'జనాంతిక..

శ్రీ మునిమాణిక్యం వారితో'జనాంతిక..(@ Sastry Tvs)


అసలు ముందు 'జనాంతికం' అంటే చెప్పాలి కదా! ప్రాచీన నాటకాలకు కొన్ని సంప్రదాయాలు, పద్ధతులూ ఉన్నాయి.అవి,నాందీ ,ప్రస్తావన,జనాంతికం--- ఇలాంటివి కొన్ని ఉన్నాయి.ఆ రోజుల్లో రంగస్థలం మీద కొన్ని దృశ్యాలను ప్రదర్శించేవారు కాదు.ఉదాహరణకు --దహన సంస్కారాలు లాంటివి.మరికొన్నిటిని ప్రదర్శించటం కష్టం.కానీ,వాటి సంగతులు ప్రేక్షకులకు తెలియటం చాలా అవసరం.ఉదాహరణకు,సీతమ్మను రావణుడు ఆకాశ మార్గాన తీసుకొని వెళ్ళుతుంటాడు.జటాయువు అడ్డగించి భీకరపోరు చేస్తాడు.ఆఖరికి ఆ పక్షీంద్రుడు రెక్కలు తెగి భూమిమీద పడతాడు.ఈ దృశ్యం అంతా ప్రేక్షకులకు తెలియచేయవలసినదే! కానీ,రంగస్థలంమీద ఎలా ప్రదర్శించగలరు?అటువంటి సమయంలో,నాటక సూత్రధారులు,ఇద్దరు హాస్య పాత్రధారులను రంగస్థలంపైకి ప్రవేశపెట్టి వారితో గ్రామ్యభాషలో కొద్దిగా హాస్య సంభాషణలతో, ఇలా చెప్పిస్తారు. 

మొదటి పాత్ర-అరే! బావ ఏందిరా అది,ఆకాశంలో పెద్ద శబ్దం వినిపిస్తుంది.

రెండవ పాత్ర--ఏమీ లేదురా,నీకు ఈ మధ్య మీ ఆవిడ దెబ్బలకు ఏది విన్నా పెద్ద శబ్దంలాగే వినిపిస్తుంది.

మొదటి పాత్ర--అక్కడికేదో,నీ భార్య పెద్ద పతివ్రత అయినట్లు.

రెండవ పాత్ర --అది సరేలేరా! నీవన్నట్లు నాకూ భయంకర శబ్దాలు వినిపిస్తున్నాయి.

మొదటి పాత్ర --అదిగోరా! ఆమె ఏడుస్తూ చెబుతుంది,"నేను దశరధ మహారాజు కోడలిని,శ్రీ రామచంద్ర ప్రభువు భార్యను.నా పేరు సీత.భర్త లేని వేళ చూసి ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని వెళ్ళుతున్నాడు.ఎవరైనా కాపాడండి"అని.

రెండవ పాత్ర -అవును నిజమేరా! బామ్మర్ది! నాకూ అవే మాటలు వినపడుతున్నాయి.

మొదటి పాత్ర --భూమిమీద అయితే వాడిని తన్ని సీతమ్మను కాపాడేవాడిని.మరి వాడు ఆకాశంలో వెళ్ళుతున్నాడు.

రెండవ పాత్ర -ఏడిసావులే! మీ ఆవిడ తన్నులకే తట్టుకోలేని వెధవవు,వాడిని నీవేమి చేస్తావు?

మొదటి పాత్ర --ఎవరో వచ్చి పోరాడుతున్నారురా, చూడు!

రెండవ పాత్ర --ఆయన ఒక పక్షి, ఆయన పేరు జటాయువట.ఆయన్ని ఆయనే పరిచయం చేసుకున్నాడు.

మొదటి పాత్ర --ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడురా! మనం ఉన్నాం దేనికి?

రెండవ పాత్ర --అరెరే! ఎంత ఘోరం, పక్షిరాజు నేలకొరిగాడు,సీతమ్మను,రాక్షసుడు ఎత్తుకొని వెళ్ళాడు.

ఈ విధంగా ఆకాశంలో జరిగిన దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు వినిపించటం ఒక ప్రక్రియ.అంతటితో ఆ పాత్రలు నిష్క్రమిస్తాయి.నాటకరంగంలో కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఉన్న గొప్ప ప్రయోగం ఇది.దీనిని బట్టి ఊహించుకొండీ, మన నాటకరంగం వెనకపడిందా లేక ముందు కెళ్ళుతుందా, లేక కొన ఊపిరితో ఉందా! అని.ఈ ప్రక్రియకు ఒక ప్రత్యేకమైన పేరు వుంది. అలాగే మరొక ప్రక్రియ ఉంది.దాని పేరు 'జనాంతికం'. ఉదాహరణకు,రంగస్థలం మీద పలుపాత్రలు ఉన్నాయనుకోండీ,ఒక పాత్రధారి మరో పాత్రధారితో రహస్యంగా ఏదో ఒక విషయం చెప్పవలసి వస్తుంది.అటువంటి సందర్భంలో,వారు మాట్లాడుకునే మాటలు వెనకనున్న పాత్రలకు వినపడకూడదు,అవి రహస్యాలు కనుక.మరి ప్రేక్షకులకు తెలియాలి ఆ రహస్యాలు.ఆ సందర్భంలో ఆ పాత్ర ధారులు రంగంస్థలం ముందుకు వచ్చి ఒక పాత్రధారి చెవివద్ద మరో పాత్రధారి చేయిపెట్టి మాట్లాడుతాడు.దానిని ప్రేక్షకులు వింటారు. వెనకునున్న పాత్రలకు వినబడనట్లు సంకేతంగా ముందుకు వచ్చి చెవివద్ద చేయి పెట్టి మాట్లాడటం,మరో గొప్ప ప్రయోగం.దీనినే'జనాంతికం' అని అంటారు.ఒక విధంగా రహస్యంగా మాట్లాడటానికి'జనాంతికం'గా అనటం ఒక జాతీయం కూడా అయింది.నా చిన్నప్పుడు రేడియోలో శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు'జానకితో జనాంతికం'అనే ప్రసంగం చేసారు. ఆకాశవాణి వారు చాలా శ్రీ రామనవముల సందర్భంలో దాన్ని ప్రసారం చేసేవారు.నేటికీ నాకు గుర్తుంది.అది విన్నంత సేపూ నా కళ్ళు నా మాట వినేవికావు.అంత బాగుండేది అది.అన్నిటినీ మించి దువ్వూరి వారి గొంతు కమనీయంగా ఉండేది. వారు చెప్పే విధానం అతి మధురంగా ఉండేది.ఆకాశవాణి వారు ఇటువంటివి వెలికి తీసి సి.డీ లుగా విడుదల చేస్తారేమోనని నా ఆశ! మరి మన ప్రభుత్వం వారు చేసే పనులు ఎలా ఉంటాయంటే, విజయవాడ కేంద్రానికి మళయాళీని డైరెక్టర్ గా, హైదరాబాద్ కేంద్రానికి బెంగాలీ వాడిని డైరెక్టర్ గా నియమిస్తారు. బహుశా:జాతి సమైక్యతను దృష్టిలో ఉంచుకొని అలా చేస్తారేమో!'

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!