ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని ........ కర్ణరంధ్రంబుల కలిమి యేల?

ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని 

........ కర్ణరంధ్రంబుల కలిమి యేల? 

పురుషరత్నమ! నీవు భోగింపగాలేని 

........ తనులత వలని సౌందర్యమేల? 

భువనమోహన! నిన్ను బొడగానగాలేని 

........ చక్షురింద్రియముల సత్త్వమేల? 

దయిత! నీ యధరామృతం బానగాలేని 

........ జిహ్వకు ఫలరస సిద్ధి యేల? 


నీరజాతనయన! నీ వనమాలికా 

గంధ మబ్బలేని ఘ్రాణమేల? 

ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని 

జన్మమేల యెన్ని జన్మములకు?!


  రుక్మిణి పంపిన ప్రణయసందేశములోని చివరి పద్యం ఇది. 


    "శ్రీకృష్ణా! మనోజ్ఞమైన నీ మాటలు వినలేని చెవులు, నీవు అనుభవించడానికి అక్కరకురాని ఈ దేహసౌందర్యము, నిన్ను చూడడానికి నోచుకోని కన్నులు, నీ అధరామృతాన్ని గ్రోలలేని నాలుక, నీ వనమాలికా పరిమళమును ఆఘ్రాణించలేని నాసిక, నీకు సేవ చేయలేని ఈ మానవజన్మ నిష్ప్రయోజనం కదా!" అంటున్నది రుక్మిణీరమణి. 


        మానవ శరీరం పంచేంద్రియముల సంపుటి. చెవులున్నాయి వినడానికి. చేతులున్నాయి తాకడానికి. కళ్ళున్నాయి చూడడానికి. జిహ్వ ఉన్నది రుచులను ఆనడానికి. నాసిక ఉంది వాసన చూడడానికి. ఇవి సర్వప్రాణులకు సహజమైన లక్షణాలు. 


        ఐతే, రుక్మిణి దృష్టిలో పాంచభౌతికమైన తన శరీరానికి పరమావధి వేరు. ప్రాణేశ్వరుని సమాగమం, ఆ సమాగమం వల్ల కలిగే మహానుభవం తన పంచేంద్రియాల కలిమికి పరమార్థమని ఆమె భావన! ఈ అవయవాలన్నింటికీ సార్థక్యం అదేనని ఆమె విశ్వాసం!....... శరీర సాకల్యానికీ, జన్మ సాఫల్యానికీ చేసిన మహోదాత్త సమన్వయం ఈ పద్య ప్రసూనం! 

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!