సాహిత్య చిరంజీవులు....

సాహిత్య చిరంజీవులు....

.

గురజాడ అప్పారావు గారి ..కన్యాశుల్కం.. నాటకం లో ప్రేమ రాహిత్యం.!

.

(గురజాడ జయంతికి ప్రభుత్వం వేసిన సోవనీర్ లో అచ్చైన వ్యాసం)


“అన్నీ సంబంధాలూ ఆర్ధిక సంబంధాలే” అన్నాడు మార్క్స్.

అయితే మానవ స్వభావాన్ని విస్తృతంగా అన్నీ కొణాలనుండి చర్చించిన గురజాడ ఈ విషయాన్ని మార్క్స్ ని చదువు కోకుండానే తన రచన “కన్యా శుల్కం” లో సోదాహరణగా పాత్రల ద్వారా చూపించాడు. ఈ నాటకం లోని పాత్రలు పీనాసి ఆశబోతు అయిన లుబ్ధవధానులు, ఎక్కువ డబ్బుల కోసం పిల్లని అమ్ముకుందామన్న ఆశ కలిగిన అగ్నిహోత్రావధానులు, వీళ్ళందరినీ బురిడి కొట్టించే రామప్పంతులు, తల తన్నే వాడైన గిరీశం ఈ నాలుగు పాత్రలూ అంతా ధనాశా పరులే. గిరీశానికి విధవా వివాహం చేసుకుని కీర్తి కూడా సంపాదించాలన్న కీర్తి కాముకత కూడా ఉంది. 

.

ఇక కధా పరంగా పరిశీలిస్తే ఈ నాటకం లో ఏ పాత్రా స్వలాభాపేక్ష లేనిదే ఏ పనీ చేయదు. ఏ పని చేసినా అందులో స్వార్ధం తప్ప ప్రేమ ఉండదు. గమనించి చూడండి లుబ్ధావధానులుకి చవగ్గా పెళ్లి కూతురు కావాలి. ఇంట్లో యుక్త వయసు విధవ కూతురు ఉందని కూడా చూడడు. అతని పెళ్లి గోల తోనే సరి పోతుంది.

అంత కంటే ఘనుడు అగ్ని హోత్రావధానులు ఎక్కువ డబ్బుకి తన చిన్న కూతురు సుబ్బి ని ముసలి వాడైన లుబ్దావధానులకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఇంట్లో ఇటువంటి దాష్టీకానికి బలై పోయిన పెద్ద కూతురు బుచ్చమ్మ విధవ అయి ఉండగా కూడా మళ్ళీ ముక్కు పచ్చలారని చిన్న కూతురి జీవితం కూడా నాశనం చేయాలని అనుకుంటాడు. ధన లాభమే తప్ప పెళ్లి అనేది మనుషుల జీవితాలకి సంబంధించిందని అది సజావుగా జరిగి పిల్ల కాపురం చక్కగా ఉండాలని కోరుకోని స్వార్ధ పరుడు. ఇతని స్వర్ధానికి బలై పోయిన అమాయకపు బుచ్చెమ్మ, ఏ సుఖానికీ నోచక తల్లి తండ్రుల వద్దనే ఉంటుంది.

.

కోర్టులో దావాలు వేసి అందరినీ మోసం చేస్తూ , అమాయకురాలు మీనాక్షిని శారీరికంగా వాడుకుని , మధురవాణిని కూడా తన వేశ్యగా ఉంచుకున్న రామప్పంతులు స్వార్ధమూ , నీచ స్వభావమూ కలిగిన వాడు.

.

వీరందరి కంటే ఘనుడు కాస్త చదువుకున్న వాడు గిరీశం, ఆ మిడిమిడి జ్ఞానం తో అందరినీ బుట్టలో వేసుకుని బుచ్చమ్మని పెళ్లాడాలని గొప్ప పథకం వేసి చివరికి ఆమెని లేవదీసుకుని వెళ్లడానికి కూడా ప్రయత్నిస్తాడు. 

.

ఇక స్త్రీ పాత్రలకొస్తే పూటకూళ్ళమ్మ గయ్యాళి తనానికి కారణం కూడా ఈ ప్రేమ రాహిత్యమే అనిపిస్తుంది. దైహిక వాంఛలకీ లొంగి గిరీశాన్ని చేరదీస్తే తాను డబ్బులు పట్టుకుని పారి పోతాడు. చీపురుకట్ట పట్టుకుని అతనిని తన్నడానికి వచ్చిన పూటకూళ్ళమ్మ కూడా మోస పోయిన ఆడదే ఆ ఉక్రోషం తోనే గిరీశాన్ని కొట్టబోతుంది. 

.

చిన్నప్పుడే వివాహమై భర్త పోయి పిసినారి అయిన తండ్రి దగ్గర బతుకీడుస్తున్న మీనాక్షి కూడా రామప్పంతులుని నమ్మి తన సర్వస్వం అర్పించుకుంటుంది. పాపం కొన్ని సార్లు దొంగ చాటుగా గర్భ విచ్ఛత్తి కూడా చేయించుకుంటుంది. ఎప్పటికైనా రామప్పంతులు పెళ్లాడక పోతాడా అనే పిచ్చి నమ్మకంతో ఉంటుంది. 

.

ఇక పోతే వెంకమ్మ అగ్నిహోత్రావధానుల భార్య , మహా దొడ్డ ఇల్లాలు. భర్త తిట్లన్నీ కాస్తూ కూడా తన చిన్న కూతురు సుబ్బిని ఎలాగైనా ముసలాడికిచ్చి వివాహం చేయడాన్ని నిరోధించాలని ప్రయత్నిస్తుంది. చివరికి నూతిలో కూడా దూకుతుంది. పెద్ద కూతురు తన కళ్లెదురుగా విధవగా తిరుగుతుంటే , మరలా తన భర్త డబ్బుకు ఆశపడి సుబ్బిని కూడా లుబ్దావధానులకిచ్చి పెళ్లి చేస్తానని పట్టు పడితే నిస్సహాయురాలై పోనీ తనకు పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి అమ్మైనా పిల్లాడిని చదివించుకోవాలని , చిన్ని కూతురికి సరి అయిన సంబంధం చేయాలని పట్టు బడుతుంది. తన అన్నదమ్ముడైన కరటక శాస్త్రి తో తమని ఈ ఆపద నుండి గట్టెక్కించమని వేడుకుంటుంది. 

.

ఏమీ ఎరుగని అమాయకురాలు బుచ్చెమ్మ అసలు ప్రేమ అంటేనే తెలియని వెర్రి మాలోకం. అటువంటి అమ్మాయి కూడా తండ్రి దాష్టీకానికి చెల్లెలు బలై పోతుంటే ఏమీ చేయలేక పోనీ నాకు అత్తింటి నుండి వచ్చిన ఆస్తి అమ్మి అయినా రక్షించుకోవాలనుకుంటుంది.

ఇక చిన్నారి పిల్ల సుబ్బి అసలు ఏమి జరుగుతుందో కూడా తెలియని పసి ప్రాయం. ఇంత కథా సుబ్బి పెళ్లి గురించే అయినా ఆమెకు మాత్రం ఏమీ తెలియదు

.. 

స్త్రీ పాత్రలన్నీ పురుషుల దౌర్జన్యానికి , వంచనకి తల వంచుతాయి. అటువంటి వారీనందరినీ ఒక ఆట ఆడించి తనకు ఏమీ కానీ కనీసం చూడను కూడా చూడని చిన్న పిల్ల సుబ్బి బతుకు బండలు కాకుండా చక్రం అడ్డు వేస్తుంది మధురవాణి. పేరుకు ఈమె వేశ్య కానీ సకల కళావంతురాలు. చదువుకుంది, వీణ వాయిస్తుంది, తెలివి తేటలు సమయ స్ఫూర్తి అన్నీ కలిగిన కులాంగన కాని మధురవాణి మాత్రమే ఎవరూ సాధించలేని పనిని సాధిస్తుంది. చివరికి మారు వేషం లో సౌజన్యా రావు పంతులు వద్దకు కూడా వెళ్ళి అంతటి నిష్టా గరిష్టుడిని కూడా తన వాక్చాతుర్యం తో మెప్పించి ఆపదను తప్పిస్తుంది అందరికీ.

.

ఇందులో ఏ ప్రతిఫలమూ ఆశించకుండా ఎవరో ఎరుగని ఒక చిన్న పిల్లను తన తెలివి తేటలుతో కాపాడుతుంది మధురవాణి. ఆమెకు ఇందులో ఏ లాభమూ లేదు. అవ్యాజ్య అనురాగమంటే ఇదే. కథలోని ప్రతి పాత్రా ఏ స్వార్ధం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయవు. ఒక్క మధురవాణి మాత్రమే అన్నిటినీ అందరినీ చక్కబెడుతుంది. 

మధురవాణి ని గూర్చి సౌజన్య రావు ఆమె ఎవరో ఉన్నత కులస్తుడైన తండ్రికి పుట్టి ఉంటుందని అంటాడు. లేకుంటే ఆమెలో ఇంత సంస్కారం ఉండేది కాదని అతని భావం. చివరికి మధురవాణి న ముద్దు పెట్టుకోవడానికీ సిద్ధ పడతాడు అప్పుడు ఆమె తన తల్లి మంచి వారిని చెడ గొట్టొద్దని చెప్పినదని చెప్పి అతని వ్రతం చెడ కుండా కాపాడుతుంది. ఉన్నతమైన బీజమే కాదు అత్యంత ఉన్నత క్షేత్రం అయిన ఆమె తల్లి సంస్కారం గురించి ఇక్కడే మనకి తెలుస్తుంది.

అందరి పట్లా ప్రేమాస్పదురాలై ఉంటుంది మధురవాణి. అన్యాయం జరుగుతున్న చోట శ్రీ కృష్ణ భగవానుని లా చక్రం అడ్డు వేస్తుంది. ఆమే లోని ఆ జన్మ సంస్కారానికి ముగ్ధుడయ్యే సౌజన్యారావు ఆమెకు భగవద్గీత బహుమతి గా ఇస్తాడు. 

దూషణ భూషణ తిరస్కారాలన్నిటినీ సమంగా స్వీకరిస్తుం

.ది మధురవాణి. ఆమెను రాణి అని పొగిడినా రామప్పంతులు , మళ్ళీ అతనే ఒక చోట లంజా అని తిట్టినా అదే సంయమనం తో ఎదుర్కుంటుంది తప్ప అనవసర ఆవేశ కావేశాలకు పోదు. పూట కూళ్ళమ్మ లో ఏమీ చేయలేని నిస్సహాయత, మీనాక్షి లోని దౌర్బల్యం, బుచ్చమ్మ లోని అమాయకత్వం, వెంకమ్మ లోని ఆవేశం , ఉక్రోషం , వీటిల్లో ఏవీ లేకుండా నిర్మమంగా తన కర్తవ్యాన్ని నిర్వహించగలిగే మానసిక బలం మధురవాణి కి ఉంది. గురజాడ ఆకాంక్షించిన ఆధునిక మహిళా మనకి మధురవాణి లో సాక్షాత్కరిస్తుంది. కానీ ఆ నాటి ఆచారాల దృష్ట్యా ఈ సుగుణాలన్నీ ఏ కులాంగన పాత్రకీ పెట్టె అవకాశం లేనందున అవన్నీ మధురవాణి అనే వేశ్యను సృష్టించాడు గురజాడ. బెర్నార్డ్ షా ప్రతిపాదించిన ‘ద కాన్సెప్ట్ ఆఫ్ న్యూ ఉమెన్’ అప్పటికే గురజాడ చదివి ఉన్నాడు. అటువంటి ఆధునిక విద్యావంతురాలైన మహిళ తన జీవితమే కాక మిగిలిన వారిని, సమాజాన్ని కూడా పరిరక్షించగలదని గురజాడ ఉద్దేశం. ఐతే అప్పటికి వేశ్య అయిన మధురవాణి కి మరో ప్రత్యామ్నాయం సూచించలేక పోతాడు సౌజన్యారావు. అందుకే ఆమెను అధ్యాత్మికతతో మరిన్ని మంచి పనులు చేయమని ఆశీర్వదిస్తూ భగవద్గీత ఇస్తాడు. 

ఎవ్వరూ తనని మెచ్చుకోక పోయినా , ప్రేమించక పోయినా అందరినీ ప్రేమించే పాత్ర మధురవాణిది. తనకు దక్కని ప్రేమ మరెవరికీ దక్క కూడదని అనుకునేవారు రాక్షస గుణాలు కలిగి ఉంటారు. తనకు దొరకని ప్రేమ కుటుంబం, ఆనందం అన్నీ తనకు సాధ్యమైన రీతిలో సుబ్బికి దక్కాలని ఆమె కోసం ఎంతో సాహసం తో పథకం వేసి సుబ్బి పెళ్లి చెడగొట్టి ఆమె జీవితాన్ని కాపాడుతుంది. ఇది దైవ స్వభావం. ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును అంటాడు గురజాడ. ఈ కథలో మాత్రం ఎవరూ ఎవరికీ ప్రేమ ఇవ్వరు ఒక్క మధురవాణి తప్ప. అందునా ఆమె అవ్యాజ్య ప్రేమ ముందు వీరందరూ స్వార్ధ పరులు రాక్షస స్వభావులుగానే మిగులుతారు. చివరికి వెంకమ్మ కూడా తన కూతురు కోసమే తప్ప మధురవాణి లా ఎవరో తెలియని మరొక అమ్మాయి కోసమంటూ ఏమీ చేయదు.

ఇంతా చేసిన మధురవాణి ఎవరి ప్రేమకూ కృతజ్ఞతకూ నోచుకోదు . కానీ తన కర్తవ్యంగా భావించి ఆమె సుబ్బి పెళ్లిని ఆపడానికి విశ్వ ప్రయత్నం చేసి అపుతుంది. లుబ్దావధానులు ని కోర్ట్ కేస్ నుండి రక్షిస్తుంది. షేక్స్పియర్ “ద మర్చంట్ ఆఫ్ వెనిస్” లో పోర్షియా లా మగ వేషం తో వెళ్ళి సౌజన్యారావుకి జరిగిన విషయాన్ని వివరిస్తుంది. ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది అనడం లోనే ఆమెకు అన్ని విధాలైన స్వేచ్చా స్వతంత్రాలు ఉండాలని గురజాడ అభిప్రాయం. అందుకు విద్య మాత్రమే పరిష్కారమని అతని ధృఢ విశ్వాసం. స్త్రీకి మెదడు, మనసు ఉన్నాయని ఆమెను గౌరవంగా చూడాలని , కాస్త ప్రేమ , సహానుభూతి ఆమె పట్ల చూపిస్తే ఆమె ఏ పనైనా సాధించగలుగుతుందని గురజాడ నమ్మకం. ప్రేమ రాహిత్యం , ధనా పేక్ష మనుషులని ఎంతగా దిగజార్చుతాయో కన్య శుల్కం లోని పాత్రలు విశద పరుస్తాయి. 

అన్నీ పనులూ ద్రవ్యమాశించే చేస్తారా అని మధురవాణి చేత చక్కగా చెప్పిస్తాడు రచయిత . కొన్ని మనసుకు నచ్చిన మంచి పనులు ధనం , కీర్తి ఆశించ కుండానే చేస్తారు మానవత్వమున్న మనుషులు అని నిరూపిస్తాడు మధురవాణి పాత్రలో. తానెంతగా ఎవరికి ఏ మంచి చేసినా తనకు లభించే గౌరవం కానీ ప్రేమ కానీ ఉండవు అని తెలిసినా మధురవాణి అవ్యాజ్య ప్రేమను పంచుతుంది. కేవలం డబ్బులు ఆశించే ఒక వేశ్య గా కాక మధురవాణి ని మహాభారతం లో శ్రీ కృష్ణుడి పాత్ర అంత గుర్తుంటుంది పాఠకులకి. ప్రేమ రాహిత్యాన్ని దాటిన ఆమె మనోస్థితి ఆదర్శంగా నిలుస్తుంది. వృత్తి ఎటువంటిదైనా ప్రవృత్తి గొప్పదై ఉండాలని అంతఃకరణ శుద్ధి ఉండాలని తెలిపే ఆమె పాత్ర చిరస్మరణీయంగా నిలుస్తుంది.

“కన్యాశుల్కం” లోని పాత్రలు అన్నీ స్వార్ధ పూరితమైనవే తప్ప ప్రేమ గుణం లేనివి. నూరేళ్ళ కిందటే మానవ స్వభావాన్ని ఇంతగా సరిగ్గా పట్టుకుని సమర్ధవంతంగా సహజంగా సహేతుకంగా రాయ గలిగిన ఘనత గురజాడదే. నేడు లోకం లో ఇంకా హద్దులు మీరి పెరిగి పోయిన స్వార్ధాన్ని చూస్తున్నాం . మనిషి మంచి మనికకి కావలిసింది విద్యా, ప్రేమ గుణం. విద్య మనిషిని సంస్కారవంతం చేస్తుంది. ప్రేమ జీవితాన్ని ఫల వంతం చేస్తుంది. ఈ జీవిత సత్యాన్ని నుడివిన గురజాడ వంటి మహనీయులు ప్రాతఃస్మరణీయులు, సాహిత్య చిరంజీవులు

Comments

  1. మంచి వ్యాసం పెట్టారు సార్

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!