Skip to main content
హాస్యభరిత నాటకం" కన్యాశుల్కం"
" కన్యాశుల్కం".!
,
హాస్యభరిత శైలిలో సాంఘిక దురాచారాలను దునుమాడిన నాటకం" కన్యాశుల్కం".
.
ఆధునిక గద్య రచనకీ ప్రారంభకుడూ, ప్రవక్తా గురజాడ అప్పారావు. ఎన్నెన్నో సాహిత్య రంగాలలో ఆయన కొత్త మార్గాలు తెరచి కొత్త ప్రక్రియలు అవలంబించారు. ప్రత్యేకంగా వచన రచనలో ఆయన వాడుక భాషను స్వీకరించి దానిని మహోన్నతమైన సాహిత్య స్థాయికి తీసుకు వెళ్ళాడు.
గురజాడ చేపట్టక పూర్వం,
ఆయన మాటల్లోనే... "గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ... ఆమెను పండితులు నిష్కారణంగా దూషించి అవమానించగా కనికరించి ఫీజు లేకుండా వకాల్తా పట్టితిని"... అన్నాడు గురజాడ.
.
ఈనాడు వాడుక భాష దిక్కుమాలినది కాదు. గుడిసెల్లో పుట్టి పెరిగి, స్వయంప్రతిభతో కళాశిఖరాలందుకున్న నటీమణీతోనో, స్వల్ప ప్రారంభాల నుంచి బైటపడి, స్వయంకృషితో చదువులన్నీ నేర్చి, పార్లమెంటు భవనాల నలంకరించే విదుషీమణితోనో నేటి వ్యావహారిక భాషను సరిపోల్చవలసి ఉంటుంది. వాడుక భాషకు ఏ ఒక్కరైనా ఇంత గౌరవం సాధించారంటే అతడు గురజాడ అప్పారావనే చెప్పాలి.
.
మన దేశభాషలన్నింటిలోనూ, పూర్తిగా వచనంతో, అందులోకి పాత్రోచితమైన వ్యావహారిక శైలిలో మొట్టమొదటి నాటకం రాసింది గురజాడ అప్పారావు గారనే అనుకుంటాను. సాంఘిక వాస్తవికతను దర్పణంలో వలె యధాతథంగా ప్రతిబింబించిన కళాఖండం మన భాషలోనే కాదు, మరే ఇతర భారతీయ భాషల్లోనైనా మొదటిదీ, ఆఖరిదీ కన్యాశుల్కమే అనుకుంటాను. కన్యాశుల్కం నాటకాన్ని ఆ తెగలో మించడం మాట అటుంచి, ఆ దరిదాపులకైనా రాగల నాటకం మన దేశంలో ఏదైనా ఉంటే దాని సంగతి ఇంతవరకూ ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరమే అని మాత్రం నేననక తప్పదు.
కన్యాశుల్కంలో ఎక్కడ, 'ఎప్పుడు' ఎవరి మాటలైనా తీసుకోండి. ఇక్కడ అప్పుడు సరిగా ఆ పాత్ర ఆ మాట తప్ప మరొకటి అనడానికి వీల్లేదు. ఇది నాటక రచనకి పరాకాష్ట. గురజాడ కవి మహత్తర విజయం.
Comments
Post a Comment