Skip to main content
“కవికుల గురు: కాళిదాసః”.!
“కవికుల గురు: కాళిదాసః”.!
.
కాళిదాస మహాకవి గొప్పతనం జగద్విదితం.
అందుకే “కవికుల గురు: కాళిదాసః” అని
అందరిచే కీర్తించబడినాడు. ఇంకా కాళిదాసు గొప్పతనాన్ని తెలిపే ఒక చక్కని శ్లోకాన్ని
తెలుసు కొందాం.
.
“పురా కవీనాం గణన ప్రసంగే /
కనిష్టికా దిష్టిత కాళిదాసః//
అద్యాపి తత్తుల్య కవేరభావాత్
అనామికా సార్థవతీ బభూవ //
.
“ పూర్వం కవులని గణన అనగా ఎవరు ముందు ఎవరు తరువాత అని లెక్కించడం
ప్రారంభించగా, చిటికిన వేలుని (ప్రధమ స్థానాన్ని) కాళిదాసు అధిరోహించెనట. తదుపరి
రెండవ స్ధానం కోసం (ఉంగరం వేలుకి “అనామిక” అని పేరు.) రెండవ వేలుని అధి
రోహించడానికి ఇప్పటికీ కాళిదాసుతో సమానమైన కవి లేనందున ఆ రెండవవేలుకి
అనామిక అనేపేరు సార్థకమైంది.”
.
సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా ఉన్న కాళిదాసుకి “వీణాపుస్తక పాణి” ఎప్పుడు
పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమై పలకరిస్తుందిట. ఒకరోజు చదువుల తల్లి తన వద్దకి వచ్చినపుడు కాళిదాసు ఇలాప్రశ్నిస్తాడు? “అమ్మా! ఇప్పుడున్న కవి,పండితులలో కవి ఎవరు? పండితుడు ఎవరు?అని.” అపుడు సరస్వతి ఇలా అంటుంది.
“కవిర్దండీ కవిర్డండీ భావభూతిస్తు పండితః”
అని శ్లోకపాదం చెప్పిందట. అనగా సంస్కృతంలో దశకుమార చరిత్రం అనే గొప్ప కావ్యాన్నివ్రాసిన దండి అనేవాడే మహాకవి అనుటలో సందేహం లేదు, అని తెలపడానికే రెండు పర్యాయాలు “కవిర్దండీ కవిర్దండీ” అనిపలికి, ఉత్తరరామ చరితం వంటి మహోన్నతమైన నాటకాలు వ్రాసిన భవభూతిని మహాపండితుడు అని వాగ్దేవి చెప్పిందట.
అప్పుడు కాళిదాసుకి చాలకోపంవచ్చిందట. కారణం తనని కవి అనికాని,పండితుడని కాని గుర్తించలేదని. లోకంలో కవులు,పండితులేకదా! ఉండేది. తాను ఏ కోవకి చెందని వాడనా అని. వెంటనే “కోహం – -(తరువాతి పదం ఒక తిట్టు.అందుకని పేర్కొన లేదు.) ఓ – నేనెవరిని ? అని గట్టిగా అడిగేడట.
పిల్లల కోపాన్ని తల్లి సహించి బుజ్జగిస్తుంది కదా! అందుకే వెంటనే అమ్మ ---
“త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం న సంశయః.”
అనగా నీవేనేను, నీవేనేను, నీవేనేను సందేహమేలేదు. అని నొక్కి వక్కాణించిందట. సాక్షాత్ సరస్వతి స్వరూపమే కాళిదాసు అనుటలో సందేహమేలేదు.అని ఆ చదువుల తల్లి స్వయంగా తెలిపింది.
అందుకే “కవిలోకానికే గురువు కాళిదాసు. అట్టి కాళిదాసు పుట్టిన భూమిపై పుట్టిన మనం ధన్యులం.
.
Comments
Post a Comment