👉మహాభారతం --జీవిత సత్యాలు!🙏


👉మహాభారతం --జీవిత సత్యాలు!🙏


👉తమపై తమకు అపారమైన నమ్మకం కలిగి ఉండాలి:


ఇది కొత్త సూక్తేమీ కాదు. ఎన్నో సార్లు ఈ సూక్తిని మనం చదివే ఉంటాం. అయినా, ఈ సూక్తిని దాని అర్థాన్ని గుర్తించడంలో విఫలమవుతూ ఉంటాం. మహాభారతం ఈ జీవిత సత్యం గురించి చక్కగా వివరిస్తోంది. అనేక అడ్డంకులు ఎదురైనా, భారీగా గాలి వాన కురుస్తున్నా కంసుడి బారి నుండి కృష్ణుడిని రక్షించడానికి కృష్ణుడి తండ్రి కృష్ణుణ్ణి ఒక బుట్టలో తీసుకుని వెళ్తాడు. పరిస్థితులకు ఎదురీది కృష్ణుడిని కాపాడతాడు. పాండవులకు తమ మీద తమకు అపార నమ్మకం కలిగి ఉండటం వలన కౌరవులపై పోరాడి విజయం సాధిస్తారు. ద్రోణాచార్యుడు కర్ణుడికి విలువిద్యను నేర్పించేందుకు అంగీకరించడు. కర్ణుడిని తన విద్యార్థిగా ఒప్పుకోడు. అయినా, మొక్కవోని దీక్షతో తనపై తనకున్న నమ్మకంతో విలువిద్యలో మంచి పట్టును సాధించాడు.

👉ఫలితం గురించి ఆలోచించకూడదు:


ఈ పవిత్ర గ్రంధంలో ఈ విషయం కూడా చక్కగా ప్రస్తావింపబడింది. తమ పనిని తాము దీక్షతో చేసుకోవాలి. ఎటువంటి అడ్డంకులూ ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్న పనిని పూర్తిచేయాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. ఫలితం మీద దృష్టి పెట్టడం వలన చక్కటి పనితీరును ప్రదర్శించలేరు. ఏకాగ్రత లోపం ఏర్పడవచ్చు. ఫలితం గురించి మర్చిపోయి పనిపట్ల నిబద్ధతతో ఉంటే పనిలో చక్కటి నైపుణ్యాన్ని కనబరచగలుగుతారు. ఫలితం పట్ల దృష్టి పెట్టినప్పుడు ఆశించిన ఫలితం దక్కకపోతే నిరాశకు గురవడం జరుగుతుంది. ఒకవేళ, ఆశించిన ఫలితం దక్కినా గర్వం బారిన పడటం వలన ముందు ముందు అద్భుతమైన నైపుణ్యాన్నిప్రదర్శించే అవకాశం కోల్పోతారు. అందువలన, ఫలితంపై దృష్టి పెట్టకుండా కేవలం చేసే పనిపై శ్రద్ధ కనబరచాలి.


👉మార్పు మాత్రమే స్థిరమైనది: 

ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ విషయాన్నే కృష్ణుడు మహాభారతంలో స్పష్టంగా వివరించాడు. మార్పు అనేది ప్రకృతి యొక్క సహజ ధర్మం. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడే తన జీవితంలో అనేక పరిస్థితులను ఎదుర్కున్నాడు. కన్నవారు ఒకరు పెంచినవారు ఒకరు. గోకులంలో అలాగే బృందావనంలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు. అయితే, తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం ఆ ప్రదేశాలను విడవవలసి వచ్చింది. అదే విధంగా, రాధతో ప్రేమలో పడినా రుక్మిణిని పెళ్లాడాడు. జీవితంలో ఎదురైనా అనేక మార్పులను, పరిస్థితులను చక్కగా ఎదుర్కొన్నాడు. పాండవుల జీవితంలో కూడా మార్పు అనేది అనేకరకాలుగా ఎదురైంది. ఒకానొక దశలో, వారు అరణ్యవాసం కూడా చేయవలసి వచ్చింది. అలాగే అజ్ఞాతవాసం కూడా చేయవలసి వచ్చింది. కాబట్టి, మార్పును అంగీకరించి తీరాలి.


👉జరిగేదంతా మన మంచికే:


శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. ఆ విధంగా కంసుడి బారి నుంచి రక్షింపబడ్డాడు. గోకులాన్ని అలాగే తన స్నేహితులను విడిచాడు. అందువలన రాక్షసుడు వధించబడ్డాడు. ద్రౌపదిపై కౌరవులు తమ ప్రతాపాన్ని ద్రౌపది వస్త్రాపహరణం ద్వారా చూపించబోతున్నప్ప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు. కృష్ణుడిపై ఆమె నమ్మకం వమ్ము కాలేదు. ధర్మాన్ని నిలబెట్టాడు. తన గతజన్మలో పాపాల వలన తానీ విధమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నదా అని ద్రౌపది కృష్ణుడిని ప్రశ్నించినప్పుడు కృష్ణుడు ఈ విధంగా బదులిస్తాడు. బాధలకు గురయ్యే వారు గతజన్మలో పాపాలు చేసినవారు కాదు, పాపాలు చేసే వారే గతజన్మలో కూడా పాపి అవడం వలన అదే ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అని వివరిస్తాడు. అందువలన, ఏది జరిగినా మంచికే జరుగుతుందని మహాభారతం స్పష్టం చేస్తోంది. ఏది ఎందుకు జరిగిందో ఆ కారణాన్ని ప్రస్తుతం మనం అర్థం చేసుకోలేకపోయిన కాలం ఆ విషయాన్ని మనకు కాలమే విడమరిచి వివరిస్తుందని మహాభారతం తెలియచేస్తోంది.


👉ధర్మాన్ని రక్షించాలి


మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఆమె కృష్ణుడిని శపిస్తుంది. కృష్ణుడి వంశం కూడా తన వంశం నాశనమైన విధంగా నాశనమవ్వాలని ఆమె శపిస్తుంది. కృష్ణుడికి యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్నా కృష్ణుడు ఆ విధంగా ప్రయత్నం చేయలేదని ఆమె నిరుత్సాహానికి గురవుతుంది. ఇది వాస్తవమే అయినా, మరొక వాస్తవం ఏంటంటే ధర్మాన్ని కాపాడటం కృష్ణుడు తన ధర్మంగా భావించాడు. భావితరాల మంచి కోసం గాంధారి పుత్రులు అలాగే మరికొంతమంది ఈ యుద్ధంలో బలవుతారన్న సంగతి కృష్ణుడికి తెలుసు. తన దగ్గరివారిని కూడా వధించమని అర్జునికి ఇచ్చిన ఉపదేశంలో ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం గురించి శ్రీకృష్ణుడు వివరిస్తాడు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!