Skip to main content
స్వరరాగ గంగా ప్రవాహం!
స్వరరాగ గంగా ప్రవాహం!
.
.
కౌసల్యా సుప్రజా రామా... అని ఆ గళం నుండి సుప్రభాతం వినకపోతే
కలియుగ దైవం వెంకటేశ్వరుడికే తెల్లవారదు. ఆమె పాటలు వింటుంటే మనసు తేలికవుతుంది. తెలియకుండానే భక్తి భావం కలుగుతుంది. ఆ దివ్యమంగళ రూపం చూస్తే చాలు రెండు చేతులూ ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది.
ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంట!
.
అవును... 'MS అమ్మా' అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే మదురై షణ్ముఖవడిపు సుబ్బలక్ష్మి. .
1916 సెప్టెంబర్ 16న తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో సుబ్రహ్మణ్య అయ్యర్, షణ్ముఖవడిపు అమ్మల్ దంపతులకు ఆమె జన్మించారు.
చిన్నపటినుంచే సంగీతమంటే ఆసక్తి ఉండడంతో దానిలో శిక్షణ పొంది 1933 లో మద్రాస్ సంగీత అకాడమీలో మొదటి సంగీత కచేరి ఇచ్చారు. అలా మొదలైన ఆమె సంగీత ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఐరాసలో పాడినా, బ్రిటన్ రాణిని తన గాన మాధుర్యంతో తన్మయురాలిని చేసినా అది ఆవిడకే చెల్లింది. అంతేకాదు... దేశంలోనే అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, ఇందిరా జాతీయ సమైక్యతా అవార్డు, ఢిల్లీ ప్రభుత్వంచే జీవిత సాఫల్య పురస్కారం, రామన్ మెగసెసే పురస్కారం, పలు విశ్వవిద్యాలయాలచే డాక్టరేట్లు ఆమెను వరించాయి.
ఇలా కొన్ని దశాబ్దాలపాటు ఈ ధరణీతలాన్ని భక్తి భావనను, పవిత్ర సుమగంధాలను వెదజల్లి పులకింపజేసిన కర్నాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004 డిసెంబర్ 11న ఆగిపోయింది.
భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిపోయినా ఆమె గళం ఈ ఇలాతలంపై వినపడుతున్నంతకాలం ఆ స్వరరాగ గంగా ప్రవాహం సాగుతూనే ఉంటుంది...
Comments
Post a Comment