మహా లింగావిర్భావము !

శ్రీమతి Padmini Priyadarsini గారువ్రాసిన పద్య రచనలు

( శ్రీ Vinjamuri Venkata Apparao ...గారు నిర్వహించిన 

శివరాత్రి పద్యపోటీలకు )

-


శివానుగ్రహంతో – భావరాజు పద్మిని

ఆ.వె.

తాను గొప్ప యనుచు దల్బమాడె విరించి

తానె గొప్ప యనుచు దబ్బె హరియు

వాదు లాడు చుండ వారిమధ్య వెలసె 

దివ్య కాంతు లెగయు తేజ మొకటి

(దల్బము , దబ్బె = దంభము, గొప్ప )

భావము : ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య తాను గొప్ప అంటే, తానే గొప్ప అన్న వివాదం రేగింది. వారు అలా వాదములో ఉండగా, వారి మధ్యన దివ్య కాంతులు చిందుతున్న ఒక తేజస్సు ఉద్భవించింది.


కం. 

ఉదరథి తేజపు కంభము 

పొదలుచు మిరుమిట్లు గొలుప బుగులుచు మనమున్ 

మొదలును తుదియును తేల్చగ 

కదిలిరి నిరువురు వడివడిగ నిరు కకుభమున్


(పొదలు = ప్రకాశము , ఉదరధి =సూర్యుడు, కకుభము =దిక్కు )


భావము : సూర్యుడి వంటి తేజస్సు కలిగిన స్తంభము తమ కనులకు మిరుమిట్లు గొలపగా, కలవర పడినవారై, దాని మొదలును, తుదిని తేల్చాలని, ఇద్దరూ చెరో ప్రక్కకూ బయలుదేరారు.


సీ. 

ధగధగ మెరిసెడి తళుకుల తుదియును 

వెదకుచు మింటికి వెడలె శలుడు 

మిలమిల కాంతుల మిసమిస మొదలును 

నరయుచు కిందకు నరిగె హరియు 

మొగలి సుమమొకటి ముందర నగపడ 

బెదిరించి రుజువిడ బెమ్మ దెచ్చె 

యాదియు గానని యంబుజ నాభుడు 

యలసి వెనుదిరగ యంత లోనె

ఆ.వె. 

కంబ మధ్య మునను కన్పించె ముక్కంటి 

సత్య మొప్ప హరిని జాలి బ్రోచె 

ధాత మొగలి బొంక తామసము రగుల 

శాప మిడెను హరుడు శంక బాప


భావము : ఆ దివ్య జ్యోతిర్ స్తంభము చివరను కనుగొనేందుకు పైకి వెళ్తాడు బ్రహ్మ, ఆ స్తంభము మొదలును చూసేందుకు క్రిందికి వెళ్తాడు విష్ణువు. దారిలో బ్రహ్మకు ఒక మొగలి పువ్వు కనిపిస్తే, దాన్ని బెదిరించి, తాను ఆ జోతిస్స్తంభం మొదలును చూసానని, దొంగ సాక్ష్యం చెప్పమని ఒప్పించి తీసుకుని వస్తాడు. ఆ స్థంభం మొదలు చూడలేని విష్ణువు అలసిపోయి వెనక్కి వచ్చేంతలో జరుగుతుంది ఒక అద్భుతం ! ఆ స్థంభం మధ్యలో శివుడు ఉద్భవిస్తాడు. నిజము చెప్పిన శ్రీహరిని అనేక వరాలు ఇచ్చి, రక్షిస్తాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును, ‘నా పూజకు పనికిరావని’ శపిస్తాడు. అలాగే గర్వంతో బీరాలు పలికిన బ్రహ్మ ఐదవ తలను, కాలభైరవుడిని సృష్టించి కొనగోటితో పెరికిస్తాడు. వారి పాపాన్ని నిర్మూలించడానికే కదా, శివుడు ఏది చేసినా !


తే.గీ. 

దివ్య లింగము నర్చింప దివిజులెల్ల 

తరలి వచ్చి మొరలిడిరి ధరణి వెలయ 

యంత నరుణాచలంబున యమరె శివుడు 

మాఘ శివరాత్రి నందు శమము లిడంగ


భావము : అంతట ఆ దివ్య లింగాన్ని కొలిచేందుకు దివి నుంచి దేవతలు దిగి వచ్చి, ‘స్వామీ, భక్త రక్షణకు ఈ భూమిపైనే కొలువుండు, అని వేడుకుంటారు. వారి ప్రార్ధనలు మన్నించిన శివుడు మాఘమాసంలో, శివరాత్రి రోజున, అరుణాచలంలో దివ్య జ్యోతిగా , అందరికీ మోక్షాన్ని ఇచ్చేందుకు వెలిసాడు. ఇదే మహాశివరాత్రి కధ !

సర్వం శివార్పణమస్తు !!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!