అర్థం చేసుకోవాలనే సూచన.. ‘మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను’ పాటలో- కలలు కనే కళ్ళున్నాయి, అవి కలతపడితె నీళ్ళున్నాయి కలల కనటం , అనుకున్నది జరగకపోతే కన్నీళ్ళు రావటం ఎవరికైనా సామాన్యమే అనే వాస్తవానికి అద్దం పట్టటం. ఇక ‘పాడుతా తీయగా సల్లగా...’ పాటలో - గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న వుండవమ్మ శాన్నాళ్ళు ఏడిస్తే బాధ తగ్గిపోయి ఊరట కలుగుతుందనేది కవితాత్మకంగా చెప్పటం. ఆ బాధ ఎంతటిదయినా కాలం గడిస్తే దాని తీవ్రత తగ్గిపోతుందని కూడా చెప్పటం .

వాలీ, కర్ణుడూ!

Image
వాలీ, కర్ణుడూ! . విజేతలంటే ఎవరికైనా ఇష్టమే! కానీ పరాజితుల్లోనూ కొందరు తమ ప్రత్యేక లక్షణాలతో ఆకట్టుకుంటారు. పురాణేతిహాసాల విషయానికొస్తే... రామాయణంలో వాలీ, భారతంలో కర్ణుడూ అలా నాకు ఇష్టంగా అనిపిస్తారు. ఇద్దరూ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. చెట్టు చాటు నుంచి దూసుకొచ్చిన రామబాణానికి వాలీ;  రథం కుంగి నిస్సహాయంగా ఉన్నపుడు అర్జున బాణానికి కర్ణుడూ! భీష్ముడు అర్థరథుడిగా చేసి అవమానించినా తర్వాత కౌరవ సేనకు సర్వసైన్యాధిపత్యం వహించిన కర్ణుడి పేర ఏకంగా ఓ పర్వమే ఉంది; ‘కర్ణుడు లేని భారతం’ అని మాట పుట్టింది. ఈ స్థాయిలో వాలికి, రామాయణంలో ప్రాధాన్యం లేకపోయినా ఆ పాత్రలో ఆకర్షణ ఉంది. ఎదుటివ్యక్తిలోని శక్తిని లాగేసుకునే ప్రత్యేకత వాలిది. సహజ కవచ కుండలాలు కర్ణుడి విశిష్టత. వీటివల్ల నాకు ప్రాథమికంగా ఆ పాత్రలపై ఆసక్తి పెరిగి వుండొచ్చు. వాలి వధ విషయంలో రాముడి వాదన అసంతృప్తికరంగానే ఉండేది, సుగ్రీవుడు అన్నను నిందిస్తూ యుద్ధానికి రమ్మని సవాలు విసురుతుండగా కిష్కింధ అంత:పురంలో వాలీ, తారల మధ్య నడిచే సంభాషణ ఎంతో భావగర్భితంగా ఉంటుంది.  . కర్ణుడి విషయానికొస్తే.. తనను ఆదరించిన కౌరవుల పక్షాన చివరిదా

ఒక ఝలక్

Image
ఒక ఝలక్  . * ఆ నవ్వేమిటమ్మాయ్… ఆడపల్ల కాలు గడపదాటకూడదు.  నవ్వు పెదవి దాటకూడదు… తెలుసా? కారణం లేని నవ్వు, తోరణం లేని పందిరి, పూరములని బూరె పనికి రాదన్నాడు శాసకారుడు. మీకివమి తెలియవు!  మీ ఇంగ్లీషు బళ్ళలో లింకన్ ఎప్పుడు పుట్టాడు? డంకెన్ ఎప్పుడుచచ్చాడు! ఇవే తప్ప… రాముడవరు, కృషుడవరు ఇవి చెప్పి తగలడరు!

సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం. .

Image
సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం. . . "మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.! . ఇందులో ఉన్నది పూర్తిగా వ్యక్తిగత దృష్టి. వ్యక్తిగా మనం మన శరీరంతోనూ, మనసుతోనూ అనేక బంధాలను పెంచుకుంటాం. ఆ బంధాల చుట్టునే మన బతుకు గుడుసుళ్ళు తిరుగుతుంది. "నేను" అనే ఒక భావం ఉన్నంత వరకూ ఆ బంధాలు ఉండనే ఉంటాయి కదా. . అంటే "నా" దృష్టిలో అవి నిత్యమే! అందులో మాయంటూ ఏముంది? ప్రాణం పోయిన తర్వాత ఇక "నేను" అన్నదే లేదు. మనసూ లేదు, అందులో భావాలూ లేవు, బంధాలూ లేవు. శరీరం కట్టెల్లో కాలిపోయేటప్పుడు "నా" అనుకొనేది ఏదీ అక్కడ లేదు. అంచేత అలాంటి సందర్భంలో "నా యిల్లాలు, నా పుత్రుడు" అనుకొనే ప్రసక్తే లేదు, ఇంక వాళ్ళు తోడై రావడమేమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, బతికుండి, ఆలోచించే బుద్ధి ఉండి, ఊహించే మనసుండి, భావాలు బంధాలూ అన్నీ ఉన్న స్థితిలో మనిషి తన "చావు"న

అలజడులు...నా అంతరంగపు ఆనవాళ్ళు....By Smt.Kondaviti Satya vathi .

Image
అలజడులు...నా అంతరంగపు ఆనవాళ్ళు....By Smt.Kondaviti Satya vathi . . నా జీవితంలో ప్రేమకే స్థానం పూజకి లేదు . నా చేతులు పాటుపడతాయ్ ప్రార్ధన చెయ్యవు . నా కోరికలు నేను తీర్చుకోవాల్సినవే ఏ శక్తి,భక్తి తీర్చేవి కావు . నా సాష్టాంగ ప్రణామం నా కన్నవాళ్ళకే కపట సన్నాసులకు కాదు . నాకు జీవితమంటే అలుపెరుగని పోరాటమే అర్ధింపులు,వేడికోళ్ళు అస్సలుండవ్ . నా ఇంట్లో పూజ గదులుండవ్ ప్రేమ గదులుంటాయ్ పుస్తకాల గదులూ ఉంటాయ్ . నన్ను నేను సమర్పించుకునేది నా లోని ఆత్మవిశ్వాశానికే ఏ అతీత శక్తికో ,మరేదో అదృశ్యశక్తికో కానే కాదు ప్రజలు పోరాటాలు మర్చిపోవాలంటే గుళ్ళవేపు తోలెయ్యడమే . భూములు దురాక్రమించాలనుకుంటున్నావా ఏం ఫర్వాలేదు అక్కడో గుడి కట్టేయ్ . ప్రజల కళ్ళు గుళ్ళ మీద నీ కళ్ళు భూముల మీద . ఆధునిక ఆదాయ వనరు అడ్డదిడ్డంగా కట్టేసిన గుళ్ళు . అమ్మ గుళ్ళంటూ కట్టి చూపించేది మళ్ళీ అంగాంగ ప్రదర్శనే . ప్రభుత్వ కార్యాలయాల్లో పూజలా??? సెక్యులరిజం జిందాబాద్ . గవర్నమెంటాఫీసులు ప్రలందరివీ పూజలు చేసే హక్కు ఎవ్వరికీ లేదు . పూజ వ్యక్తి

ఒక స్త్రీ స్వగతం....

Image
ఒక స్త్రీ స్వగతం....  . అమ్మాయిలు - ఆంటీలు తెలుగులో కొన్ని కొన్ని మాటలు ఇతర భాషల నుండో, లేక సరదా కోసం పుట్టించినవో లేక మరో రకంగానో వచ్చి చాలా జెన్యూన్ గా చెలామణి అయిపోతుంటాయి. . 'సుత్తి ' , 'అంత సీన్ లేదు ' 'కాలింది '(మండిపోయింది) మొదలైనవి..ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు విషయం వాటి గురించి కాదు. ఇలా పుట్టిన మాటల్లో . నాకు ఒళ్ళు మండించే మాట ఒకటుంది. అదే "ఆంటీ" ! ఆ మధ్య ఒక బ్లాగులో 'ఆంటీ 'అని పిలవడం పట్ల కొందరు స్త్రీ బ్లాగర్లు బాధ పడ్డారు కూడా! కేవలం బాధ బాధ పడి ఊరుకుంటె లాభం లేదని, ఒక టపా రాసేయాలని అనిపించి రాస్తున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మ స్నేహితుల్ని 'సుశీలత్త ''రాధత్త ' 'కమలత్త 'ఇలాగే పిల్చేదాన్ని! హైస్కూలుకొచ్చాక ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మల్ని 'అత్తా 'అని పిలుద్దామంటె కొంచెం సంకోచంగా ఉండేది.పైగా నా ఫ్రెండ్స్ అన్నలెవరూ అంత పెద్ద అందగాళ్ళు కుడా కాదని తెలిసిపోయింది. ఈ లోపు నా స్నేహితురాళ్ళు మా అమ్మను 'ఆంటీ ' అని పిలిచి నాకు దారి చూపించారు. . ఆడవాళ్ళను గౌరవంగా పిలవడానికి ఉపయోగించే మాటగా

సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.!

Image
సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.! . తండ్రి అయిన దక్షప్రజాపతి దక్షయజ్ఞ సమయంలో ప్రవర్తించిన తీరును నిరసించి సతీదేవి పలికిన పలుకులు:  . జనుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు స య్యన వెళ్లించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్ ఘను నిందించిన నీ తనూభవ ననంగా నోర్వ నీ హేయ భా జనమైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాప్తించెదన్ . భావం:  మనిషి, తనకు తెలియకుండా తినకూడని పదార్థాలు తిన్నప్పుడు వెంటనే వాంతి చేసుకుని ఉదరాన్ని శుభ్రం చేసుకుంటాడు. చెడు స్వభావం కలిగిన నువ్వు, గొప్పవాడైన పరమశివుని నిందించిన కారణం చేత, నేను నీ కుమార్తెను అనిపించుకోవడాన్ని సహించలేను. అందువల్ల ఈ అసహ్యమైన శరీరాన్ని విడిచి, పవిత్రతను పొందుతాను.

దేవుడా ఓ .. FB దేవుడా …

Image
దేవుడా ఓ .. FB దేవుడా … నాకు రాయడానికి ” WALL” ఇచ్చావ్ ..  నొక్కడానికి ” LIKE “ఇచ్చావ్ ..  తోక లాగ ” TAG ” పెట్టావ్ .. నస పెట్టడానికి ” CHAT ” అన్నావ్ .  గొప్పలు చెప్పడానికి ” STATUS ” ఇచ్చావ్ …  అందం చూపడానికి ” PHOTOS ” ఇచ్చావ్ …  అల్లరి పిడుగుల కి ” GROUP “లు పెట్టావ్ .. క్లాసు లీడర్స్ కి ” PAGE “లు చూపెట్టావ్ . .  న…వ్వులు ” OPEN ” అన్నావ్ ..  నసుగుడు “SECRET ” అన్నావ్ ..  చాడీలు “SHARE ” చెయ్ అన్నావ్ ..  “APPLICATIONS ” తో మాయ చెయ్ అన్నావ్ ..  నోట్స్ రాయని నాతో , Facebook లో ” NOTES ” రాయిస్తున్నావ్ ..  నా ” POST ” లని అందరికీ చూపించి , నవ్వులు పూయిస్తున్నావ్ ..  అందుకే నువ్వు నాకు నచ్చావ్ … I like you somuch

పోతన - శ్రీమద్భాగవతం....... పంచమ స్కంధం..

Image
పోతన - శ్రీమద్భాగవతం....... పంచమ స్కంధం.. . బహుకుటుంబి యగుచు బహు ధనాపేక్షచే నెండమావుల గని యేగు మృగము కరణి బ్రేమ జేసి పరువులు వాఱుచు నొక్కచోట నిలువకుందురెపుడు . . ఈ మనుషులు తమతమ కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటారు . డబ్బు మీద వ్యామోహం పెంచుకుంటారు. లేళ్లు ఎండమావుల వెంట పరుగులు తీసే విధంగా కోరికలను నెరవేర్చుకోవాలనే అత్యాశతో మానవులు ఎక్కడా నిలకడగా ఉండక నిరంతరం పరుగులు పెడుతుంటారు. అల్పధనుడు విశ్రమాస్థానముల దృప్తి బొందకొరుల ధనము బొందగోరి యరిగి వారి వలన నవమానముల బొంది యధికమైన దుఃఖమనుభవించు . ధనం తక్కువగా ఉన్నవాడు, అంటే కొద్దిపాటి ఆస్తి మాత్రమే ఉన్నవాడు,  తనకు ఉన్న ధనం, గృహం, విశ్రాంతి మందిరాలతో తృప్తి చెందడు.  అంతటితో ఊరుకోక పక్క వారి ధనాన్ని కూడా పొందాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఇతరుల వలన అవమానాలు పొందుతాడు. అంతేకాక మరింత దుఃఖాన్ని అనుభవిస్తాడు. . అంతగొందఱల్ల నన్యోన్య విత్తాది వినిమయమున గడుబ్రవృద్ధమైన వైరములను బొంది పోరాట వొందుదు రాత్మ చింతలేక యనుదినంబు . . కొందరు డబ్బుకి సంబంధించిన లేదా ద్రవ్యానికి సంబంధించిన లావాదేవీల కారణంగా ఒకరితో ఒకరిక

ఎక్కడనో జనించి,పరమేశ్వరు డిచ్చిన గాలి పీల్చి,.....

Image
ఎక్కడనో జనించి,పరమేశ్వరు డిచ్చిన గాలి పీల్చి, వే రొక్కరి జోలికేగక, యెదో భుజియించి , సరోవరాలలో  గ్రుక్కెడు నీళ్ళు గ్రోలి, విను త్రోవల నేగెడు రాజహంసపై  రక్కసి బుద్ధి చెల్లునె? మరాళ మరాళ శరాగ్ను లోర్చునే? -- కరుణశ్రీ.  (“కరుణశ్రీ” అనే కావ్యం నుండి. హంసను గాయపరచిన దేవదత్తునితో సిద్ధార్థుడు)

వెంపటి చిన సత్యంగారు.

Image
వెంపటి చిన సత్యంగారు. . వెంపటి చిన సత్యం గారికి కూచిపూడి అన్నా, కూచిపూడి వారన్నా ప్రాణం. మద్రాస్ వెళ్ళినా కూచిపూడి కోసం తహ తహలాడేవారు. కూచిపూడి డాన్సు పైకి వస్తే తన వాళ్ళంతా బాగు పడతారని ముప్ఫయి ఏళ్లుగా తపన పడుతూ వచ్చారు. ఈవేళ కూచిపూడికి అంతర్జాతీయ ప్రాముఖ్యం వచ్చింది. కూచిపూడి భాగవతులుగా వొకప్పుడు గర్భ దారిద్ర్యం అనుభవించిన వారంతా ఈవేళ కూచిపూడి డాన్సు మాస్టర్లు గా పేరు పొందారు.  చిన్న సత్యం గారు మద్రాస్ వెళ్ళే సమయానికి అక్కడ వేదాంతం రాఘవయ్య, వెంపటి పెద్ద సత్యం, పసుమర్తి కృష్ణ మూర్తి వంటి కూచిపూడి వాస్తవ్యులు సినిమా రంగంలో ఉన్నత స్థితిలో వున్నారు. పేరుతో పాటు డబ్బుకూడా సంపాదించుకొన్నారు.  అయినా వాళ్ళెవరికీ పట్టలేదు, కూచిపూడి గురించి కాని కూచిపూడి నృత్యం గురించి కాని. చిన్న సత్యం వొక్కరే నిలబడ్డారు.  తన స్కూల్ కి కూచిపూడి ఆర్ట్ అకాడెమి అని పేరు పెట్టుకొన్నారు. అది ఎందరికి నాట్య బిక్ష పెట్టిందంటే, ఇప్పుడు కేవలం డాన్సు మీద ఆధార పడ్డ వాళ్ళయినా, సినిమా వాళ్లయినా సరే, ప్రతివారూ తాము కూచిపూడి ఆర్ట్ అకాడెమి చిన్న సత్యం గారి శిష్యులమని చెప్పుకునే వారే.. x

వికటకవి..

Image
వికటకవి.. తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. . ఒకమారు అల్లసాని పెద్దన వారు ఒక కవితలో "అమావాశ్యనిశి" ని ఛందస్సు కోసం "అమవసనిసి" అని వాడగా దానికి రామలింగకవి చెప్పిన అద్భుతమైన చాటువు, ఎమి తిని సెపితివి కపితము బెమ పడి వెరి పుఛ్చ కాయ మరి తిని సెపితో ఉమెతకయలు తిని సెపితో అమవస నిసి యనుచు నేడు అలసని పెదనా || ఇక్కడ "అలసని" అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వచ్ఛత లేని పదం అని కవీంద్రులు ఘాటుగానే సెలవిచ్చారు. కావలి తిమ్మడు మరొకమారు వాకిటి కావలి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పథకం వేసి వాకిటి కావలి తిమ్మా ! ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా ! నీకిదె పద్యము కొమ్మా ! నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !! అంటూ చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి తిరుమలరాయల గురించి రాయల సోదరులైన తిరుమలరాయలు తనపై కవిత చెప్పుమని అష్టదిగ్గజములని అర్ధింపగా, అందవిహీనుడు, ఒంటి కన్ను వాడైన తిరుమలరాయల గూర్చి యేమి కవిత్వం చెప్పాలి అని సంశయంలో ఉండగా, రామకృష్ణ కవి ఇలా స్తుతించాడు. అన్నాతి గూడ

స్త్రీ స్వాతంత్ర్యము --

Image
స్త్రీ స్వాతంత్ర్యము -- . (సాక్షి వ్యాసాలు శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు.) . పదాలు గుప్పించడంలోను, ఒకమాటకు పది మాటలు వాడి వ్యంగ్యాన్ని, వర్ణనను, హాస్యాన్ని రంగరించడంలోను జంఘాలశాస్త్రి ఉద్ధండుడు. మహిళలంతా ఓచోట గుమికూడితే ఎలా ఉంటుందో చెప్పడంలో జంఘాలశాస్త్రి ఇలా రెచ్చిపోయాడు. -- 'ఎక్కడ వినిన గాజుల గలగల, అందెల ఝణఝణ , కాంచీఘంటికల గణగణ, ఎక్కడజూచిన జెక్కుటద్దముల తళతళ, గుబ్బిగుబ్బిల పెళఫెళ, తారాహారముల మిలమిల, వేణీభారముల జలజల, ముద్దుమొగాముల కలకల, ఎక్కడకు బోయిన నగరు ధూపముల గమగమ, చందన చర్చల ఘుమఘుమ, మృగమదలేపముల ఘుమఘుమ... --- కొర్నాటి చీరలవారు, బనారసుకోకలవారు, బరంపురపు పీతాంబరములవారు, సన్నకుసుంబాచీరలవారు, గోచికట్లవారు, గూడకట్లవారు, చుట్టుత్రిప్పులవారు, మేలిముసుగులవారు, వ్రేలుముళ్ళవారు, జడచుట్లవారు, వంకకొప్పులవారు ...

వయసు ఎరగిని బాపు గారిమిధునం..!

Image
వయసు ఎరగిని బాపు గారిమిధునం..! . వాలు జడ గట్టిగ ముడి వేయుటొ మఱి  బిట్టుగ విడివిడిగ వదిలి వేయుటొ పూలం బెట్టుటొ పెట్టకపోవుటొ యెట్టులయిన నేమి యందమే నీది జడా !

చిలిపి కృష్ణుడు...

Image
చిలిపి కృష్ణుడు...  . శ్రీ కృఇష్ణుడు వాళ్ళ అమ్మని ఎప్పుడుపద్తే అప్పుడు పాలు అడుగుతుంటే, యశోదమ్మ  "రాత్రికి" అన్నదట.  "రాత్రి అంటే ఏమిటీ" అన్నడుట."రాత్రి అంటే అంధకారోదయం" అన్నదట.  అప్పుడు కళ్ళు మూసుకోని, కనపడటం లేదు, పాలివ్వమన్నాడుట.

కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల?

Image
పోతన గారి.....భాగవత పద్యాలు సీ. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల? సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేల? వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేల? గొనకొని వసియింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటల మేల? తే. ఫలరసాదులు కురియవే పాదపములు స్వాదుజలముల నుండవే సకల నదులు పొసగ భిక్షము బెట్టరే పుణ్య సతులు ధన మదాంధుల కొలువేల తాపసులకు నిజంగా చూస్తే జీవితాన్ని ఆనందించడానికి కావలసినవన్నీ పుష్కలంగా ఇచ్చాడు పరమాత్మ . పచ్చని గడ్డి మైదానాలు మనకిస్తే , దూది పరుపుల మీద పడుకోవాలనే కోరిక మనది . అన్నం నోటికందించడానికి చేతులు ( కరాంజలులు ) ఉన్నాయి . అయినా కంచాలూ గరిటల మీద మోజు . శరీరాన్ని కప్పుకోవడానికి నార బట్టలున్నాయి . అయినా పట్టుపుట్టాలంటే పరమ ప్రీతి .  నివసించడానికి పృకృతి సిధ్ధమైన గుహలున్నాయి ( తాపసులకు మాత్రమే ) . కానీ కావాలి మేడలూ మిద్దెలూ .ఫలాలను వర్షిస్తున్నాయి.. స్వాదుజలాలను అందిస్తున్నాయి సకలనదులు . అడగకుండానే అన్నపూర్ణ లాగా అన్నం పెడుతున్నారు పుణ్య సతులు .కానీ కోరికలు చావడం లేదు .  ధనంతో మదమెక్కిన వారిని సేవిస్తున్నార

పోతన గారి భక్తి..!

Image
పోతన గారి భక్తి..! . కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని జింతించు దినము దినము చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి! x

శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ

Image
శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ కారుణ్యధామా కమనీయనామా శ్రీరామ జయ రామ సీతారామ నీ దివ్యనామం మధురాతిమధురం నేనెన్న తరమా నీ నామ మహిమ కారుణ్యధామా కమనీయనామా శ్రీరామ జయ రామ సీతారామ చరణాలు కొలిచే నగుమోము జూచే ఆ చరణాలు కొలిచే నగుమోము జూచే సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా నీ కీర్తి చాటగా నా కోసమే నీవు అవతారమెత్తేవు సుగుణాభిరామా శ్రీరామ జయ రామ సీతా రామ కారుణ్యధామా కమనీయనామా శ్రీరామ జయ రామ సీతా రామ నిలకడ లేని అల కోతి మూకచే నిలకడ లేని అల కోతి మూకచే కడలిపై వారధి కట్టించినావే పెను కడలిపై వారధి కట్టించినావే నీ పేరు జపియించ తీరేను కోర్కెలు నీ పేరు జపియించ తీరేను కోర్కెలు నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ శ్రీరామ జయ రామ సీతారామ కారుణ్యధామా కమనీయనామా శ్రీరామ జయ రామ సీతారామ చిత్రం :ముత్యాల ముగ్గు గానం :ఎమ్.బాలమురళీకృష్ణ సంగీతం:కె.వి.మహదేవన్

బుడుగోదయం.!

Image
బుడుగోదయం.! . ఒక్క సారి నేను నిద్ర లేచి కూర్చున్నా.  సుబ్బలష్మి ముగ్గులు వేయడానికి లేచిందనుకుంటా.  బాబాయి హడావుడిగా లేచి నా కాలు తొక్కి మరీ బయటకు పరిగెత్తాడు. . ఈ బాబాయిలందరూ ఇంతే. ఎదురింటి సుబ్బలష్ములు పక్కింటి సీతలూ కనిపిస్తే,  మనల్ని అస్సలు పట్టించుకోరు. . అదే ఉంకో అప్పుడు అనుకో, “బుడుగు, బుడుగు, బంగారు తండ్రి కద, సుబ్బ లష్మికి ఈ ఉత్తరం ఇచ్చి రా ఏం? నీకు చేగోడీలు కొని పెడతా,” అంటారు.

పోతన - శ్రీమద్భాగవతం...

Image
పోతన - శ్రీమద్భాగవతం... . త్రాసురునికి, ఇంద్రుడికి మధ్య జరిగిన యుద్ధంలో ఆ రాక్షసుడు... వజ్రాయుధం సహా ఇంద్రుడిని మింగేశాడు.  అయినప్పటికీ నారాయణ కవచ ప్రభావంతో ఇంద్రుడు క్షేమంగా ఉన్నాడని  ఈ పద్యంలో వివరించారు . . కందడు భీతి గుందడు ప్రకంపితమొందడు పెద్దనిద్దురం జెందడు దత్తఱింపడు విశేషము దప్పడు వైష్ణవీజయా నందపరైక విద్యను మనంబున దాల్చుచు నుండెగాని సం క్రందనుడా నిశాచరుని గర్భములో హరిరక్షితాంగుడై భావం:-. . ఇంద్రుడు కందిపోలేదు. భయంతో మానసికంగా కుంగిపోలేదు. వణికిపోలేదు. చనిపోలేదు. తత్తరపాటు చెందలేదు, తన గొప్పతనాన్ని కోల్పోలేదు. నారాయణ కవచ మంత్రవిద్యను మనస్సులో నిరంతరం ధ్యానిస్తూ, వృత్రాసురుడి గర్భంలో ఆ నారాయణునిచేత రక్షింపబడుతూ క్షేమంగా ఉన్నాడు. పోతన - శ్రీమద్భాగవతం... . త్రాసురునికి, ఇంద్రుడికి మధ్య జరిగిన యుద్ధంలో ఆ రాక్షసుడు... వజ్రాయుధం సహా ఇంద్రుడిని మింగేశాడు.  అయినప్పటికీ నారాయణ కవచ ప్రభావంతో ఇంద్రుడు క్షేమంగా ఉన్నాడని  ఈ పద్యంలో వివరించారు . . కందడు భీతి గుందడు ప్రకంపితమొందడు పెద్దనిద్దురం జెందడు దత్తఱింపడు విశేషము దప్పడు వైష్ణవీజయా నందపరైక విద్

ప్రేమంటే తెలీదా? ఇన్సల్ట్!...

Image
శుభోదయం... . ప్రేమంటే తెలీదా? ఇన్సల్ట్! ఈ సీగాంపెసూనాబ ఉందే, మహా గడుసుది. గడుసు అంటే నాకు తెలీదనుకో. కానీ దాన్ని అందరూ అలానే అంటారు. “ఒరే బుడుగూ, అది చాలా గడుసుదిరా, అది ఎవరికి పెళ్ళాం అవుతుందో వాడిని కొంగుకి కట్టేసుకుంటుంది,” అని మా అమ్మ అంటూ ఉంటుంది. పెళ్ళాం అంటే ఆడది. దానికి ఫదేళ్ళు కంటే ఎక్కువ ఉంటాయి.  సీగానపెసూనంబకి ఏడేళ్ళే. అది చీరే కట్టుకోదు. మరి ముగుడిని కొంగుకి ఎలా కట్టేసుకుంటుంది? ఈ పెద్ద వాళ్ళంతా ఇంతే. ఇలా గడుసుగా మాట్లాడుతూ ఉంటారు. “ఒరే బుడుగూ, నీకు ప్రేమంటే ఏమిటో తెలుసారా?” అని అడిగింది నన్ను సీగానపెసూనాంబ. “ప్రేమంటే డాన్సులు చేసుకుంటూ, గాఠిగా పాటలు పాడుకోవడం,” అన్నాను నేను. “నీ మొహం!” అంది అది.

లోకంబులు లోకేశులు...

Image
తెలుగుసాహిత్యంలో ఈ పద్యానికి పెద్దపీట వేశారు.  ఇంతకుమించిన పద్యం మరొకటి లేదనేంత పేరున్న పద్యం ఇది.  భగవంతుడు ఎక్కడ ఉంటాడనే విషయాన్ని పోతన తన మనోనేత్రంతో చూసి వివరించాడు. . లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వం  డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్ భావం:-- లోకాలు, లోకాధిపతులు, లోకులు నశించిన తరవాత, లోకమనేది లేనప్పుడు  ఏర్పడే దట్టమైన చీకటికి అవతల ఏ పరమపురుషుడు ఒకే ఆకారంతో ప్రకాశిస్తాడో  అతనిని మాత్రమే నేను సేవిస్తాను. 

‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. .

Image
‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి.  . ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ తమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ! భావం: -- మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి.  తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి.  ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి.  ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది. మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి.

మాగాయ పచ్చడి పసందు : భాగవతం

Image
మాగాయ పచ్చడి పసందు : భాగవతం కర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయహారాళితో స్వర్ణభ్రాజిత వ్రేత దండకముతో సత్పింఛదామంబుతో బూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్ఫుల్లాబ్జ హస్తంబుతో దూర్ణత్వంబున నేగె లేగలకునై దూరాటవీవీథికిన్. . పోతన భాగవతంలోని పద్యమిది . అందమైన కొలను . దాని నిండా తామర పూలు . చల్లని గాలి . ఆ గాలికి కొలనులోని నీరు తుంపరలుగా మారి గోపకుమారుల మీద పడుతోంది . తుంపరల తాకిడికి ఒళ్ళంతా గగుర్పాటుతో జలదరిస్తున్నది . కొలను చుట్టూ ఫలవృక్షాలు . వాటినిండా ఫలాలు . సేద తీరడానికి చెట్టు నీడ . ఆటలతో అలసిపోయిన శరీరాలు . విపరీతంగా ఆకలి వేస్తున్నది . లేగదూడలను పచ్చిక బయళ్ళలో స్వేచ్ఛగా వదలి వేసారు గోపబాలకులు . లోకపాలకుడు గోపబాలురతో — చల్దులు తినడానికి అనువైన స్థలమూ , సరియైన సమయమూ కనుక తినడం మొదలు పెడదామని అన్నాడు . కొలనులోని తామర ఆకులే వారికి కంచాలైనాయి . తను తెచ్చుకున్న ఊరగాయలు పక్కవాడికి చూపించి ఊరిస్తూ తినే వాడొక్కడైతే , పక్కవాడి కంచంలోనిది తీసుకొని తినేవాడొకడు . వేళాకోళాలతో , తమకున్నది ప్రక్కనున్న స్నేహితులతో పంచుకుంటూ చద్ది ఆరగిస్తున్నారు ఆ గొల్లలు . గోపబాలకులలో తానూ ఒకడై చల్దులారగిస్త

ధూర్జటి

Image
ధూర్జటి ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు. ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించిఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు. ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి. ఉదాహరణ పద్యాలు     శ్రీ కాళహస్తీశ్వర శతకము నుండి     పుడమి న్నిన్నొక బిల్వ పత్త్రమున నేఁ బూజించి పుణ్యంబునుం     బడయన్; నేరక పెక్కు దైవంబులకుం బప్పుల్, ప్రసాదంబులుం,     గుడుముల్, దోసెల

మన కవి త్రయం.

Image
మన కవి త్రయం. . నన్నయ తెలుగువారి ఆదికవి,వేదాధ్యాయ సంపన్నుడు,శబ్దశాసనుడు,,వేదవేదాంగివిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి మరియు వాగమశాసనుడు . . ఆదికవి నన్నయ్య గారి ముందు నూయ్య వెనుక గోయ్యా పోలు పద్యం. . చంపకమాల: ఇది ప్రళయాగ్నివోలె దెస లెల్లను గప్పఁగ విస్ఫులింగముల్: వదలక వాయుసారథి జవంబున దా నిట వచ్చె నేమిసే: యుదు సుతులార యీబిలము నొయ్యన పోయి చొరుండు దీనిఁ గ: ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి దాఁకకుండగన్:. అర్థము: ఓ పుత్రులార| ఈ కార్చిచ్చు అన్ని దిక్కుల నుండి క్రమ్ముకు వస్తుంది, ప్రళయ కాలంలో చెలరేగే విధంగా వాయువునే సారధిగా కలిగిన ఆ అగ్నిదేవుడు మనను కబళించడానికి వస్తున్నాడు. ఈ అగ్ని బారినుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ బిలము నందు దూరండి, నేను దానిని దట్టమైన ధూళి సమూహముచేత కప్పివేస్తాను. తేటగీతి బిలము సొచ్చితిమేని నందెలుక చంపు: నింద యుండితిమేనిఁ దా నేర్చు నగ్ని: యెలుకచే జచ్చుకంటె నీ జ్వలనశిఖలఁ: గ్రాగి పుణ్యలోకంబులఁ గాంతు మేము:. అర్థము: బిలములో దూరితే అందుగల ఎలుక చేతిలో చచ్చెదము, ఇక్కడే వుంటె అగ్నిలో మాడిపోయెదము.

శివునికి...శిరోవేష్టనంగా....జింక చర్మం..

Image
శివునికి...శిరోవేష్టనంగా....జింక చర్మం.. . రంగనాథుండు రంగత్తురంగ మెక్కఁ గులిశమును దాల్చె గోత్రారి కుతుక మొప్ప; ఖేదమోదంబు లందె నగేంద్రకన్య, మౌళిఁ గృష్ణాజినంబున మాఁటె శివుఁడు. . భావం. శత్రుసంహారానికై రంగనాథుడనే రాజు ఉద్యుక్తుడై గుఱ్ఱం ఎక్కుతున్నాడు. ఆ ఎక్కేటప్పుడు నేలపై గుర్రం కాలిగిట్టల తాకిడి వల్ల ధూళి చెలరేగింది.  ఆ చెలరేగిన ధూళి దుమారమై ఏకంగా సప్తసముద్రాలనూ ముంచెత్తివేసేంత ఉద్భటంగా రేగిందట. సముద్రాలు ఇంకిపోతే — పూర్వం ఇంద్రుడు పర్వతాల రెక్కలను నరికివేసినపుడు హిమవంతుని కొడుకు మైనాకుడు తప్పించుకొని పారిపోయి సముద్రంలో దాక్కొన్నాడు కదా, అతనిప్పుడు బయటపడక తప్పదని గోత్రారి (గోత్రాలకు = పర్వతాలకు, అరి = శత్రువైనవాడు) — ఇంద్రుడు వజ్రాయుధాన్ని చేతబూనాడట. ఆ మైనాకుడు హిమవత్పుత్త్రిక అయిన పార్వతీదేవికి (నగేంద్రకన్యకు) తమ్ముడు కదా, ఇప్పుడిక ఇంద్రుని బారినుండి తప్పించుకోలేడని ఆమెకు ఖేదం కలిగింది. అయితే ఒకందుకు మోదమూ కలుగకపోలేదు. సప్తసముద్రాలే ఇంకిపోగా లేనిది తన సవతి గంగాదేవి మాత్రం ఉండగలదా? అని మోదం.  గంగకు కష్టం కలిగితే పార్వతికి సంతోషమే కానీ, పాపం జగత్తులకు ఈశ్వరు

శ్రీనాధుని..కాశి విశ్వేశ్వర వర్ణన:-- .

Image
కార్తీక పున్నమి శుభా కాంక్షలతో.... శ్రీనాధుని..కాశి విశ్వేశ్వర వర్ణన:-- . ‘’ఎం చెప్పమంటావు అగస్త్య మహర్షీ !పార్వతిని చూస్తె మహా ప్రేమ ,పరమేశ్వరుని చూస్తె మహా క్రోధం గ కనపడ్డారు .అప్పుడు మా మనసులు ఒక పక్క సంతోషం తో మరోపక్క భయం తో గుజగుజ లాడాయి .’’అని చెప్పి వ్యాసుడు కాశి శివుని భార్య కనుక దానిపై అలిగి నేను శివుడి కోపానికి పాత్రుడినయ్యాను .కాశి గౌరికి సపత్నికనుక దానిపై నేను అలగటం వలన ఆమెకు సంతోషం కలిగించిన వాడినయ్యానుఅనిపించింది .శివ పార్వతులు అక్కడికిరాగానే మేమందరం లేచినిలబడి స్వాగతం చెప్పి నమస్కరించి చేతులు చంకలో పెట్టుకొని ఒక ప్రక్కగా నిలుచున్నాం .ఉమా మహేశులు మా దగ్గరకు వచ్చి ఉచితాసనాలలో కూర్చున్నారు .అప్పుడు రుద్రుడు ప్రళయ కాల రుద్రుడులా ఉచ్చ్చైస్వరం తో కోపంగా – ‘’ఓరి దురాత్మ !నీవార ముస్టింపచా- భాసయోజన గ్రంధి ప్రధమ పుత్ర దేవరన్యాయ దుర్భావనా పరతంత్ర -బహు సంహితా వృధా పాఠపఠన భారత గ్రంధ గుంభన పండితం మన్య –నీవా మదీయ పత్నికి ,నశేష కైవల్య కళ్యాణ ఘంటా పధమునకు –గాశికా పురికి నిష్కారణంబ శాప మిచ్చేదనని యనా చార సరణి –నడుగు బెట్టిన వాడ వహంకరింఛి పొమ్ము నిర్భాగ్య ,మాయూరి పొలమ

ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కొక్కడై తోచు.....

Image
శుభం . ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కొక్కడై తోచు పో లిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూ పకుడై యొప్పుచునుండునట్టి హరి నే బ్రార్థింతు శుద్ధుండనై పదవిభాగం:  ఒక, సూర్యుండు, సమస్త, జీవులకు, తాను, ఒక్కొక్కడై, తోచు, పోలికన్, ఏ, దేవుడు, సర్వకాలము, మహాలీలన్, నిజ, ఉత్పన్న, జన్య, కదంబంబుల, హృత్, సరోరుహములన్, నానా, విధానూన, రూపకుడై, ఒప్పుచున్, ఉండునట్టి, హరిన్, నే, ప్రార్థింతు, శుద్ధుండనై. భావం: ఒకే సూర్యుడు, సమస్త జీవులకు వేర్వేరుగా ఒక్కొక్క సూర్యుడు ఉన్నట్లు కనిపిస్తాడు. ఏ దేవుడు తన అద్భుతమైన లీలలతో, తన నుండి పుట్టిన జీవసమూహాల మనస్సులలో అనేక రూపాలలో ఉంటాడో, అటువంటి దేవుడైన శ్రీకృష్ణుడిని, నేను మంచిమనసుతో ప్రార్థిస్తాను. . (పోతన గారి పద్యం...బాపుగారి చిత్రం.)

శ్రీనాద కవిసార్వభౌముని చాటువు ....

Image
సిరిగలవానికి జెల్లును తరుణులు బదియారు వేలు దగ బెండ్లాడన్ తిరిపమున కిద్దఱాండ్రా పరమేశా గంగ విడువు పార్వతి చాలున్ కవులెంత నిరంకుశులో ఈ పద్యం చెబుతుంది వర్షమివ్వమని పరమశివునిి ప్రార్థిచడం... శ్రీనాద కవిసార్వభౌముని చాటువు ఇది బాపూబొమ్మలతో

ఎవరి కన్న ఎవరు గొప్ప!

Image
ఎవరి కన్న ఎవరు గొప్ప! . పద్యానవనం జగతి పుట్టించెడి వాడతడంటినా బ్రహ్మ తామరపువ్వు తనయుడాయె  . తామర ఘనమని తర్కించి చూచిన . నలినాక్షి విష్ణు తా నాభినుండె విష్ణువు ఘనమని వివరించ చూచిన . జలరాశి కొకతెప్ప చందమాయె జలరాశి ఘనమని తర్కించి చూచిన . కుంభసంభవుచేత గ్రోలబడియె కుంభసంభవుండు ఘనమని చూచిన . భూమిలోపలను పొత్తుబడెను భూమియె ఘనమని తర్కించి చూచిన . శేషుండు మోసెనని చెప్పగలిగె శేషుండు ఘనమని తర్కించి చూచితె . ఉమకన్నె కొకవేలి ఉంగరంబు ఉమకన్నె ఘనమని వూహించి చూచిన . శివుని అర్థాంగమున చిక్కుబడెను శివుడె ఘనమని తర్కించి చూచిన... . జగతిని పుట్టించిన వాడు కదా బ్రహ్మ గొప్పవాడనుకుందామంటే, ఆయనేమో తామర పువ్వులో పుట్టాడు! పోనీ, తామర పువ్వే గొప్పదనుకుందామన్నా, అదేమో విష్ణు నాభిలోంచి వచ్చిందాయె! సరే, విష్ణే గొప్పోడనుకుందామా అంటే, శేషశయ్యమీద పవళించిన ఆయన సముద్రంలో ఓ చిన్న తెప్ప మాదిరి. అయ్యో! అలాగని సముద్రుడు ఘనుడనుకుందామా, అగస్త్యుడు సాంతం తాగేశాడాయె! పోనీ, కుంభసంభవుడైన ఆ అగస్త్యుడే ఘనమనుకుందామా, అతడు భూమిలో ఓ భాగమే అయ్యాడు! అందుకని, భూమే గొప్పదనుకుందామా అంటే, ఆదిశేషుడు

శ్రీ నాధుని చంద్రోదయ వర్ణన.!

Image
శ్రీ నాధుని చంద్రోదయ వర్ణన.! . ‘’ఆతత లీల గోమల నవామ్శుక పాళిమ హాంధ కార సం –ఘాతము మీటే నద్భుతముగా శశి లాంచను డభ్రవీదికిన్ శ్వేత వరాహ మూర్తి యగు వెన్నుడు ప్రన్నని యొంటి కోర,ధా –త్రీతల మెంత యంతయు ధరిం చిన యట్టి విజ్రుమ్భణంబు నన్’’-అంటే – విష్ణువు వరాహావతారం ఎత్తి తెల్లగా ఉన్న ఒకే ఒక్క కోరతో భూగోళాన్ని అంతటిని అవలీలగా పైకెత్తి నట్లు చంద్రుడు నెల వంకచేత ఆశం లో చీకట్లను అద్భుతం గా తొలగించాడు . యెర్ర దనం తో ఉన్న అర్ధ చంద్ర బింబం తాంబూలం వేసుకోవటం వలన  యెర్ర బడ్డ తూర్పు దిక్కు అనే స్త్రీ యొక్క కింది పెదవిలాగా ఉన్నదట . x

శ్రీ నాధుని .సూర్యోదయం

Image
శ్రీ నాధుని .సూర్యోదయం . ‘’ప్రధమ సంధ్యాంగానా ఫాల భాగమున –జెలువారు సింధూర తిలక మనగ గైసేసి పురుహూతు గారాపు టిల్లాలు-పట్టిన రత్న దర్పణ మనంగ నుదయాచాలలేంద్రంబు తుద బల్లవిం చిన –మంజు కంకేళి నికుంజ మనగ శత మాన్యు శుద్ధాంత సౌధ కూటము మీద –గనువట్టు కాంచన కలశమనగ గాల మనియెడు సిద్ధుండు గమిచి మ్రింగి –కుతుక మొప్పగా నుమిసిన ఘటిక యనగ గగన మందిర దీపికా కళిక యనగ –భానుడుదయించే దేదీప్య మాను డగుచు ‘’ భావం –ప్రాతః కాల సంధ్య అనే స్త్రీ నుదుటి మీద సింధూరం బొట్టు లాగా  ,బాగా అలంకరించుకొన్న ఇంద్రపత్ని శచీదేవి చేతిలో ఉన్న అద్దం లాగా , తూర్పు కొండ పై చిగిర్చిన అశోక వృక్షపు పొదరిల్లు లాగా , ఇంద్రుడి మేడపై ఉన్న బంగారు కలశం లాగా ,కాలం అనే సిద్ధుడు మింగి ఉమ్మేసిన మాత్ర లాగా , . ఆకాశ మందిరం లో ప్రకాశించే దీప కాంతి లాగా సూర్యుడు ఉదయించాడు .

అంతా రామమయం బీ,,,,, జగమంతా రామమయం.

Image
అంతా రామమయం బీ,,,,, జగమంతా రామమయం. . ( వరాళి రాగం ఆది తాళం) . ప: అంతా రామమయం బీ జగమంతా రామమయం || అంతా || చ1: అంతరంగమున ఆత్మారాము డ నంత రూపమున వింతలు సలుపగ || అంతా || చ2: సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు నఖిల జగంబులు || అంతా || చ3: అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ || అంతా || చ4: నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేదశాస్త్రములు || అంతా || చ5: అష్ట దిక్కులును ఆదిశేషుడును అష్ట వసువులును అరిషడ్వర్గము || అంతా || చ6: ధీరుడు భద్రాచల రామదాసుని కోరిక లొసగెడి తారక నామము || అంతా || https://www.youtube.com/watch?v=5F18ckGYYr8

హనుమంతునితో, రావణుని ఆగ్రహభాషణము.

Image
కొలువుకూటమునకుబందీగా తీసుకురాబడిన హనుమంతునితో, రావణుని ఆగ్రహభాషణము. "ఎవ్వడవోరి? నీకుఁ బ్రభు వెవ్వడు చెప్పుము! నీ విటొంటిమై ని వ్వనరాశి దాటి యిట కే గతి వచ్చితి? నామమేమి? నీ వెవ్వని ప్రాపునం బెఱికి తీ వనమంతయు శంక లేక? యిం కెవ్వని పంపునం దునిమి తీ సురవైరులనెల్ల నుగ్రతన్?" భావము: "నీవు ఎవడవురా? నీ ప్రభువు ఎవరో చెప్పు. ఇలా ఒంటరిగా సముద్రమును దాటి ఇక్కడికి ఎలా రాగలిగినావు? ఎవరి అండ చూసుకుని, ఏమాత్రం భయం లేకుండా మా అశోకవనమును ధ్వంసం చేశావు? ఎవరి అనుమతితో ఈ రాక్షసవీరులందరినీ ఈవిధంగా సంహరించావు?" అంటున్నాడు రావణుడు. "శరనిధి దాటి వచ్చుటయ చాలక నా పురిఁ జొచ్చి, చొచ్చియున్ వెఱవక దంటవై వనము వేళ్ళకుఁ ద్రుంచితి, త్రుంచి క్రమ్మఱన్ బిరుదవు పోలె రాక్షసులఁ బెక్కురఁ జంపితి, చంపి నెమ్మదిన్ గరకరితోడ నా యెదుర గర్వముతోడుత నిల్చి తద్దిరా!" భావము: "సాగరము దాటివచ్చినది చాలక నా లంకాపురిలోకి ప్రవేశించావు. ప్రవేశించి వెఱపులేకుండా పోటుగాడి వలె మా వనమును కూకటివేళ్ళతో కూల్చినావు. కూల్చి మొనగాడిలా అసురవీరులను ఎందరినో హతమార్చావు. హతమార్చి బెదురులేక నా యెదుట గర్వం

నా చెలికాడు

Image
(కవిత ... ఒక ప్రముఖ కవయిత్రి... పేరు చెప్పను.. ఆమె వద్దు అన్నారు.) నా చెలికాడు అందంలో చందురూడు,  ఆదరణలో ఆంధ్రభోజుడు, మానస చోరుడు, మన్మధ రూపుడు, అతనిమది అతివల కలల నిధి. మగసిరి ఉట్టిపడే ఆ ధృడత్వం, సొగసరి ఇష్టపడే ఆ మృదుత్వం, ప్రేయసి మనసుపడే ఆ సాహసం. తాపసి కోరుకునే ఆ నిర్మలత్వం, రూపసి చేరుకునే ఆ కోమలత్వం, సఖులు కోరుకునే ఆ సన్నిహితం, చెలులు కలలుకనే ఆ సున్నితం. కలతలేని ఆ నిరాడంబరం, కళ్ళెం లేని ఆ దానగుణం, శత్రువుని ఎదిరించే ఆ శూరత్వం, ఎల్లలు చెరిపేసే ఆ ధీరత్వం. నడకలో సాహసం, నవ్వులో సరసం, నా హృదిలో ప్రణయం, అతనితోనే నా జీవన ప్రయాణం. x

సరసము విరసము కొఱకే

Image
సరసము విరసము కొఱకే పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే పెరుగుట విరుగుట కొఱకే ధర తగ్గుట హెచ్చుట కొఱకె తథ్యము సుమతీ! . (సుమతీ శతకం) . భావం : మనసుకు ఆనందం కలిగించేలా మాట్లాడటం, చేష్టలు చేయటం... ఇవన్నీ దుఃఖం కలగటానికే. పరిపూర్ణ సుఖం కలగటం అంటే ఎక్కువ కష్టాలు అనుభవించటానికే. వృద్ధి చెందటం అంటే క్షీణించటం కోసమే. ఒక వస్తువు ధర తక్కువ కావటం అంటే పెరగటం కోసమే. ఇది వాస్తవం. ప్రతిపదార్థం : సరసము అంటే ఆనందం కలిగించేలా మాట్లాడటం, పనులు చేయటం; విరసము కొరకే అంటే బాధలు కలగటం కోసమే; పరిపూర్ణ అంటే పూర్తిస్థాయిలో; సుఖంబులు అంటే సౌఖ్యాలు; అధిక అంటే ఎక్కువ కావటం, బాధల కొరకే అంటే కష్టాల కోసమే; పెరుగుట అంటే వృద్ధిచెందటం; విరుగుట కొరకే అంటే నశించిపోవటానికే; ధర అంటే వెల; తగ్గుట అంటే తగ్గటం; హెచ్చుట కొరకే అంటే అధికం కావటం కోసమే; తథ్యము అంటే వాస్తవం. జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. కష్టాలకు కుంగిపోవడం, సుఖాలకు పొంగిపోవడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. అధిక ధనం వచ్చింది కదా అని గర్వంతో విర్రవీగకూడదు. అది కొన్నిరోజుల తరవాత మన దగ్గర నుంచి వెళ్లిపోవచ్చు. అలాగే ఇబ్బందులలో ఉన్నామని క

నీతో యుద్దము చేయనోప.....

Image
శ్రీ కాళహస్తీశ్వర.... . నీతో యుద్దము చేయనోప,గవితా / నిర్మాణశక్తి న్నిన్నుం బ్రీతుం చేయగలేను,నీకొరకు తం / డ్రిన్ చంపగాజాల నా చేతన్ రోకట నిన్ను మొత్తవెరుతం / చీకాకు నా భక్తి యే రీతి న్నాకిక నిన్ను చూడగనగున్ / శ్రీకాళాహస్తీశ్వరా! . శ్రీకాళాహస్తీశ్వరా!అర్జునునివలె నీతో యుద్దము చేయుటకు శక్తిలేనివాడు నీపై కవిత్వములల్లి నిన్ను ప్రసున్నునిగా చేసుకొనవలెను.నీకోసమై తండ్రిని చంపుకొనలేను.మూఢ భక్తునివలె నాచేతిలో యున్న రోకటితో నిన్ను కొట్టనూ లేను. నీయందు నాకు గల భక్తియే నను బాదలపాలు చేయుచున్నది. మరే విధముగా నాకు నిన్ను చూడగల అవకాదము కల్గునో భోదపడక యున్నది .కావున వెంటనే నాకు కన్పింపుము.