Skip to main content
గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం! రచన: జయప్రభ
గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం!
రచన: జయప్రభ
.
రావిశాస్త్రి “పనిపాటా లేక సమానత్వము, హక్కులు అని మాట్లాడే వాళ్ళుగా” ఫెమినిస్టులని ఎద్దేవా చేసి, కన్యాశుల్కం లోని మధురవాణి పాత్ర మాత్రం “మధురం” అని మెచ్చుకున్నారు.
ఆశ్చర్యమేమిటంటే, ఈ విప్లవ రచయితల కన్నా వందేళ్ళ ముందుగానే గురజాడ అప్పారావు గారు “Modern women will rewrite history” అని ప్రకటించినా, వీళ్ళకి మధురవాణే కన్పించింది గాని,
అప్పారావు గారి ముందు చూపు మాత్రం అర్థం కాలేదు.
.
పుట్టిన ఆడపిల్లని గృహిణిగా తయారుచేసే క్రమం ఒకటి మాటల ద్వారా
పాటల ద్వారా పెంపకంలో … ఆమె ఆలోచనాసరళిలో చొప్పించడానికే
మగసాహిత్య కారులు బోలెడంత సాహిత్యాన్ని సృష్టించారు!
ఆడవాళ్ళలో దీనికన్నా భిన్నంగా ఆలోచించే అవకాశాన్ని చాతనైనంత వరకు తీసివేయాలని చూశారు వాళ్ళు! అయినా ఆడవాళ్ళు మౌఖిక సాహిత్యంలో కుటుంబ జీవనంలోని క్లిష్టతని గురించి… వత్తిడిని గురించి… తామేమనుకుంటున్నదీ పాటలు కట్టి పాడుకున్నారు. ఆడవాళ్ళకి చరిత్ర ఎలా ఉండదో… వాళ్ళ సాహిత్యానికి కర్తృత్వమూ అలాగే ఉండదు. అలాంటి ఒక పాట ఏ తరంలోదో… మా అమ్మ గొంతునించి నా దాకా వచ్చించి.
“శ్రీరాంపురమే కూతుర కూతుర / చీపురుకట్టే కూతుర కూతుర
ఏడు పిడకలే కూతుర కూతుర / ఎద్దడినీళ్ళే కూతుర కూతుర
మారటి బిడ్డలె కూతుర కూతుర / మనువు దక్కదే కూతుర కూతుర
ముసలి మొగుడె కూతుర కూతుర / ముచ్చట తీరదె కూతుర కూతుర”
1984 లో సావిత్రి ” బంది పోట్లు ” అనే కవిత రాసింది!
” పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళిచేస్తానని
పంతులు గారన్నప్పుడే భయమేసింది !
ఆఫీసులో నా మొగుడున్నాడు
అవసరమొచ్చినా సెలవివ్వడని
అన్నయ్య అన్నప్పుడే అనుమాన మేసింది!
వాడికేం ? మగమహారాజని
ఆడా, మగా వాగినప్పుడే అర్థమై పోయింది
పెళ్ళంటే పెద్ద శిక్ష అని
మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని! ”
సావిత్రి రాసిన ఈ పద్యం కన్నా ముందొచ్చిన రేవతీ దేవి కవిత్వంలో ఈ రకమైన గొంతు లేదు. ఒక అశాంతీ, దిగులు… అంతర్మథనం… చెప్పుకోలేని అసహనం… ఇవీ కన్పిస్తాయి ” శిలాలోలిత ” పుస్తకంలో! రేవతీదేవి ఇలారాస్తుంది….
” దిగులు
దిగులు దిగులుగా దిగులు
ఎందుకా
ఎందుకో చెప్పే వీలుంటే
దిగులెందుకు ” అని
సావిత్రి ” బందిపోట్లు ” లో ఈ గుంజాటన పడటం మరిలేదు. ఎందుకో చెప్పే వీలుంటే అన్న ఊగిసలాట లేదు. అదెందుకో చెప్పెయ్యటమే తప్ప!!
.
Comments
Post a Comment