గౌతమ మహర్షి కథ...(గోదావరి పుట్టుక)

గౌతమ మహర్షి కథ...(గోదావరి పుట్టుక)

ఒకసారి సృష్టికర్త అయిన చతుర్ముఖుడు సరస్వతీదేవిని మెప్పించటానికి అహల్యను సృష్టించాడు. “న హల్యతి ఇతి అహల్య”. అంటే ఎందులోనూ అఱకొఱలు లేనిది సాటిలేనిది అని అర్థము. బ్రహ్మదేవుడు ఆ అపూర్వ గుణవతి సౌందర్యవతికి వరుడెవ్వడని యోచించి తీవ్ర బ్రహ్మచర్య నిష్ఠ నిగ్రహం ఉన్న సంయమీంద్రుడే ఆమె భర్తకాగలడని నిశ్చయించినాడు. గౌతమ మహర్షి అట్టి ధీరుడని కనుగొని ఆతనిని పరీక్షించుటకై “నాయనా! ఈ అతిలోక సుందిరి నా పుత్రిక అహల్య. ఈమెను నీ ఆశ్రమములో వదిలి వెళుతున్నాను. జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వచ్చి ఆమెను తీసుకువెళతాను” అని ఆజ్ఞాపించాడు. ఆ పరమేష్టికి ప్రీతిచేయుట కంటే అధికమేమున్నది తలచి గౌతముడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఎంతో కాలము గడచిపోయింది. అయినా ఎన్నడూ సంయమీంద్రుడైన ఆ గౌతముడు అహల్యను చూసి చలించలేదు. పరమశివభక్తుడైన ఆ గౌతముడు పంకజాసనుని పరీక్షలో నెగ్గాడు. గౌతముని నిగ్రహాన్ని మెచ్చుకొని అహల్యను అతనకి అర్థాంగిగా అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు.

అహల్యా గౌతమ దంపతులు నిరంతర అతిథిసేవా పరాయణులు. గౌతముడు తన వ్యవయాస శాస్త్రవిజ్ఞానముతో శిష్యుల సహాయముతో వరి కాయగూరలు మొదలైన పంటలు పండించేవాడు. పరమసాధ్వి పతివ్రత అయిన అహల్య ఆ పంటలనుండి వచ్చిన వాటిని వండి అతిథులకు ఆర్తులకు పెట్టేది. అపర అన్నపూర్ణ వలె విరాజిల్లేది ఆ అహల్య.

గణేశుడు ఒక మాయాధేనువును సృష్టించినాడు. అది గౌతముడి పొలాన్ని పాడుచేయసాగినది. పవిత్రమైన గోమాతను ఎన్నడు అదిలించరాదని తెలిసిన గౌతముడు ఆ మాయాధేనువును పక్కకి పంపాలని గడ్డి పరకలు తీసుని గోవుపై వేశాడు. దానికే అది మృతిచెందినది. గౌతముడు దుఃఖిస్తూ “పరమేశ్వరా! నేనేమి అపరాధము చేసినాను? గడ్డిపరకలు తగిలి గోవు మృతిచెందుటేమి? నన్ను ఈ ఘోరమైన గోహత్యాపాతకము నుండి రక్షించు స్వామి!” అని ఆక్రోశించాడు. ఇలా బాధపడుతున్న గౌతముని చూసి ఆ మునులు “గోహత్య వంటి మహాపాతకము చేసిన మీరు పవిత్రమైన ఈ ఆశ్రమములో ఉండకూడదు. తక్షణం వెళ్ళిపోండి” అని తూలనాడి రాళ్ళు విసిరి వెళ్ళగొట్టారు.


మహాపాపము చేశానే అనే దుఃఖంతో గౌతముడు అహల్య ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారు. సకల ధర్మసూక్ష్మాలు తెలిసిన ఆ గౌతమ మహర్షి ప్రాయశ్చిత్త విధానము తెలిసికూడా పండితమండలిచే ఆమోదముద్ర వేయించుకోవాలనే ఉద్దేశ్యముతో క్రోశదూరం వెళ్ళినా తిరిగివచ్చి తనకు అపకారం చేసిన మునులకు నమస్కరించి “అయ్యా! నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉపదేశించండి” అని ప్రార్థించాడు! “గౌతమా! చేసిన తప్పు చెప్పుకుంటూ పృథ్వికి ముమ్మార్లు ప్రదక్షిణము చేసి ఇక్కడ మాసవ్రతము చేయాలి. లేదా ఈ బ్రహ్మగిరికి నూటొక్కమార్లు ప్రదక్షిణములు చేసి కోటి పార్థివలింగారాధన చేసి గంగాస్నానము చేయాలి” అని ప్రాయశ్చిత్త మార్గాన్ని బోధించారు. గౌతమ మహర్షి అటులనే చేశాడు. అప్పుడు పరమశివుడు సంతోషించి


“నాయనా! గౌతమా! నీవు ధన్యుడవు. ఆజన్మ శుద్ధుడవైన నీకు పాపము లేదు. ఇదంతా ఆ మునుల కుతంత్రము. ఈ కృతఘ్నులకు ప్రాయశ్చిత్తము లేదు. వీరు భ్రష్టులై వేదమార్గాన్ని వదిలి నాకు దూరమవుతారు. వీరి వంశములోని వారంతా పతితులవుతారు. వత్సా! ఏదైనా వరం కోరుకో. ప్రసాదిస్తాను.” అని అన్నాడు. కరుణామయుడైన గౌతముడు “స్వామి! ఈ మునివరులు నాకు ఉపకారమే చేసినారు. వీరివల్లనే కదా నేడు నాకు నీ దర్శన మహద్భాగ్యము కలిగినది!” అని అన్నాడు. పరమశివుడు గౌతముని క్షమాగుణము చూసి సంతోషించాడు. “స్వామి! లోకకళ్యాణార్థము గంగను ప్రసాదించు” అని కోరాడు గౌతముడు. పరమశివుని సంకల్ప మాత్రాన ప్రత్యక్షమైన గంగాభవానిని స్తుతించి గౌతముడు “భాగీరథివై ఉత్తర భారతమును అనుగ్రహించినట్టే గోదావరివై దక్షిణ భారతాన్ని ఆంధ్రభూమిని పునీతము చేయి తల్లీ!” అని ప్రార్థించాడు. గంగాదేవి కోరికపై స్వామి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపుడై గోదావరీనది జన్మస్థానములో అవతరించాడు. గౌతమ మహర్షి పేఱున ఆ నది గౌతమీనదిగా ప్రసిద్ధికెక్కినది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!