ప్రపంచ మానవాళికి మహాభారత సందేశం:--

ప్రపంచ మానవాళికి మహాభారత సందేశం:--

భీష్మద్రోణాదులు పెక్కుమార్లు ధర్మ మెచ్చట నుండునో అచట శ్రీకృష్ణుడండునని, కృష్ణుడెచట నుండునో విజయ మచటనుండునని పలుకుట అక్షరసత్యం! "యతో ధర్మ స్తతః కృష్ణో యతః కృష్ణ స్తతో జయః" ఒక విధముగా మహాభారత మంతయు ఈ వాక్యార్థమునకు వ్యాఖ్యానప్రాయమైన మహాకావ్యమే!

సకల సంస్కృత వాంగ్మయమునకును తలమానికమై విరాజిల్లెడు ఈ మహాభారతము ఇంతయై, అంతయై పెరిగి పెరిగి లక్షశ్లోకాత్మకమైన ఒక మహాగ్రంథముగా ప్రపంచ విఖ్యాతి వడసినది. నిఖిల భారతీయ జ్ఞాన విజ్ఞాన సర్వస్వమైనది.

"ధర్మే చ, అర్థే చ, కామే చ, మోక్షే చ భరతవర్షభ
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్"

భరత కుల శ్రేషా్ఠ! ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థ విషయమున ఇందేమి గలదో అదియే ఇతరత్ర గలదు. ఇందు లేనిది మరి యెచ్చోటను లేదు.

భారతజాతీయ ప్రజాజీవిత సర్వస్వమే మహాభారతమునందలి ఇతివృత్తము. ఇందలి ప్రతి పాత్రయు సజీవమై జీవన మార్గ రహస్యములను దెల్పి మానవుల నడవడిని తీర్చిదిద్దుటలో ప్రముఖపాత్ర వహించును. దాని పరిణామమును, తుదకు ధర్మమే జయించుటను కండ్లకు కట్టినట్లుగా చూపును.

ఆంధ్రమహాభారతం త్రివర్గ (ధర్మం, అర్థం, కామం) సాధనలోని అంతర్యాన్ని ఈవిధంగా ప్రపంచ మానవాళికి వివరిస్తున్నది.

ధర్మం, కామం తగ్గిపోయేటట్లు అర్థపురుషార్థాన్ని (ధనార్జనయే) ధ్యేయంగా సేవించేవాడు కుత్సితుడు. అతడు తప్పక పతనం చెందుతాడు. కేవలం ధనం కోసమే అర్థసేవ చేసేవాడు భయంకరమైన అడవిలో గోవులను రక్షించబూనే మందబుద్ధిని పోలుతాడు. ఇక అర్థధర్మాలు రెండింటిని విడిచి కేవలం, కామపురుషార్థపరాయణుడైనవాడు నీరు తక్కువ అయిన చెరువులో ఉండే చేప వంటివాడు.

అల్పజలాలు చేపను ఎట్లా చెరుస్తాయో కామం అట్లే అతడికి హానిని కలిగిస్తుంది. మరి అర్థధర్మాల అనుబంధం సముద్ర మేఘాల సంబంధం వంటిది. సముద్రజలాలు ఆవిరై మేఘాలకు పరిపుష్టి చేకూరుస్తాయి. మేఘాలు వర్షించి సముద్రానికి పుష్టిని కలిగిస్తాయి. అవి పరస్పరపోషకాలు. ఈ విధంగా త్రివర్గ విజ్ఞానం సాధించినవాడు సర్వశ్రేష్ఠుడు.

ప్రపంచమానవాళికి శ్రీకృష్ణుడు కౌరవసభలో రాయబార సందర్భంలో పలికిన వాక్కులు చూద్దాం.

"సారపు ధర్మమున్ విమలసత్యము బాపము చేత బొంకు చే
బారము బొంద లేక చెడబారినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగు గాని ధర్మని
స్తారకమయ్యు, సత్యశుభదాయక మయ్యును దైవ ముండెడున్"

ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం, పాపం చేతను, అబద్ధం చేతను దరిచేరలేక చెడటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి కలిగియూ ఎవరు అడ్డుపడక అశ్రద్ధ వహిస్తారో అది వారలకే హానికరమవుతుంది. ఆ స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్ధరించటానికి సత్యమునకు శుభం కలిగించటానికి ముందుకు వస్తాడు - అని తిక్కనగారు చెప్పారు.

సంస్కృతమూలంలో వ్యాసమహర్షి ధర్మం అధర్మం చేతా, సత్యం అసత్యం చేతా నశిస్తున్నప్పుడు చూస్తూ ఊరకుంటే, సభాసదులకే చెడు మూడుతుంది. అటువంటివారిని నది తన ఒడ్డున పుట్టిన చెట్లను ప్రవాహంతో పెకలించి వేసినట్లుగా ధర్మం వారిని ఉన్మూలించేస్తుంది. కాబట్టి ధర్మాన్ని సదా పరిశీలిస్తూ పరిరక్షిస్తూ దానినే ధ్యానిస్తూ కాలం గడిపేవారు, సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్నీ మాత్రమే పలుకుతారు.

భీష్ముడు ధర్మజునకు శాంతిపర్వంలో ఈ విధంగా బోధించాడు.

వేదాలపై భక్తి, సృ్మతులపై గట్టి విశ్వాసం, మంచి ఆచారం అనేవి మూడూ, ధర్మానికి సుందరమైన ఆకారాలు. కొందరు పండితులు ధనం ధర్మానికి నాలుగవ ఆకారమంటారు. ఐనా న్యాయం తప్పి అసత్యం పలికి ధనాన్ని సంపాదించటం పాపాలన్నింటిలోనికి ఎక్కువ పాపం. అసత్యం పలుకకుండా ఉండటం, ఇతరుల ధనాన్ని ఆశించకుండా ఉండటం, అన్ని ధర్మాలలోను మేలైన ధర్మాలు. శాస్త్రవిరుద్ధమైన ధర్మం చేయటం చవిటినేలలో విత్తిన విత్తనంవలె
నిష్ర్పయోజనం అవుతుంది. ఇది గ్రహించి ప్రవర్తిస్తే ఇహలోకపరలోకాలలో సుఖం లభిస్తుంది.

అన్ని ధర్మాలకు సారభూతమైన ధర్మనిజస్వరూపజ్ఞానాన్ని మహాభారతంలో వ్యాసుడు నిక్షేపించాడు.

"ఒరు లేయవి యొనర్చిన నరవర! యప్రియము తన మనంబున కగు దానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథముల కెల్లన్"

రాజా! ఇతరులు ఏమేమి చేస్తే తన మనస్సునకు అప్రియంగా ఉంటుందో, ఆ పనులను తాను ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలకు ఉత్తమమైన ఆలంబనగా ఉన్నది.

ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులైన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, తమ దినపత్రికలో యావద్భారతావనిలోని మానవులకు సందేశంగా ఒక శతాబ్ది కాలం తమ పత్రికలో ప్రతిదినం ఈ పద్యాన్ని ప్రచురించి ఆంధ్రులకు మహోపకార సందేశాన్ని గుర్తు చేశారు. త్రికరణశుద్ధిగా ఆచరించి, తరించమన్నారు.
(Courtesy...Padyala Vaidyudu (Kavithraya Mahabharathamlo Dharmasookshmaalu)


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!