అరగుండు + అరగుండు = ఎంత?...”గుండు ! ..... (కథ- శ్రీ చంద్రశేఖర్ ఇండ్ల)

.


“మీరెన్ని చెప్పినా నేనొప్పుకొనేదేలేదు” అని ఖచ్చితంగా చెప్పింది వెంకటమ్మ గుడ్డలమూటమీద బాసిపట్లేసుకొని కూర్చుంటూ.

.


“నీకే అంతుంటే నీ మొగుడ్ని అందునా మొగోడ్ని నాకెంతుండాలి, నేను మాత్రం ఎందుకొప్పుకుంటాను” ఎదురు ప్రశ్నించాడు యాకోబు కండవని తలకు చుట్టుకుంటూ.

.


కథ మళ్ళీ మొదటికొచ్చేసరికి కందులూరు గ్రామస్థులందరికి విసుగొచ్చి లేచి ఇంటికి వెళ్ళాలనిపించింది. చూస్తే కరెంట్ లేదు టీవీలు కూడా రావు, ఇంటి దగ్గర పనులేమి లేవనే విషయం గుర్తుకొచ్చి ఊరికే వచ్చే ఆనందాన్ని ఎందుక్కాదనాలని అక్కడే కూర్చుండి పోయారు.

.


“ఒరేయ్ వెంకటేసు నువ్వే చెప్పరా మీయమ్మ మాట వింటావా ? మీ నాన్న మాట వింటావా?” అన్నాడు అంత అందమైన తగాదా లో నిశ్శబ్దాన్ని భరించలేక తంబారంబావ ( తంబారం అనే వూరి నుంచి కందులూరు కొచ్చిన మొట్ట మొదటి అల్లుడు కాబట్టి అందరు అతన్ని బావ అనే అంటారు).

.


తను నమ్మేవన్ని నగ్న సత్యాలే అని నమ్మే ఆదాము, నత్తేసేబు, కత్తేసు, చిన్న నవాకు, పెద్ద నవాకు, పేతురు, దేవనందం, కొండయ్య, గోవిందమ్మ, జానూ, ఉలిపిరి నాగేంద్రం మరియు ఆమె ఏడేళ్ళ కూతురు నల్లకుమారి, మేరిమ్మ, మరియమ్మ, ఇస్రాంతమ్మ, రూబేను, పులిబొంగరాలు (పుణుగులు) అమ్ముకునే ఆదెయ్య, జిలకర ఏసుపాదం, మాజీ పసిరెంటు పిచ్చమ్మ తదితరులందరూ ఆసక్తిగా వెంకటేసు వైపే చూస్తున్నారు ఏమి చెప్తాడా అని. నవమాసాలు మోసి, కని ,పెంచి ఇప్పుడు తూర్పుకి తిరిగి కూర్చున్న అమ్మ మాట వినాల? లేకపోతే అమ్మకు, తనకు అన్నీ తానే అయ్యి ఇప్పుడు పడమరకు తిరిగి కూర్చున్న నాన్న మాట వినాలో అర్ధం కాని వెంకటేసు అలా ఆకాశంలోకి చూస్తు పట్టపగలే చుక్కలు లెక్క పెడుతుంటే వెనకాలగా వచ్చి వెంకటేసు తల్లో పేలు చూడడం మొదలెట్టింది నాన్నమ్మ కోటమ్మ.


ఇంతలో దేవుడిలా వచ్చాడు సుబ్రమణ్యం మాష్టారు. ఆనాడు కూలికిబోయిన యాకోబును, ఆసామి కూతురు వెంకటమ్మ ప్రేమిస్తే, అది అర్ధం చేసుకొని యాకోబు వెంకటమ్మ కు మనసిస్తే, ఇది తెలిసిన ఆసామి కోపంతో ఇంతెత్తున యెగిరి గంతేస్తే, ఆయన్ని కాదని ఆరోజుల్లోనే కులాంతర వివాహం జరిపిన జూనియర్ కందుకూరి అతను. ఇంకా చెప్పాలంటే యాకోబు వెంకటమ్మలకు కొడుకు పుట్టినప్పుడు ‘నా కొడిక్కి వెంకటేశ్వరస్వామి పేరు పెడతానని వెంకటమ్మ , కాదు ఏసుప్రభు పేరు పెడతానని యాకోబు గొడవ పడుతుంటే అలా కాదని వెంకటేశ్వర స్వామిలోంచి వెంకటను తీసి, ఏసుప్రభు లోంచి ఏసును తీసి దానికి గుణసంధి సూత్రం ఆపాదించి, వెంకట+ఏసు=వెంకటేసు అని నామకరణం చేసిన ఈ కాలపు తెనాలి రామలింగడతను. అటువంటి మహానుభావున్ని చూసి గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకొని పైకి లేచారు.

.


సుబ్రమణ్యం మాష్టారు నవ్వి, అందర్నీ కూర్చోమని సైగ చేసి, తనూ పక్కనే వున్న నాబ్బండరుగు మీద కూర్చుని, చేతి కర్రను జాగ్రత్తగా ఒల్లో పెట్టుకొని, నిమిషాల్లో విషయం తెలుసుకొని గర్వంగా మీసాలు దువ్వి , ఛాతి నిండా గాలి పీల్చి “ఓస్ ఇందుకేనా గోలంతా! ఎరీ సింపుల్, అరగుండు + అరగుండు = ఎంత?” అని అడిగాడు అక్కడ కూర్చున్న వాళ్ళని , ఆ లెక్కకు జవాబు తెలియక అందరు తిక మక పడుతుంటే ఆ గుంపులో వున్న జాన్ అప్పుడే స్కూల్కి వెళ్ళడం మొదలెట్టిన తన ఆరేళ్ళకొడుకుని చెప్పమన్నాడు. ఆ పిల్లాడు బాగా ఆలోచించి, బలపం కోసం బ్యాగంత వెతికి అది కనపడక పోయేసరికి వేలితో నేలమీద రాసి మరీ చెప్పాడు “అరగుండు + అరగుండు = రెండరగుండ్లు” అని. అది విన్న జాన్ సంతోషంతో సుబ్రమణ్యం మాష్టారు వైపు చూసాడు ‘అవును కదా!’ అన్నట్లు. మాస్టారు ఆ అజ్ఞానులను చూసి అందంగా నవ్వి “అరగుండు + అరగుండు = గుండు” అని, వెంటనే “ అంటే వెంకటేశ్వర స్వామికి సగం వెంట్రుకలు, ఏసుప్రభు కి సగం వెంట్రుకలు ఇస్తే సరి “ అన్నాడు పొంగిన ఛాతిని ఇంకొంచం పొంగిస్తూ . “అదెలా కుదుర్తుంది” అన్నారు ఇద్దరూ ఒకేసారి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!