Skip to main content
మనసున మల్లెల మాలలూగెనే
భావకవికి ...బాపు చిత్రం....
.
మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
కొన్ని వాక్యాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. చదివినకొద్దీ మరింత ఆహ్లాదంగా ఉంటాయి. పిల్లగాలులు పలకరిస్తాయి. మనసులో మల్లెలు పూయిస్తాయి. వెన్నెల్లోకి లాక్కెళతాయి. కమనీయమైన ప్రకృతిని హృదయానికతిస్తాయి. ఆ వాక్యాల్లో ఉన్న మత్తు అలాంటిది.
1950 లో తెలుగు సినిమా పాటకి భావ కవిత్వపు వెన్నెల సొబగులద్దీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కలం పూయించిన పారిజాత కుసుమాలు పై వాక్యాలు. అంతవరకూ సాదా సీదాగా సాగుతున్న తెలుగు పాటలోకి మల్లెల జలపాతంలా చొచ్చుకు పోయింది కృష్ణ శాస్త్రి గారి భావ కవిత్వం. తెలుగు సినిమా పాటకి కొత్త వొరవడిని చూపించి, కావ్య వర్ణనా రీతిని చొప్పించిన ఘనత కృష్ణ శాస్త్రి గారి కవిత్వానిది. భావ కవిత్వ సాగరాన్ని చిన్న పాటలో చుట్టేసిన కమనీయ విశిష్ట భావనా శిల్పం ఆయన కవిత. ఎంత రాసినా కాసింత మిగిలిపోతుంది.
పైన ఉదహరించిన పాట పల్లవి మల్లీశ్వరి సినిమాలోదే! పల్లవి ఎత్తుగడే అలా ఉంటే, ఇహ చరణాలు సంగతి సరే సరి. మధురమైన ప్రేమ భావన వల్ల కలిగిన అనుభూతికి విరహాన్ని జోడించీ, ప్రణయ సౌందర్యాన్ని ప్రకృతి కౌగిలిలో చుట్టేసిన విరహ భావాలు అవి.
కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా
అలలు కొలనులో గల గల మనినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హౄదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
అందనంత అర్థాన్ని అలవోకగా పలికించే సరళమైన పదాలవి. వ్యాఖ్యలూ, వివరణలూ అవసరం లేని పొందికైన భావ కవిత్వం అది. అందులో బాధ ఉంది. ఆ బాధలో తెలీని సుఖం ఉంది.
మల్లీశ్వరి సినిమాలో మాటలూ, పాటలతో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన కృష్ణ శాస్త్రి స్పృశించని తెలుగు హృదయం ఒక్కటీ లేదు అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో మల్లీశ్వరి సినిమాలో పాటలు ఓ మలయ మారుతంలా తెలుగు ప్రేక్షకుల్ని సమ్మొహితుల్ని చేసాయి.
కేవలం పాటలోనే కాదు, విడిగా చదువుకున్నా వెన్నెల రాత్రులూ, మల్లెల విరహాలూ మనముందు సాక్షాత్కరింపచేసే మత్తైన మకరందాలవి. ఎన్నిసార్లు చదివినా, కొత్త కొత్త అనుభూతులు కలిగిస్తాయి.
సాధారణంగా పాటల్లో సాహిత్యానికి ఒక స్థాయి కనిపించేలా చేసేది సంగీతం. మంచి సంగీతంతో ఏ సాహిత్యానికైనా విలువ మరింత పెరుగుతుంది. సాహిత్యం సంగీతం కంటే ఓ మెట్టు కిందనే ఉంటుంది. కానీ కృష్ణ శాస్త్రి పాట సంగీతాన్ని మించి మరో మెట్టు పైన ఉంటుంది.
ఆయన పాటల్లో ప్రత్యేకతని మల్లీశ్వరి సంగీత దర్శకులు, సాలూరి రాజేశ్వరరావు చాలా సార్లు ధృవీకరించారు. ప్రతీ పాటకీ సన్నివేశాన్ని బట్టి ఒక్కో రాగం నిర్ణయించుకుంటాడు సంగీత దర్శకుడు. సాధారణంగా సినిమాల్లో ముందుగా వరసలు కట్టిన తరువాతే పాట రాయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వరసకి ( ట్యూన్ ) కి సరిపడేలా పదాలు రావాల్సుంటుంది. అదీకాక పాడడానికి అనువుగా రాయాలి. కొన్ని మాటలు పాటల్లో ఇమడవు. అందువల్ల ముందు సంగీత వరుస కట్టిన తరువాతే రాయడం పరిపాటి. కానీ మల్లీశ్వరి సినిమాకి పాటలు అన్నీ ముందు రాసిన తరువాతే ట్యూన్లు కట్టారు. “ఈ పాటల్లో సాహిత్యం చదువుతుంటేనే అలవోకగా ట్యూన్లు వచ్చాయి. ఏ మాత్రం శ్రమ లేకుండా అతి సులువుగా పాటలు కట్టాను. లలిత గీతాలు రాసిన అనుభవం వల్ల కృష్ణ శాస్త్రి గారి కవిత్వం ఒక పాటలా సాగింది. ” అని రాజేశ్వరరావు అన్నారు.
మనం నిత్యం చూసే పువ్వుల్నీ ఆకుల్నీ, సెలయేళ్ళనీ, గాలుల్నీ సరళ మైన పదాలతో, సున్నితమైన భావాలతో పాట రాయడం అందరికీ రాదు. అందరికీ అర్థమయ్యేలా చెప్పడం అంత సులభం కాదు. ఎవరికీ రానిదీ, చేతకానిదీ అతి సునాయాసంగా చెప్పే గుణం ఆయన పాటకుంది. చిత్ర గీతాల్లో భావుకతని ప్రవేశ పెట్టిన తీరుని ఎంతో మంది అనుకరించారు కానీ, ఆయన స్థాయిలో ఎవరూ రాయలేక పోయారన్నది జగమెరిగిన సత్యం.
.https://www.youtube.com/watch?v=CF1v6M6m86U
Comments
Post a Comment