గజేంద్రమోక్ష గ్రంధములోని ఒక రసవత్తర ఘట్టము ..

గజేంద్రమోక్ష గ్రంధములోని

ఒక రసవత్తర ఘట్టము ..

మొసలిబారిన బడ్డ గజేంద్రుడు తనను రక్షింపుమని శ్రీహరిని వేడుకున్నాడు.

అతని దీనాలాపన....
అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూలసౌధంబు దా
పలమందార వనాంతరామృతసర: ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంకర మావినోదియగు నాపన్న ప్రసన్నుండు, వి
హ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంరంభియై
అచట వైకుంఠపురమునందు, కల్పవృక్ష సమూహములతోనున్న అమృతసరోవర తీరమునందు గల రాజనగరిలోనున్న మణిమయకాంతులీను భవనములో కలువపూలు పరచిన చంద్రకాంతపాన్పు మీద శ్రీలక్ష్మీదేవితో గూడి విహరించుచున్న, ఆపన్న శరణాగత తత్పలుడైన యా శ్రీమన్నారాయణుండు తన భక్తుడైన గజరాజు యొక్క మొరవిని కాపాడతలచినవాడై తత్తరపాటుతో తటాలున
సిరికింజెప్పడు, శంఖుచక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ బన్నింప డాకర్ణికాం
తరధమ్మిలమ్ము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరి చేలాంచలమైన వీడడు, గజప్రాణావనోత్సాహియై
శ్రీమన్నారయణుండు గజేంద్రుని కాపాడే తొందరలో తన ప్రియసఖియైన లక్ష్మీదేవికి కూడా జెప్పక, శంఖ చక్ర గదాది ఆయుధములను జేపట్టక, పరివారంబును బిలువక, తనవాహనమైన గరుడునిపై గూడ నధిరోహింపక, జారిన జుట్టును గమనింపక, వేడుకలో లక్ష్మీదేవి కొంగుతో ముడివేసిన యామె పైటకొంగునుకూడ గమనింపక తొందరపాటుతో యీడ్చుచునే బయలుదేరెను.
తనపతియైన శ్రీమన్నారాయణుండెటకు బోవుచున్నాడొ చెప్పడు. ద్రౌపది మున్నగు అనాధస్త్రీల ఆర్తనాదము విని రక్షింప దలంచెనో, వేదముల నెవరైనా తస్కరులు తస్కరించిరో, రాక్షసులు దేవతానగరిపై దండెత్తి వచ్చిరో, దుర్జనులు 'మీచక్రాయుధుడేడీ' అని ధూషణ తిరస్కారముల నిందించిరో అని తర్కించుచూ, వూగుచున్న చెవికమ్మెలను సరిచేసుకొనక, విడిన కొప్పుముడిని మరల వేసికొనక, జారిన మొల నూలును సరిదిద్దుకొనక, చెరిగిన బొట్టును గమనింపక, తన బ్రాణేశ్వరుని చేత జిక్కిన పైటకొంగు తన కుచకుంభముల నుండి చెదరగా, సిగ్గు జెందినదై, కోటి చంద్రకాంతులనుబోలు ముఖారవిందముగల లక్ష్మీదేవి
అడిగెదనని కడువడిన జను
నడిగిన దను మగుడ నుడువడని నడయుడుగున్
వెడవెడ జిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
తొట్రుపాటుతో తన భర్త ఎచటి కేగుచున్నాడో తెలుసుకొన గోరి ఒక యడుగు ముందుకు వేసి, తనకు బదులిచ్చునో లేదో యని సంశయముతో వెనుకంజవేయుచు, మరల ముందరికేగి అడిగితే యేమగునోయని తొట్రుపాటుపడుచు నట్లేయుండిపోయి, మరల తెప్పరిల్లి శ్రీమనారాయణమూర్తిని వెంబడించెను.

ఆపిమ్మట శ్రీహరి మకరి గజేంద్రుల పోరు సలుపు మడుగును జేరి, ప్రచండప్రళయ భీకరమై కన్నులు మిరుమిట్లు గొల్పు సుదర్శన చక్రమును విడిచెను. ఆది మొసలి దాపునకు జేరి తటాలున దాని శిరస్సును ద్రుంచి సంహరించెను. అప్పుడు...
మకరమొకటి రవిజొచ్చెను
మకరము మరియొకటి ధనదు మాటున దాగెన్
మకరాలయమున దిరిగెడు
మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్
ఒక మకరము మకరరాశిని ప్రవేశించెను, మరియొకటి కుబేరుని జేరెను, మిగిలిన మకరములన్నియు ఆదికూర్మమును జేరి దాగుకొనెను. (ఇక్కడ అతిశయోక్తి అలంకారము ఉపయోగింబడినది. జలచర, మకరములన్నియు భీతినందినవి అని యర్ధము.) మొసలిబారినుండి రక్షింపబడిన గజేంద్రుడు అలసటతీర్చుకొనుటకై మిక్కిలి సంతోషాతిశయంబున వీనులవిందుగా ఘీంకారము జేసెను.
కరమున మెల్లన నివురుచు
గర మనురాగమున మెరసి కలయంబడుచున్
గరి హరికతమున బ్రదుకుచు
గరపీడనమాచరించె గరిణులు మరలన్
శ్రీహరి దయతో గజేంద్రుడు బ్రతికి బయటకు రాగా, ఆడ యేనుగులన్నియు మహదానందముతో మమతానురాగములతో ఒకరి తొండములనొకరు పెనవేసుకున్నాయి.

తనతో వెంబడించి వచ్చిన లక్ష్మీదేవిని జూచి, జగత్ప్రభువైన శ్రీహరి యిట్లనెను
బాలా నావెనువెంటను
హేలన్వినువీధినుండి యేతెంచుచు నీ
చేలాంచలంబు బట్టుట
కాలోనేమంటి నన్ను నంభోజముఖీ !
(నీచేలాంచలంబుబట్టుటకు ఆలోన్ ఏమంటివి)

ఓలక్ష్మీదేవీ! నీపైటకొంగుముడి విడదీయక గజేంద్రుని కాపాడాలనే సంరంభమున నిన్నుగూడ యీడ్చుకొనిపోయినందుకు నీవేమనుకొంటివి? సర్వదా నన్ను భజించువారి ఆపదలను నేను బాపాదును. అని పలికిన
దేవా! దేవరయడుగులు
భావంబున నిలిపికొల్చు పని నాపనిగా
కో వల్లభ! యేమనియెద
నీవెంటనె వచ్చుచుంటి నిఖిలాధిపతీ !

ఓ జగన్నాయకా! మీపాదసేవయే నాపరమావిధి. నాకు వేరొందు బనిలేదు. కావున మిమ్ములను వెంబడించితినేగాని మరే తలంపులేదు.
దీనులకుయ్యాలింపను
దీనుల రక్షింప మేలు దీవన బొందన్
దీనావన నీకొప్పును
దీన పరాధీన దేవదేవ మహేశా !
నిన్ను కొల్చినవారిని కొంగుబంగారమై కాపాడుదేవదేవా! మహేశా! ఆపన్నుల దీనాలాపములను విని రక్షించే రక్షకుడవు. భక్తులచే దీనులచే మిక్కిలిగా బొగడబడినవాడవు. నాకు నీవేదిక్కు అని లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుని గొనియాడెను.

ఆపిమ్మట సాదరసరస సల్లాప మందహాస పూర్వకముగా లక్ష్మీదేవిని ఆలింగనంబు గావించి సపరివారుండై గరుదారూఢుండగుచు శ్రీహరి నిజసదనంబునకుం జనియె.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!