‘సామాన్యుడు’.......

‘సామాన్యుడు’..............(~ భాస్కరం కల్లూరి.)
మనిషికి ‘నరుడు’ అనే పర్యాయపదం ఉంది. పురాణ, ఇతిహాసాలు దేవ, దానవ, సిద్ధ, సాధ్య, యక్ష, రాక్షస, వానరాల మధ్య నరుని ఇరికించి చెప్పాయి. నేటి అవగాహనతో దేవ దానవాదులను కూడా నరులుగానే గుర్తిస్తే, లేదా ఆ మాటలు నరుని గుణ, స్వభావాలను; లేదా తెగ నామాలను తెలిపేవి అనుకుంటే ఆ జాబితాలో చెప్పిన ‘నరుడు’ ఎవరనే ప్రశ్న వస్తుంది. ఇంకో విచిత్రం చూడండి: మహాభారతం అర్జునుని నరునిగా పేర్కొంటూనే, అతనిని నరుడనే ముని అవతారంగా చెప్పి మహాత్ముణ్ణి చేసింది. నరుని… అంటే మామూలు మనిషిని గుర్తించడంలో మహాభారతానికి ఏదో ఇబ్బంది ఉంది. మహాభారతానికే కాదు, ప్రపంచ పురాణ కథలన్నిటికీ ఆ ఇబ్బంది ఉంది.

కీచకుడు తన వెంటపడి వేధిస్తున్నప్పుడు ద్రౌపది ఏకాంతంగా భీముని కలిసి తన దుఃఖాన్ని వెళ్లబోసుకుంటుంది. ఆవేశం పట్టలేక, ఆ జూదరి వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నామని ధర్మరాజును తూలనాడుతుంది. అప్పుడు భీముడు ఆమెను మందలించగా తప్పు దిద్దుకుంటూ ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తిస్తుంది. ఆ సందర్భంలో “…కేవల మర్త్యుడే ధర్మసుతుడు?” అంటుంది. ధర్మరాజు మామూలు మనిషి కాదు, మహాత్ముడని చెప్పడం అందులో ఉద్దేశం. ఇలా మహాత్ముడు-మర్త్యుడు అనే విభజన మహాభారతంలో ఇంకా చాలా చోట్ల వస్తుంది. అజ్ఞాతవాసం గడపడానికి విరాటనగరానికి వెళ్లబోయేముందు, ‘ఇంతటివాడు ఒక మర్త్యుని ఎలా సేవించుకుంటాడు’ అంటూ ధర్మరాజును తలచుకుని అర్జునుడు బాధపడతాడు. ఇంద్రునితో అర్థసింహాసనం అధిష్టించిన అర్జునుడు ఒక మర్త్యుని కొలువు ఎలా చేస్తాడని ధర్మరాజు విచారిస్తాడు. మామూలు మనుషులను సూచిస్తూ మహాభారతం ప్రయోగించిన మరో మాట: ప్రకృతిజనులు. “పుడుతూనే కవచ, కుండలాలతో పుట్టిన కర్ణుడు ఒక ప్రకృతి కాంతకు పుట్టడం ఎలా సాధ్యం?” అని దుర్యోధనుడు ప్రశ్నిస్తాడు. సారాంశం ఏమిటంటే, మహాభారత కాలానికి మనుషుల్లో సామాన్యులు-అసామాన్యులన్న తేడా వచ్చేసింది.
అంతకుముందు మనిషి చరిత్రలో వేల సంవత్సరాలు కొనసాగిన గణవ్యవస్థకు వెడితే, అందులో సామాన్యుడు, అసామాన్యుడన్న విభజనే లేదు. గణంలోని ప్రతి సభ్యుడూ సామాన్యుడే, లేదా అసామాన్యుడే. గణసభ్యులు కలసికట్టుగా ప్రకృతితో సంఘర్షించినంత కాలం వారిలో తారతమ్యాలు లేవు. మనిషి సాటి మనిషితో సంఘర్షించడం ప్రారంభమయ్యాకే తారతమ్యాలు వచ్చాయి. సామాన్యులు, అసామాన్యులనే విభజన వచ్చింది. గణవ్యవస్థలో ప్రతి మనిషీ ముఖ్యుడే. ఏ ఒక్కరూ అనామకులు కారు. ప్రతి ఒక్కరి ఉనికీ చరిత్రలో నమోదు అయింది. కుంటా కింటే తన మూలాలనుంచి వేరుపడి తనది కాని నేలపై, తనది కాని భాష మధ్య అనామకంగా బానిస జీవితం గడిపినా; తను పుట్టిన గడ్డపై అతను అనామకుడు కాడు. అతని స్మృతిని అది తరం నుంచి తరానికి భద్రంగా అందిస్తూనే వచ్చింది. విచిత్రాన్ని మించి, విషాదం ఏమిటంటే; లిఖితచరిత్ర లేని కాలంలో కూడా ప్రతి మనిషి ఉనికీ నమోదయింది, లిఖితచరిత్ర వచ్చాక మనిషి చరిత్రహీనుడయ్యాడు. గణంనుంచి జనానికి మారగానే సామాన్యుడి పేరుతో అనామక సముద్రంలో అజ్ఞాతంగా కలసిపోయాడు. తాత ముత్తాత పేరు కూడా తెలియని చారిత్రక అజ్ఞానిగా మిగిలిపోయాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!