ధూళిపాళ సీతారామ శాస్త్రి !

ధూళిపాళ సీతారామ శాస్త్రి !

.

ధూళిపాళ, ఈ పేరు వినగానే మనకి సాధారణంగా ఒక కామన్ డైలాగ్ గుర్తొచ్చేస్తుంది ఆ పాత్రతో సహా..

“అని గట్టిగా అనరాదు,వేరొకరు వినరాదు,

అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్థుడై రారాజు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రి లోకం,

ఒకవేళ నీవు పోకపోయిననూ యాగమా ఆగునది కాదు, పోయినచో స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది, ఎదిరి బలాన్నీ, బలగాన్ని కనిపెట్టే అదనూ చిక్కుతుంది.

వేయేల కురుసార్వభౌముడు మాననీయుడూ,మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో,ఆపైన కొంచపు వంచన పనులన్నిటికీ అయిన వాడ్ని అమ్మ తమ్ముడ్నీ నేనున్నానుగా…

ముల్లుని ముల్లుతోటే తియ్యాలి,వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి,

కనుక హిత పురోహిత ధృత్య వాక్య సామంత దండనాయక వారవనితా జనతా నృత్య నాట్య కళావినోదమనోహరంబగు పరివారంబుతో,చతురంగ బలసమేతులై, శతసోదర సమన్వితులై శ్రీ శ్రీ శ్రీ గాంధారీ సుతాగ్రజులు ఇంద్రప్రస్థానికి వెళ్ళవలసిందే,రాజసూయాన్నిసందర్సించవల్సిందే”

అంటూ రెండు అరచేతుల మధ్యా పాచికల్ని రాపాడి, పితుహూ అని అరుస్తూ కుడిచేత్తో వాటిని ఎగరేస్తూ, ఎడమ చేత్తో గడ్డాన్ని దువ్వుకుంటూ, ఐమూలగా మొహం పెట్టి ఎడమ కనుబొమ్మ విల్లులా వంచుతూ,కనీ కనిపించని ప్రతీకారేఛ్చతో మిళితమయిన క్రూరమైన నవ్వుతో “శకుని” గుర్తొస్తాడు…

సి.ఎస్.ఆర్, లింగమూర్తి వంటివారు పోషించి మెప్పించిన ఆ పాత్ర ప్రత్యేకతను ధూళిపాళ తనదైన శైలిలో,తనకి మాత్రమే సొంతమయిన హావ భావ నటనా వైదుష్యంతో దానికి జీవం పోశారు.ఒక విధంగా ధూళిపాళ అంటేనే శకుని అనేంతలా,ఆయన తరవాత మరెవ్వరినీ ఆ పాత్రలోఊహించుకోలేని విధంగా..

ఎంత క్లిష్ట మయిన పద సమాసమయినా,పెద్ద సంభాషణ అయినా ఇదెంతలే అన్నంత సులువుగా చెప్పి దానికి సరిపడినంత భావాన్ని ఒలికించడమే ఆయన ప్రత్యేకత.బహుశా పూర్వాశ్రమంలోని నాటకానుభవం(ఆయన తన 14వ ఏటినుండే నాటకాలు వేయడం మొదలుపెట్టారు, చాలామందిలాగే ఈయనా స్త్రీ పాత్రతోటే)అంతా ఈ పునాది దిట్టానికి కారణం కావచ్చు.ఈ ప్రత్యేకత వల్లే రామారావు తన సొంత బేనరులో స్వీయ దర్శకత్వంలో తీసిన మొదటి చిత్రం “శ్రీకృష్ణపాండవీయం”లో ఈయనకి అంతటి ప్రభనిచ్చే పాత్రనిచ్చి గౌరవించారు.అందుకే “అయినవాడ్ని అమ్మ తముడ్ని నేనుండగా నీకు దిగులెందుకని రారాజు”కిచ్చిన మాట నిలపెట్టారు ఆ పాత్రకి జీవం పోసి. ఒక విధంగా ఆలోచిస్తే పౌరాణిక పాత్రల్లో దాదాపుగా అన్ని పాత్రలని(నాయక,ప్రతినాయక)వేసి మెప్పించి తెలుగు వారికి ఆరాధ్యుడయిన ఎన్.టి.ఆర్ వేయసాహసించని పాత్ర ఇదొక్కటేనేమో?

1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలకు వెళ్లినప్పుడు ఆ పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి వీరి అభినయానికి ఆకర్షితులై సినిమాల్లో నటించమని సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం చేయడంతో “భీష్మ” (1962) చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం అయ్యారు దుర్యోధన పాత్రతో. ఆ సినిమాలో భీష్ముడిగా ఎన్.టి.ఆర్ నటించారు.

ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు.

వాపీకూప తటాక నిధి నిక్షేపాదులన్నీ సమభోజ్యంగానూ పంచగా మిగిలినవి బడి,గుడి.ఇవి ఎవరికి ఇష్టమయితే వారి ఖాతా లో జమ చేద్దామని అంటూ (ప్రేమనగర్) దివాన్ జీ లా చూసినా,

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా,నీ కోవెలా ఈ ఇల్లు కొలువైవుందువుగానీ,కొలువై వుందువుగానీ రావమ్మా మహాలక్ష్మీ…రావమ్మా…రావమ్మా… కృష్ణార్పణం… అంటూ హరిదాసుడయినా(ఉండమ్మ బొట్టుపెడతా) ఆయనకి ఆయనే సాటి. పాత్ర నిడివితో సంబంధం లేకుండా తనదైన ముద్ర వేయడమే అయన ప్రత్యేకత.

ఆయన ఎంత పెద్దనటుడయి చిత్రసీమలో స్థిరపడ్డా ఎప్పుడూ నాటక రంగాన్ని వీడలేదు,వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక పౌరాణికాన్ని వేస్తూ సేవ చేసారు.అందులో భాగంగానే “శ్రీకృష్ణరాయబారం” నాటకాన్ని వందసార్లకు తక్కువ కాకుండా ప్రదర్శించి తన వంతుగా “దుర్యోధన పాత్రతో” ప్రేక్షకుల్ని మెప్పించారు.

నాటక, సినీ రంగాల్లో ఆయన ప్రతిభకు నిదర్శనంగా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ నాటక అకాడమీ వారి నాటక కళాప్రపూర్ణ

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ ఆత్మగౌరవ పురస్కారం

తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు వెలుగులు ఉగాది పురస్కారం అందజేశారు.

బాంధవ్యాలు చిత్రంలో ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసింది.

అజో-విభో-కందాళం ఫౌండేషన్‌ వారు సైతం 2007 ప్రతిభా పురస్కారానికి ధూళిపాళను ఎంపిక చేసింది.

తమిళ పత్రికలు సైతం ఆయనను ‘నడిప్పిళ్‌పులి నడత్తళ్‌పసువు’ అని అభివర్ణించారు. అంటే… నటనలో పులి…నడతలో (నిజజీవితంలో) గోవు ని అర్ధం

ఇంకా సాంస్కృతిక సంఘాల సత్కారాలు ఎన్నో లభించాయి.

ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ప్రశ్న,ఎలా బ్రతికామన్నది?ఎంత మంది మనం పోయిన తర్వాత మనని ఎలా గుర్తు పెట్టుకుంటారన్నది,అందుకు మనం ఏమి చేశామన్నదాని మీద అధారపడి ఉంటుంది.అది మంచయినా చెడ్డయినా సరే.

అలాంటి ఆలోచనే ప్రాతిపదికగా నటరాజ సేవలో తరించిన ధూళిపాళ తనువు చాలించే పది సంవత్సరాల ముందు సినీ జీవితానికి స్వస్తి చెప్పి తనకున్న సంపదను త్యజించి ఆధ్యాత్మిక జీవితానికి తెర తీశారు. మానవ జన్మ విశిష్టత, మోక్షసాధన అవసరాన్ని తెలుసుకుని తరిచాలని భావించి మానవసేవే మాధవసేవ లక్ష్యంగా ఆయన సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టారు. పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదని, 2001 మే 7న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. అప్పటి నుంచి శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో వ్యవహారంలో ఉన్నారు. గుంటూర్ మారుతీ నగర్ లో మారుతి గుడి నిర్మించి, రామాయణం, సుందరాకాండలను తెలుగు లోకి తిరిగి వ్రాశారు . ధూళిపాళ ట్రస్టును ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు, ధూళిపాళ కళావాహిని స్థాపించి కళారంగాన్ని ప్రోత్సహిస్తున్నారు/. హించారు.మూడున్నర దశాబ్దాల పాటు కళామతల్లికి సేవలందించి, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేందుకు తన శేషజీవా/వితాన్ని అంకితం చేసిన ధన్యజీవి ధూళిపాళ. ధూళిపాళ కొద్దికాలం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడి 2007 ఏప్రిల్ 13 న మరణించారు.

ఆయన నటించిన సినిమాలు మచ్చుకు కొన్ని:

మాయాబజార్ (1957) ,,మహామంత్రి తిమ్మరుసు (1962), నర్తనశాల (1963), శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) (గయుడు), బొబ్బిలి యుద్ధం (1964) (నరసరాయలు), మైరావణ (1964), వీరాభిమన్యు (1965) (ధర్మ రాజు), శ్రీకృష్ణ పాండవీయం (1966) (శకుని), పూల రంగడు (1967), అగ్గిమీద గుగ్గిలం (1968), బాంధవ్యాలు (1968), ఆత్మీయులు (1969), బాలరాజు కథ (1970), రెండు కుటుంబాల కథ (1970), కలెక్టర్ జానకి (1972) (జానకి తండ్రి), బాల భారతం (1972) (శకుని), మంచి మనుషులు (1974), గుణవంతుడు (1975), శ్రీ రామాంజనేయ యుద్ధం (1975), సీతా కళ్యాణం (1976) (వశిష్టుడు), దాన వీర శూర కర్ణ (1977) (శకుని), ఉండమ్మా బొట్టు పెడతా…

ధూళిపాళగా పిలవబడే ఈయన పూర్తి పేరు ధూళిపాళ సీతారామ శాస్త్రి. ఈయన గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో 1921 సెప్టెంబర్ 24 న జన్మించారు. చిన్నప్పటి నుంచి రంగస్థల ప్రదర్శన పట్ల ధూళిపాళ ఎంతో మక్కువ చూపేవారు. బతుకుతెరువు కోసం గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్‌థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి.

–పప్పు శ్రీనివాస రావు గారికి కృతజ్ఞలతో.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!