శకుని .!


శకుని .!
.
By..Padyala Vaidyudu" Late Sri Dr. C.M. Krishnamurthy Garu.
కౌరవ సార్వభౌముని మేనమామ. దుష్టచతుష్టయంలో ప్రముఖపాత్ర శకునిది. శకునిని కౌరవులకు ఆత్మీయుని జేసినది అతని బాంధవ్యము గాదు, కుటిలబుద్ధి.
ఘోషయాత్ర పరాభవానంతరం దేహత్యాగానికి సిద్ధపడిన అల్లునితో శకుని - ఓ దుర్యోధన సార్వభౌమ! పాండవులు నీకు తోడబుట్టినవారు. మీరు, పాండవులు ఐకమత్యం కలిగి ఈ రాజ్యాని పరిపాలించండి. ఈ విధంగా చేస్తే మీ ఉభయులకూ సౌఖ్యం, గొప్పదనం చేకూరుతాయి అంటాడు.
ఈ బోధలో ఏమాత్రం చిత్తశుద్ధియున్న మహాభారత సంగ్రామం జరిగెడిది కాదు గదా?
శకుని వంటి కుటిలస్వభావుని చరిత్ర గురించి తెలియని ఆంధ్రుడు లేడంటే ఆశ్చర్యపోనక్కరలేదు. శకునిలాంటి వ్యక్తులను మనం నిత్యం జూస్తూనే ఉంటాం. అసూయాద్వేషాలు, కలహాలు, కుటిలబుద్ధులకు వీరు ఉనికిపట్టులు. ధర్మపక్షమున వీరెన్నటికీ చేరరు. హితము చెప్పుట వీరి చేతగాని పని. కుల్లిన హృదయమున్న చోటనే కుటిలస్వభావులు చేరుదురు. చెడు మార్గమున నడిపేందుకు, వెనుదిరుగుటకు వీలులేకుండా చేయుదురు. కుటిలస్వభావుల సాంగత్యం తాత్కాలికలాభము గూర్చినను శాశ్వత నష్టమును కల్గించును. మానవస్వభావమున అసూయా ద్వేషములున్నంతకాలం, మానవునికి మానవునికి మధ్య కలహం కొనసాగుతున్నంత కాలం సమాజమున శకునులు చిరంజీవులు!
శకుని సుయోధనునికి మేనమామ. బాంధవ్యమును బట్టి కౌరవపక్షమున నుండవలసినవాడే. కాని శకునిని, కౌరవుల కంత ఆత్మీయుని చేసినది అతని బాంధవ్యము గాదు, కుటిలబుద్ధి. ఆ కుటిలబుద్ధి నుండి పుట్టిన ప్రియవాక్కు మాయాద్యూతము.
రాజసూయమున పాండవుల వైభవమును చూచి అసూయపడి ఒకరితో చెప్పుకొనలేక తానోర్చుకొనలేక కుమిలి క్రుశించిపోవు దుర్యోధనునితో శకుని,
"భానుప్రభులగు పాండుమహీనాథాత్మజుల లక్ష్మి యెల్లను నీకున్
నేనపహరించి, యిత్తు ధరానుత మాయాదురోదరవ్యాజమునన్"- అన్న మాట నిల్పుకొన్నాడు. ఈ మాయాద్యూతము తోడనే శకుని మహాభారతమున వెలుగులోనికి వచ్చినాడు. దుష్టచతుష్టయంలో సుయోధనుని హృదయమున సుస్థిరస్థానమేర్పరచుకున్నాడు.
ఘోషయాత్ర:
పాండవులు ద్వైతవనసరోవరతీరంలో ఉన్నారని, వనవాస క్లేశదుఃఖితులైన పాండవులను, విశేషించి పాండవపట్టమహిషి అయిన ద్రౌపదిని, తమ అనంత సంపదల విలాసాల ప్రదర్శనంలో వెక్కిరించి, వారు మనసులో కుమిలిపోయేటట్లు చేసి తాము సంతోషించే దుష్టవ్యూహం పన్నింది చతుష్టయం. ఈ వ్యూహముల కర్త కర్ణుడు.
ద్వైతవనంలో ఉన్న గోవులు క్రూరమృగబాధకు గురి అవుతున్నాయనీ, తత్క్షణమే ప్రభువులు వాటికి రక్షణ కల్పించాలని నాటకమాడి మహావైభవంగా అట్టహాసంగా సకుటుంబ ససైన్యపరివారంగా, వంధిమాగధులతో మందీమార్బలంతో దుష్టచతుష్టయం ద్వైతవనం బయలుదేరారు. దీనికి ధృతరాషు్ట్రననుమతి సాధించినవాడు శకుని.
ద్వైతవనం చేరిన దుర్యోధనాదులు, కొంతకాలం మృగయావినోదం సాగించారు. పిమ్మట చిత్రసేనుడనే గంధర్వరాజు క్రీడార్థం కల్పించుకొన్న కొలను వద్దకు చేరి అందులో విహరించాలని తలచారు. కావలివారు హెచ్చరించినా లెక్కచేయక గంధర్వసేనతో యుద్ధానికి దిగారు. చిత్రసేనుడు మాయా యుద్ధనిపుణుడు. వేల గంధర్వసేన చుట్టుముట్టగా భీకర యుద్ధం జరిగింది. కర్ణుడు శక్తి కొలది ఒంటరిగా పోరాడవలసివచ్చినా, శత్రుసహస్రసంఖ్య గల గంధర్వసేన తాకిడికి నిలువలేక, రణరంగం నుండి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడింది. తుదకు దుర్యోధనుడు కూడా యుద్ధరంగంలో ప్రవేశించక తప్పలేదు. చిత్రసేనుడు దుర్యోధనుని రథం విరుగగొట్టి జుట్టు పట్టి లాగి పెడకేల బంధించి సింహనాదం చేశాడు. అతని ఆజ్ఞతో దుశ్శాసనాది భ్రాతృవర్గాన్ని, కౌరవుల భార్యలను, మంత్రులను బట్టి బంధించారు. కౌరవసేన చెల్లాచెదరై పారిపోయింది. యజ్ఞదీక్షితుడైన ధర్మరాజు వద్దకు దుర్యోధనుని మంత్రులు వెళ్లి జరిగిన కథంతా చెప్పారు. దుర్యోధనుని సకుటుంబంగా చిత్రసేనుని చెరనుండి విముక్తి కలిగించవలసినదిగా ధర్మరాజును ప్రార్థించారు.
భీమసేనుడు మిక్కిలి సంతోషించి కాగల కార్యము గంధర్వులే తీర్చారని, వనక్లేశాలనుభవిస్తున్న మనలను పరిహసించటానికి పన్నాగం పన్ని వచ్చిన ఆ పాపి తన పాపఫలం అనుభవిస్తున్నాడని దయార్హుడు కాడన్నాడు.
భయంకరశత్రువైనా శరణని వస్తే సంతోషంతో రక్షించాలి, ఇది దయామయుల తీరు, దీనికి ఏ ధర్మాలూ సరిగావని, అతడిని రక్షిస్తే పుణ్యం, కీర్తి కలుగుతాయని భీమార్జునులను ఒప్పించి, ధర్మరాజు గంధర్వులను ఎదుర్కొనమంటాడు.
ఇరువురూ గంధర్వులతో భీకరయుద్ధం సాగించి విజయులై సామరస్యంగా పెడరెక్కలు కట్టిన దుర్యోధనుని, ధర్మరాజు ఎదుట నిలుపగా, అతని దుష్టస్వభావాన్ని గంధర్వుడు, ధర్మరాజుకు వివరిస్తాడు. భీమునితో కట్లు విప్పజేసి, ఇటువంటి సాహసాలు ఇక ముందు చేయబోకుమని మందలించి దుర్యోధనుని నగరానికి సాగనంపుతాడు ధర్మరాజు.
దుర్యోధనుడు పాండవుల చేత విడిపింపబడి అవమానాన్ని, అపకీర్తిని భరించలేక, నగరానికి తిరిగిపోతూ మార్గమధ్యంలో -
"ఒవ్వనివారల ఎదురన్, యివ్విధమున భంగపడితి నేనింక జనుల్ నవ్వగ నేటి బ్రతుకుగా నివ్వసుమతి యేలు వాడ? నెట్లు చరింతున్"- శత్రువుల సమక్షంలోనే ఈ విధంగా మిక్కిలి పరాభవం పొందాను గదా! ఇక ప్రజలు అందరూ నన్ను వెక్కిరించరా? ఇటువంటి బ్రతుకు ఇక ఎందుకు? ఈ భూమిని నేను ఇక ఎట్లా పరిపాలించగలను? ఇక మీద ఏ మొగం పెట్టుకొని తిరుగాడగలను?
అయ్యో! అయ్యో! నాకు ఎంతటి దురవస్థ కలిగింది? నా అంతటివాడిని శత్రువులు యుద్ధంలో ఓడించి చెరబట్టడమా? జాలితో ఒకడెవడో వచ్చి నన్ను బంధవిముక్తుణ్ణి చేయటమా? ఏ విధంగానైనా జరిపించటానికి దైవానికి శక్తి ఉన్నది. ఎంతటి బలవంతులైనా విధి చేతిలో కీలుబొమ్మలే కదా?
ఆత్మాభిమానం పాడైపోయి ఈ విధంగా ఈ శరీరంలో అసువులను నేను ఎట్లా భరించగలను? మానం కంటే ప్రాణం గొప్పది కాదు. ఇది నా దృఢమైన అభిప్రాయం. నేను ప్రాయోపవేశ దీక్ష పూని ప్రాణాలను విడనాడదలచాను. దీనికి తిరుగులేదు. ఎవరూ నా సాహసాన్ని మాన్పలేరు - అంటూ "అన్న దుశ్శాసన, నిన్ను రాజ్యమునకు బట్టము గట్టెద బతివిగమ్ము" అనగా..
"అవని విదీర్ణమైనను హిమాద్రి చలించుట కల్గినన్ మహార్ణవమది యింకినన్, దివసనాథుడు ఇంద్రుడు తేజమేగినం, గువలయనాథ! నీకు నొక కుత్సితభావము కల్గనేర్చునే? భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింప శక్యమే!"
ఓ దుర్యోధన సార్వభౌమా! రాజ్యభారం వహించవలసినవాడవు నీవే! నీ కొరకే ఈ రాజ్యం ఏర్పడింది. ఈ పృథ్వి ముక్కచెక్కలగు గాక, సముద్రం ఇంకిపోవు గాక, సూర్యచంద్రులు తమ తేజాలు కోలుపోతారు గాక, హిమాలయపర్వతమే కదులుగాక, నీలో ఎట్టి నికృష్టభావాలు పొడసూపకుండును గాక, నేను నీవు వహింపదగిన రాజ్యభారాన్ని మోయజాలను సుమా! అంటూ తమ్ముడు దుశ్శాసనుడు అన్న పాదాలు పట్టుకొని కన్నీరు కార్చాడు.
కర్ణుడు ప్రవేశించి, అసలు పాండవులు ఎవరు? వారు నీరాజ్యంలో సుఖంగా జీవిస్తున్న పౌరులు గదా? రాజుకు ఆపద వచ్చినప్పుడు తమ ప్రాణాలొడ్డి అయినా వారు రాజుకు సేవ చేయాలి గదా? పాండవులు నీ సేవకులు, నీవు పాండవులకు ఏలిక అయిన సార్వభౌముడవు. పాండవులు నీ రాజ్యంలో శాంతి, భద్రతలను అనుభవిస్తూ నివసించటం సేవకుల ధర్మం. కాబట్టి వారు తమ ప్రభు ఋణం దీర్చుకొనటానికి నిన్ను విడిపించారు. ఇది వారికి అవశ్య కర్తవ్యం. జూదంలో ఓడిన నాడే వారు నీకు దాసులు, వారి పౌరుష ప్రాభవాలన్నీ నీ సొత్తు అంటూ ఓదార్చాడు.
దీనికి సమ్మతించని దుర్యోధనునితో శకుని,
త|| "కడగి బుద్ధిబలంబు నంద యకంటకంబుగ జేసి యే
పుడమి రాజ్యము సర్వముం దగ బుచ్చియిచ్చిన నిమ్ములం
గుడువనేరక దీని నిచ్చట గూల దన్ని శరీరమున్
విడుతుగా కని నిశ్చయించెదు వెర్రివైతె నరేశ్వరా!"
ఓ దుర్యోధనా, నీవు సాధారణ మానవుడవు కావు, సార్వభౌముడవు. నీ కర్తవ్యాన్ని గూర్చి జాగరూకతతో యోచించుము. నీకు ఈ భూమి, రాజ్యాన్ని సమస్తాన్ని కేవలం నా బుద్ధిబలం చేత (మయాద్యూత మహిమ చేత) నీకు సంపాదించి ఇచ్చాను. నీవు నీ బాహుబలం చేత సంపాదించింది కాదు గదా. ఈ రాజ్యం నీవు ఆర్జించినచో దానిని నీవు త్యజింపవచ్చును గాని నేను నీకు సంపాదించి ఇచ్చిన దానిని నీవు త్యజిస్తే నా మనస్సు ఖేదపడుతుంది కదా! నీవు కష్టపడి సంపాదించనక్కరలేకుండా సంక్రమించిన రాజ్యాన్ని హాయిగా అనుభవించకుండా, ప్రాయోపవేశదీక్షతో ఆత్మహత్యకు పూనటం అవివేకం. నీకు పిచ్చిపట్టిందా ఏమి? పాండునందనులు నీకు ఉపకారం చేసిన మాట నిజం. నీవు వారికి ప్రత్యుపకారం చేయటం పాడి. ఘోరమైన దుఃఖమనే అగ్నిలో పడి వెతచెందుట సరిగాదు.
శకుని హితబోధ దుర్యోధనుని మనస్సును ఏమాత్రం తాకలేదు. ఆ ఎత్తు మార్చి పాండవుల ప్రశంస మొదలెట్టినాడు. వారికి రాజ్యభాగమిమ్మని,
"కృతము దలంచి చిత్తమున గిల్బిషమంతయు నుజ్జగించి సన్మతుల బృథాతనుజుల నమానుషతేజుల బిల్వబంచి తత్పితృధనమైన రాజ్యము నభీష్టముగా దగ నిమ్ము! నీకు నీ క్షితీవలయంబునం బరమకీర్తియు పుణ్యము గల్గు భూవరా!"
పాండవులు నీకు చేసిన మేలును గుర్తించి నీ మనస్సులో ఉన్న పాపాన్ని అంతటిని తుడిచివేసి, వారిని ఆహ్వానించుము. కుంతీకుమారులు సజ్జనులు. లోకోత్తరపరాక్రమవంతులు. దివ్యతేజస్సు గలవారు. పాండవుల పైతృకమైన రాజ్యాన్ని యిచ్చి సంప్రీతితో సమ్మానించుము. అప్పుడు నీకు ఈ భూమండలంలో సాటిలేని కీర్తి, పుణ్యం లభించగలవు.
"వారలు నీ తోబుట్టువులీ రాజ్యము మీరు వారు ఏకంబై పెంపారగ, నేలుడు దీనం గౌరవకులనాథ ! సౌఖ్య గౌరవ మొందున్"
- కౌరవవంశానికి అధినేతవైన ఓ దుర్యోధనా, పాండవులు నీకు తోడబుట్టినవారు. మీరూ, పాండవులు ఐకమత్యం కలిగి ఈ రాజ్యాన్ని పరిపాలించండి. ఈ విధంగా చేస్తే మీ ఉభయులకూ సఖ్యం, గొప్పదనం చేకూరుతాయి.
ఈ హితబోధ చావుబోవు వ్యక్తికి చివరి చికిత్సగా గరళము బోయుట వంటిది. ఈ హితబోధలో ఏమాత్రం చిత్తశుద్ధియున్నను మహాభారతసంగ్రామము సంభవించెడిది గాదు. సర్వనాశనము జరిగెడిది కాదు.
శకుని వంటి కుటిలబుద్ధులకు బుద్ధిబలమున్నంతగా బాహుబలముండదు. బాహుబలము ప్రదర్శించవలసిన చోట వీరు పరిహాసముల పాలగుదురు. అంతేగాక ఇంతకు ముందపకారము పొందినవారు కుటిలబుద్ధుల పాటు చూచి - "ఆనాడు మోసము చేసినట్లు గాదు, ఇప్పుడు నీ పప్పులుడుక"వని ఎత్తి పొడుతురు. సమరభూమిలో శకుని కల్పించిన మాయలన్నింటిని వమ్ము చేసి చిరునవ్వుతో అర్జునుడు-
"మాయలు జూదము తోడన బోయెం గాకింక నిచట బొనగునె యవి! మ
త్సాయకము లడ్డసాళే్ల? నీ యా చవి లేదు పొమ్ము నిలువక మామా!"
శకుని మామా! నీ మాయలన్నీ జూదంతోనే పోయినవిలే! అవి యుద్ధరంగంలో పొసగవు. నా బాణాలంటే పాచికలనుకొన్నావా? నీకా కపటజూదంలోని రుచి ఇచట దొరుకదు. ఆగక ఇటనుండి వెళ్లిపొమ్ము - అర్జునుడు ఆ విధంగా పలికి నిశితమైన బాణాలు దేహం నిండా నింపగా శకుని కలతపడి, ధైర్యాభిమానాలు విడిచి తోడివారు నవ్వగా యుద్ధభూమి నుండి పారిపోయాడు.
సహదేవుడు, శకునితో యుద్ధరంగంలో పారిపోకుండా నిలువుము మామా అంటూ భయంకరమైన కాంతితో చలిస్తున్న బల్లెం దెబ్బతో శకుని కంఠాన్ని ఖండించగా, తల, మొండెం భూమిపై పడి దొర్లాయి.
కౌరవుల చెడు ప్రవర్తనకు కారణమైన శకుని, దుర్యోధనుడు చూస్తుండగానే సంహరింపబడ్డాడు. కుటిలబుద్ధుల కిట్టి గతులు తప్పవు. ప్రపంచమున కుటిలబుద్ధికి శకుని పర్యాయపదము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!