"చెల్లుకు చెల్లు" !

"చెల్లుకు చెల్లు" !

.

పూర్వం అనంతారంలో భీమయ్య అనే పేదవాడు ఉండేవాడు.ఒకసారి ఆయన బంధువుల ఊరికి బయల్ధేరాడు. మధ్యాహ్నానికి ఒక పట్టణానికి చేరుకున్నాడు. భీమయ్యకు బాగా ఆకలివేస్తోంది. అందుకని దగ్గర్లోని పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. పేదరాశి పెద్దమ్మ ఇంటి ప్రక్కనే కల్లు దుకాణం ఉంది. ఆ దుకాణం యజమానురాలి పేరు సూరమ్మ. భీమయ్య అక్కడికెళ్ళేటప్పటికి సూరమ్మ చేపలు వేయిస్తోంది. భీమయ్య ఇదేమీ పట్టించుకోలేదు. పేదరాశి పెద్దమ్మ దగ్గరకెళ్ళాడు.

.

ఆమెకు కొంత డబ్బిచ్చి, కడుపునిండా భోజనం చేశాడు. బయటకొచ్చి తన దారిన తాను వెళ్ళసాగాడు. ఇంతలో సూరమ్మ గోలగోలగా అరుస్తూ అతని దగ్గరకెళ్ళింది. సూరమ్మ అరుపులకు చుట్టుపక్కలవాళ్ళు అక్కడ చేరారు. ఆమె ఎందుకు అలా అరుస్తుందో భీమయ్యకు అర్ధం కాలేదు. అదే అడిగాడు. "ఈ పెద్దమనిషి నా చేపల వాసన పీల్చి, డబ్బులివ్వకుండా చక్కా పోతున్నాడు అంది సురమ్మ. ఆ మాటలకు భీమయ్య తెల్లబోయాడు. "చేపల వాసన పీల్చినందుకు డబ్బులివ్వాలా! ఎంత?" అయోమయంగా అడిగాడు. "ఒక వెండి నాణెం" చెప్పింది సూరమ్మ.

.

"ఇది చాలా అన్యాయం. బజర్లో పీల్చిన వాసనకు కూడా డబ్బులివ్వాలా? నేనివ్వను" అన్నాడు భీమయ్య. అతనితో సూరమ్మ వాదనకు దిగింది. చివరకు వాళ్ళిద్దరూ పట్టణాధికారి దగ్గరకెళ్ళారు. జరిగిందంతా ఆయనతో చెప్పారు. "అవునయ్యా...నువ్వు చేపల వేపుడు వాసన పీల్చడం వలన ఆ కూర రుచి తగ్గుతుంది. కాబట్టి నువ్వు ఆమెకు డబ్బులివ్వాల్సిందే" చెప్పాడు పట్టణాధికారి. భీమయ్యకు ఏమీ పాలుపోలేదు. అయోమయంగా అయన్నే చూస్తూ నిలబడ్డాడు. అతణ్ణి చూసి పట్టణాధికారి చిరునవ్వు నవ్వాడు.

.

"చూడు భీమయ్య...నేనిచ్చిన తీర్పు ప్రకారం నువ్వు వెండి నాణాన్ని ఎండకు ఎదురుగ్గా పెట్టు. సూరమ్మ వచ్చి ఆ నాణెం నీడను పట్టుకుంటుంది. చెల్లుకు చెల్లు" అన్నాడు పట్టణాధికారి. 

ఇది విన్న తరువాత సూరమ్మ ముఖం మాడిపోయింది. అత్యాశకు పోయినందుకు తనను తానే నిందించుకుంది. పట్టణాధికారిని, భీమయ్యను క్షమాపణ కోరింది. భీమయ్య సంతోషంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!