ప్రాప్తం.

ప్రాప్తం.
ఒక రోజు పార్వతీపరమేశ్వరులు భూలోక విహారానికి బయలుదేరారు. భూలోక సౌందర్యానికి ముగ్దురాలయిన పార్వతీదేవి వరమేశ్వరునితో "నాథా! భూలోకము ఎంత రమణీయము గా నున్నది! ఈ వనములు, ఈ పక్షులు, జలాశయములు కన్నుల పండువుగా ఉన్నవి. ఇట్టి సుందర ప్రదేశములో నివశించుచున్న జనులు ఎట్టి పుణ్యమును చేసియున్నారో కదా, ఈ భవనములు చూడుడు ఎంత అందము గా ఉన్నవి, ఈ జనుల వస్త్రములెఒత అద్భుతముగ నున్నవి. మా అక్క లక్ష్మీ దేవి సక్షాత్తూ కొలువై ఉన్నది కదా ఇచట" అని పరవశురాలయింది. ప్రియసఖి ఉత్సాహమును గమనించి నవ్వుకున్నాడు మహాదేవుడు.
అలా కొనసాగిన వారి విహారం ఒక చోట నిలిచింది. అక్కడ ఒక ముసలి బిచ్చగాదు "అమ్మా! అన్నపూర్ణమ్మ తల్లీ! పట్టెడన్నం పెట్టండమ్మా!" అని అతి దీనంగా బిచ్చమెత్తుకుంటున్నాడు. అది చూసిన ఆన్నపూర్ణ హ్రుదయం ద్రవించిపోయింది. సజల నయనాలతొ పరమేశ్వరుని తో, "స్వామీ! ఏమి ఈ వైపరీత్యము? ఒక చోట రత్న మాణిక్యలతో తుల తూగు సుందర భవనములా? ఒక పక్క పొట్టకు పటికెడు మెతుకులు దొరకని దుస్థితి యా? ఏమి ఈ మాయ స్వామీ? అని ప్రశ్నిఒచింది. దానికి శంకరుదు చిరునవ్వు నవ్వి, "సఖీ పార్వతీ, ఈ పేదవాని ఆకలి చూసి నీ మాత్రు హ్రుదయం ఎంత విలవిలలాడుతున్నదో నేను అర్థం చేసుకోగలను. వెళ్ళు, వెళ్ళి వాని ఆకలి తీర్చు" అన్నాడు. ఫార్వతీదేవి మిక్కిలి సంతోషం తో ఒక ముత్తైదువ రూపం లో వెళ్ళి ఆ పేదబిచ్చగాని ఆకలి తీర్చింది. సాక్షాత్తు అన్నపూర్ణ చేతితో అన్నం తిన్న ఆ బిచ్చగాని జన్మ ధన్యం!
అయిననూ పార్వతీదేవి కి ఇంకా ఏదో సహాయం చెయ్యాలనే తపన. అది గమనించిన పరమేశ్వరుదు, "దేవీ! మనం చెయ్యగలిగినది అంతే, నీవు వాని గురించి ఎక్కువగా అలోచిస్తున్నావు" అన్నాడు. దానికి పార్వతి, "అదేమిటి నాథా! మనం ఆది దంపతులం. మీరు లయ కారకులు. మీరే ఇలా అంటే ఎలాగు? నేను వానికి సహయం చేస్తాను." అన్నది. సరే చేసి చూడమన్నాడు శంకరుడు. ఆ పేదవాడు వెళ్ళె దారిలో ఒక డబ్బుల మూట పడవేసింది ఫార్వతీదేవి.
ఇదిలా ఉండగా ఆకలి తీరిన పేదవాని మనసు ఎంతో ఉత్సాహం గా ఉంది. ఆ వేళ ఇంక పనేమి లేక పోయింది. హుషారు గా నడుస్తున్నాడు. ఇంతలో అతని మదిలో ఒక అలోచన. గుడ్డివాళ్ళు ఎలా నడుస్తారు అని. ప్రయత్నిద్దాం అనుకుంటూ, కళ్ళు మూసుకుని నడవటం ప్రారంభించాడు. అలా నడుస్తూ నడుస్తూ పార్వతీదేవి పడవేసిన మూట దాటుకుని వెళ్ళిపోయాడు. అది గమనించిన పరమేశ్వరుదు "చూసావా గౌరీ? విధి లిఖితాన్ని తప్పించటం మన వల్ల కాదు. ఎవరికేది ప్రాప్తమో అదే దక్కుతుంది" అన్నాడు. "అవును కదా" అని పరమేశ్వరునికి చేతులు జోడిచింది పార్వతి.
గమనిక : ఈ కథ లోని ముఖ్యాంశం మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పిన కథల్లోంచి తీసుకున్నది. దానికి నా సొంత కవిత్వం కొంచెం జోడించటం జరిగింది.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!