శా. ప్రారంభించిన వేదపాఠములకున్ బ్రత్యూహ మౌనంచునో
ఏరా తమ్ముడ! నన్నుఁ జూడఁ జనుదే వెన్నాళ్ళనోయుండి చ
క్షూరాజీవ యుగమ్ము వాఁచె నినుఁ గన్గోకున్కి మీ బావయున్
నీరాకల్ మదిఁ గోరు జంద్రు పొడుపున్ నీరాకరంబుంబలెన్..
(పై పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము అనే ప్రబంధపు తృతీయాశ్వాసం లోనిది. )
ఏరా తమ్ముడూ, మా ఇంటికి రావడమే మానేశావు. నీకోసం నేనూ, మీ బావా కళ్ళు కాయలు కాచేట్టు ఎన్నో రోజుల్నించీ ఎదురు చూస్తున్నాము, నెలపొడుపు కోసం సముద్రం ఎదురు చూస్తున్నట్లు. కొత్త వేదపాఠాలేమైనా ప్రారంభించావా? వాటికి ఆటంకం కలుగుతుందనా రావడం మానేశావు. నిన్ను చూసి ఎంత కాలమయిందో గదా! అంటూ ప్రారంభించింది. ఆత్మీయతను చూపిస్తూనే ఎంతో సున్నితంగా ఎత్తిపొడుస్తూ, వాడి మనస్సు విరగకుండా మొదలు పెట్టింది.
ఎంతో సహజంగా, మనోహరంగా, సాంసారికంగా, ఆత్మీయంగా వున్నది గదా ఈ దృశ్యం. ఇంత చక్కని ఛాయాచిత్రాలతో, ఎంతో ప్రతిభతో నిగమశర్మ అక్కను తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాడు రామకృష్ణ కవి. అక్క ఇక ఉపదేశం ప్రారంభించింది.
Comments
Post a Comment