అటజని కాంచె......................(కామేశ్వర రావు భైరవభట్ల )

అటజని కాంచె......................(కామేశ్వర రావు భైరవభట్ల  )

అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్


మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యం.

ఈ పద్యంలో ఛందస్సుకి సంబంధించిన విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ పద్యాన్ని చంపకమాలలో ఎందుకు రాసుంటాడు పెద్దన అని ఆలోచిస్తే, "అటజని కాంచె" అన్న ప్రారంభం కోసం అని అనిపిస్తుంది. మొదటి నాలుగు లఘువులూ ఆ వెళ్ళడంలోని వేగాన్ని సూచించడం లేదూ! ఇక మొదటి పాదంలో "అంబర చుంబి" దాకా చంపకమాల నడకతో సాగిన పద్యం, హఠాత్తుగా "శిరస్సరజ్ఝరీ" (తడక్-తడక్-తడక్) అన్న నడకలోకి మారిపోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చంపకమాలతో ఇలాటి నడక సాధించవచ్చా అనిపిస్తుంది. అలానే రెండవ పాదంలో "అభంగ తరంగ మృదంగ" (తధింత-తధింత-తధింత) అన్న నడకకూడా!

ఇక ఇందులోని అర్థం విషయానికి వస్తే - "అటజని కాంచె భూమిసురుడు". ఏమిటి చూసాడు? "శీతశైలమున్" - హిమాలయాన్ని. ఎలాంటిదా హిమాలయం అన్నది మొత్తం పద్యం, రెండు పొడవైన సమాసాలు!

"అంబర చుంబి శిరః" - ఆకాశాన్ని ముద్దాడుతున్న శిఖరాలనుండి, "సరత్ ఝరీ పటల" - ప్రవహిస్తున్న సెలయేళ్ళ (జలపాతాల) గుంపులో, "ముహుర్ ముహుర్ లుఠత్" - మాటిమాటికీ దొరలుతున్న, "అభంగ తరంగ మృదంగ" - ఎడతెగని తరంగాలనెడి మద్దెలలు చేసే, "నిస్వన స్ఫుట నటన అనుకూల" - ధ్వనికి తగినట్లు నాట్యం చేసే, "పరిఫుల్ల కలాప" - విప్పారిన పింఛం కలిగిన, "కలాపి జాలమున్" - నెమళ్ళ గుంపుతో కూడినది. ఆకాశాన్నంటే పర్వత శిఖరాలనుంచి కిందకి ఉరుకుతున్న జలపాతాల తరంగాలు అనే మృదంగాలు చేసే ధ్వనికి అనుకూలంగా పురి విప్పి నాట్యం చేస్తున్న నెమ్మళ్ళ గుంపుతో ఉన్నది ఆ హిమాలయం. ఈ వర్ణనలో గొప్పతనం ఏమిటంటే, కవి హిమాలయ శిఖరాలనీ, జలపాతాలనీ, నెమళ్ళనీ అన్నిటినీ ఇక్కడ చిత్రించాడు. ఏదో వేరే వేరేగా చూపెట్టడం కాకుండా వాటన్నిటినీ చక్కగా లింక్ చేసాడు. అదీ కవి ఊహ అంటే! ఇంతకన్నా గొప్ప విషయం మరోటి ఉంది. నెమళ్ళు సాధారణంగా పురివిప్పి యెప్పుడాడతాయి? ఉరుముల శబ్దం విన్నప్పుడు, వాన పడేటప్పుడు. ఇక్కడ ఈ జలపాతాలు చేసే శబ్దానికి నాట్యం చేస్తున్నాయంటే, ఆ జలపాతాల హోరు మేఘ గర్జనలా ఉందన్నమాట! శిఖరాలు ఆకాశమంత యెత్తున్నాయి కాబట్టి, ఆకాశంలోని మేఘాలే వర్షిస్తున్నట్లుగా ఆ జలపాతాలున్నాయన్న మాట! ఇవేవీ పద్యంలో సూటిగా చెప్పలేదు, స్ఫురింప చేసాడు! దీనినే మనవాళ్ళు "అలంకార ధ్వని" అంటారు. 

ఒక విషయాన్ని చెప్పకుండా చెప్పడమూ, చూపించకుండా చూపించడమే కదా కవిత్వమంటే!

ఇక, అక్కడ నెమళ్ళే కాక ఏనుగులు కూడా ఉన్నాయి. "కటక చరత్" - ఆ పర్వతాల మధ్యలో తిరిగే, "కరేణు కర" - ఏనుగుల తొండాల చేత, "కంపిత సాలము" - కదిలించి వెయ్యబడ్డ చెట్లు కలది, ఆ హిమాలయం. ఇక్కడకూడా కవి మనకి ఒక still photograph కాకుండా videoని చూపిస్తున్నాడు. ఏనుగులని మాత్రం చెప్పి ఊరుకుంటే అది still photograph అయి ఉండేది. అవి కదిపి కుదిపేస్తున్న చేట్లని కూడా చూపించి దీన్ని videoగా మార్చాడు అల్లసాని.

ఇదే "అల్లసానివాని అల్లిక జిగిబిగి"!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!