విశిష్ట అంతరిక్ష శాస్త్రవేత్త - పద్మశ్రీ డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్

విశిష్ట అంతరిక్ష శాస్త్రవేత్త - పద్మశ్రీ డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్


పల్లెటూరు నుంచి ప్రస్తానం చేసి, రాకెట్లను ప్రయోగించి, వాటి స్థితి గతులను నియంత్రించి, దిశామార్గం చూపి వాటిని భ్రమణ కక్షలో ప్రవేశ పెట్టి ఉపగ్రహ కమ్యునికేషన్స్ కి ఆద్యం పోసి, భారత దేశం ప్రప్రధమ ఎస్ ఎల్ వి - రాకెట్ వెహికిల్ సిస్టం దగ్గర నుండి, నేటి చంద్రయాన్, మంగల్యాన్ వ్యోమ నౌకా - ఉపగ్రహాలని నడిపించిన భారతీయుడు, తెలుగు వాడు, విశిష్ట అంతరిక్ష శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్ గారు. శాస్త్రవేత్తగా తన ప్రయాణం మొదలు పెట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు శ్రీహరికోటలోని 'షార్ ' కేంద్రంలో పనిచేసి, సంచాలకుడిగా ఎదిగి భారత దేశ ప్రయోజనాలను, అంతరిక్ష లక్షాలను సాధిస్తున్న సుప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త. రాకెట్ ఉపరితలం ఒదిలి, చంద్ర కక్ష, అంగారక కక్ష ఎలా చేరాలో నిశితంగా రూపకల్పన చేసి దాన్ని అమలులో పెట్టి, నియంత్రిస్తూ, గగనాంతరాళలో విహరింప చేస్తున్నారూ అంటే వారి ప్రజ్ఞా పాటవాలు ఏపాటివో, వారి శాస్త్రీయ నైపుణ్యత ఎంత శ్రేష్టమైనదో వేరే చెప్పనక్కర లేదు. వారు సాధించిన అసామాన్య ఫలితాలు వారి దీక్షా దక్షతలకు ఎంత పరిణితి చెందినవో చెప్పకనే చెప్తున్నాయి. మరో విశేషం ఏమిటంటే భారత దేశానికున్న అన్ని ఉపగ్రహాలను మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ద్వార పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఇంతటి మహత్తర అవకాశం లభించడం చాలా అరుదు. ఈ ఘనత డాక్టర్ ప్రసాద్ గారికే దక్కింది. తొమ్మిది దూరసంచార ఉపగ్రహాలను ఆయన నేతృత్వంలో నింగికి ఎగురవేశారు. 


ప్రస్తుతం భూ కక్షలో ఇరవై మూడు భారతీయ ఉపగ్రహాలను ఆజమాయిషీ చేస్తున్నారు. వీరి పర్యవేక్షణలో ఇరవై జియో సింక్రనస్ ఉపగ్రహాలను ఆజమాయిషీ చేసే మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీని భూపాల్ లో స్థాపించారు. ఇలాటి బృహత్తర కార్యాలన్నిటి వెనుక ఓ తెలుగు వాడి మేదస్సు వుంది అంటే అది మనందరికీ గర్వకారణం. 


మంగల్యాన్ ప్రయోగం - అంతరిక్ష క్షేత్రంలో మైలు రాయి:


నవంబరు 5, 2013, భారతీయ అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఒక మైలు రాయి. పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో రూపొందించిన పి ఎస్ ఎల్ వి - రాకెట్ ద్వారా మంగల్యాన్ వ్యోమ నౌక, ఉపగ్రహాన్ని కక్షలో పెట్టారు. ఎన్నో సవాళ్ళని అధిగమించి అసాధరణ ప్రతిభ కనపరిచారు మన భారతీయ శాస్త్రవేత్తలు. 


మార్స్ ఆర్బిటర్ ను భూ కక్షలో ప్రవెశపెట్టారు. తరువాత దాన్ని ఐదు మార్లు కక్ష, గతులను పెంచి, 9.8 కిలోమీటర్ల నుంచి 10.8 కిలోమీటర్లో వేగాన్ని అందించి, తరువాత 11.4 కిలోమీటర్లకి వేగం పెంచి భూ కక్ష నుంచి "ట్రాన్స్ మార్స్ ట్రాజెక్టరీ" ఆపాదించి అంగారక గ్రహ ప్రయాణ కక్షలోకి పెట్టారు. పది నెలలలో దాదాపు కోటి కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహానికి చేరువై దాని చుట్టూ భ్రమణం చేస్తుంది. ఇంతటి అసాధారణ సాహసం చేసిన ఉదంతాలు భారత దేశ అంతరిక్ష శాస్త్ర రంగంలో ఎక్కడా లేవు. ఇదే ప్రప్రధం. భారత దేశం సత్తాని లోకానికి విదితం చేసారు డాక్టర్ ప్రసాద్ గారు. 


అంగారకుడికి ఉపగ్రహమై ప్రదక్షిణాలు చేస్తుంది. అంగారక గ్రహం ఉపరితలం, వాతావరణం గురించి పరీక్షలు చేస్తుంది, జీవకణాల ఉనికిని కనిపెడుతుంది. మిథేన్, హైడ్రోజన్ ఉన్నాయో లెవో, ఎంత ప్రమాణంలో ఉన్నాయో పరిశోధిస్తుంది. ఘనీభవించిన మంచు గడ్డలు ఉన్నాయో కనిపెడుతుంది. ఇదంతా స్వదేశీ పరిజ్ఞానంతో సాధించినది. ప్రతీ భారతీయుడు గర్వ పడవచ్చు. 


బాల్యం, చదువు, ఉద్యోగం:

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ లో జన్మించారు. వీరిది సామాన్యమైన కుటుంబం. తండ్రి బడి పంతులు. ఇంజినీరింగ్ రెందో సంవత్సరం చదువుకునే దాక ఇంట్లో విద్యుత్ శక్తి కూడా లేదు. అలాటి పరిస్థితుల నుండి పైకి వచ్చారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారికి చదువు మీద చాలా శ్రద్ధ; పని మీద కూడ శ్రద్ధ. కాకినాడ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి బి ఎ లో ఉత్తీర్ణులైయ్యారు. అటు తర్వాత డాక్టరేట్ పట్టా అందుకున్నారు.


"ఎక్కడ చదివేరు అన్నది ముఖ్యం కాదు; మీరు ఏమి చదివేరు, ఎలా చేస్తున్నారు అన్నది ముఖ్యం " అని ముక్తాయించారు డాక్టర్ ప్రసాద్ గారు. శ్రద్ధ పెట్టి పనిచేస్తే పైకి వచ్చేందుకు తగినన్ని అవకాశాలు ఉంటాయి" అని ఉద్ఘాటించారు. డాక్టర్ ప్రసాద్ గారు తాత్విక చింతన కలిగి ఉన్నవారు. మృదు భాషి. 


1975 నుండి 1994 వరకు లాంచ్ వెహికిల్ సిస్టంస్ విభాగాధిపతిగా వ్యవహరించారు. ఈ దరిమిలా ఎన్నో పరిశోధనలు చేసి కొత్త పరికరాలను రూపొందించి రాకెట్లలోకి అనుసంధానం చేశారు. నేడు షార్ - సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్ర సంచాలకుడిగా ఎదిగారు. ఎన్నో క్లిష్టమైన, విపరీతమైన పరిస్థితులని ఎదుర్కుని, వాటిని వుపాయాలతో అధిగమించి చంద్రయాన్, మంగల్యాన్ వంటి అద్వితీయ అంతరిక్ష వ్యోమ నౌకా ఉపగ్రహాలను కక్షలో పెట్టారు. 


కుజ గ్రహానికి ఉపగ్రహం పంపటం అంత సులువు కాదు. ఎన్నో సంక్లిష్ట పరిస్తుతులను ఎదుర్కుని, ఉపగ్రహాలనే కాదు, భారత దేశ కీర్తి పతాకాలను గగనాంతరాళలోకి తీసుకు వెళ్ళిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ గారు.


పురస్కారాలు:

అనేక పురస్కారాలను అందుకున్నారు డాక్టర్ ప్రసాద్ గారు. వాటిలో:


భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ (2014)

కన్నడ రాజ్యోత్సవ అవార్డు

ఇస్రో మెరిట్ అవార్డు

ఇస్రో టీం ఎక్సలెన్స్ అవార్డు (2007, 2009, 2011)

డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కారం

జీవిత సాఫల్య పురస్కారం - అరునై ఇంజినీరింగ్ కళాశాల

గౌరవ డాక్టరేట్

టీం అవార్డు - చంద్రయాన్ - 1 మిషన్ 2013

సభ్యుడు, ఇంటర్నేష్నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ లా, పారిస్

సభ్యుడు, ఇంటర్నేష్నల్ అకాడమి ఆఫ్ అస్ట్రోనాటిక్స్


కృషి ఉంటే మనుషులు ౠషులౌతారు, మహాపురుషులౌతారు అన్న నానుడిని యదార్ధం చేశారు డాక్టర్ ప్రసాద్ గారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, పల్లెటూరు నుంచి మొదలైన వీరి ప్రస్థానం, డాక్టర్ అబ్దుల్ కలాం శిష్యరికంలో " ఇంతింతై వటుడింతై " అన్నట్టు దిన దిన ప్రవర్ధమానమై భారత అంతరిక్ష క్షేత్రాన్ని గగనాంతరాళలోకి తీసుకు వెళ్ళి తన స్వప్నాన్ని సాకరం చేసిన విశిష్ట శాస్త్రవేత్త - రాకెట్లని, ఉపగ్రహాలని కక్షలో పెట్టి, వాటి స్థితి - గమనాలని అన్ని వేళలా చూస్తూ దేశ ప్రయోజనాలని పెంపొందించిన పరిపూర్ణ అంతరిక్ష శాస్త్రవేత్త. డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్ అందరికీ ఆదర్శం. గగనాంతరాళలో ఉపగ్రహాలను పంపి, వాటికి గతులు చూపి కక్షలో ప్రవేశ పెట్టిన ఈ తెలుగు తేజోమూర్తి, భారతీయ ఉపగ్రహాలకు దిశామార్గం చూపించారు. వీరి జీవితమే అందరికీ ఆదర్శం - ప్రసాద్ గారు తెలుగు జాతికి భగవంతుడు ఇచ్చిన వర ప్రసాదమే. మరిన్ని అఖండ విజయాలు భారత దేశానికి చేకూరుస్తారని ఆశిద్దాం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!