ఏం తేడా పడింది?

ఏం తేడా పడింది?

.

స్వతంత్రం వచ్చిందని తెలిసి ఆబాలగోపాలం తెగ సంబరపడిపోయారు. ‘‘ఇన్నాల్టికి కష్టం ఫలించింది’’ అనుకున్నది బామ్మ.

.

ఆ మర్నాడు గారెలకి పప్పు నానపోయాల్సి వచ్చింది. ఎటూ స్వతంత్రం వచ్చింది కదా, రాత్రే దేనికి పొద్దున్నే నానపోయచ్చులే అంది బామ్మ. అమ్మకేమీ అర్థం కాలేదు. పొద్దున్నే నానపోస్తే అవి సమయానికి నానలేదు. మరి స్వతంత్రం వచ్చిందన్నారు - ఏమి తేడా పడిందని దీర్ఘాలు తీసింది బామ్మ.

.

.

మూడు వాయలు పప్పు రుబ్బడానికి మూడు గంటలూ పట్టింది. ‘‘స్వతంత్రం వచ్చిందన్నారు కదే’’ అన్ని కళ్లతోనే అడిగింది - ఒక చెయ్యి పొత్రం మీద ఉంచి మరో చేత్తో ఎత్తిపొడుపు ముద్ర పట్టి. అమ్మకేం అర్థం కాలేదు.

.

‘‘అమ్మాయ్! నూనె కూడా ముందుకులాగే లాగాయి. ఏమీ తగ్గలేదు. తేడా ఏమిటో...’’ బామ్మ సమస్య ఏమిటో అర్థం అయింది గాని అమ్మకి ఎలా సర్దిచెప్పాలో అర్థం కావడం లేదు.

సాయంత్రానికి గారెల బుట్ట ఖాళీ అయింది. మునుపు మూడు రోజులు బుట్ట కళకళలాడుతూ ఉండేది. ఇదేవిటో బుట్టెడు గారెలూ మరు పూటకే మాయం అయినాయంటూ బామ్మ బుగ్గలు నొక్కుకుంటుంటే- ‘‘స్వతంత్రం వచ్చింది కదోచ్’’ అంటూ పిల్లలు అడుగూ బొడుగూ కూడా ఖాళీ చేసి పారిపోయారు. బామ్మకి స్వతంత్రం అంటే తినడం అని అర్థమైంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!