శ్రీ గర్గభాగవతము లోని కథ.......వ్యోమాసురుని చరిత్ర

శ్రీ గర్గభాగవతము లోని కథ.......వ్యోమాసురుని చరిత్ర
ఒకరోజు నందనందనుడు గోపాలురతో కలిసి ఆడుచుండెను. కొందఱు గోవులుగా మరికొందఱు మేకలుగా కొందఱు చోరులుగా మరియు కొందఱు పసులకాపరులుగా విడివడి ఆడుచుండిరి. కంసప్రేరితుడైన వ్యోమాసురుడు చోరుల గుంపులో చేరి గోవులుగా మేకలుగా గోపాలురుగా నటిస్తున్న బాలులను ఎత్తుకొని పోయి ఒక బిలమున దాచి బిలద్వారము మూసివేసెను. పరమాత్మ అది గ్రహించి రక్కసుని రెండుకాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలపై విసిరిగొట్టెను. మృతుండైన వ్యోమాసురుని లోని తేజస్సు పరమాత్మలో లీనమయ్యెను.
పూర్వం మహాపుణ్యక్షేత్రమగు భవ్య కాశీనగరమును భీమరథుడు అను రాజేంద్రుడు పరిపాలించెడివాడు. అతడు మేధావి దానశీలి ధర్మజ్ఞుడు పైగా శ్రీహరి భక్తుడు. రాజ్యభారమును యోగ్యుడైన కుమారునికి అప్పగించి రమేశుని పై అనురక్తుడై తపముకై మలయపర్వతమునకు ఏగెను. అక్కడ ఆశ్రమములో నివసించి తపమును సాగించుచుండెను.


ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడు పరమపూజ్యుడు అయిన పులస్త్య మహర్షి శిష్యవర్గముతో భీమరథుని ఆశ్రమమునకు వచ్చెను. త్రిలోకపూజ్యుడైన పులస్త్యునకు రాజు నమస్కరించెనే కానీ యథావిధి అతిథి సత్కారము చేయలేదు. ధర్మము తప్పినందుకు మహర్షి “రాజా! ఇంటికి వచ్చిన వానిని సత్కరింపకుండుట అసురలక్షణము. కావున నీవు రాక్షసుడివి కమ్ము”! అని శపించెను. పశ్చాత్తాపముతో శరణువేడిన రాజును కరుణించి పులస్త్యుడు “నీ దుష్కర్మకు ఫలితమనుభవించక తప్పదు. కానీ నీవు అఖండ విష్ణుభక్తుడవగుటచే నీకు ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహము కలుగును. భగవంతుడు భక్తుల కెన్నడు అపజయము కలిగించడు కదా!” అని ఆశీర్వదించెను. ఆ భీమరథుడే వ్యోమాసురుడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!