శ్రీకృష్ణ శతకం.!............... (శ్రీ నరసింహ కవి.)

శ్రీకృష్ణ శతకం.!............... (శ్రీ నరసింహ కవి.)

.

కుక్షిని నిఖిల జగంబులు

నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్

రక్షక వటపత్రముపై

దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!

.

ప్రతిపదార్థం:

రక్షక అంటే అందరినీ రక్షించే; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; కుక్షిని అంటే నీ పొట్టయందు; నిఖిల అంటే సమస్తమైన; జగంబులను అంటే లోకాలను; నిక్షేపము చేసి అంటే దాచిపెట్టి; ప్రళయ అంటే ప్రళయ సంబంధమైన; నీరధి అంటే సముద్రము యొక్క; నడుమన్ అంటే మధ్యభాగంలో; వటపత్రముపై అంటే మర్రి ఆకు మీద; దక్షతన్ అంటే నేర్పు; పవళించునట్టి అంటే నిద్రిస్తున్న నీవు; ధన్యుడు అంటే గొప్పవాడివి.

.

భావం: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం!

.

ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.

Comments