సైంధవుడు లేదా జయధ్రదుడు !


సైంధవుడు !
సైంధవుడు లేదా జయధ్రదుడు(సంస్కృతం:जयद्रथ) మహాభారత ఇతిహాసంలో కౌరవులకు చెల్లెలైన దుస్సల కి పతి. జయధ్రదుడు సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. సింధు దేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి సైంధవుడు అయ్యాడు.
.
ఇతఁడు పాండవులు వనవాసము చేయుకాలమున తాను ఒక రాచకూఁతురును వివాహము చేసికొని వారు ఉన్న వనముగుండ తన పట్టణమునకు పోవుచుండి ఆశ్రమమున ఏకాకియై ఉండిన వారిపత్ని అగు ద్రౌపదిని చూచి వారులేకుండుట తెలిసి బలాత్కారముగా పట్టి తన రథముమీఁద పెట్టుకొని పోవుచు ఉండెను. ఇంతలో ఈవర్తమానమును ఎఱిఁగి పాండవులు వచ్చి వీనిని చక్కఁగ మర్దించి అవమానించి పంపిరి. అంతట వీఁడు దానికి ప్రతికారము చేయ సమకట్టి ఉగ్రతపము సలిపి అర్జునుఁడు తక్క తక్కిన పాండవులను ఒక్కదినమున జయించునట్లు వరము పడసి భారతయుద్ధము జరుగునపుడు పాండవులను పద్మవ్యూహము భేదించిన అభిమన్యునికి తోడుపడకుండ అడ్డగించి గెలుపుకొనెను. కనుక పదుగురు యోధులు ఒక్కటిగాచేరి అభిమన్యుని చంపిరి. ఆవృత్తాంతము సంశప్తకులతో పోరాడపోయి ఉండిన అర్జునుఁడు విని ఆమఱునాడు సూర్యుఁడు అస్తమించునంతలో సైంధవుని తల నఱకుదును అని ప్రతిజ్ఞచేసి ఆప్రకారము నడపెను.

మఱియు ఇతఁడు అర్భకుఁడై ఉండు కాలమున ఒకనాడు అశరీరవాణి వీఁడు సంగ్రామమున ఏమఱి తల తునుమఁబడును అని ఆదేశింపఁగా అది అతని తండ్రి అగు వృద్ధక్షత్రుఁడు విని ఎవఁడు వీనిమస్తకమును మహిమీఁద పడవైచునో అట్టివాని శిరము సహస్రశకలములు అగుఁగాక అని సకలజనుల వీనులకు గోచరము అగునట్లు పలికెను.
అర్జునుడు చేసిన ప్రతిన కౌరవసైన్యములో అందరికి తెలుస్తుంది. సైంధవుడిని రక్షించడం కోసం కౌరవ సైన్యం ఒక వలయం క్రింద ఏర్పడి అర్జునుడు సైంధవుడి వద్దకు చేరకుండా చేయాలని అందరూ వ్యూహం పన్నుతారు. అనుకొన్న ప్రణాళిక ప్రకారం కౌరవసైన్యం సైంధవుడి వద్దకు అర్జునుడిని చేరకుండా చేస్తుంది. అర్జునుడు చాలా చింతితుడయి సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుంటే జగన్నాటక సుత్రధారి శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంను సూర్యుడికి అడ్డుగా ఉంచి సూర్యాస్తమయం అయిపోయిందనే భావన కలిగిస్తాడు. అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక సూర్యాస్తమయం అయిపోయింది ప్రాణ త్యాగం చెయ్యాలని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడు అసలు విషయం తెలిపి తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండి తొలగిస్తాడు. సూర్యాస్తమయం జరిగిందని కౌరవసైన్యం అంతా తాము పన్నిన వ్యూహం నుండి సడలుతారు. ఆ విధంగా సడలడం వల్ల సైంధవుడిని వద్దకు చేరడం చాలా తేలికవుతుంది. అర్జునుడు సైంధవుడితో యుద్ధం జరిపి సైంధవుడి మీదకు పాశుపతాశ్త్రం ప్రయోగిస్తాడు. పాశుపతాస్త్రం సైంధవుడి శిరఛ్చేధం చేస్తుంది. అప్పుడు ఆ శిరస్సు నేలపై పడిపోతుండగా శ్రీ కృష్ణుడు ఆ శిరస్సు నేలపై పడరాదని దానిని ఆ అస్త్ర సహాయంతోనే వనంలో తపస్సు చేసుకొంటున్న సైంధవుడి తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులలో పడేటట్లు చేయమని చెబుతాడు. సైంధవుడి శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో వారి శిరస్సు నూరు చెక్కలు అవుతుంది. ఆ విధంగా తన తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులనుండి సైంధువుడి శిరస్సు పడగానే వృద్ధాక్షాత్రుడు తల నూరు చెక్కలై వృద్ధాక్షాత్రుడు మరణిస్తాడు. ఈ విధంగా సైంధవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!