మధ్యాహ్న పురాణం. 1 (3/5/16.) తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – మూడవ భాగం

మధ్యాహ్న పురాణం. 1 (3/5/16.)

తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – మూడవ భాగం

రచన: కె. వి. ఎస్. రామారావు

పదమూడవ రోజు

తెల్లవారింది. నీ కొడుకు విషాదవదనంతో అందరికీ వినపడేట్టు ద్రోణుడితో అన్నాడు – “ధర్మరాజుని పట్టిస్తానని నాకు వరం ఇవ్వటం ఎందుకు, దాన్ని తీర్చలేక ఇప్పుడిలా అందరి ముందు నువ్వూ నేనూ చులకన కావటం ఎందుకు? ఇలా నన్ను వెర్రివాణ్ణి చేస్తే నీకు ఒరిగిందేమిటి?” అని. ఆ మాటలు నచ్చకపోయినా బాధపడకుండా ద్రోణుడన్నాడూ – “నరనారాయణులు అక్కడుంటే ధర్మరాజుని పట్టటం సాధ్యమా? ఇవాళ ఏం చేస్తానో చూద్దువు గాని, ఎలాగైనా అర్జునుణ్ణి దూరంగా తీసుకువెళ్లే మార్గం చూడు. ఇచ్చిన మాట తప్పుతానా?”

అప్పుడు సంశప్తకులు మేం తప్ప అతన్ని పక్కకి తీసుకెళ్లి అక్కడే యుద్ధంతో తీరికలేకుండా ఉంచగలిగే వాళ్లు ఇంకెవరూ లేరు అని వెళ్లి మళ్లీ అర్జునుణ్ణి యుద్ధానికి పిలిచారు. అర్జునుడలా వెళ్తే ద్రోణుడు పద్మవ్యూహం సంఘటించాడు. దానికి అనేక రాజులు దళాలు. రాజకుమారులు కేసరాలు. కర్ణ దుశ్శాసనుల్తో దుర్యోధనుడు కర్ణిక. వలయాకారంగా వుంటుంది గనక కొందరు దాన్ని చక్రవ్యూహం అని కూడ అంటారు. ఆ వ్యూహానికి ముఖస్థానాన ద్రోణుడు దర్పంతో నిలబడ్డాడు. అవసరమైన చోట్లలో రక్తమాల్యాలు ధరించి సైంధవుడు, అశ్వత్థామ, కృపుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శల్యుడు, నీకొడుకులు, మనవలు నిలిచారు. పాండవసైన్యం భీకరంగా వచ్చి ద్రోణుణ్ణి తాకింది. ఐతే అతని బాణధాటికి నిలబడి ఎవరూ వ్యూహాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించలేక పోయారు.

ధర్మరాజు కల్లోలపడ్డాడు. ఈ ఆపద నుంచి బయట పడెయ్యగలిగింది ఎవరా అని చుట్టూ వెదుకుతుంటే ఉత్సాహ, శౌర్య సంపదల్లో దుర్నిరీక్ష్యుడైన అభిమన్యుడు కనపడ్డాడు. అతన్ని చూసి వీడు తప్ప ఇంకెవరూ ఈ మొగ్గరాన్ని నుగ్గు చెయ్యలేరని నిశ్చయించాడు ధర్మరాజు. “దీన్ని భేదించటం అర్జునుడికీ నీకూ కృష్ణుడికీ ప్రద్యుమ్నుడికీ మాత్రమే తెలుసు. కనుక నువ్విప్పుడు దీన్ని ఛేదించి మన పరువు కాపాడు” అనడిగాడు. దానికతను చిరునవ్వు ముఖంతో “మా తండ్రి నాకు దీన్ని భేదించే మార్గం చెప్పాడు. కనుక వ్యూహాన్ని విచ్ఛిన్నం చేసి లోనికి వెళ్లి శత్రుబలగాల్ని చించి చెండాడతా. కాని శత్రువులు మూకుమ్మడిగా చుట్టుముడితే బయటికొచ్చే దారి మాత్రం నాకు తెలీదు. ఐనా దానికేముంది, అవసరాన్ని బట్టి ఏదో చేస్తాలే. నేను ఈ మొగ్గరాన్నెలా ప్రవేశిస్తానో చూద్దువుగా” అన్నాడు ఉల్లాసంగా.

దానికి ధర్మజుడు “నువ్వు తెరిస్తే నీవెనకే మేమూ వస్తాం. అదే నువ్వు మాకిచ్చే వరం” అని చెప్పాడు. భీముడు కూడ, “నువ్వు ముందు ఈ వ్యూహం లోకి కొంచెం దారి చెయ్యి చాలు, నేనూ సాత్యకీ ద్రుపదుడు ధృష్టద్యుమ్నుడు విరాటుడు నీ వెనకే వచ్చి దాన్ని చెల్లాచెదురు చేసేస్తాం” అన్నాడు. దానికి అభిమన్యుడు, “ధర్మజుడు ఇంత ప్రీతిగా అడిగి గౌరవిస్తే, ద్రోణుడు మెచ్చేట్టు ఆ మొనని పిండి చెయ్యకుండా ఉంటానా? కొడుకుని కని అర్జునుడూ సుభద్రా పొందిన ఆనందం వమ్ము చేస్తానా? వయసులో చిన్నవాడినైనా గోపకుడినై కౌరవమూకల్ని గోవుల్లా తోలి చూపిస్తా. మామకి, తండ్రికి ప్రియం చేస్తా. సుయోధనుడు బిత్తరపోయేట్టు చేస్తా” అన్నాడు ఉబుకుతున్న ఉత్సాహంతో. ధర్మరాజు “నీ ధైర్యం, శౌర్యం, బలం, కీర్తి వర్ధిల్లుతాయ”ని దీవించాడు.

అభిమన్యుడు తన సారథితో రథాన్ని ద్రోణుడి మీదికి పోనివ్వమన్నాడు. ఆ సుమిత్రుడు అనుమానంగా “నువ్వా బాలుడివి. అనేక యుద్ధాల్లో ఆరితేరిన ద్రోణాదులు తొలియుద్ధం చేస్తున్న నీ చేతిలో ఓడుతారనుకోవటం అత్యాశేమో” అంటే “ద్రోణాదులే కాదు ఇంద్రాదులొచ్చినా, ఆ ఫాలాక్షుడే స్వయంగా పూనుకున్నా నేను జయిస్తా. ఏం భయమక్కర్లేదు, పద” అని అదిల్చి ద్రోణుడి కెదురుగా బయల్దేరాడు. అతని వెనకే మిగతా సేన కదిలింది. ద్రోణాదులు వాళ్లనెదుర్కుని పోరారు. ఐతే మెరుపు మెరిసినట్టు బాణవర్షంలో ద్రోణుణ్ణి ముంచి అతన్ని దాటి మొగ్గరం లోకి జొరబడ్డాడు అభిమన్యుడు.

ఇలా భేదించటం మహా కష్టమైన ఆ పద్మవ్యూహాన్ని అవలీలగా ఛేదించి ప్రవేశించిన అభిమన్యుడు తన శరపరంపరల్తో కౌరవసేనని కల్లోలసముద్రం చేశాడు. విరిగిన రథాలు, తెగిన తలలు, ముక్కలైన కేతనాలు, చెల్లాచెదురుగా పడ్డ చేతులు, కాళ్లు, గుర్రాలు, ఏనుగులు – వ్యూహం కాస్తా విచ్చి చితికి దీనదశకి చేరుకుంది. ఇది చూసి సహించలేక నీ కొడుకు అతని మీదికి దూకబోతుంటే ద్రోణుడు చెయ్యి ఊపి పెద్దరాజుల్ని కేకేసి “దుర్యోధనుడు అభిమన్యుడి వాత పడకుండా అడ్డుపడండి, మీ శౌర్యపరాక్రమాలు చూపండి” అని ఎలుగెత్తి చెప్తూ తన రథాన్ని అటుకేసి మళ్లించాడు.

కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, భూరిశ్రవుడు, శలుడు, సౌబలుడు, పౌరవుడు, శల్యుడు, వృషసేనుడు దుర్యోధనుడికి అడ్డుగా నిలిచి అభిమన్యుడితో తలపడ్డారు. నోటి కండ లాక్కుంటే దూకే పులిలా విజృంభించి అభిమన్యుడు వాళ్లని చెల్లాచెదురు చేశాడు. లేళ్లగుంపులా పారుతున్న ఆ యోధానుయోధుల్ని చూసి వీణ్ణి వారించటం వీళ్ల వల్ల అయే పనికాదని స్వయంగా తనే అందుకు పూనుకున్నాడు ఆచార్యుడు. పారిపోతున్నవాళ్లు కూడ అతన్ని వచ్చి కలిశారు. ఐతే అభిమన్యుడు అందరినీ సమాధానపరిచి తన నిశితశరాల్తో శరీరాలు తూట్లు పొడుస్తుంటే దుర్యోధనుడు సేనకి చెయ్యి ఊపి పిలిచాడు. బలవంతులైన అనేకమంది దొరలొచ్చి అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు.

అభిమన్యుడు తన మీదికి ఆవేశంగా వచ్చిన అశ్మకుణ్ణి రథంతో సహా నుగ్గుచేశాడు. అదిచూసి విరుగుతున్న బలాల్ని కూడకట్టి ద్రోణాదులు, నీ కొడుకులు కొందరు అభిమన్యుడితో తలపడితే అతను వాళ్లందరికీ గాయాలు చేసి కర్ణుడి వెంట పడ్డాడు. అతను వేసిన ఒక క్రూరనారాచం కర్ణుడి కవచాన్ని చొచ్చి గాయం చేస్తే అతను కటకట పడ్డాడు. అభిమన్యుడు నీ కొడుకుల్నందర్నీ కూడ అలాగే చేస్తే వాళ్లు వెనక్కి తగ్గారు. శల్యుడు వేగంగా వచ్చి తాకితే అంతే వేగంగా అతన్ని మూర్ఛితుణ్ణి చేస్తే నీ బలాలు ద్రోణుడు వారిస్తున్నా వినకుండా దిక్కులేకుండా పారిపోయినయ్. శల్యుడలా ఐతే అతని తమ్ముడు కోపోద్రేకంతో పది తీవ్రబాణాల్తో అభిమన్యుణ్ణి గుచ్చాడు. దాంతో అభిమన్యుడు కాలయముడై వాడి గుర్రాల్ని చంపి, సారథిని కూల్చి, పతాకని పటుక్కున విరిచి, వాడి రెండు ఘనబాహువుల్నీ తుంచి, వేగంగా వాడి దగ్గరికి వెళ్లి భల్లంతో వాడి తల నేల దొర్లించాడు.

కౌరవవీరానీకం కలిసికట్టుగా అతన్ని కమ్ముకుంది. ఐనా అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందరికీ అన్ని రూపులా తానే బలుపిడుగులు కురిసే ప్రళయమేఘంలా భల్లాలు, అంజలికాలు, క్షురాలు, ప్రకూర్మాలు, నఖరాలు – ఇలా నానా రకాల ఆయుధాల్తో మనసేనని అల్లకల్లోలం చేస్తుంటే విచ్చి పారే సైన్యాన్ని ఆపలేక ఆచార్యుడు నివ్వెరపోయి చూస్తూ నిలబడ్డాడు. ఐతే అలా విరిగిన మనసేనని పోనివ్వకుండా వెంట తరిమి అభిమన్యుడు తన రథాన్ని కొరివి తిప్పినట్టు చుట్టూ తిప్పుతూ పీనుగుపెంటలు చేశాడు.

అప్పుడా కుమారుడి వీరవిక్రమాన్ని చూసి ద్రోణుడు ముచ్చటపడ్డాడు. దుర్యోధనుడికి బుద్దొచ్చేలా అతనికి వినపడేట్టు కృపుడితో ఇలా అన్నాడు – “ఈ విజయాత్మజుడు చూశావా, ఒక్కడే మన బలంలో వున్న యోధానుయోధులందర్నీ కలిపి ఎలా మట్టిగరిపిస్తున్నాడో!” అది విని అతిదీనంగా చూస్తూ నవ్వుగానినవ్వు నవ్వుతూ నీ కొడుకు తన చుట్టూ వాళ్లతో అన్నాడు -“ఈ ధనురాచార్యుడి మాటలు వింటున్నారా – ఒక్క బాలుణ్ణి, వెర్రివెధవని ఎంత పెద్ద చేసి పొగుడుతున్నాడో? అర్జునుడి మీది పక్షపాతం చూపించుకుంటున్నాడు గాని ద్రోణుడే తల్చుకుంటే వీడిలా చెలరేగ్గలడా? అది తెలీక వీడు ఇదంతా తన పోటుతనం అనుకుంటున్నాడు. అందరూ కలిసి దూకి వీడి అంతు చూడండి.” అది విని అందరూ అభిమన్యుడి మీదికి వెళ్లబోతుంటే దుశ్శాసనుడు వాళ్లని ఆపి “వీడి సంగతి చూడటానికి ఇంతమంది ఎందుకు, నేనొక్కణ్ణే వీణ్ణి అంతం చేస్తా. అది విని కృష్ణార్జునులూ చస్తారు. దాంతో మన పగ తీరిపోతుంది,” అని ఒక్క అరుపు అరిచి ఆవేశంగా అభిమన్యుణ్ణి తాకాడు.

కరలాఘవాలు, శరలాఘవాలు, విచిత్ర రథప్రచారాల్తో వాళ్లిద్దరూ యుద్ధం సాగించారు. మిగిలిన వాళ్లంతా ప్రేక్షకులై చూస్తున్నారు. అభిమన్యుడు నీ కొడుకు విల్లు తుంచి భల్లాల్తో ఒళ్లు తూట్లు చేసి “అప్పుడు సభలో ధర్మరాజుకి బాధ కలిగించేట్టు నువ్వన్న మాటలకి ఫలితం ఇప్పుడు చూపిస్తా నీకు, పిరికిపందా! పారిపోకుండా కొంచెం సేపు నిలబడి తలపడు. నిన్ను చంపి నన్ను పెంచిన వాళ్ల ఋణం తీర్చుకుంటా” అని అతని వీపు సంధి ఎముకల్లో ఒక వాలాన్ని, వక్షాన మరికొన్ని వాలాల్ని గుచ్చితే ఎప్పుడో చచ్చిన పీనుగులా రథమ్మీద చేరగిలపడ్డాడతను. సారథి రథాన్ని దూరంగా తోలుకుపోయాడు. అది వరకు అభిమన్యుడి వెనకనే వచ్చి వ్యూహం లోకి జొరబడి అడ్డుపడిన బలాల్తో పోరుతూ తలలెత్తిచూస్తూ అభిమన్యుడి యుద్ధం గమనిస్తున్న పాండవులు అది చూసి ఆనందంతో అరిచారు.

దుర్యోధనుడు బాధగా కర్ణుణ్ణి చూసి వీడు దుశ్శాసనుణ్ణి ఎలా గాయపరిచాడో చూశావా అంటే అర్థం చేసుకుని అతను తన బలాల్తో అభిమన్యుడి మీదికి నడిచి దివ్యాస్త్రాలు వేస్తే అభిమన్యుడు లెక్కచెయ్యకుండా అతనితో తలపడితే యుద్ధంలో కర్ణుడు అలిసిపోవటం చూసి అతని తమ్ముడు అభిమన్యుడి మీద బాణపరంపరలు విసిరాడు. క్రోధంతో అభిమన్యుడు ఓ భల్లంతో వాడి శిరస్సుని ఖండించాడు. అది చూసి కర్ణుడు పక్కకి తొలిగిపోతే అతని సైన్యం అభిమన్యుణ్ణి కప్పుకుంది. అతను వాళ్లని చిందరవందర చేసి కర్ణుడి వెంటపడితే అతను భయంతో పారిపోయాడు. అతన్ని చూసి సైన్యం కూడ కకావికలైంది. అప్పటికీ ద్రోణుడు పేరుపేరునా పిలిచి కర్ణా నిలబడు, కృపా ఇలా పారిపోతే ఎలా, బాహ్లికా ఇలా భయపడటం తగునా, రారాజా నీ బలం ధైర్యం చూపి నిలబడు అంటూ ఎంత పురికొల్పినా ఎవరూ అతన్ని పట్టించుకోనేలేదు.

అభిమన్యుడు ఉత్సాహంతో సింహనాదం చేసి శంఖం మోగించి విల్లుతాడు సారించి తనివి తీరక ఆ దొరలందర్నీ తరిమి తరిమి కొట్టాడు. రణరంగం దారుణమైంది. ఎటు చూసినా అవయవాలు, శవాలు, నెత్తుటి మడుగులు. అప్పటి మధ్యాహ్న సూర్యుడూ తనూ ఒకరే ఐనట్టు ఆ బాలుడు తీవ్రుడై మన సైన్యాన్ని కాల్చి మసిచేశాడు.

ఇది వింటున్న ధృతరాష్ట్రుడికి ఒక సందేహం కలిగింది “సంజయా, బాలుడొక్కడే అంతమంది మహారథుల్తో పోరుతుంటే పాండవుల్లో ఒక్కరు కూడ వాడికి తోడుగా రాక పోవటం ఎలా జరిగింది?” అనడిగాడు. దానికి సంజయుడు “పాంచాల యాదవ పాండ్య కేకయ విరాట సైన్యాలు తోడురాగా మన సేనల్ని అల్లకల్లోలం చేస్తూ అభిమన్యుడి వెనకే కదిలొచ్చిన పాండవసైన్యాన్ని సైంధవుడు అడ్డుకున్నాడు” అని చెప్తే ధృతరాష్ట్రుడు “అలా పాండవుల్ని అడ్డుకోవటానికి సైంధవుడెంత తపస్సు చేశాడో కదా, లేకుంటే అదెలా సాధ్యం?” అన్నాడు. “నువ్వన్నది నిజమే. పాండవులు అరణ్యాల్లో ఉన్నప్పుడు ద్రౌపది విషయంలో తనకి జరిగిన అవమానానికి బాధపడి పరమేశ్వరుణ్ణి గురించి గాఢతపస్సు చేశాడతను. ఈశ్వరుడు ప్రత్యక్షమైతే పాండవుల్ని నివారించే వరం కోరుకుంటే ఆ మహాదేవుడు ఒక్కరోజు అర్జునుడు తప్ప మిగిలిన పాండవులందర్నీ నివారించే వరం ఇచ్చాడు. అందువల్ల అతనికి ఆరోజు ఆ గౌరవం దక్కింది” అని యుద్ధక్రమం చెప్పటం కొనసాగించాడు సంజయుడు.

సింధుదేశపు స్థిరవారువాలు కట్టిన రథమ్మీద వరగర్వంతో నిలిచి నీ అల్లుడు సైంధవుడు సాత్యకిని, భీముణ్ణి, ధృష్టద్యుమ్నుణ్ణి, విరాటుణ్ణి, శిఖండిని, ద్రుపదుణ్ణి, ద్రౌపదీయుల్ని, కేకయుల్ని, ధర్మరాజుని – అందర్నీ తనొక్కడే ఎదుర్కుని వారించి ముప్పుతిప్పలు పెట్టాడు. అంతకుముందు అభిమన్యుడి విక్రమానికి నుగ్గైన రథాలు, జంతుకళేబరాలు కూడ వాళ్ల మార్గాన్ని దుర్గమం చేశాయి. ఇంతలో అభిమన్యుడి ధాటికి పారిపోతున్న మన సేనలు కూడ వచ్చి సైంధవుణ్ణి కలిసి పాండవబలగాల్ని కదలకుండా చేసినయ్.

అక్కడ ద్రోణుడు అతిప్రయత్నం మీద కొన్ని బలగాల్ని కూర్చుకుని అభిమన్యుడిని తాకాడు. వాళ్లలో కర్ణుడి కొడుకు వృషసేనుడు అభిమన్యుడి మీద బాణవర్షం కురిపిస్తే అతను క్రోధంతో వాడి సూతుణ్ణి చంపి, విల్లు తుంచి, గుర్రాల ముఖాల్ని బాణాల్తో గుచ్చితే పీనుగులా పడివున్న అతన్ని తీసుకుని గుర్రాలు దూరంగా పరిగెత్తినయ్. ఐతే అభిమన్యుడు వదలకుండా వాణ్ణి తరుముతూ వెంటపడితే వసాతి అనే రాజు అతన్నెదుర్కుని ఆరు బాణాలేశాడు. అభిమన్యుడు వాణ్ణి ఒక బాణంతో పడేస్తే వాడు కిందపడి తన్నుకుని చచ్చాడు.

మన సైన్యం మళ్లీ కొంత కూడకట్టుకుని అతన్ని చుట్టుముడితే అభిమన్యుడు లేళ్ల మీదికి దూకే బెబ్బులి లాగా దొరికిన వాళ్లని దొరికినట్టు రాజుల్ని ఊచకోత కోశాడు. సైన్యం అతలాకుతులమౌతుంటే శల్యుడి కొడుకు రుక్మరథుడనేవాడు మీకేం భయం వద్దు, నేను వీణ్ణిప్పుడే చంపుతానని అతని ఉరాన తొమ్మిది అమ్ములు, భుజాన రెండు నాటి ఇంకా వెయ్యబోయేంతలో అభిమన్యుడు ఒక శరంతో వాడి చేతిని మరోరెంటితో వాడి తలనీ నరికేశాడు. అదిచూసి రుక్మరథుడి స్నేహితులు అనేకమంది రాజులు ఒక్కమారుగా అభిమన్యుడిని చుట్టుముట్టారు. దాంతో అభిమన్యుడి కథ ముగిసిందని నీ కొడుకు ఆనందించాడు.

ఐతే అభిమన్యుడు అలా చుట్టుముట్టిన వాళ్ల మీద గాంధర్వి ఐన ఒక మాయని ప్రయోగించాడు. అది అదివరకు అర్జునుడి తపస్సుకి మెచ్చి తుంబురాదులు ఇచ్చింది. దానివల్ల ఆ రాజులకి అనేకమంది రథికులు వచ్చి తమతో తలపడుతున్నట్టు అనిపించి దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరయారు. ఈలోగా అభిమన్యుడు తన రథాన్ని గిరగిర తిప్పుతూ వాళ్లని నానా తిప్పలు పెట్టాడు. వాళ్లు పారిపోయారు. ఇది సహించలేక నీ కొడుకు స్వయంగా అతన్నెదుర్కుని కొంతసేపు యుద్ధం చేశాడు కాని అభిమన్యుడి ప్రతాపానికి ఆగలేక వెనక్కి తప్పుకున్నాడు.

చివరికి దుర్యోధనుడు కూడ అలా వెనక్కి తగ్గేసరికి నీ కొడుకులు దిగాలు పడిపోయారు. అప్పుడు దుర్యోధనుడు తిరిగి మన సేనల్ని కూడుకుని అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు, కృతవర్మ, బృహద్బలుడు, సౌబలుడు తోడుగా అభిమన్యుణ్ణి ఎదుర్కున్నాడు.

ఇంతలో నీ మనవడు లక్ష్మణుడు సింగపుకొదమలా అభిమన్యుడి పైకి దూకితే కొడుకు ఒంటిగా అభిమన్యుడితో యుద్ధం చెయ్యటం చూసి దుర్యోధనుడు కంగారు పడుతుంటే అక్కడున్న మనవాళ్లంతా అభిమన్యుడి మీద బాణాలు కురిపించారు. ఐతే అభిమన్యుడు ఘోరశరాల్తో వాళ్లని వారిస్తూనే “తెలిసి తెలిసి నాతో తలపడ్డావ్, ఇంకెక్కడికి తప్పించుకుంటావ్” అంటూ అతని వక్షాన, బాహువుల్లో బాణాలు నాటి మణికుండలాల్తో ప్రకాశించే అతని తలని నరికి నేల పడేశాడు. మన సైన్యం గొల్లుమంది. ఆ దృశ్యం చూసిన నీ కొడుకు ఆగ్రహోదగ్రుడై “ఇంక వీణ్ణి వదలొద్దు పొడవండి చంపండి” అనరిచాడు. మన మహారథులంతా నిశితశరాల్తో అభిమన్యుడిని ముంచెత్తారు.

అతను వాళ్ల అమ్ముల్ని వమ్ము చేసి సైంధవుడితో పాండవులు యుద్ధం చేస్తున్న వైపుకి తన రథాన్ని నడుపుతుంటే నిషాదులు, కాళింగులు గజబలాల్తో అతన్ని అడ్డుకున్నారు. అతను వాళ్లతో ఘోరంగా పోరుతూంటే వెనక మిగిలిన పెద్ద యోధులంతా మళ్లీ అతన్ని చుట్టుముట్టారు. అక్కడ సైంధవుడు కూడ పాండవబలాల్ని లోపలికి కదలనివ్వకుండా ఎంతో చాకచక్యంతో పోరాడుతున్నాడు.

అభిమన్యుడు ద్రోణుణ్ణి పదిహేను బాణాల్తో, ఎనభై బాణాల్తో కృతవర్మని, పది విశిఖాల్తో అశ్వత్థామని, ఒక్క పెద్ద నారసంతో కర్ణుణ్ణి నొప్పించి కృపుడి రథాన్ని విరిచి బృహద్బలుడికి ముప్పై బాణాలు నాటి వాళ్ల చుట్టూ వున్న అనేకమంది రాజుల్ని యముడి దగ్గరికి పంపాడు. బృహద్బలుడు ఎన్నో బాణాలేస్తే అతను వాడి వింటిని, జెండాని విరిచి, సారథిని గుర్రాల్ని చంపాడు. వాడో క్రూరమైన కత్తితో కిందికి దూకి తలపడబోతే అభిమన్యుడు విసిరిన ఒక భల్లం వాడి వక్షాన్ని చీల్చింది, వాడు పరలోకాలకి పోయాడు. వాడి బంధువులు అనేకమంది కమ్ముకుంటే ఇంతలో ఆ దగ్గర్లో వున్న కర్ణుణ్ణి చూసి అతనితో తలపడ్డాడు అభిమన్యుడు. వాళ్లిద్దరూ భయంకరంగా పోరాడారు. మగధపతి సుశర్మ కొడుకు అశ్మంతకుడు వచ్చి తాకితే సారథి, గుర్రాలు, రథికుడు – అందరి తలలూ వరసగా నరికి అభిమన్యుడు సింహనాదం చేశాడు.

అదిచూసి భరించలేక దుశ్శాసనుడి కొడుకు అభిమన్యుడి మీదికి లంఘించి నాలుగు బాణాల్తో గుర్రాల్ని, ఒకదానితో అతని సారథిని, పదిబాణాల్తో అతని శరీరాన్ని నాటితే అభిమన్యుడు “ఇంతకుముందే నీ తండ్రి ఓడిపోయి పారిపోయాడు, ఇప్పుడు నువ్వొచ్చావ్. నువ్వెక్కిడికి పోతావో చూస్తా” అంటూ ఏడు నిశితశరాల్తో పీడించి ఒక గొప్ప నారసాన్ని బలంగా వేస్తే హడావుడిగా అశ్వత్థామ దాన్ని మధ్యలోనే ఖండించాడు. ఐతే అభిమన్యుడతని వంక నైనా చూడకుండా నీ మనవడి విల్లు తుంచి సారథిని చంపి ఆరు బాణాలు వక్షాన నాటితే వాడు గబాల్న ఇంకో రథమ్మీదికి ఉరికాడు.

అప్పుడు శత్రుంజయుడు, చంద్రకేతుడు, సువర్చసుడు, సూర్యభానుడు, మేఘవేగుడు అనే మేటిరాజులు అతన్ని తాకితే అభిమన్యుడు క్షణంలో వాళ్లందర్నీ ఖండఖండాలు చేసి ఇక దుర్యోధనుడి వైపుకి కదిలాడు. అదిచూసి కర్ణుడు ద్రోణుడితో “వీరరథికుల్ని చెండాడుతూ వీడిప్పుడు రారాజు మీదికే వెళ్తుంటే నువ్విలా ఊరికే ఉండటం భావ్యమా” అని నిష్టూరమాడి దుర్యోధనుడికి అడ్డుగా వెళ్లాడు.

ద్రోణుడు అక్కడున్న యోధులందరితో “అర్జునుడెంతో వీడంత, వయసుకి చిన్నే గాని తేలిగ్గా దొరికేవాడు కాదు. మనందరం కలిసి ఒక్కసారిగా వీణ్ణి ఎదుర్కుందాం” అని ప్రోత్సహిస్తే వాళ్లు అభిమన్యుడితో తలపడ్డారు. ఈలోగా అభిమన్యుడి దెబ్బకి హతాశుడై కర్ణుడు, “అర్జునుడితో మనం ఇదివరకు యుద్ధాలు చెయ్యలేదా, ఎన్నడూ ఇలా దెబ్బలు తిన్నది లేదు” అంటే ద్రోణుడు చిన్న నవ్వు నవ్వి అన్నాడూ -“అర్జునుడికి నేను కవచధారణమనే విద్యని నేర్పాను, అది వీడు నేర్చుకున్నాడు. దాని మూలాన వీడి చేతిలో ధనుస్సుండగా ఎదురుపడి వీణ్ణి నొప్పించటం దేవతలకైనా సాధ్యం కాదు. వంచనతో మనం ఒక్కసారిగా వీడి విల్లు విరిచి, సారథిని చంపి, రథం నుగ్గుచేస్తే కాని మనకి అవకాశం కలగదు. నువ్వలా చెయ్యగలవా?”

అది విని కర్ణుడు అభిమన్యుడికి భయపడి వెనక్కి తగ్గినట్టు నటించి వెనగ్గా తిరిగి వచ్చాడు. అభిమన్యుడి ఎదుట వున్న వాళ్లు అతని దృష్టి మరలకుండా అతనితో పెనుగుతుంటే వెనక నుంచి ఒక వాడి బాణంతో అతని విల్లు విరిచాడు కర్ణుడు. అదే సమయమని ద్రోణుడు అశ్వాల్ని కూల్చాడు. కృపుడు సారథిని చంపాడు. అలా నిరాయుధుడు, విరథుడు ఐన అభిమన్యుణ్ణి శకుని, కృతవర్మ, శలుడు, బాహ్లికుడు, అశ్వత్థామ, ఇంకా అనేకులు అస్త్రశస్త్రాల్తో చిక్కుపరిచారు. ఐతే అభిమన్యుడు వాలుని పలకని తీసుకుని పైకెగిరాడు. రథాలు, గుర్రాలు, ఏనుగుల మీద దూకుతూ విహరిస్తుంటే ఎవరి మీద దూకుతాడోనని అందరూ గగ్గోలు పడ్డారు.

ద్రోణుడు ఒక బల్లెంతో వాలుని విరిచాడు. కర్ణుడు పలకని ముక్కలు చేశాడు. అభిమన్యుడు తన రథమ్మీద వున్న చక్రాన్ని చేతబట్టి అడ్డున్న సైన్యాన్ని చంపుతూ ద్రోణుడి మీదికి పరిగెత్తుతుంటే శకుని, కృతవర్మ, కృపుడు, కర్ణుడు, శల్యుడు మొదలైన వాళ్లు ఒక్కుమ్మడిగా ఆ చక్రాన్ని ముక్కలు చేశారు. అతను వేగంగా గద తీసుకుని అశ్వత్థామ మీదికి దూకితే అశ్వత్థామ రథమ్మీంచి దూకి వెనక్కి పరిగెత్తాడు. అభిమన్యుడతని సారథిని గుర్రాల్ని గదతో మోది సౌబలుడి వైపుకి నడిచాడు. అడ్డుపడిన గాంధార రాజుల్ని చంపి వసాతి బంధువులు పదిమందిని వాళ్ల ఏనుగులతో సహా పీనుగుల్ని చేశాడు.

అంతటి భీభత్సమైన సమరం సాగిస్తూ విరథుడై, విల్లు లేక, ఒంటిగా చాలా అలిసిపోయివున్నాడతను. శరీరం స్వాధీనం తప్పుతున్నది, తూలుతున్నది. ఐనా పళ్లబిగువున, మనోనిశ్చయంతో దీక్షగా తనని తప్పించుకు పోయే వాళ్లని అవమానిస్తూ ఎదుర్కున్న వాళ్లని చంపుతూ వీరవ్రతం సాగించాడు. ద్రోణాది ప్రముఖులు దూరంగా నిలబడి చూస్తున్నారు ఏం చెయ్యాలో తోచక. ఆ స్థితిలో అతన్ని చంపటానికి వాళ్లెవరూ సాహసించలేకపోయారు.

అప్పుడు దుశ్శాసనుడి కొడుకు రథం మీద అక్కడికి వస్తే తన గదతో వాడి సారథిని గుర్రాల్ని చంపాడు అభిమన్యుడు. వాడు క్రోధంతో ఒక గద తీసుకుని అతన్ని ఎదుర్కున్నాడు. చూచేవారికి అద్భుతమూ శోకమూ కలుగుతుండగా ఉగ్రంగా రణం సాగించి ఒకరొకరి శరీరాల్ని మాంసపు ముద్దలుగా మోదుకుని తుదిశ్వాస విడిచే వరకు రాజధర్మాన్ని పాటించి కన్నుమూశారిద్దరూ.

నెత్తుటినేల ఎర్రటి ఆకాశమైంది. అందులో చంద్రుడిలా అభిమన్యుడు. ఆయుధఖండాలు, భూషణాలు, మణులు తారల్లా వున్నాయి.

సముద్రం లాటి యుద్ధభూమిలో యోగనిద్రలో వున్న విష్ణువులా పవళించివున్నాడతను.

పాండవబలం శోకసంద్రమైంది. మన సైన్యం సంతోషంతో బొబ్బలు పెట్టింది.

“అనితర సాధ్యమైన పరాక్రమ విక్రమంతో ఆచార్యాది మహాయోధులందర్నీ అల్లకల్లోలపరిచి వీరస్వర్గం అందుకున్న అభిమన్యుడి గురించి మనం కలత పడకూడదు. శత్రువుల్ని చంపి గెలుపు సాధించటమే మన కర్తవ్యం” అని ధర్మరాజు తన సేనకి ధైర్యవచనాలు చెప్పాడు.

సంధ్యాసమయం ఐంది. యుద్ధభూమంతా నెత్తుటిగడ్డలా కనిపించింది. పిశాచాలు, నిశాచరులు రక్తపానం చేస్తూ మాంసాలు తింటూ ఆడుతూ పాడుతున్నారు. సైన్యాలు శిబిరాలకి చేరుకున్నయ్.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!