నన్నయ్యగారి పద్యం.


నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలై

సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్

నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులన్

దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్


ఇది
నన్నయ్యగారి పద్యం. మహాభారతం అరణ్యపర్వంలోది. ప్రసిద్ధమైన పద్యమే.

అరణ్యపర్వంలో వచ్చే అనేక కథలలో నల మహారాజు కథ ఒకటి. ఇది కూడా చాలామందికి తెలిసిన కథే. ఇందులో హంస రాయబారం బాగా ప్రాచుర్యాన్ని పొందింది. నలుడి చేత రక్షింపబడ్డ ఒక హంస, ప్రత్యుపకారంగా దమయంతిదగ్గరకి వెళ్ళి నలుణ్ణి గురించి గొప్పగా చెప్పి, నలునిపై ఆమెకు ఇష్టాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే దమయంతి రూపవైభవాన్ని నలునికి చెప్పి అతనిలోని కోరికని పెంపొందిస్తుంది. ఈ హంస రాయబర ఫలితంగా వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి కోరిక కలిగి, విరహితులౌతారు. ఆ విరహ బాధ తగ్గించుకోడానికి నానా తిప్పలూ పడతారు. వాటిని వర్ణించే పద్యం ఇది!


మనఃప్రభవుడు అంటే మనసులో పుట్టేవాడు, మన్మథుడు. మనఃప్రభవానలం - ఆ మన్మథుడికి సంబంధించిన అగ్ని. మన్మథ తాపం అన్న మాట. ఆ మన్మథ తాపంతో బాధింపబడే మనసు కలవాళ్ళయ్యారు ఆ ఇద్దరూ. ఇక్కడ "మనః ప్రభవానల"లో "నః" యతి స్థానంలో ఉంది. కాబట్టి కొంచెం ఒత్తి పలకాలి. అలా అక్కడ, ఆ విసర్గతో కూడిన నకారాన్ని వత్తి పలికినప్పుడు ఆ మన్మథ తాపం మనసుని ఎంతగా దహిస్తోందో చక్కగా తెలుస్తుంది.

"దీర్ఘవాసర నిశల్" - పొడవైన పగళ్ళు కలిగిన రాత్రులు. వాటిని ఎలాగో అలా కష్టపడి గడుపుతున్నారు. ఈ "దీర్ఘవాసరనిశల్" అనేది భలే అద్భుతమైన ప్రయోగం. చెపుతున్నది రాత్రుల గురించి. ఆ రాత్రులు ఎలాంటివంటే బాగా దీర్ఘమైన పగళ్ళు కలిగినవి. అంటే రాత్రులేమో ఇట్టే గడిచిపోతున్నాయి. పగళ్ళు మాత్రం జీళ్ళపాకంలా సాగుతునే ఉన్నాయని. ఎందుకిలా జరుగుతోంది? దీనికి రెండు కారణాలు. ఒకటి అసలే విరహ తాపంతో ఉన్నారు. దానికి తోడు పగలు ఎండ వేడి తోడైతే మరి కాలం ఎంత మెల్లిగా కదులుతుంది! అంచేత ఆ పగళ్ళు అంత దీర్ఘంగా సాగుతున్నాయి. మరొక కారణం - వేసం కాలంలో (వసంత గ్రీష్మ ఋతువుల్లో) పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. సూర్యోదయం తొందరగా అవుతుంది. సూర్యాస్తమయం ఆలస్యంగా అవుతుంది. అంచేత ఆ కాలంలో పగళ్ళు పొడుగైనవి. కాబట్టి ఈ పదం ద్వారా అది వేసవి కాలమని ధ్వనిస్తోంది. వేసవి కాలం విరహార్తులకి మరింత గడ్డు కాలం కదా! అంచేత నలదమయంతుల బాధ మరింత తీవ్రంగా ఉన్నదన్న మాట. ఇదంతా "దీర్ఘవాసరనిశల్" అన్న ఒక్క పదంతో ధ్వనింప జేసాడు నన్నయ్య. అనుభవించ గలిగేవారికి ఇందులోని కవిత్వం అనుభూతమవుతుంది! సరే ఆ విరహాన్ని తట్టుకోలేక వాళ్ళు పూలదోటల్లోనూ, తామరాకుల మధ్యనా, మృదువైన తామర తూళ్ళ మధ్యనా, కర్పూర ధూళి అలముకొంటూ, పూల శయ్యలమీద విశ్రమిస్తూ, చల్లనీటి ధారలలో తడుస్తూ, చందనాన్ని పూసుకొంటూ గడిపారట - ఆ తాపాన్ని తట్టుకోలేక!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!