Posts

Showing posts from September, 2015

వటపత్ర సాయికి వరహాల లాలి

Image
చాలా రోజుల తర్వాత ఇవాళ అమ్మగుర్తుకొస్తోంది. విడివడిన కొప్పును జడ వేసుకోవాలనే తీరిక కూడా లేకుండా వొంచిన నడుము ఎత్తకుండా నీ కోసం నా కోసం అన్న కోసం చెల్లి కోసం చెమటను చిందించిన అమ్మ గుర్తుకొస్తోంది. ఆమె పవిట పట్టుకొని తిరిగి ఎన్నాళ్లయ్యిందో! ఆమె పాడిన పాటను విని ఎన్నాళ్లయ్యిందో! ఆ జోలకు ఆదమరిచి ఒడిలో తల పెట్టుకొని నిదురించి ఎన్నాళ్లయ్యిందో. వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి… ఆపు. చాలా బాగుందిగాని ఆపు. కసువుచిమ్మే పిలగాణ్ణి. గొడ్లు కాసే కసిగాణ్ణి. మా అమ్మ ఇలా పాడదే. మీ అమ్మ ఇలా పాడి ఉంటుందా? కాస్త మామూలు మాటల్లో పాడవయ్యా తల్లీ. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు గోపాల క్రిష్ణయ్య రేపల్లెకు వెలుగు మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు!

మధుర భక్తి!

Image
మధుర భక్తి! సుమారు క్రీశ:1670; ప్రాంతంలో పుసులూరి సోమరాజనేకవి జీవిచాడు. ఆయన శ్రీకృష్ణునిపై ెఅనేక భక్తి శతకాలు రచించాడు. గోపాల శతకం, నందనందనశతకం, ఇందుశతకం, మొదలయినవి. ఇవన్నీ పూర్తిగా మధుర భక్తితో నిండినవి. నందనందన శతకంలోని యీపద్యాన్ని చిత్తగించండి. ఉ: పుక్కిట తమ్ములమ్మడుగ బోటికి నోటికి నియ్యజూచి, వే రొక్కతె కోపగింప కనకోత్పలమాలిక లిచ్చినట్టి మే లిక్కడ చూప వచ్చితి భళీ! యను రాధిక నూరడించు నీ చక్కదనంబు జూడమనసైనది, చూపుము నంద నందనా! తమ్ములమంటే బాగా నమిలిన తాంబూలం. ప్రేమించినవ్యక్తి, లేక భార్య లేదాభర్త , తాంబూలం నములుతూఉంటే, తమ్మనాకు బెట్టమని యడగటం ప్రేమకు నిదర్శనం. అది యామెకు బెట్టకపోగా, బంగారు కలువపూదండను వేరొకతె కిస్తున్నాడట కొంటెకృష్ణుడు. మరి రాధమ్మకు కోపంరాదా? రాధకు కృష్ణునిపైగల యధికాపము, చనవు అట్టివి. అలాఆమెయలిగినవేళ ఆమెను బ్రతిమిలాడే కృష్ణయ్య అందాన్ని చూచిన వారిదే భాగ్యం! అంటాడుకవి. బాగుందికదూ?

చకారకుక్షి!

Image
చకారకుక్షి __________ కాళిదాసు వ్యాసుని చకార కుక్షి అనేవాడట. దానిపరిణామక్రమం తెలిసికుందాం! భారతం చాలా పెద్ద గ్రంధం. అందులో లక్షకు మించిన శ్లోకాలున్నాయి. అంతపెద్దగాధని వివరించేటప్పుడు ఆశ్లోకాలలో పాదపూరణకు చకారం యెక్కువగా వాడారట! అదీ కాళిదాసు ఆయన్ని చకార కుక్షి యంటానికి కారణం. కాళిదాసు విశ్వనాథుని దర్శంచేందుకు ఒకపర్యాయం కాశీ వెళ్ళాడు. అక్కడ ఒకపరిచాయకుడు ఆయనకు ఆలయప్రాంగణంలోని వ్యాసుని విగ్రహం వద్దకు తీసికెళ్ళి " వీరు వ్యాసులవారు" అనిపరిచయం చేస్తూ విగ్రహం చూపారట. కాళిదాసు" ఓహో వీరా ఆచకారకుక్షి " అంటూ విగ్రహం బొడ్డులోనికి తన వేలు దూర్చారట. అంతే ఆవేలు యిరుక్కుపోయింది. కాళిదాసు ఆశ్చర్య పడుచుండగా ఆవిగ్రహంనుండి " మనవడా! నాపొట్టలో చకార లెక్కువ ఉన్నాయని నన్నాక్షేపిస్తున్నావుగదా! ద్రౌపది పాండవులు వారి బంధుత్వాలను గురించి చకారం లేకుండా ఒక్క శ్లోకంచెప్పు,? చెప్పావో నీవేలూడుతుంది. అన్నాడట. కాళిదాసు వినయంగా తలవంచి" తాతగారూ! నాకుమీరంటే చాలాఅభిమానం.ఊరక యేదోవేళాకోళానికల్లా అన్నాను గానీ మరేదీ గాదు. మీవలెశ్లోకం వ్రాయటం నాచేతనౌతుందా? అయినా ప్రయ

పడతి . ఇలతిరిగెడు.. పూల్తురిమిన

Image
పడతి . ఇలతిరిగెడు.. పూల్తురిమిన యది ...పొసగెడు కత్తేరా! బడినన్ నేర్వగ రాదే జడకుండు మహిమ తెలియదు జడులకు జగమే జడలుండు పడతి ఇలతిరి గెడు తేనెలలది యది పొసగెడు కత్తేరా పాఠాంతరం బడినన్ నేర్వగ రాదే జడకుండు మహిమ తెలియదు జడులకు జగమే జడలుండు పడతి ఇలతిరి గెడు పూల్తురిమిన యది పొసగెడు కత్తేరా!

కూర్మావతారం........సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు!

Image
కూర్మావతారం........సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు! . కూర్మావతారం ద్వారా మనిషి నేర్చు కోవలసిన ముఖ్యమైన లక్షణాలు పట్టుదల, ఓర్పు , సహనం అని సీతారామ శాస్త్రి గారు వివరించిన విధానం నిజంగా అమొఘం.. మనం ఏమైనా గొప్ప గొప్ప ఘనకార్యాలు తలపెట్టేటప్పుడు ఆ పని భారం మంధర పర్వతం లాగ చాలా బరువుగా అనిపించి ఒకొక్కసారి వొదిలెయ్యాలనిపిస్తుంది.. దానికి తోడు తనను తాడు లాగా ఉపయోగిస్తున్న వాసుకి సర్పం బుసలు కొట్టే విషపూరితమైన అసహనపు నిట్టూర్పు సెగలు పరిస్థితులను ఇంకా తీవ్రతరం చేసినా కానీ పొందవలసినదందలేదని నిరాశ నిస్పృహలతో నీరశించకుండా ఓర్పుతోను, పట్టుదలతోను నొప్పిని సహిస్తూ అడుగు ముందుకెస్తే ఓటమిని కూడా ఓడించగలిగే అవకాశం ఉంటుందని, విజయం వరించడం ఖాయమని కూర్మావతారమర్మం అంటూ ఈ క్రింద అయిదు వాక్యాలతో అద్భుతంగా తెలియజేసారు . . చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే... పొందగోరినదందలేని నిరాశలో అణగారి పోతే.... బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక.... ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది... క్షీర సాగర మధన మర్మం....

ఒక పిరికివాడు ప్రేమించడానికి అనర్హుడు

Image
  ఒక పిరికివాడు ప్రేమించడానికి అనర్హుడు.... దేవదాసు (అక్కినేని) తన తండ్రితో పార్వతి విషయం చెప్పినప్పుడు జమీందారు (ఎస్ వి.రంగారావు) టేబిల్ డ్రాయరు తెరిచి అందులోనుండి ఓ రివాల్వర్ తీసి టేబిల్ పై పెట్టి " నా గొంతుకలో ప్రాణం ఉన్నంత వరకూ ఈ పరువు ప్రతిష్టలు లేని పిల్లను నువ్వు పెళ్లి చేసుకోవడం అంగీకరించలేను. నువ్వు ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాలంటే ఈ రివాల్వర్ తో నన్ను కాల్చి ఆ పైన నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో" అంటాడు. అప్పుడు దేవదాసు ఏమీ చెప్పలేక పట్నం వెళ్ళిపోతాడు.  పదహైదేళ్ళ వయస్సులో చూసినప్పుడు. ఛ! ఈ నాగేశ్వరరావు ఒట్టి పిరికి, అదే మా ఎన్. టి. రామారావు అయితేనా (అప్పట్లో నేను ఎం టి రామారావు పార్టీ.) తండ్రిని ఎదిరించి అయినా పెళ్లి చేసుకునే వాడు. మనస్పూర్తి గా ప్రేమించిన అమ్మాయి కోసం తల్లి తండ్రులు కాదు లోకంఅంతా అడ్డం వచ్చినా ఖాతరు చెయ్యకుండా పెళ్ళిచేసుకోవాలి వాడే అసలయిన మగవాడు. అంత గుండె ధైర్యం లేనివాడు అమ్మాయిని ప్రేమించడానికి అనర్హుడు. అనుకున్నాను. పదహారేళ్ళ వయస్సులో మళ్ళీ దేవదాసు సినిమాను చూసినప్పుడు : పార్వతి తండ్రిని అవమాన పరచి పంపి వేసిన తరువాత, దేవదాసు పార్వత

శ్మశానవాటిక (జాషువా విశ్లేషణ) (వికీపీడియా నుండి సేకరణ.)

Image
శ్మశానవాటిక (జాషువా విశ్లేషణ) (వికీపీడియా నుండి సేకరణ.) శ్రీశ్రీ తన మహప్రస్ధానము లో ఒకచోట అంటాడు కుక్కపిల్ల,సబ్బుబిళ్ల,అగ్గిపుల్ల.... కాదేది కవిత కనర్హం..."'. అంతకు కొన్ని దశాబ్దాలముందే ,అవునవును శ్మశానం కవితకు అర్హం అంటూ జాషువా ఈ ఖండకావ్యాన్ని లిఖించాడు. ఈ కావ్యంలోని పద్యాలలోని పదభావం సూటిగా పాఠకుని హ్రుదయం లోతుల్లోనికి చొచ్చుకెళ్లి,గుండె బరువెక్కుతుంది,వైరాగ్యభావం దోబుచులాడుతుంది.జీవిత చరమాంకసత్యాన్ని కళ్లెదట నిలుపుతుంది.ఈ ఖండకావ్యంలో 8 పద్యాలున్నాయి. అన్ని అణిముత్యాలాంటి పద్యాలే. దువ్వురి వారి పానశాలలో ఒకచోట కవి...అంతం లేని ఈభువనమంతయు ఒకవిశాల పాంధశాల, విశ్రాంతి గృహం,అందు ఇరుసంజెలు రంగుల వాకిలిల్.........కొంత సుఖించి పోయిరెటకో , అంటాడు. . జాషువ ఈకావ్యం మొదటీ పద్యంలో ఈవిషయాన్నే ప్రస్తావిస్తు,ఈ శ్మశానవాటికలో కొన్నివందల,వేల ఏండ్లగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు కదా అంటు ప్రారంభించాడు.ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈచలనంలేని నిద్ర అంటూ వాపోతున్నాడు. ఈ రుద్రభూమిలో తమబిడ్దలును పొగొట్తుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నిళ్ళకు వల్లకాడులోని రాళ్లు క్ర

నేను చూసిన నలుగురి దేవదాసులు ..

Image
నేను చూసిన నలుగురి దేవదాసులు .. .కే.ఎల్. సైగల్.. దిలీప్ కుమార్..అక్కినేని...శారురఖాన్ లు ... నాకు నచ్చినవాడు దీలిప్ కుమార్.

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ!

Image
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ! గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ. ‘పుత్తడిబొమ్మా పూర్ణమ్మా’అంటూ అందచందాల రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ. ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనం ఆశతో పిల్లల్ని ముసలి వరులకు తండ్రులు పెళ్ళిచేయడాన్ని ఇతివృత్తంగా రచించినది. ఒక పూజారింటను పుట్టిన పూర్ణమ్మ అనే బాలిక కన్యాశుల్కం కారణంగా తాత వయసు వున్న వరుడితో బాల్యవివాహమై మూఢాచారానికి బలయిన తీరు అర్ధంతరంగా తనువు చాలించిన విషాదం మనసున్న ఎవరికైనా కళ్ళను చమర్చేటట్లు చేస్తుంది. మేలిమి బంగరు మెలతల్లారా ! కలువల కన్నుల కన్నెల్లారా ! తల్లులగన్నా పిల్లల్లారా ! విన్నారమ్మా ఈ కథను ? ఆ

కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ నివేదన -

Image
కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ  నివేదన - చూచివచ్చిన మాట తేటపడగాను నోటజెప్పుట నీకు చేతకాదనుము చురుకు గల చూపులతొ సూర్యుడా! నీవు చూడలేవైతివా సున్నితపు విభుని మనసు మెత్తనివాడు మహమంచివాడు మాటాడ వెరతురూ మనబోటివారు మగువలకు భయమన్న మరినమ్మవచ్చు మగవారికేలయ్య మాటాడభయము మగవారికైననూ మాటలాడుటకు మనసు తెలుపని వాని మరులేలతిరిగె పగలె పరికిస్తావు పారిపోతావు చీకటిని జూచితే చిక్కుతాడేమొ కునికిపాటున నీవు కునుకుతావేమొ కుముదబాంధవునైన కూకలెట్టుమను.

తొందర పడకు తుమ్మెదా!

Image
తొందర పడకు తుమ్మెదా! . ఎంత చక్కని వాడో అంత టక్కరివాడు... ఎంతకూ ఓయమ్మో చిక్కనివాడు... అంతు చిక్కనివాడు.. తుమ్మెదా తుమ్మెదా ...తొందర పడకు తుమ్మెదా ముందుంది ముసళ్ళ పండగా.. (బాణం వేసేవారు అందరు మన్మధు లు కారు.)

సహజగుణము! (బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి)

Image
సహజగుణము! (బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి) చిమడకే చిమడకే ఓ చింతకాయ! నువ్వెంత చిమిడినా, నీ పుల్ల పోదు. ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ! నువ్వెంత ఉడికినా, నీ కంపు పోదు.

బాల సాహితీ !

Image
బాల సాహితీ ! ఇందు భౌతికస్వభావము వరుస చొప్పునఁ జెప్పఁబడుటచే బాలుఁ డా వరుస నంటు కొని, యొకటి రెండు మారులు వినినంతనే తప్పకుండఁ బదము నప్పగింపఁగలడు ..ఎండలు కాసే దెందుకురా? మబ్బులు పట్టే టందుకురా. మబ్బులు పట్టే దెందుకురా? వానలు కురిసే టందుకురా. వానలు కురిసే దెందుకురా? చెరువులు నిండే టందుకురా. చెరువులు నిండే దెందుకురా? పంటలు పండే టందుకురా. పంటలు పండే దెందుకురా? ప్రజలు బ్రతికే టందుకురా. ప్రజలు బ్రతికే దెందుకురా? స్వామిని కొలిచే టందుకురా. స్వామిని కొలిచే దెందుకురా? ముక్తిని పొందే టందుకుర (వేటూరి గారి బాల సాహితీ నుండి సేకరణ)

సకలవిద్యాసనాధ కవిసార్వభౌమ శ్రీనాథుని 'శృంగార నైషధము' - ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు!

Image
సకలవిద్యాసనాధ కవిసార్వభౌమ శ్రీనాథుని 'శృంగార నైషధము' - ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు . శ్రీనాథుఁడు వ్యభిచారియను ప్రతీతి లోకమునందున్నది. అది యెంతవఱకు సత్యమో మనము చెప్పఁజాలము. కాని శృంగార రసపోషణమున నాతని కభినివేశము మెండని చెప్పుటలోమాత్ర మతిశయోక్తి లేదు. రచనలలో శృంగార రసమును చక్కఁగా పోషించు వారందఱును జీవితములోఁ గూడ శృంగార క్రియాలాలసులై యుందురని భావించుట యుక్తము కాదు. శృంగార రసపోషణాసక్తి కలవాఁడయ్యును నైషధమున శ్రీనాథుఁ డౌచిత్య దృష్టితో కావించిన మార్పులావిషయమున నాతనికిఁగల నిగ్రహమును ప్రదర్శించును. హంస దమయంతికి నలుని సౌందర్యమును వర్ణించిచెప్పునప్పుడు మూలకర్త రంభాద్యప్సరలనేకాక యింద్రాణియు త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ లక్ష్మీ పార్వతులను గూడ నాతని యతిలోక సౌందర్యమును గూర్చి విని చిత్త విభ్రాంతికి లోనైరని వర్ణించియుండెను. లోకమాతలైన ఆ సతీమతల్లుల కట్టి చిత్త వికారము కలిగెనని యూహించుట యసంభావ్యమును అనుచితమును అగుటచే శ్రీనాథుఁడా శ్లోకము లనువదింపక విడిచివైచెను. దేవవేశ్య యగుటచే రంభయందట్టి వికార మసంగతము కాదని తలంచుటచే కాఁబోలు నా శ్లోకమును మాత్ర మనువదించెను. ఆ శ్ల

చదువుసందెలు(బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .)

Image
చదువుసందెలు(బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .) విఘ్నమ్ము లేకుండ విద్య నియ్యవయ్య విఘ్నేశ్వరుడ నీకు వేయిదండాలు.   ఉంగరమ్ములు పెట్టి, ముంగురులు దువ్వి, ఒద్దపెట్టుకు తల్లి ముద్దులాడింది; పలక బలపములిచ్చి, పద్యాలుపాడి, సరసపెట్టుకు తండ్రి చదువు నేర్పాడు. చదువుకో నాయన్న! చదువుకో తండ్రి! చదువుకొంటే నీకు సౌఖ్యమబ్బేను! ఆడుకో నాయన్న! ఆడుకో తండ్రి! ఆడుకొంటే నీకు హాయి కలిగేను! పిల్లలందరు రండి బళ్లోకిపోయి చల్లన్ని గాలిలో చదువుకుందాము. విసరూ విసరూ గాలి విసరవే గాలి మల్లెపూవుల గాలి మామీద విసరు. అరటిపండూ తీపి, ఆవుపాల్‌ తీపి మాచిన్ని అబ్బాయి మాటల్లు తీపి. చదువంటె అబ్బాయి చండికేశాడు బద్దెపలుపా రావె బుద్ధిచెప్పాలి. చదువంటె అబ్బాయి సంతోషపడును అగసాలి రావయ్య నగలు చెయ్యాలి. పొరుగు పిల్లలతోను పోట్లాడబోక; ఇరుగు పిల్లలతోను యేట్లాడబోక. చక్కగా నీ చదువు చదువుకో తండ్రి! చదువుకొంటే నీకు సౌఖ్యమ బ్బేను.

మహర్షులు ప్రసాదించిన అమృతం!

Image
మహర్షులు ప్రసాదించిన అమృతం! . జాతస్య మరణం ధృవం...పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. కానీ అకాలమరణాన్ని ఎలా జయించాలి? సత్యవ్రతాన్ని పాటిస్తూ, సద్వర్తనతో మెలగుతూ, ధర్మపరాయణులుగా ఉండడమే దీన్ని దాటే సులభమార్గం. ఈ విషయాన్నే ధృవీకరిస్తూ మనం చేయాల్సిన నిత్యకృత్యాలు మహాభారతంలోని అరణ్యపర్వంలో వివరంగా చెప్పారు. పూర్వం హైహయవంశంలో దుంధుమారుడు అనే రాకుమారుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేటకు వెళ్లిన సందర్భంలో జింక చర్మాన్ని ధరించి ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడిని జింకగా భ్రమించి బాణంతో కొట్టాడు. ఆ వేటుకు యువకుడు మరణించాడు. దుంధుమారుడు ఆ బ్రాహ్మణయువకుడి మృత కళేబరాన్ని చూశాడు. పొరపాటుకు ఎంతో విచారించాడు. ఈ విషయాన్ని తన కుల పెద్దలకు తెలిపాడు. వారందరూ సమీపంలో ఉన్న తార్క్షు్యడు అనే ముని ఆశ్రమానికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు. ఆ బ్రాహ్మణయువకుని హతమార్చిన మహాపాపాన్ని తొలగించుకునే మార్గం చూపుమని ప్రార్థించారు. అప్పుడు తార్క్షు్యడు వారితో "ఆశ్రమంలో నివసించే వారికి భయం, రోగం, చావుల వంటివి వుండవు" అంటూ, మరణించిన బ్రాహ్మణ యువకుడిని సజీవంగా వారికి చూపాడు. ఈ మహిమకు కారణమేమిటని వార

వినాయక చవితి శుభాకాంక్షలు !!

Image
వినాయక చవితి శుభాకాంక్షలు !! మీకు మీ కుటుంబానికి గణేశుని అనుగ్రహం సదా లభించు గాక !! బాలుల పండగ ఈ వినాయక చవతి వారికి నా దీవెనలు శ్రీ గణ నాధం భజామ్యహమ్ వక్ర తుండ మహా కాయం సూర్య కోటి సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా !! . పూజా విధానం! .   వినాయక చవతి వ్రతకల్పం ఆచమనం:  ఓం శివాయ స్వాహాః, మహేశ్వరాయ స్వాహాః శంభవే స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా, యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః  ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ప్రాణాయామము చేసి దేశకాలములను స్మరించి సంకల్పం చేయవలెను. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప

కాలునితో కలసి నడిచిన సతీసావిత్రికి జీవాత్మ దర్శనం.!

Image
కాలునితో కలసి నడిచిన సతీసావిత్రికి జీవాత్మ దర్శనం.! . ప్రాణ, అపాన అనే వాయువులతో కలిసి అన్ని శరీరాల్లో సంచరించే అగ్నే జీవాత్మ. అచేతనమైన దేహాన్ని చేతనంగా చేసేవాడు, జీవాత్మగా భాసించే ఆ పరమాత్మ అని మహాభారతం అరణ్యపర్వంలో ఎర్రాప్రగడ వివరించాడు. ప్రత్యక్ష దర్శనం... ఇంతకూ ఆ జీవున్ని ప్రత్యక్షంగా దర్శించిన వారెవరైనా ఉన్నారా అంటే, ఉన్నారు. ఆ వ్యక్తే మహాసాధ్వి సావిత్రి, సత్యవంతుని భార్య. జీవున్ని యముణి్న దర్శించగలిగింది, కేవలం ఆమె పాతివ్రత్య మహిమ చేతనే. నల్లని మేఘంలా శోభిల్లే నల్లని కాటుకవంటి ఆకారంతో, భయంకరమైన కోరలతో, మిలమిల మెరిసే నెత్తుటి రంగు నేత్రాలు కలిగి, ప్రళయకాలంలోని అగ్నిలా మండుతూ బంగారు రంగుతో వెలుగుతున్న వస్త్రాలు ధరించి, లోకంలోని జనులకు భీతిని కలిగించే విధంగా యమధర్మరాజు సావిత్రికి ప్రత్యక్షమవుతాడు. నిడివి ఎక్కువగా గల పాశాలను రాకుమారుడైన సత్యవంతుడి పైకి భయంకర రీతిలో ప్రయోగిస్తాడు. అతడి శరీరం నుంచి జుత్తిలి కొలత గల (చూపుడు వేలు, బొటనవేలు చాపగా, పైన నడిమ కొలతకు లోబడిన ఆకృతి) జీవుడిని బంధించి బయటకు లాగగా ఆ జీవుణి్న సావిత్రి ప్రత్యక్షంగా దర్శిస్తుంది. కారణ

విజయ విలాసం!

Image
విజయ విలాసం! . విలాసం ”.అలాగే శృంగార చేష్టలకూ విలాసం అనే పేరుంది  .విజయుడు అయిన అర్జునుడు ముగ్గురు స్త్రీ లతో విలాసం గా ప్రవర్తించిన సంఘటనల మాల ”విజయ విలాసం ” ఈ కావ్యం లో ముగ్గురు నాయికలున్నారు .”ఉలూచి ”అర్జునున్ని ,స్వయం గా వరించిన ప్రౌఢ .దీన్నే SETTLED MARRIAGE అంటాం మనం .చిత్రాంగదను అర్జునుడే వరించాడు .ఇదే ARRANGED MAARRIAGE .ఈమె ముగ్ధ .ఇక సుభద్రార్జును లకు ఒకరిపై ఒకరికి గాడాను రాగం ,ప్రేమ వున్నాయి .దీనికి మించి బంధుత్వము వుంది .దగ్గర కావాలనే తపనా వుంది .నవోద అయిన సుభద్ర అర్జునున్ని చూడ గానే ప్రౌఢ గా మారింది .ఆమె ను ”మధ్యమ నాయిక ”అంటారు . x

భారతంలో నన్నయగారి చివరిపద్యం -

Image
నన్నయగారి చివరిపద్యం: భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన - శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్ జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై (శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు) తాత్పర్యం: అవి శరత్కాలంలోని రాత్రులు; మిక్కిలి ప్రకాశమానాలైన నక్షత్రమాలికలతో కూడి ఉన్నవి, వికసించిన కొంగ్రొత్త తెల్ల కలువల దట్టమైనసుగంధంతో కూడిన గొప్పగాలి యొక్క పరిమళాన్ని వహించాయి, అంతటావెదజల్లబడిన కప్పురపు పుప్పొడివలె ఆకసాన్నిఆవరించిన చంద్రుడి వెన్నెలవెల్లువలు కలిగి మిక్కిలి సొగసుగా వున్నాయి. దీంట్లో నన్నయ తనమహాభినిష్క్రమణని సూచించాడా? విశేషంలో వివరణ ఇలా వుంది: కొందరు పండితులు ఈ పద్యంలోని చివరిపదగుంఫనం - పాండురుచిపూరములు + అంబరపూరితంబులై - అని విరవటానికి బదులు - పాండురుచిపూరములన్ + పరపూరితంబులై-

జీవాత్మ దర్శనం !

Image
జీవాత్మ దర్శనం ! . రాజసూయ యాగ సమయంలో రాజులంతా చూస్తుండగా సుదర్శన చక్రం శిశుపాలుడి తలను ఖండించింది. ఒక కొండలా అతడి తల క్రిందపడింది. వెంటనే ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ బయటికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ ప్రత్యక్షంగా వీక్షించారు. శ్రీకృష్ణుడిని మానవమాత్రుడైన దైవంగా కీర్తించారు. ఆత్మనివాసం.... జీవి (జీవాత్మ) నివాస స్థానం గురించి మంత్రపుష్పంలో ఇలా ఉంది- 'పద్మకోశ ప్రతీకాశగ్o హృదయం చాప్యధోముఖం' గొంతుకు కింద, నాభికి పైన ఉన్న ప్రదేశంలో 12 అంగుళాల ఎడంగా ఉండే హృదయ కమలమే జీవాత్మ-పరమాత్మ నివాసస్థానమని మంత్రపుష్పం తెలుపుతున్నది. సృష్టికి మూలమైన ఆ మహాశక్తి అగ్నిమాలికలా ప్రకాశిస్తున్నది. ప్రాణ, అపాన అనే వాయువులతో కలిసి అన్ని శరీరాల్లో సంచరించే అగ్నే జీవాత్మ. అచేతనమైన దేహాన్ని చేతనంగా చేసేవాడు, జీవాత్మగా భాసించే ఆ పరమాత్మ అని మహాభారతం అరణ్యపర్వంలో ఎర్రాప్రగడ వివరించాడు. (కృతజ్ఞతలు...""Padyala Vaidyudu" Late Sri Dr. C.M. Krishnamurthy Garu)

నెమలిని మయూరము అని అంటారు ఎందుకు?

Image
నెమలిని మయూరము అని అంటారు ఎందుకు? ‘మ' కారము మధనానికి అని అర్ధము. ‘యూర'అనే పదం హృదయానికి అని అర్ధం. ఇంకా ‘మ' అంటే మగనెమలిని అని కూడా అంటారు. పక్షిజాతిలో ‘యోగవిద్య' తెలిసిన పక్షులు 5మాత్రమే ఉన్నాయి. అవి..శుకము, హంస, గరుడు, నెమలి చివరిది పావురము. వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఝానము ఉన్నది. అసలు నెమలి అందమే పింఛం. క్రౌంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించవు. వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి.

స్త్రీ స్వేచ్చ ... చలం (మైదానం)..........విశ్వనాధ(చెలియలికట్ట)..

Image
స్త్రీ స్వేచ్చ ... చలం (మైదానం)..........విశ్వనాధ (చెలియలికట్ట).. స్త్రీల సామాజిక దుస్థితి గురించి,వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలని గురించి తన ఆందోళనని జీవితాంతమూ కొనసాగించిన రచయిత గుడిపాటి వెంకటాచలం. (చలం అనే పేరు తో ప్రాచుర్యం).చలం సాహిత్య ప్రభావం బలమైనది.తెలుగు సాహిత్యం లో చలం అంతటి వివాదాస్పద రచయిత మరొకరు లేరు.స్త్రీ పురుష సంబందాల మధ్య ఏ అంశాలనయితే ముట్టుకోడానికి కూడా మిగతా రచయితలు వేల ఏళ్ళుగా సాహసించ లేదో,ఆ సాహసాన్ని స్త్రీ కోసం మనసారా చేసిన తొలి రచయిత చలం.పురుషుల నిరంకుశ ధోరణి కింద స్త్రీలు అనుభవించే హింస తాలూకు బహు ముఖాలనీ తన సాహిత్యంలో నిజాయితీగా బొమ్మ కట్టి మరీ చూపినవాడు చలం. పురుషాధిక్య సమాజపు వికృత నీతిని తన రచనల్లో ఏ ముసుగులూ వెయ్యకుండా భాషించ గలిగిన వాడు చలం. సాహిత్యం లో శశిరేఖ,అరుణ,వంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీలను చిరస్థాయిగా ఉంచిన వాడు చలం.అయితే చలం రచనల్లో ఎక్కువ సంచలనాన్ని సృష్టించిన నవల మాత్రం "మైదానం". ఈ మైదానం నవలని చలం 1925 లో రాశారు.మైదానం నవల చాలా చర్చలను రేపింది.ప్రతికూల విమర్శల నెదుర్కొన్నది.స్త్రీ స్వేచ్చ మీదా,స్త్రీ పురుషుల సంబం

బాల సాహిత్యము బాలభాష --- శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి !

Image
బాల సాహిత్యము బాలభాష --- శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి ! దొంగవో? దొరవో? . పెద్దవారు బిడ్డను ముందు కూర్చుండబెట్టుకొని 'నీవు దొంగవో దొరవో కనుగొందునా' అని అడిగి - దొంగవో దొరవో? దొంగవో దొరవో? అంటూ ముడ్డిపూస దగ్గరనుండి ముచ్చిలిగుంట దాకా వెన్నెముకను అలాకనగా తాకుతారు. దాని చేత బిడ్డకు చక్కిలిగిలి యేర్పడుతుంది. కొంత దూరము ఓర్చుకోవచ్చునుగాని, ముచ్చిలిగుంట చేరువకు రాను రాను చక్కిలిగింతను నిబ్బరించు కోవడము సాధ్యము కాకపోతుంది. నిబ్బరించుకోలేక చక్కిలిగింతపడి బిడ్డనవ్వును. నవ్వితే దొంగ, నవ్వకుంటే దొర అని నిర్ణయము. 'నవ్వినావులే' అని చక్కిలిగిలి పెట్టినవారు గేలిచేస్తారు. అందుకని బిడ్డ చక్కిలిగిలి పడకుండా నిబ్బరించుకునేటందుకు ప్రయత్నించును. .......   దీపారాధన రక్ష రక్ష! సంధ్య రక్ష! సర్వ రక్ష! దీపరక్ష! దివ్య రక్ష! చిన్ని నా అబ్బాయికి శ్రీరామ రక్ష! (దీపం పెట్టగానే దీపానికి అరచేయి చూపి, అబ్బాయి కండ్లకు అద్దుతూ ఈ పాట పాడుతారు.)

ఒద్దిక కలిగిన భార్య!

Image
వేమన శతకం! . ఆనుకూల్యము గల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమమరు ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు విశ్వదాభిరామ వినురవేమ! . ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన. ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి. భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టి ప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలం వారి క

-భోగినీ దండకము

Image
-భోగినీ దండకము బమ్మెర పోతన-.. ఇది పోతనామాత్యుడు రాసినది కాదు.. ఎవరో రాసి అయన పేరు పెట్టేరు అని నా నమ్మకం... ఇది పోతనగారి సైలి కాదు. . **సింగభూపాలునిఁ గాంచి భోగిని మోహించుట** . శ్రీమన్మహామంగళాకారు నాకారలక్ష్మీకుమారున్‌ గుమారీమనోరాము రామాంబరీషాది రాజన్య రాజద్యశఃకాముఁ గామాహితక్షీరవారాశి తారేశ వాగీంద్ర నాగేంద్ర మందార కుందార విందాభ్ర కల్లోలినీకాశ విఖ్యాత సత్కీర్తి ముక్తావళీ భూషితాశాంగనాలోక సీమంతు సీమంతినీ మానసారామవాటీ వసంతున్‌ వసంతావనీనాథ సంసేవితాంచత్పదాంభోజు నంభోజరాజీ సుహృత్తేజుఁ దేజోజయప్రాభవోద్దాము నుద్దామజన్యావనీ భీము భీమప్రతాపానలాభీలజిహ్వాలి కీలావినిర్మూలితారాతి పాండ్యక్షమాపాల దుర్వారగర్వాటవీవారు వారాధిపోరుప్రభా భాసుర స్ఫార కల్యాణ దుర్వారు వారాశి వేలాపరీతావనీ భార ధౌరేయు ధౌరేయతారాతిరాజన్మహాబాహు బాహాకఠోరాసి ధారావినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్‌ సమూహామహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్‌ వల్లభామానసేచ్ఛాకలాదుర్లభున్‌ దుర్లభారిక్షమానాథ మత్తేభయూధంబులం జించి చెండాడు రాసింగమున్‌ సింగభూపాలు * భూపాలగోపాలగోపాలికాకృష్ణగోపాలు గోపాలదేవోత్సవ క్రీడలో మేడలో ను

-కరుణశ్రీ గారి మందార మకరందాలు -

Image
-కరుణశ్రీ గారి మందార మకరందాలు - . పుష్పవిలాపము. ఉ. నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళువిప్పి "మా ప్రాణము తీతువా" యనుచు బావురుమన్నవి - క్రుంగిపోతి - నా మానసమం దెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై. ఉ. ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జా తీయత దిద్ది తీర్తుము - తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నూయల లూగుచున్ మురియుచుందుము - ఆయువు దీరినంతనే హాయిగ కన్ను మూసెదము - ఆయమ చల్లని కాలివ్రేళ్ళపై. ఉ. గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం గాలకు విందు సేసెదము కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నే త్రాలకు హాయి గూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో తాళుము త్రుంపబోవకుము ! తల్లికి బిడ్డకు వేఱు సేతువే ! ఉ. ఊలుదారాలతో గొంతు కురి బిగించి గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము అకట ! దయలేనివారు మీ యాడువారు.

ముద్దుల నా యెంకి

Image
యెంకి పాటలు నండూరి సుబ్బారావు . ముద్దుల నా యెంకి గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ . కూకుండ నీదురా కూసింతసేపు! నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది . యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది . దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ యీడుండ మంటాది యిలుదూరిపోతాది . యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ మందో మాకో యెట్టి మరిగించినాదీ . వల్లకుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

కిన్నెరసాని పాటలు కిన్నెర దుఃఖము! . (శ్రీ విశ్వనాథ సత్యనారయణ.)

Image
కిన్నెరసాని పాటలు కిన్నెర దుఃఖము! . (శ్రీ విశ్వనాథ సత్యనారయణ.) . హా యని కిన్నెర యేడ్చెన్‌ తన మనోహరుడు శిలయైనా డని తా నేమో యీ వాగైనా నని హా యని కిన్నెర యేడ్చెన్‌ ఊగులాడు కెరటాల నాపుకొన సాగులాడు తరగల్లు నిల్పుకొన ప్రాకిపోవు తనగుణము చంపుకొన చాలక చాలక చాలక చాలక హా యని తన తొందరయును తన పతి ప్రేమయు తాను చేసినా తెలివితక్కువయు తన పతి చూపిన త్యాగగౌరవము తలచుకు తలచుకు బోరున బోరున హా యని ఏడుపు నిప్పుక లెగసి చిమ్ముకొని ఏటి నీరముల నెండగట్టుకొని చేటు తప్పిపోయేటిరీతిగా బాట యేల కనరాదని రాదని హా యని చుక్కనైతె యీ బెడద తప్పునే మొక్కనైతే యీ వగపు తప్పునే అక్కట నా చెలువునిదెస చేసిన యిక్కలుషము నే దాటు టెట్టులని హా యని కడలి లోకముల నేలేరాజట కడలి ధర్మములు నిలిపే దొరయట కడు పతివ్రతల కవయ నెంచుటలు కడలికి తగునా తగునా యిట్లని హా యని అతడు మంచివాడే యగునేమో సతి వాగై ప్రవహించిన దం చన అతనికోసమే అయిన దటంచును మతి తలపోయుట తప్పెట్లగు నని హా యని ఏడ్చి ఏడ్చి జలమెల్ల నెర్రనయి ఏడ్చి ఏడ్చి తనువెల్ల నల్లనయి ఏడ్చి ఏడ్చి నురుసుల్లు తెల్లనయి ఏడ్చి ఏడ్చి నడకల్లు వేగమయి హా యని బొట్టు బొట్ట

శ్రీ రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావన.!

Image
శ్రీ రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావన.! 'శ్రీ భద్రాచల రామదాసు.' రామదాసు గొప్ప రామభక్తుడు. సీతారామచంద్రులను తల్లిదండ్రులుగా ఎంచి, ఆయన ఆలపించిన ప్రతి కీర్తనలో భక్తి-జ్ఞాన-వైరాగ్యాలు, శ్రవణ-కీర్తన-స్మరణము వంటి నవవిధ భక్తిరసాలు ఉట్టిపడుతూ ఉంటాయి . (- జానకి పెండ్లి ఆడినప్పుడు నెత్తి బియ్యం నేను తెచ్చివుందునే... - సీతమ్మకు హరికి ఆకులు నేను ముడిచి ఇచ్చి ఉందునే... - కనక మృగమును... అయ్యో! అమ్మకు నేను తెచ్చియుందును గద... - రావణుడు సీతమ్మను చెరబట్టగ, నేను ధైర్యము చెప్పియుందునే.. - అమ్మ జాడ నేను తెచ్చి యుందునే...) శ్రీరాములతో ఆహా ! పుట్టనైతిని రఘు రాములతో అయ్యో ! పుట్టనైతిని శ్రీరాములతో పుట్టి సేవలు జేయనైతిని // పల్లవి // దశరథ నందనుడై దాశరథి రాములు  వశముగ బాలురతో వరదుడై యాడంగ వనజ నాభునకు నే భక్తుడనై  భయ భక్తి ప్రేమలతోడ శ్రీరామ రామ // ఆశ // సకల సేవలు సలుపుచు మురియుచు అకట ! నల్గురతో నాడు కొందును గద అయోధ్యా నగరిలో గజమునెక్కి  అచ్యుతుడు వెడలి రాగాను // ఆశ // నాట్యమాడుచు నను రక్షింపు మందును ; విశ్వామిత్రుని వెంట పోగానే పోదును జనకుడు హరికి జానకి