నర్తనశాల సినిమా లోనాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు!

నర్తనశాల సినిమా లోనాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు!

(కృతజ్ఞతలు...శ్రీ చీమలమర్రి బృందావనరావు గారు.)

.

సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ

రా పురవీధుల గ్రాలగలదె

మణిమయంబగు భూషణ జాలములనొప్పి

ఒడ్డోలగంబున నుండగలదె

అతి మనోహరలగు చతురాంగనల తోడి

సంగతి వేడ్కలు సలుపగలదె

కర్పూర చందన కస్తూరి కాదుల

నింపు సొంపార భోగింపగలదె

గీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర

వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి

సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె

జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము

నర్తనశాల సినిమాలో ఘంటసాల గానం చేసిన ఈ పద్యం చాలామంది విని వుంటారు. భారతం విరాటపర్వం లోనిది ఈ పద్యం. కవి తిక్కన సోమయాజి. సందర్భం ఉత్తర గోగ్రహణ సమయంలో కురుసేనను కకలావికలం చేసి, దుర్యోధనుణ్ణి ఓడించి, అతని ఎదురుగా నిలిచి, అతన్ని ఉద్దేశించి అర్జునుడు ఎగతాళిగా ఎత్తిపొడుస్తూ చెప్పిన మాటలు ఇవి.

పై పద్యంలో గొప్ప నాటకీయత ఉంది. గొప్ప ఉపాలంభన ఉంది. ఈ రెండూ పైకి కనిపించేవి. కానీ పాదం పాదం వెనకా ఒక బాధితుడి ఆక్రోశం వుంది. పదమూడు సంవత్సరాలుగా తమ కష్టార్జితాన్ని తమకు కాకుండా చేయడమే కాక, అడుగడుగునా ఘోషయాత్ర పేరుతోనో, గోగ్రహణం పేరుతోనో కవ్విస్తూ వచ్చిన దౌష్ట్యాన్ని అంతవరకూ భరిస్తూ వచ్చి, ఇక భరించాల్సిన అవసరం లేదని తెలిశాక ఒక్కసారిగా తన సర్వశక్తులూ విప్లవించబోయే ఒక మహా పౌరుషశాలి తెగింపు వుంది. ఏ కారణం వల్ల అయితేనేం ఇంతకాలం తల వంచి కూర్చున్నా, ఇప్పటిదాకా తమను పదపదానా పరిభవిస్తున్న వారిపై తిరగబడగలిగిన అవకాశం వచ్చిందని నింగికెగిరి రెక్కలు సారించే డేగ గరుత్తుల క్షేళాధ్వని వుంది. గుడ్డిరాజు కోసం తమ తండ్రి కొంత సంపాదించి ఇస్తే, తమ సోదరులు రాజసూయం కొరకు నలుదిక్కులకూ పోయి సంపాదించుకొని వచ్చిన సర్వసంపదలను ఎవడో అనుభవిస్తుండగా, తాము కందమూలాలు తింటూ, అడవుల్లోనో, పరాయి పంచల్లోనో అగచాట్లు పడుతున్న దుస్థితి ఎడ బాధ – దురాక్రమణదారుని పట్ల తీవ్రమైన ద్వేషమూ, అక్కసూ వుంది. పద్యం చూడండి. ప్రతి పాదంలోనూ దుర్యోధనుడు అనుభవిస్తున్న భోగాలను పేర్కొని ఎత్తిపొడిచాడు అర్జునుడు. “సింగంబు ఆకటితో గుహాంతరమునం జేడ్పాటు మైనుండి, మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చిన” రీతిగా అర్జునుడున్నాడని ద్రోణుడు ఎంతో అద్భుతంగా వర్ణిస్తాడు.

ఏనుగునెక్కి ఆపక్క, ఈ పక్క ఏనుగులు నడుస్తుండగా రాజధాని వీధుల్లో రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కాదు. రత్నమాణిక్య హారాలనూ, ఆభరణాలనూ ఒంటినిండా వేసుకొని సింహాసనం మీద కూర్చుని హొయలు పోవడం కాదు. పెత్తనం ఉంది గదాని అందగత్తెలను రప్పించుకొని వారితో కులకడం కాదు. తేరగా వచ్చిన సుగంధ ద్రవ్యాలతో భోగాలు అనుభవించడం గాదు. ఇప్పుడు నీ గతి చూసుకో. అసలు నీకు సిగ్గనేది ఉంటే ఎక్కడన్నా పడి చావు. తొల్లింటి చూఱగలదె (చూఱ అంటే కొల్ల, దోచుకోవడం) – ఇంతకు ముందు లాగా ఇంకా కొల్లగొడదామనుకుంటున్నావేమో – ఇక్కడ నీ జూదపుటెత్తులు పనిజేయవు సుమా. ఇదీ పద్యభావం. నిజానికి పై వివరమంతా చెప్పాల్సిన పని లేదు. పద్యం చదువుతుంటేనే జ్వరతీవ్రతతో శరీరం వేడెక్కుతున్నట్టుగా పఠితకు పద్యభావంతోటి తాదాత్మ్యత ఎక్కిపోతూ వుంటుంది. “జూదమిక్కడ ఆడంగరాదు సుమ్ము” అని ఆఖరు పాదం చెప్పడం, పద్యంలోని నాటకీయతకు ఎంత అందమైన కొసమెరుపు నిచ్చిందో గమనించారు గదా.

అప్పటికి యవ్వనంలో ఉన్న ఎన్. టి. రామారావు (ముప్ఫైలలో ఉన్నాడేమో) అర్జునుడి ఆహార్యంలో అభినయిస్తుండగా – ఇంత అందమైన తిక్కన సోమయాజి పద్యాన్ని – అసలు పద్యం అనేది ఎలా పాడాలో తెలిసిన ఘంటసాల తన మధురగళంతో ఆలాపిస్తుండగా, వింటూ చూడడమూ, చూస్తూ వినడమూ జరిగిన క్షణాలు, ఆహా నా తెలుగు భాష ఎంత కమ్మనిది అనుకుంటూ గుండెలు ఉప్పొంగజేసుకున్న క్షణాల్లో కొన్ని! నాకు నచ్చిన ఈ పద్యం మీకూ తప్పక నచ్చుతుంది.

https://www.youtube.com/watch…

Comments

  1. ఈ పద్యం నాకు చాలా ఇష్టం.అర్ధము బాగా ఉంది
    పదే.. పదే వింటూంటాను

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!