త్యాగయ్య కు భక్తి నివాళి!

త్యాగయ్య కు భక్తి నివాళి!

.

( త్యాగరాజ స్వామికి ఆయన కృతులతో నివాళి-నెట్ నుండి  సేకరణ).

శ్రీ త్యాగరాజ పరబ్రహ్మణేనమః--

త్యాగరాజ స్వామి ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామములో 1767లో జన్మించారు.కాకర్ల రామబ్రహ్మం,

 శ్రీమతి కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం త్యాగరాజు.కాకర్ల త్యాగ బ్రహ్మం తల్లిదండ్రులు పెట్టిన పేరు.. 

అలకలు నుదుటిపై అందంగా కదులుతున్న ఆ చిన్నారి త్యాగరాజుని చూసి తల్లి ఎంతగా పొంగిపోయిందో

.

అలక లల్లలాడఁగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో ॥అ॥

అను పల్లవి:

చెలువు మీఱఁగను మారీచుని మదమణఁచే వేళ ॥అ॥

.

18 సంవత్సరాల వయసులో త్యాగయ్యకి పార్వతి అనే యువతితో వివాహమైంది. 

కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించారు.

పార్వతి సోదరియైన కమలాంబను త్యాగయ్య వివాహమాడారు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. 

ఈమె ద్వారా త్యాగరాజుగారికి ఒక మనుమడు పుట్టాడు కానీ చిన్నతనంలో మరణించాడు

.ఆ సమయంలో త్యాగరాజు ఆవేదనతో నగరాజ ధరా ! 

అంటూ ఆరామచంద్రుని తో ఎంతగా మొర పెట్టుకొని ఉంటారో !

నగుమోము గనలేని నా జాలిఁ దెలిసి

నన్ను బ్రోవగ రాద? శ్రీరఘువర నీ ॥న॥

.

అను పల్లవి:

నగరాజధర! నీదు పరివారులెల్ల

ఒగి బోధన జేసెడువారలు గారె? యిటు లుండుదురే? నీ ॥న॥

.

త్యాగరాజుకి తల్లితండ్రులు పెట్టిన పేరు త్యాగబ్రహ్మం. 

తరువాత త్యాగరాజు గా మారింది..

.

"గుడులు కట్టించె కంచర్ల గోపరాజు | 

రాగములు కూర్చె కాకర్ల త్యాగరాజు |

పుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు | 

రాజులీ మువ్వురును భక్తిరాజ్యమునకు || 

అన్నారు కరుణశ్రీ 

నిజానికి త్యాగయ్య రాజు. సంగీతపు రారాజు.

రాజు వెడలెఁజూతాము రారె కస్తూరి రంగ రా..

అను పల్లవి:

తేజి నెక్కి సామంతరాజు లూడిగము సేయ

తేజరిల్లు నవరత్నపు దివ్యభూషణము లిడి రంగ రా..

.

ముగ్గురు భక్త రాజులలో త్యాగరాజు

పుట్టిన రోజుని సంగీత దినోత్సవంగా జరుపుతారు.

ఆయన సిద్ధి పొందిన పుష్య బహుళ పంచమిని 

తిరువాయూర్ లో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.

వందనము రఘునందనా సేతు –

బంధనా భక్త చందనా రామ ॥వం॥


శ్రీదమా నాతో వాదమా నే –

భేదమా ఇది మోదమా రామ ॥వం॥

త్యాగరాజు తండ్రి పేరు రామబ్రహ్మం. తల్లి పేరు సీతమ్మ. 

ముగ్గురు కొడుకులలో త్యాగరాజు మూడోవాడు .

 పెద్ద అన్నయ్య పంచనద బ్రహ్మం లేదా పంచనదయ్య 

రెండవ అన్నయ్య పంచాపకేశ బ్రహ్మం..

తన అమ్మకి, సీతమ్మకి అభేదంగా త్యాగరాజ స్వామి కీర్తన రచించారు

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాతండ్రి ॥సీ॥

.

అను పల్లవి:

వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన

ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా ॥సీ॥

.

త్యాగరాజు రాసిన మొదటి కృతి ఏది? ఎన్నో సంవత్సరంలో రాసాడు? అనే వివరాలు సరిగా తెలీవు. 

.

కొంతమంది “గిరిరాజ సుత తనయ” అనే కృతి మొట్టమొదటి

 రచన అని నమ్ముతారు.

.

కొంతమంది “నమో నమో రాఘవాయ” (దేశి తోడి రాగం) 

మొట్ట మొదటి కృతి అని వాదిస్తారు.

 మనం గిరిరాజ సుతాతనయ కీర్తనను చూద్దాం.

గిరిరాజ సుతా తనయ! సదయ ॥గి॥

అను పల్లవి:

సురనాథముఖార్చిత పాదయుగ

పరిపాలయ మా మిభరాజముఖ ॥గి॥

.

పల్లవి వెంట వచ్చే చరణాన్ని అనుపల్లవి అంటారు.

దీనిని కవితాత్మకంగా చెప్పాలంటే పల్లవి మొగ్గ .

అనుపల్లవి అంటే విరబూస్తున్నపువ్వు. 

చరణం విరబూసిన పువ్వు. 

.

ఉదాహరణకి బంటూ రీతి అనేది పల్లవి

తుంటవింటివాని అనుపల్లవి

రోమాంచమనేది చరణం

.

బంటురీతిఁ గొలు వీయవయ్య రామ ॥బం॥

అను పల్లవి:

తుంటవింటివాని మొదలైన మదా

దులఁ బట్టి నేలఁ గూలఁజేయు నిజ ॥బం॥

చరణము(లు):

రోమాంచమనే ఘనకంచుకము

రామభక్తుడనే ముద్రబిళ్లయు

రామనామ మనే వరఖడ్గము వి

రాజిల్లనయ్య త్యాగరాజునికే ॥బం॥

.

చిన్నప్పట్నుం చి త్యాగరాజుకి సంగీతం అంటే ఇష్టం.

వీణకాళహస్తయ్య దగ్గర వీణా, తల్లి గారి దగ్గరా గాత్రమూ నేర్చుకొన్నాడు. 

వేణువు మొదలైన వాయిద్యాలు అతని కీర్తనల్లో కనిపిస్తాయి.

వేణుగానలోలునిగన అనే త్యాగరాజ కీర్తనలో వేణువును పలికించాడు

..

పల్లవి:

వేణుగానలోలునిగన, వేయి కన్నులు కావలనే ॥వేణు॥

అను పల్లవి:

అలి వేణులెల్ల దృష్టి చుట్టి

వేయుచు మ్రొక్కుచు రాగ ॥వేణు॥–

.

పాటకి గంధము పూసిన మహాకవి త్యాగరాజు

ఈ కీర్తనలో బాల కృష్ణునికి గంధము పూయించాడు.తిలకం దిద్దించాడు. చేలము కట్టించాడు.

.

గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా 

గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా 

అందమైన యదునందనుపై 

అందమైన యదునందనుపై 

కుందరదన లిరువొందగ పరిమళ

గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా

.

వాయిద్య సహకారమెప్పుడూ సంగీతకారుడి వెనుకే ఉండాలి.

 అంతే కాని అతని పాటని మింగేసేట్టు ఉండకూడదనీ త్యాగరాజు పలుమార్లు తన శిష్యుల్ని హెచ్చరించేవాడట. 

.

‘సొగసుగా మృదంగ తాళము’ కృతి ఈ భావాన్నే చెబుతుంది.

.

పల్లవి:

సొగసుగా మృదంగతాళము జతగూర్చి నినుఁ

జొక్కఁజేయు ధీరుఁడెవఁడో ॥సొ॥

అను పల్లవి:

నిగమ శిరోర్థము గల్గిన నిజవాక్కులతో స్వరశుద్ధముతో

త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి.

.

జగదానంద కారక మొదటీ కీర్తన.

జగదానంద కారకుడైన శ్రీరాముని వర్ణన ఇందులో ఉన్నది.

యమునికి యముడైన శివునిచే పొగడ్తలందుకొనేవాడివి నువ్వు” అని ఈ రెండో చరణంలో ఒక విశిష్ట సంబోధన.”

అంటే రాముడు శివునికంటె గొప్పవాడని త్యాగయ్య ఉద్దేశ్యంగా మనం భ్రమపడకూడదు. 

.

”నాద తనుమనిశం” అని శివున్ని ప్రార్థించిన హృదయంఆయన్ని తక్కువ చేయదు.

ఈ కీర్తనలోనే08 వచరణంలో శివుని స్నేహితునిగా రాముని పేర్కొన్నాడు.(కళాధరాప్త) 

.

పంచరత్న కీర్తనల్లోనూ, ప్రజల హృదయాల్లోనూ ఈ కీర్తనకి మొదటి స్థానమే.

పల్లవి:

జగదానందకారక! జయ జానకీ ప్రాణ నాయక! జ..

అను పల్లవి:

గగనాధిప! సత్కులజ! రాజ రాజేశ్వర!

సుగుణాకర! సుజనసేవ్య! భవ్య దాయక! సదా సకల

పంచ రత్న కీర్తనలలో రెండవది దుడుకుగల

దుడుకు చేష్టలున్నవాడిని ఏ దొర కొడుకు రక్షించడని ఇందులో చక్కటి సందేశం..

.

పల్లవి:

దుడుకు గల న న్నేదొర కొడుకు బ్రోచురా యెంతో దు..

అను పల్లవి:

కడు దుర్విషయాకృష్టుఁడై గడియ గడియకు నిండారు దు..

నారదుడు స్వయంగా త్యాగరాజస్వామికి సంగీతంలోని రహస్యాలను చెప్పి,”స్వరార్ణవ”మనే ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చారట.

ఆ సంధర్భంలో త్యాగరాజు పంచరత్న కృతులలో మూడవదైన “సాధించెనే” అనీ చెప్పారట.

.

పల్లవి కంటె “”సమయానికి తగు మాటలాడెనే అను చరణ ప్రారంభముతో ఈ కృతి ప్రసిద్ధి.

.

పల్లవి:

సాధించెనే ఓ మనసా స..

అను పల్లవి:

బోధించిన సన్మార్గ వచనముల

బొంకు జేసి తాఁ బట్టినపట్టు సా..

చరణము(లు):

సమయానికిఁ దగు మాటలాడెనే సమ..

దేవకి వసుదేవుల నేగించినటు సమ..

రంగేశుఁడు సద్గంగా జనకుఁడు

సంగీత సాంప్రదాయకుఁడు సమ..”

.

4 ఎందరో 

గురువు శొంఠి వేంకటరమణయ్య గారి ఇంటిలో చేసిన కచేరీలో పంచ రత్న కీర్తనలలో నాలుగవదయిన “ఎందరో మహానుభావులు” అనే కీర్తనను త్యాగరాజ స్వామి స్వరపరచి పాడారట. 

ఈ కీర్తనలోని మొదటి పంక్తి తెలుగు వారి నాలుకలపై ఎప్పుడూ కదలాడుతుంటుంది. 

పల్లవి:

ఎందరో మహానుభావు లందరికి వందనము ఎం..

అను పల్లవి:

చందురు వర్ణుని యంద చందమును హృదయార

విందమునఁ జూచి బ్రహ్మానంద మనుభవించు వా రెం.

..

చరణము(లు):

సామగానలోల మనసిజలావణ్య ధన్యమూర్ధన్యు లెం..

ఎందరో మహానుభావులు పాటగురించి తంజావూరు రాజుగారికి తెలిసి కానుకలను పంపిస్తే తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను తిరస్కరించిన మహానుభావుడు త్యాగయ్య, పల్లవి:

నిధిచాల సుఖమో రాముని స

న్నిధిసేవ సుఖమో నిజముగఁ బల్కు మనస ॥ని॥

.

అను పల్లవి:

దధి నవనీత క్షీరములు రుచో దాశ

రథీ ధ్యానభజన సుధారసము రుచో ॥ని॥

5 కనకనరుచిరా 

కనకనరుచిరా’ అనేది పంచరత్న కీర్తనలలో చివరిది. 

ఇందులో రాముని కన కన.. అంటే చూస్తున్న కొద్దీ ఆనందం కలుగుతుందని పొంగిపోయారు త్యాగరాజు.

.

ఈ కీర్తన చివర ధ్రువుని గురించి వివరణ చేసి మరిపిస్తారు త్యాగరాజు

పల్లవి:

కన కన రుచిరా కనకవసన! నిన్ను క..

అను పల్లవి:

దిన దినమును మనసున చనువున నిన్ను క..

.

చరణము(లు):

పాలుగారు మోమున శ్రీయపార మహిమ దనరు నిన్ను క..

త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు ఎందు దాగినావో అను కీర్తన పాడారు. 

ఇందులో ఆర్తి, భక్తి పెనవేసుకొన్నాయి.

ఎందు దాగినాఁడో ఈడకు రా

నెన్నడు దయవచ్చునో ఓ మనసా ఎం..

.

అను పల్లవి:

ఎందుకు చపలము వినవే నా మనవిని

ముందటివలె భక్తుల పోషించుట కెం.

..

తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంది, 

తెరతీయగరాదా అని త్యాగయ్య కీర్తన పాడితే తెరలు తొలగిపోయాయి.

మాయల తెరలు , మత్సరాల తెరలు తొలగించే అద్భుత కీర్తన ఇది. తెరతీయగ రాదా లోని

తిరుపతి వెంకటరమణ మత్సరమను ॥తె॥

.

అను పల్లవి:

పరమపురుష ధర్మాదిమోక్షముల

పారదోలుచున్నది నాలోని ॥తె॥

.

బంటు రీతి కొలువు కీర్తనలో త్యాగయ్య ఒక చిన్న కోరిక, అంటే శ్రీ రాముని కొలువులో తానొక భటుడైతే చాలు అన్నారు., 

రామ స్మరణతో కలిగే పులకింత, రామ నామం, రామ భక్తీ – గొప్పవని అని త్యాగరాజు ఈ కీర్తనలో ప్రబోధించారు..

.

పల్లవి:

బంటురీతిఁ గొలు వీయవయ్య రామ ॥బం॥

అను పల్లవి:

తుంటవింటివాని మొదలైన మదా

దులఁ బట్టి నేలఁ గూలఁజేయు నిజ ॥బం॥

.

సంగీతఙ్ఞానము..భక్తి ఈరెండూ తప్పించి ఇంకొక మంచి మార్గము లేదని స్పష్టంగా చెప్పినవాడు త్యాగరాజు

ఆ మాటలను అనుసరిస్తే జన్మ ధన్యం.

పల్లవి:

సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదె మనసా ॥సం॥అను పల్లవి:

భృంగి నటేశ సమీరజ ఘటజ మ

తంగ నారదాదు లుపాసించే ॥సం॥

.

నాద సుధారసంబిలను నరాకృతాయెరా మనసా' అను కృతిలో రాముని కోదండాన్ని వర రాగంగా, దాని చిరుగంటలను సప్తస్వరాలుగా వర్ణించారు.

.

సామజ వరగమన కీర్తనలో “వేదశిరోమాతృజ సప్తస్వర “ అని వేదాలకు శిరస్సయిన ఉపనిషత్తుల జనని గాయత్రీ మంత్రము నుండి సప్త స్వరాలు పుట్టాయన్నాడు

.”శోభిల్లు సప్తస్వర”కీర్తనలో సప్త స్వరాలను సుందరులుగా కొలువమన్నాడు 

.

“.రాగసుధా రసపానము చేసి ‘’ కీర్తనలో “సదాశివమయమగు నాదోంకార స్వర “ అని సప్త స్వర సహితమైన నాదోంకారము పరమశివుని తనువుగా చెప్పారు.

.

’మోక్షము గలదా ‘కీర్తనలో ప్రాణానల సంయోగము వల్ల ప్రణవ నాదము సప్త స్వరములయిందని చెప్పారు.

.

వీటన్నింటిని కలుపుతూ నాద తనువయిన పరమశివుడే సప్త స్వరాలకు మూలమని నాదతనుమనిశం కీర్తనలలో అద్భుతంగా శివుని కీర్తించారు

త్యాగయ్య.

.

నాదము శివునియొక్క శరీరం. సంగీత విద్యలో నున్న రాగములన్నీ శివునిశరీరం.

నాదతను మనిశం శంకరం

నమామి మే మనసా శిరసా ॥నా॥

అను పల్లవి:

మోదకర నిగమోత్తమ సామ

వేదసారం వారం వారం ॥నా॥

.

“వేదము పాడబడినది. జీవుని యొక్క మాయను కప్పుచున్నది. ఆహ్లాదమును కల్పించుచున్నది. అందులో సంగీత మున్నది, లయ యున్నది. లయయు, సంగీతమును - అనగా రాగచ్ఛాయయును దానియం దున్నవి. సామ వేదమునందే లేదు. ఋగ్వేదమునందు నున్నవి. ఈ రహస్యము తెలిసిన త్యాగరాజుల వారు 

-'నాద తను మనిశం శంకరంనమామి మే శిరసా మనసా!

' అన్నారని విశ్వ నాథ సత్యనారాయణ దీనిని వివరించారు.. 

.

సద్యోజాతాది పంచవక్త్రజ

సరిగమ పదనీ వరసప్తస్వర

విద్యాలోలం విదళితకాలం

విమలహృదయ త్యాగరాజపాలం ॥నా॥

.

 దినకరుడు అంటే సూర్యుడు. ఆ సూర్యకులానికి అలంకారమువంటి వాడు రాముడు. వంశములో చాలా మంది జన్మిస్తారు.

 అలంకారము వల్ల శరీరానికి కాంతి వచ్చినట్లు, వారిలో కొద్ది మందివల్లనే ఆ వంశానికి పేరు వస్తుంది. శ్రీ రాముడు అటువంటివాడు. ఓ మనస్సా ! ఆ రాముని దీనత్వంతో భజన చేసి ప్రతి రోజూ గడపమని మనవి చేసినా వినవు . మంచిలక్షణాలు లేనిదానివే నువ్వు. గుణ విహీనురాలివి అందుకే నా మనవిని వినటం లేదు అని మనస్సును తిట్టారు

 త్యాగరాజ స్వామి

.

మనసా ఎటులోర్తునే నా/మనవిని చేకొనవే 

దినకరకుల భూషణుని/

దీనుడవై భజనజేసి/

దినముగడుపమనిన నీవు/

వినవదేల గుణవిహీన

.

మనో నిగ్రహము ముఖ్యమని త్యాగరాజు ప్రబోధించారు. మనస్సులో భక్తి లేకుండా గంటలు మోగించి , దేవునిపై పూలు చల్లితే ప్రయోజనం లేదని హెచ్చరించారు. మనసునిల్ప శక్తిలేకపోతే

మధురఘంటవిరుల పూజేమి జేయును? మ..

,

అను పల్లవి:

ఘనదుర్మదుఁడై తా మునిగితే

కావేరి మందాకిని యెటు బ్రోచును? మ..

త్యాగరాజ స్వామి నౌకా చరిత్రము అనే యక్ష గానము వ్రాసారు. ఇందులోనే ఓడను జరిపే ముచ్చట గనరే కీర్తన ఉంది.

ఓడను జరిపే ముచ్చట గనరే వనితలార నేడు

.

అను పల్లవి:

ఆఁడువారు యమున కాడ కృష్ణుని గూఁడి

యాఁడుచు బాఁడుచు నందఱు జూఁడగ

చరణ (1): కొందఱు హరికీర్తనములు బాఁడ

కొందఱానందమున ముద్దులాఁడ

కొందఱు యమునాదేవిని వేఁడ

కొందఱి ముత్యపు సరు లసియాఁడ

.

త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్తి విజయము అని ఇంకో యక్షగానము రాసారు.అందులోనిదే ప్రసిద్ధమైన శ్రీగణపతిని సేవింపరారే అను కీర్తన.

శ్రీగణపతిని సేవింపరారే - శ్రిత మానవులారాఅనుపల్లవి వాగాధిపాది సుపూజలఁ జేకొని - బాగ నటింపుచును వెడలినచరణ (1): పవన నారికేళాది జంబూ - ఫలముల నారగించి ఘన తరంబుగను మహిపై పదములు - ఘల్లు ఘల్లన నుంచి అనయము హరిచరణ యుగములను హృద - యాంబుజమున నుంచి

వినయమునను త్యాగరాజ వినుతుఁడు - వివిధగతుల ధిత్తళాంగుమని వెడలిన


మే 4, 1767 న జన్మించి – 800కి పైగా అద్భుతమయిన కీర్తనలు రచించి జనవరి 6, 1847న స్వర్గస్థులయిన త్యాగయ్య పరమపదము చేరటానికి ముందు చివరిగా పరితాపము అనే కీర్తనల రచించారని చెబుతారు.

పల్లవి:

పరితాపముఁగని యాడిన

పలుకుల మఱచితివో నా ప..

అను పల్లవి:

సరిలేని సీతతో సరయూమధ్యంబున నా ప.

త్యాగయ్యకు నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యూర్ లో ఆయన సమాధిదగ్గర త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆచారం ఇప్పుడు దేశమంతటా పాకింది.అన్నిచోట్ల చేస్తున్నారు

.

ఆరాధన అంటే పూజ. సంతోషపెట్టుట. 

త్యాగయ్య పరమపదము చేరిన రోజున చేసే ఆరాధనోత్సవం మానవులందరికోసం.

మానవులలో కప్పి ఉన్న తెరలను తొలగించుకోవటానికి చేసే ఉత్సవం. 

ఈ లోకంలో భక్తి ఉన్నంతకాలం త్యాగయ్య ఆరాధనోత్సవాలు జరుగుతుంటాయి.

త్యాగయ్య కు ఇదే భక్తి నివాళి.

.

మా రామచంద్రునికి జయమంగళం ॥మా॥

ఘోరభవవరనిధి తారకునికి మంగళం ॥మా॥

మారునిగన్న రాజ కు - మారునికి మంగళం

మారులేని హరికి ము - మ్మారు జయమంగళం ॥మా॥

బాహులే యాప్తునికి సు - బాహువైరికి మంగళం

బాహుజాశూరుని కాజాను - బాహునికి మంగళం ॥మా॥

బృందావనస్థిరమౌని - బృందావనునికి మంగళం

బృందాలోలునికి పాలిత - బృందారకునికి మంగళం ॥మా॥

రాజవేషునికి రాజ - రాజార్చితునికి మంగళం

రాజధరుడగు త్యాగ - రాజ నుతునికి మంగళం ॥మా॥

Comments

  1. మంచి టపా అండీ. ఇన్ని కీర్తనలని ఒక్క చోట ఎంతో శ్రమతో కూర్చిన్నట్టున్నారు. త్యాగయ్యని స్మరించుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!