నివేదిక
స్కూల్ లో క్లాస్ జరుగుతుంటుంది .. స్కూల్ తనిఖీ ( Inspection )చెయ్యడం కోసం ఒక పెద్దాయన స్కూల్ కి వస్తారు.
ఒక తరగతి గదికి వెళ్తారు .. అక్కడ టీచర్ ఏదో పాఠం చెప్తూ ఉంటారు.
తనిఖీ చెయ్యడం కోసం వచ్చిన పెద్దాయన ఆ తరగతిలోని ఒక విద్యార్థిని ఒక ప్రశ్న అడుగుతారు.
తనిఖీ అధికారి : బాబూ నువ్వు లేచి నిలబడు !
విద్యార్థి లేచి నిలబడతాడు.
తనిఖీ అధికారి : రామాయణం ఎవరయ్యా రాసింది ?
విద్యార్థి : నాకు తెలియదు సార్ , నేనైతే రాయలేదు !!.
తనిఖీ అధికారి ఎవరో ఒకర్ని ప్రత్యేకించి అడగడం దేనికని .. విద్యార్థులనందరినీ ఉద్దేశ్యించి ...
' రామాయణం ఎవరు రాసారో మీలో ఎవరైనా చెప్తారా ' అని అడుగుతారు.
విద్యార్థులెవ్వరూ సమాధానం చెప్పరు .. అంతా మౌనంగా ఉంటారు.
అప్పుడు ఆ అధికారి ఉపాధ్యాయులవారిని అడుగుతారు ..
'ఏంటి మాస్టారు .. రామాయణం ఎవరు రాశారంటే ఎవరూ చెప్పట్లేదు '
దానికి ఆ ఉపాధ్యాయుని సమాధానం : 'ఏమో సార్ ..ఎవరు రాశారో నేను చూడలేదు '.
ఆ సమాధానం విన్న అధికారికి చిర్రెత్తుకొస్తుంది
పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని పిలిచి జరిగినదంతా చెప్తారు.
దానికి ఆ హెడ్ మాస్టర్ గారు :: 'అయ్యో మీతో అలా చెప్పారా !! .. ఐతే మీకు అబద్దం చెప్పారు !!
(ఒక కుర్రాడిని చూపిస్తూ ) ఆ రామాయణం రాసింది ఈ కుర్రాడే .. అది చెప్పింది మా మాస్టారే .. ఆయన చెప్తుండగా వీడు రాయడం నేను కళ్ళారా చూశానండి '.
(నివేదిక చివర్లో తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తనిఖీ అధికారి చేసిన సూచన ఇలా ఉంది.)
ఆ పాఠశాలలో చదివే విద్యార్థులకు గానీ , పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి గానీ , ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి గానీ ఎవ్వరికి ..
రామాయణం రాసింది రాముడనీ , మహాభారతం రాసింది భీముడనీ తెలియదు.
ఇలాంటి సిబ్బంది ఉండడం వల్లనే మన విద్యావ్యవస్థ ఇలా తయారయింది.
వీలైనంత త్వరలో ఆ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
Comments
Post a Comment