విష్ణు సహస్రనామ స్తోత్రము ! (ఫలశ్రుతి-ఉపదేశాలు.)

విష్ణు సహస్రనామ స్తోత్రము !

(ఫలశ్రుతి-ఉపదేశాలు.)


విశ్వం అనే నామంతో మొదలైన సహస్ర నామ జపం 

సర్వ ప్రహరణాయుధ అనే వెయ్యవ నామంతో ముగుస్తుంది.

ఈ ప్రధాన స్తోత్ర భాగంలో 108 శ్లోకాలలో వేయి నామములు పొందుపరచబడి ఉన్నాయి. పరమాత్ముని వివిధ లక్షణ గుణ స్వభావ రూపములు వివిధనామములలో కీర్తించబడ్డాయి. 

అనంత గుణ సంపన్నుడైన భగవానుని వేయి ముఖ్యగుణములను కీర్తించే పుణ్యశబ్దాలుగా ఈ వేయి నామాలను సాంప్రదాయికులు విశ్వసిస్తారు.


విష్ణు సహస్రనామాల గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు రచించిన భాష్యము వీటిలో ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించింది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.


వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు శంకరాచార్యులు "స్థవిరోధ్రువః" అని ఒకే నామమును పరిగణించగా, పరాశరభట్టు "స్థవిరః", "ధ్రువః" అనే రెండు నామములుగా పరిగణించెను. పరాశరభట్టు "విధేయాత్మా" అని తీసుకొనగా శంకరాచార్యులు "అవిధేయాత్మా" అని తీసుకొనెను. 

కాని ఇటువంటి భేదాలు చాలా కొద్ది.


ఇంకా కొన్ని నామములు పునరావృతమైనట్లుగా ఉంటాయి. ఉదాహరణకు విష్ణుః (మూడు సార్లు) ; శ్రీమాన్, ప్రాణదః (ఒక్కొక్కటి నాలుగు సార్లు) ; కేశవః, పద్మనాభః, వసుః, సత్యః, వాసుదేవః, వీరః, ప్రాణః, వీరహా, అజః, మాధవః (ఒక్కొక్కటి మూడు సార్లు) ; పురుషః, ఈశ్వరః, అచ్యుతః, అనిరుద్ధః, అనిలః, శ్రీనివాసః, యజ్ఞః, మహీధరః, కృష్ణః, అనంతః, అక్షోభ్యః, వసుప్రదః, చక్రీ (ఒక్కొక్కటి రెండేసి సార్లు) - ఇలా చెప్పబడ్డాయి. మొత్తం 90 నామాలు ఒకటికంటె ఎక్కువసార్లు వస్తాయి. కాని భాష్యకారులు ఒకే నామానికి వివిధ సందర్భాలలో వివిధ అర్ధాలు వివరించి, పునరుక్తి దోషం లేదని నిరూపించారు.


ఇంకా భగవద్గీతకు, విష్ణు సహస్రనామ స్తోత్రానికి అవినాభావ సంబంధము ఉంది. (రెండూ మహాభారతం లోనివే). ప్రత్యేకించి గీతలోని 10వ అధ్యాయము (విభూతి యోగము) లో భగవంతుని వర్ణించే విభూతులు అన్నీ విష్ణు సహస్ర నామంలో వస్తాయి. (ఉదాహరణ - ఆదిత్యః, విష్ణుః, రవిః, మరీచిః, వేదః, సిద్ధః, కపిలః, యమః, కాలః, అనంతః, రామః, ఋతుః, స్మృతిః, మేధా, క్షమః, వ్యవసాయః, వాసుదేవః, వ్యాసః). 11 వ అధ్యాయము (విశ్వరూప సందర్శన యోగము) లలో భగవంతుని వర్ణించే పదాలు అన్నీ విష్ణు సహస్ర నామంలో దాదాపుగా వస్తాయి. (ఉదాహరణ: తత్పరః, అవ్యయః, పురుషః, ధర్మః, సనాతనః, హృషీకేశః, కృష్ణః, చతుర్భుజః, విశ్వమూర్తిః, అప్రమేయః, ఆదిదేవః). ఇంకా గీత 2వ అధ్యాయములోని స్థితప్రజ్ఞ లక్షణాలు, 12వ అధ్యాయములోని భక్త లక్షణాలు, 13వ అధ్యాయములోని భగవద్గుణములు, 14వ అధ్యాయములోని త్రిగుణాతీతుని లక్షణాలు, 16వ అధ్యాయములోని దేవతాగణగుణాలు అన్నీ వేర్వేరు నామాలుగా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడ్డాయి.


శంకరాచార్యులు "గేయం - గీతా - నామ సహస్రం" అని రెండు పవిత్ర గ్రంథాలకూ ఎంతో ప్రాముఖ్యతను తెలియజెప్పారు.


ఫలశ్రుతి!

ఈ స్తోత్రం వలన కలిగే ప్రయోజనాలు ఫలశ్రుతిలో చెప్పబడ్డాయి. క్లుప్తంగా ఇదీ ఫలశ్రుతి:


ఈ దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభములు కలుగవు. బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు లభించును. క్షత్రియులకు విజయము, వైశ్యులకు ధనము, శూద్రులకు సుఖము లభించును. ధర్మము కోరువారికి ధర్మము, ధనము కోరువారికి ధనము అబ్బును. కోరికలీడేరును. రాజ్యము లభించును. భక్తితో వాసుదేవుని నామములను శుచిగా కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు, ప్రాధాన్యత లభించును. వారి రోగములు హరించును. వారికి బలము, తేజము వర్ధిల్లును.

పురుషోత్తముని స్తుతి చేసేవారిలో వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులవుతారు. బంధితులకు స్వేచ్ఛ లభించును. భయమునుండి విముక్తి కలుగును. ఆపదలు తొలగిపోవును. అట్టి భక్తుల కష్టములు కడతేరును. వాసుదేవుని భక్తులకు పాపములు తొలగును. వారికి అశుభములు, జన్మ మృత్యు జరా వ్యాధి భయములు ఉండవు. సుఖము, శాంతి, సిరి, ధైర్యము, కీర్తి, సస్మృతి లభించును. పుణ్యాత్ములగుదురు.

సకల చరాచర జీవములు, గ్రహ నక్షత్రాదులు, దేవతలు వాసుదేవుని ఆజ్ఞానుబద్ధులు. జనార్దనుడే సకల వేద జ్ఞాన విద్యా స్వరూపుడు. ముల్లోకాలలో వ్యాపించిన విష్ణువు ఒకడే. వ్యాసునిచే కీర్తింపబడిన ఈ స్తవమును పఠించిన, విన్న యెడల శ్రేయస్సు, సుఖము లభించును. అవ్యయుడైన విశ్వేశ్వరుని భజించినవారికి పరాభవమెన్నడును జరుగదు.

ఈ స్తోత్రంతో కలిపి చదివే ఈ స్పష్టమైన ఫలశ్రుతి మహాభారత పాఠంలో అంతర్గత విభాగం. దీనికి జనాదరణ కలిగించడానికి ఎవరో తరువాత అతికించినది కాదు. భాష్యకారులు తమ వ్యాఖ్యలలో ఫలశ్రుతిని కూడా వివరించారు.

-

ఉపదేశాలు!


అర్జునుడు "పద్మనాభా! జనార్ధనా! అనురక్తులైన భక్తులను కాపాడు"


అని కోరగా కృష్ణుని సమాధానం - "నా వేయి నామములు స్తుతించగోరే వారు ఒకే ఒక శ్లోకమును స్తుతించినా గాని నన్ను పొందగలరు"


వ్యాసుడు చెప్పినది - "ముల్లోకములు వాసుదేవుని వలన నిలచియున్నాయి. అన్ని భూతములలోను వాసుదేవుడు అంతర్యామి. వాసుదేవునకు నమోస్తుతులు"

-

పార్వతి "ప్రభో! ఈశ్వరా! విష్ణు సహస్ర నామమును పండితులు నిత్యం క్లుప్తంగా ఎలా పఠిస్తారు? సెలవీయండి" అని విన్నవించగా ఈశ్వరుడు ఇలా చెప్పాడు - "శ్రీరామ రామ రామ యని రామనామమును ధ్యానించనగును. రామనామము వేయి నామములకు సమానము"

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

బ్రహ్మ చెప్పినది - "అనంతుడు, వేలాది రూపములు, పాదములు, కనులు, శిరస్సులు, భుజములు, నామములు గల పురుషునకు నమోస్తు. సహస్రకోటి యుగాలు ధరించిన వానికి నమస్కారములు"

సంజయుడు చెప్పినది - "యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఉన్నచోట ఐశ్వర్యము, విజయము నిశ్చయంగా ఉంటాయి."


శ్రీ భగవానుడు చెప్పినది - "ఇతర చింతనలు లేక నన్నే నమ్మి ఉపాసన చేసేవారి యోగక్షేమాలు నేనే వహిస్తాను.

ప్రతియుగం లోను దుష్ట శిక్షణకు, సాధురక్షణకు నేను అవతరిస్తాను"

-

నారాయణ నామ స్మరణ ప్రభావము - "దుఃఖితులైనవారు, భయగ్రస్తులు, వ్యాధిపీడితులు కేవలము నారాయణ శబ్దమును సంకీర్తించినయెడల దుఃఖమునుండి విముక్తులై సుఖమును పొందుతారు."

-

సమర్పణ

శరీరముచేత గాని, వాక్కుచేత గాని, ఇంద్రియాలచేత గాని, బుద్ధిచేత గాని, స్వభావంచేత గాని చేసే కర్మలనన్నింటినీ శ్రీమన్నారాయణునకే సమర్పిస్తున్నాను. భగవంతుడా! నా స్తోత్రంలోని అక్షర, పద, మాత్రా లోపములను క్షమించు. నారాయణా! నీకు నమస్కారము.


అన్న ప్రణతులతో ఈ పుణ్యశ్లోకము ముగుస్తుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!