అక్బరు - బీర్బల్ కథలు

అక్బరు - బీర్బల్ కథలు
ఒకరోజు అక్బరు చక్రవర్తి సభలో కూర్చొని ఉన్నారు. "మన పట్టణంలో గుడ్డివారు ఎక్కువమంది ఉన్నారా..? లేక మంచివారు ఎక్కువమంది ఉన్నారా..?" అంటూ సభికులను ప్రశ్నించాడు చక్రవర్తి. ఆయన ప్రశ్నకు అక్కడున్న ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.
అప్పుడు బీర్బల్ లేచి... "మహారాజా..! మన పట్టణంలోనే కాదు, లోకంలో చాలామంది గుడ్డివారే ఉన్నార"ని అన్నాడు. అయితే వారిని మీకు చూపేందుకు నాకు రెండురోజులు గడువు ఇప్పించండని అడిగాడు బీర్బల్. అందుకు అక్బర్ సరేనని తలూపాడు.
మరుసటి రోజు బీర్బల్ దర్బారుకు వెళ్లలేదు. బాగా జనం తిరిగే ఒక కూడలి వద్ద కూర్చున్నాడు. అతని చుట్టూ చెప్పులు ఉన్నాయి. ఒక చెప్పును కుడుతూ కూర్చున్నాడాయన. ఆయనకు పక్కనే అక్కడ ఏం జరుగుతుందనేది రాసేందుకు ఇద్దరు పనివాళ్లను నియమించుకున్నాడు.
ప్రతిఒక్కడూ వచ్చి "పండిట్ జీ... ఏమి చేస్తున్నారు మీరు..?" అని ప్రశ్నిస్తూ వెళ్లిపోతున్నారు. అలా అడిగిన వారి పేర్లను పనివారు రాస్తూనే ఉన్నారు. అలా సాయంకాలం అయ్యింది. రాజుగారు విహారం కోసం అదే దారిలో వచ్చాడు. ఆయన కూడా బీర్బల్‌ని చూసి అందరూ అడిగిన ప్రశ్ననే అడిగాడు. అంతే రాజుగారి పేరు కూడా చేరిపోయింది.
మరుసటిరోజు ఉదయాన్నే బీర్బల్ అక్బర్ సభకు తరలివచ్చాడు. వస్తూనే అక్బర్ వద్దకు వెళ్ళి.. "ఈ పట్టిక చూడండి మహారాజా... మన పట్టణంలో గుడ్డివారు ఎంతమంది ఉన్నారో మీకు సులభంగా తెలుస్తుంద"ని అన్నాడు. వెంటనే రాజుగారు అది తీసుకుని చదవడం ప్రారంభించాడు.
ఆ పట్టికలో చాలామంది పేర్లు వారి చిరునామాలతో సహా రాసి ఉన్నాయి. అందులో తన పేరు కూడా కనిపించడంతో అక్బర్ ఖంగుతిన్నాడు. "అదేంటి బీర్బల్...! నా పేరును కూడా రాశావెందుకు..?" అని ప్రశ్నించాడు మహారాజు.
అప్పుడు బీర్బల్ మాట్లాడుతూ... "మహారాజా...! మీరందరూ నేను చేసే పనిని చూస్తూ కూడా ఏం చేస్తున్నావని అడిగారు కదండీ... కళ్ళుండి కూడా చూడలేనివారు గుడ్డివారే కదా...!!" అన్నాడు. దీంతో అక్బర్‌కు తాను చేసిన పొరపాటేంటో అర్థమై, దానికి చింతిస్తూ... బీర్బల్‌ తెలివితేటలను అభినందించాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!