పురాస్మృతులు..............................- రచన : దాశరథి కృష్ణమాచార్య. .


పురాస్మృతులు..............................- రచన : దాశరథి కృష్ణమాచార్య.

.

అంగారం, శృంగారం నీ రచనలో కలగలిసి వుంటాయి" అంటాడు నా బాల్యమిత్రుడూ, ప్రముఖ రచయిత, విమర్శకుడు శ్రీ డి. రామలింగం. ఇది నాలోని ప్రత్యేకత అని అతని అభిప్రాయం, 

.

నెల్లికుదురు (మానుకోట తాలూకా) గ్రామంలో పోలీసు స్టేషన్‌ నుంచి తప్పించుకుని అడవిలోపడి పరుగెత్తినప్పుడు, గుఱ్ఱాలమీద నలభై మంది సైనికులు నన్ను వెదుకుతూ వెంటాడినప్పుడు, క్షణం ఆగకుండా అరణ్యంలో పరుగెత్తుతుంటే, ఎక్కడో పది గుడిసెలు, చిన్నపల్లె. అక్కడ కాస్తసేపు ఆగి మంచినీళ్లు అడిగితే, ఆప్యాయంగా ముంతతో నీళ్లు అందించిన రైతు పిల్ల ఒయ్యారం, ఆమెకళ్లలోని అమాయికత నన్ను మైమరపించాయి. నిజామాబాదు జైల్లో కిటికీలోంచి చూస్తే, బయట మామిడికొమ్మ చిగిర్చి, పూలుపూస్తే, లక్ష ఉగాదులు ఒక్కసారి హృదయంలో దూకినట్లుండేది.

.

మహాకవి "ఇక్బాల్‌" రాసిన ఒక విప్లవగీతంలో -

.

'జిస్‌ ఖేత్‌సె దహ్ఖా\న్‌కు మయస్సర్‌ నహో రోజీ

ఉస్‌ ఖేత్‌కె హర్‌ ఖూషయె గందం కు జలాదో'

.

'ఏ పొలమున నిరుపేదకు దొరకదొ తిండి

ఆ పొలమునగల పంటను కాల్చేయండి'

అనే పద్యపాదం ఒకటుంది. అది చదువుతున్నప్పుడల్లా హృదయం ఉద్రేకంతో పొంగి పోయేది. కాస్త చల్లబడ్డాక ఆలోచిస్తే, ఆ పొలాన్ని కాపలాకాసే అందమైన అమ్మాయికి ఏ అపకారం జరక్కుండా ఆ పంట తగలబెట్టాలి సుమా! అనేది హృదయం.


Comments