🌹🌺సుభద్రా పరిణయం.🌺🌹

🌹🌺సుభద్రా పరిణయం.🌺🌹


(విజయవిలాసం-కర్త చేమకూరవేంకటకవి. )


🥀🥀🥀🥀

క్లుప్తంగా కథ:


ద్వారకనుండి గదుడనేవాడు పాడవులను దర్శించటానికి వస్తాడు. ఆప్పుడు అర్జునునితో శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్ర సౌందర్యన్ని వర్ణిస్తాడు.


కానన్ సుభద్రకున్ సమంబు గాఁగ నే మృగి విలో

కనన్ ; నిజంబు గాఁగ నే జగంబునందుఁ జూచి కా

కానన్ దదీయ వర్ణనీయ హావభావ ధీ వయః

కన న్మనోఙ్ఞ రేఖ లెన్నఁగాఁ దరంబె గ్రక్కనన్?

.

ఆమె అద్భుత సౌందర్యాన్ని గురించి విన్న అర్జునుడు ఆమెపై మరులుకొంటాడు. పాండవులు తమలో తాము ఒక నియమాన్ని ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ద్రౌపతి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి వద్ద ఉండేటట్టుగానూ ఆ సమయంలో మిగిలిన వారు వారి ఏకాంతతకు భంగం కలిగించ రాదని, ఒకవేళ అలా భంగం కలిగించితే వారు ఒక సంవత్సరకాలం దేశాటన చేయ్యాలని నియమం. ఒక వృద్ధ బ్రాహ్మణుని గోసంరక్షణార్ధం అర్జునుడు ఆ నియమాన్ని ఉల్లంఘించి అన్నగారైన ధర్మరాజు మందిరంలో ఉన్న తన శస్త్రాస్త్రాలను తెచ్చుకొని నియమ భంగం చేస్తాడు. నియమోల్లంఘన జరిగింది కాబట్టి అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరతాడు. అన్నగారు వారించినా ఒప్పుకోలేదు. ఆ సాకుతో ద్వారకకు వెళ్ళి సుభద్రని చేపట్టాలని అర్జునుని ఆలోచన. తనవెంట ధౌమ్యుని తమ్ముడి కొడుకు మిత్రుడు ఐన విశారదుడు, మరికొంత పరివారంతో భూప్రదక్షిణకి బయలుదేరాడు.


అలా బయలుదేరిన అర్జునుడు గంగానదీతీరానికి చేరాడు. గంగాతీరం చేరిన అర్జునుడు గంగాభవానిని స్తుతించి ఆ రోజుకి గంగాతీరాన విశ్రమిస్తాడు. ఆ గంగలో ఉన్న ఉలూచి అనే నాగ కన్య అర్జునిపైన ఎన్నేళ్ళుగానో మరులు కొంది. ఆమె కోరిక తీరే సమయం ఆసన్నమయింది. గంగాతీరాన్న విశ్రమించిన అర్జునుని చూసి"రాజసము తేజరిల్లు నీరాజుఁ గూడి ఇంపుసొంపులు వెలయ గ్రీడింపవలదే" అని అనుకొని అతనిని తన నాగలోకానికి తీసుకొని పోయింది. అక్కడ అర్జునుడు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఉలూచి అతనికి తన కోరిక వెల్లడించింది. "భూమి ప్రదక్షిణము సేయఁ బోయెడివానిన్ గామించి తోడి తేఁ దగవా? మగువ ! వివేక మించుకైన వలదా ?" అని అడిగాడు. ఎన్ని విధాల చెప్పినా ఆమె మాట వినలేదు. తనను చేపట్టకపోతే ప్రాణత్యాగం చేస్తా అని...

-

చెఱకువిలుకాని బారికి వెఱచి నీదు

మఱుగుఁ చేరితిఁ; జేపట్టి మనుపు నన్నుఁ;

బ్రాణదానంబు కన్నను వ్రతము గలదే?

యెఱుఁగవే ధర్మపరుఁడవు నృపకుమార !

-

అన్నది.

ఆవిధంగా అతనిని ఒప్పించిన ఉలూచికి ఇలావంతుడనే కుమారుడు పుట్టాడు. (ఇదంతా ఒకే రాత్రిలో జరిగింది). మరునాడు ఉదయం తన మిత్రులంతా ఎదురు చూస్తారని వెళ్ళకపోతే వారు కలత చెందుతారని ఉలూచికి నచ్చచెప్పి అక్కడనుండి బయలుదేరి మిత్రులని కలిసి తన భూప్రదక్షిణ ప్రారంభిస్తాడు. అవిధంగా తిరుగుతూ దక్షిణ భారతంలో పాండ్యదేశరాజధాని ఐన మణిపురానికి చేరుకున్నాడు. ఆ రాజ్యానికి రాజు మలయధ్వజుడు. ఆతనికి ఒక కుమార్తె ఉన్నది పేరు చిత్రాంగద. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన అర్జునుడు విశారదునితో పెండ్లికి రాయబారం పంపుతాడు. అర్జునుడు అల్లుడిగా చేసుకునేందుకు మలయధ్వజుడు సంతోషంగా అంగీకరిస్తాడు. అలావారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోతుంది. కాలక్రమేణా చిత్రాంగద గర్భందాల్చి బబ్రువాహనుడికి జన్మమిస్తుంది. కుమారుని అచ్చట్లు ముచట్లు తీరాక అర్జునుడు మరల తన భూప్రదక్షిణకు బయలుదేరాడు. అలా తిరుగుతూ సౌభద్ర నదిలో శాపగ్రస్తులైన మొసళ్ళకు శాపవిమోచనం కలిగించి అక్కడనుండి పశ్చిమాన్న ఉన్న ద్వారకా నగరానికి చేరుకున్నాడు.


అక్కడికి చేరుకున్నాక అర్జునుడూ శ్రీకృష్ణుని తలచుకొన్నాడు. శ్రీకృష్ణుడు అతనికి ప్రత్యక్షమయి అతనికి సాధువేషంలో రైవతక పర్వతం మీద ఉండమని అదేశిస్తాడు. మరునాడు అక్కడ ఒక గొప్ప సన్యాసి వచ్చి ఉన్నాడని ద్వారక ప్రజలంతా వస్తారు. బలరామ శ్రీకృష్ణులు కూడా వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారు. అప్పుడు బలరాముడు అర్జునుని నిజమైన సన్యాసిగా భావించి తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు. అర్జునుడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ద్వారకకు చేరుకున్నాడు. బలరాముడు అతని సేవకై సుభద్రని నియమిస్తాడు. సుభద్ర ఆ కపట సన్యాసికి సేవలు చేస్తుండగా ఒకనాడు ఆమెకు శకున శాస్త్రం చెప్తాడు. మాటల్లో ఒకనాడు సుభద్ర...

మీ రింద్రప్రస్థముఁ గని

నారా? పాండవులఁ జూచినారా ? సఖులై

వారందఱు నొకచో ను

న్నారా? వీరాగ్రగణ్యు నరు నెఱుఁగుదురా?

.


ఎగు భుజంబులవాఁడు, మృగరాజ మధ్యంబు

పుడికి పుచ్చుకొను నెన్నడుమువాఁడు

నెఱివెండ్రుకలవాడు, నీలంపు నికరంపు

మెఱుఁగుఁ జామనచాయ మేనివాఁడు

గొప్ప కన్నులవాఁడు, కోదండ గుణ కిణాం

కములైన ముంజేతు లమరువాఁడు

బరివి గడ్డమువాఁడు, పన్నిదం బిడి దాఁగ

వచ్చు నందపు వెను మచ్చవాఁడు

.

గరగరనివాఁడు, నవ్వు మొగంబువాఁడు

చ్గూడఁ గలవాఁడు, మేలైన సొబగువాఁడు,

వావి మేనత్తకొడుకు కావలయు నాకు

నర్జునుండు పరాక్ర మొపార్జునుండు.

.

అని అడిగింది.


ఆమె మనసును గ్రహించిన అర్జునుడు తనే అర్జునుడని అసలు విషయం బయటపెడతాడు.

.

నీకై తపంబు జేసెద

నీ కైవడి; దాఁపనేల? యే నర్జునుఁడన్

లోకోత్తర శుభలగ్నం

బో కోమలి! నేడు కోర్కులొడఁగూర్పఁ గదే !

.

అన్నాడు.


తన నిజరూపం తెలియచేసిన ఆర్జునుడు తనని గాంధర్వ వివాహం చేసుకోమని సుభద్రని అర్ధించాడు. సుభద్ర అందుకు ఒప్పుకోలేదు. పెద్దల సమక్షాన్నే కళ్యాణం అని చెప్పివేసింది. చేసేదిలేక ఆమెను వదిలి వేసాడు. పెళ్ళివరకు ఇద్దరు విరహ తాపాన్ని అనుభవించారు. చంద్రుణ్ణి తిట్టుకున్నారు. మన్మధుడిని తూలనాడారు. బలరామునికి ఈ విషయం ఇంకా తెలియదు. అంతా శ్రీకృష్ణుని ఆధ్వర్యంలోనే నడుస్తోంది. సరైన సమయం చూసి శ్రీకృష్ణుడు వారికి దొంగపెళ్ళి జరిపించాడు. వారి ఆనందానికి అంతులేదు. అంత సుభద్రని తీసుకొనివెళ్ళే సమయంలో యాదవ వీరులు అతనిని అడ్డగించారు. సుభద్ర సారధ్యం చెయ్యగా అర్జునుడు వారందరిని ఓడించి ఇంద్రప్రస్థం చేరుకున్నారు. సుభద్ర వివాహం సంగతి బలరామునికి తెలిసింది. కోపంతో మండి పడ్డాడు. శ్రీకృష్ణుడు జరిగినది బలరాముని కి చెప్పి వారిని శాంతపరిచాడు. వారందరు కలిసి ఇంద్రప్రస్థం చేరి దంపతులను ఆశీర్వదించారు. మరల వారిద్దరికీ ఐదురోజుల పెండ్లి జరిపించారు. వారి ప్రేమకు అనురాగానికి గుర్తుగా అభిమన్యుడు జన్మించాడు.


ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ముఖ్యంగా విజయ నామధేయుడైన అర్జునుని భూప్రదక్షణ, ఉలూచి, చిత్రంగద, సుభద్రలతో వివాహం వరకు వివరించినా కథ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. చక్కని తేట తెలుగు పద్యాలతో ఉండే ఈ కావ్యం, అందరు తప్పక చదవాల్సిన పుస్తకం.


🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!