సత్సంగత్యము !

సత్సంగత్యము !

-

జగద్గురువులైన ఆదిశంకరులు...

.“సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |

నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తిః ||”

అని ఉపదేశించినారు. అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సంగత్యము..

ఆ సత్సంగత్యము పురాకృతపుణ్యము వలన కలుగును.

.

కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారినుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.

.

మహనీయుడైన నారదుడు ఒకసారి శ్రీకృష్ణుని దర్శించుటకై వచ్చి దండప్రణామములు చేసి “భగవాన్! సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి” అని కోరినాడు.

జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకముగానే నారదునికి తెలియచేయాలని సంకల్పించి “నీవు తూర్పువైపుగా వెళితే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడపురుగును సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు” అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వునవ్వాడు.

పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. నరద మహర్షి ప్రశ్న అడిగాడోలేదో గిలగిలలాడూతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు. ఇలా జరిగిందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకొన్నాడు

నారదుడు. జరిగినది విని జగన్నాటకసూత్రధారి ఇలా అన్నాడు “ఇప్పుడు పశ్చిమదిశగా వెళ్ళు. ఒక పాడుపడిన దేవాలయము అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు”.

వెంటనే బయలుదేరి పావురమును కలుసుకొని తన ప్రశ్నవేశాడు నారదుడు. అదేమి చిత్రమో ఆ కపోతము నారద మహర్షి పాదలమీద పడి ప్రాణాలు విడిచింది. “ఇది ఏమి వింత? ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించదలచాడో?” అని చింతిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినది విన్నవించుకొన్నాడు

. “అలా జరిగిందా నారదా? అయితే ఈ సారి ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగశిశువును పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు” అని చెప్పి చిరునవ్వులొలకబోసాడు లీలామానుషవిగ్రహుడైనందనందనుడు.

మొదటి రెండు మార్లు జరిగినది తలచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి “నారదా! నిర్భయముగా వెళ్ళు. ఈ సారి అంతా శుభమే జరుగుతుంది” అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి “ఓ పాపాయి! మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించాడు.

నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో

“దేవర్షి! అలా ఆశ్చర్య పోతున్నారేమిటి? పెంటకుప్పలోనున్న పేడపురుగును నేనే. అప్పుడు నా జన్మజన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన మీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీవంటి దివ్యపురుషుల సందర్శన మాత్రముచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శనభాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరల ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందు వలన నాకు దైవత్వము లభించినది. 

మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది!” అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు.

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!