మధ్యాహ్నపురాణం 8 (13/5/16.) తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – చివరి భాగం!

మధ్యాహ్నపురాణం 8 (13/5/16.)తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ –
చివరి భాగం!











.

భీముడు కూడ బంగారుకవచం ధరించి గదతో దుర్యోధనుడికెదురుగా నిలబడ్డాడు. దుర్యోధనుడు ధర్మరాజుతో “మా ఇద్దరి గదాయుద్ధం చూడటానికి కుతూహలంగా వున్న జనం సంఖ్య పెరుగుతుంది, వాళ్లు చేసే సందడి కూడ ఎక్కువౌతున్నది. అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే బాగుంటుంది” అంటే ధర్మరాజు తనవైపు వాళ్లందర్నీ కూర్చోమని చెప్పి, బలరామకృష్ణుల్తో తనూ మధ్యలో ఆశీనుడయాడు. భీముణ్ణి గదాయుద్ధానికి పిలిచాడు దుర్యోధనుడు. భీముడు అన్న వైపు తిరిగి “వీణ్ణి గెలవటం నాకు చిన్నపని. ఐతే మన ఇన్నాళ్ల బాధలకి ఫలితం అనుభవించేట్టు వీడి తొడలు పొడిచేసి దారుణంగా చంపుతా చూడు” అనిచెప్పి దుర్యోధనుడితో “నా చేతికి చిక్కావిప్పుడు, ఇంక తప్పించుకుపోనివ్వను. ఈ పూటతో నీకథ ముగుస్తుంది” అన్నాడు.


దానికి దుర్యోధనుడు “యుద్ధం చెయ్యకుండా ఈ ప్రగల్భం మాటలెందుకు? మాటలయుద్ధం గెలుస్తావేమో గాని గదాయుద్ధంలో గెలవటం నీవల్ల కాదు. ఒళ్లు చూసుకుని సంబర పడుతున్నట్టున్నావ్. నా గదాదండం దెబ్బల ముందు నీ భుజబలం ఎందుకూ చాలదు. ఆ పరమశివుడే గదాయుద్ధంలో నన్నెదిరించలేడు, నువ్వో లెక్కా? నా గదాకౌశలం చూసేవాళ్లంతా ఆహా అనేట్టు, నీ పాట్లు చూసి మీవాళ్లంతా హా, హా అనేట్టు చేస్తా. రా ముందుకి” అని గర్జించాడు.


శత్రువులైనా పాంచాలాదులు అతని సాహసాన్ని పొగిడారు, అదిచూసి దుర్యోధనుడింకా ఉప్పొంగాడు.


ఇద్దరు వీరులూ భీకరంగా గదాసమరం ప్రారంభించారు. రెండుగదల రాపిళ్లనుంచి మంటలెగిసి ఆకాశాన్నంటుతున్నయ్. వాళ్ల పదఘట్టనలకి భూమి కంపిస్తున్నది. రకరకాల మండలప్రచారాల్తో, చిత్ర విచిత్ర గదాప్రహారాల్తో యుద్ధం సాగిస్తున్నారు. వాళ్ల బాహుబలం, వేగం, నేర్పు, గుండెదిటవు చూసేవాళ్లకి భయం కలిగిస్తున్నయ్. ముందుగా ఇద్దరి కవచాలూ విరిగి, పగిలి, ముక్కలై నేలరాలినయ్. ఒకవైపుకి వేస్తున్నట్టు నటించి రెండోవైపు దెబ్బ వెయ్యటం, వేగంగా వంగి దెబ్బ తప్పించుకోవటం, అదేవేగంతో దెబ్బ వెయ్యటం, అవతలి వాళ్ల గదని తూలించటం – ఇలా అనేక విన్యాసాల్తో ఒకరికొకరు తీసిపోకుండా రణం కొనసాగిస్తున్నారు.


గదతో గదని చుట్టి చుట్టూతిరగటం, సాహసంగా ఎగిరి అనుకున్న వైపు కాక మరోవైపుకి దూకటం, దెబ్బవేసి వెనక్కి తప్పుకోవటం, పాదాలు, బాహువులు, నడుం, వక్షం అసంభావ్యమైన అనేక రీతుల్లో తిప్పటం, దెబ్బ తప్పించుకున్నప్పుడు తనని తను అభినందించుకోవటం, దెబ్బ పడినప్పుడు శరీరాన్ని పెంచటం – ఇలా పోరుతున్నారు. అంగాలన్నీ రక్తమయాలౌతున్నయ్. ఇద్దరిలో ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడుతున్నారో చెప్పటం దేవతలక్కూడ సాధ్యం కావటం లేదు.


దుర్యోధనుడు కుడివైపు నుంచి వస్తే భీముడు ఎడమవైపుగా తిరిగాడు, దుర్యోధనుడతని పక్కటెముకల మీద మోదాడు. భీముడతని చేతిమీద కొడితే అతని గద వదులై జారింది. జారిన గదని తీసుకుని దుర్యోధనుడతని తలమీద వేటు వేశాడు. దానికి భీముడు ఆవంతైనా చలించకపోవటం అందర్నీ ఆశ్చర్యమగ్నుల్ని చేసింది. ఐతే అమితక్రోధంతో భీముడు గిరగిర తిప్పి గదనతని విశాలవక్షానికి సూటిగా విసిరాడు. దుర్యోధనుడు లాఘవంగా దాన్ని తప్పించుకున్నాడు. భీముడు అద్భుతవేగంతో తన గదని పుచ్చుకునేలోగా దుర్యోధనుడతని వక్షాన్ని దారుణంగా బాదాడు. ఆ దెబ్బకి భీముడు తూలటంతో పాండవ పాంచాల వీరుల గుండెలు గుభేలుమన్నయ్.


భీముడంతలోనే తెలివి తెచ్చుకుని దుర్యోధనుడి పక్కలు విరిగేలా మోదాడు. ఆ దెబ్బకి దుర్యోధనుడు చతికిలబడ్డాడు. శత్రువులు ఫక్కున నవ్వారదిచూసి. కాని అతనంతలోనే లేచి భీముడి ఫాలానికి చెవికి మధ్యభాగాన్ని బద్దలు కొట్టాడు. భీముడు మళ్లీ తూలి చెక్కిళ్ల మీద కారుతున్న రక్తాన్ని లెక్కచెయ్యకుండా గదతో బలంగా దుర్యోధనుడి మెడ మీద కొడితే అతను కిందపడ్డాడు. ధర్మరాజాదులు ఆనందంతో అరిచారు. దుర్యోధనుడు కాలాంతకుడిలా లేచి రకరకాల విన్యాసాల్తో శరీరాన్ని పొడిచేసి భీముణ్ణి నేలకూల్చి సింహనాదం చేశాడు. భీముడు చచ్చాడనే అనుకున్నాడతను.


భీముడికి అంతలోనే తెలివొచ్చి లేచి కళ్లు పైకెత్తి చూశాడు. ఇంతలో సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, నకులుడు, సహదేవుడు “నేను తలపడతా, నేను తలపడతా” అని దుర్యోధనుడి మీదికి వెళ్లబోతుంటే భీముడు వాళ్లందర్నీ వారించి మళ్లీ దుర్యోధనుడి మీదికి దూకాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి “వీళ్లిద్దరి యుద్ధాల్లో ఏం తారతమ్యాలు కనిపిస్తున్నయ్ నీకు? ఉన్నదున్నట్టుగా చెప్పు” అనడిగితే దానికతను “గురూపదేశం వల్ల నేర్చిన విద్య ఇద్దరిదీ సమానం. భీముడికి బాహుబలం ఎక్కువ, దుర్యోధనుడు ఎక్కువ పరిశ్రమ చేసి గదావిద్యలో ఆరితేరాడు. అందువల్లనే బలవంతుడైన భీముడతని యుద్ధకౌశలం ముందు నిలవలేకపోతున్నాడు. ధర్మయుద్ధంలో దుర్యోధనుణ్ణి జయించటం కష్టసాధ్యం. ఎలాగోలా నాడు సభలో చేసిన ప్రతిజ్ఞ పేరు చెప్పుకుని అతని తొడలు విరగ్గొట్టటమే మార్గం. మాయావి వాడు, కనక మాయతోనే జయించామనొచ్చు. అలా చెయ్యకుండా ధర్మయుద్ధమని నాభికి దిగువ కొట్టకుండా సాగిస్తే మొదటికి మోసం వస్తుంది. అప్పుడు అందరం కలిసి మీదపడి వాణ్ణి చంపాల్సొస్తుంది.


ఏమైనా ధర్మరాజు వల్ల ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది. భీష్మ ద్రోణాది మహావీరుల్ని గెలిచి జయం, యశం తెచ్చుకునే సమయాన ఇలా ఒకరితో పోరాడి గెలిచి రాజ్యం తీసుకో అని దుర్యోధనుడికి చెప్పటం ఏమిటి, దానికి భీముణ్ణి పంపటం ఏమిటి? బంధుమిత్రులంతా చచ్చి రాజ్యం మీద ఆశ వదలుకుని మడుగులో దాక్కున్న వాణ్ణి వెతికి బయటికి పిలిచి మరీ ఇలాటి అవకాశం ఇస్తారా ఎవరైనా? వాడేమో భీముడితో గదాయుద్ధానికి ఈ పదమూడేళ్ల పాటూ బాగా పరిశ్రమ చేసి సిద్ధంగా వున్నాడు, చిత్రవిచిత్ర విన్యాసాల్తో ఇతన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. భీముడా, ఇన్నాళ్లూ అలవాటు తప్పిపోయి అతనిచేత దెబ్బలు తింటున్నాడు. ఇప్పటికైనా ఇతను ధర్మం అని పట్టింపు పెట్టుకోకుండా వీణ్ణి హతమార్చాలే తప్ప ఇంకాసేపాగితే తనే చావటం ఖాయం, ఆ దుర్మార్గుడు మీకు రాజు కావటమూ తప్పదు” అని అర్జునుడితో తన మనసులో మాట చెప్పాడు.


అర్జునుడు వెంటనే, భీముడు తనవైపు చూసే సమయంలో చేత్తో తనతొడల మీద కొట్టి చూపించాడు. దానర్థం వెంటనే గ్రహించాడు భీముడు. అధర్మమైనా సరే తొడలు విరగ్గొట్టమని కృష్ణుడు సలహా ఇస్తే అర్జునుడు దాన్ని తనకలా అందజేశాడని తేల్చుకున్నాడు.


భీముడు ఇంకొంతసేపలా వివిధవిన్యాసాల్తో రణం సాగించాడు. దుర్యోధనుడూ చిత్రవిచిత్రగతుల్లో కదుల్తున్నాడు. భీముడు గదని దుర్యోధనుడి మీదికి బలంగా విసిరితే దుర్యోధనుడు ఎగిరి తప్పించుకున్నాడు. భీముడు వేగంగా వెళ్లి గదనందుకున్నాడు. దుర్యోధనుడి దెబ్బకి భీముడు తూలి కిందపడ్డాడు. అది గమనించక దుర్యోధనుడు పైకెగిరాడు. అంతలో భీముడు తెలివితెచ్చుకుని భీషణంగా అతన్ని కొట్టబోయాడు. దాన్ని తప్పించుకోవటానికి దుర్యోధనుడు భీముడి పైగా ఊర్ధ్వపరిభ్రమణం చేశాడు. అదే అవకాశంగా భీముడతని తొడలు విరిగేట్టు బలంకొద్దీ బాదాడతన్ని. వజ్రాయుధం దెబ్బకి రెక్కలు విరిగి పడ్డ మహాపర్వతంలా కూలాడు దుర్యోధనుడు.


అనేక ఉత్పాతాలు కలిగినయ్ అప్పుడు. ఉల్కలు నేలరాలినయ్, రక్తవర్ణంగా వర్షం కురిసింది, జంతువులు వికృతంగా అరిచినయ్. రారాజు పాటుకి సంతోషంతో అరిచిన పాండవ, పాంచాల వీరులు సిగ్గున తలలు వంచుకున్నారు.


ఇంతలో భీముడు దుర్యోధనుడి దగ్గరికెళ్లి “నిండుసభలో ద్రౌపదిని ఈడ్చుకురమ్మని తెప్పించి చేసిన పరాభవానికి ఫలితం అనుభవించు” అని ఎడం కాలితో ఈడ్చి తన్నాడతని తలని. ఒక పెలుచనవ్వు నవ్వి అక్కడున్న వాళ్లందర్నీ చూసి “మమ్మల్ని ఇదివరకు నానామాటలన్న ముష్కరులందర్నీ బంధుమిత్ర సపరివార సహితంగా చంపాం, మా పగతీరింది. ఇందుకు మాకు స్వర్గమే రానీ, నరకమే కానీ, నాకేం ఫరవాలేదు” అని గదతో నీ కొడుకు గొంతు నొక్కి మళ్లీ అతని తలని కాల్తో తన్నాడు భీముడు.


మొదటిసారి తన్నిన దానికే బాధపడుతున్న ధర్మరాజు కోపంతో “ఏమిటీ తులువతనం? అతని తల తన్నటం ఎంత అధర్మమో నీకు తెలీదా? తమ్ముళ్లు, మిగతా బంధువులు అంతా నేలకూలినా రాజధర్మాన్ని పాటించి నీతో పోరాడి యుద్ధంలో పడ్డ వాణ్ణి ఇలా చేశావే, నీ పనిని లోకం హర్షిస్తుందా? ఇన్నాళ్లూ ధర్మపరుడివని అందరూ అనుకునే మాటని పొరపాటని చూపించటం తప్ప నువ్వు సాధించిందేమిటి?” అని గద్దించాడు.


ధర్మరాజు దుర్యోధనుడి వంక చూసి నీళ్లు నిండిన కళ్లతో “విధి వక్రదృష్టివల్ల మనకి వైరం కలిగింది, ఒకరొకరి మీద కోపాలు పెంచుకున్నాం, ఇతర ద్రోహాల వల్ల ఇంతదూరం తెచ్చుకున్నాం. నీ అధర్మపరత, లోభం, పిల్లవాడి మనస్తత్వం, మదం నిన్నీస్థితికి తెచ్చినయ్. నీమూలాన నా బంధువులు మరణించారు, ధృతరాష్ట్రుడి కోడళ్లు వాళ్ల వైధవ్యాలకి నేనే కారణం అనుకుంటారు, వాళ్ల దైన్యం తల్చుకుంటే నా గుండె తరుక్కుపోతున్నది.” అని బాధపడ్డాడు.


ఇంతలో బలరాముడు క్రోధాతిరేకంతో మొహమంతా ఎర్రబడి లేచి చేతులు పైకెత్తి అందర్నీ చూస్తూ “రాజులంతా చూశారుగా ఈ భీముడి దుర్నీతి? గదాయుద్ధంలో నాభికి దిగువన కొట్టకూడదనే నియమం తెలిసి తెలిసి ఇలా ప్రవర్తించిన వీడికి తగిన శిక్ష పడాల్సిందే” అని వేగంగా తన రథం మీది హలాయుధాన్ని బుజానికి అమర్చుకుని భూమి కంపించేట్టు నడుస్తూ భీముడి వైపుకి కదిలాడు. ఐతే భీముడు మాత్రం అన్నదమ్ముల అండ చూసుకుని ఏ మాత్రం తగ్గకుండా నిలబడ్డాడు.


కృష్ణుడు దిగ్గున లేచి అన్నకి ఎదురెళ్లి తన దీర్ఘబాహువుల్తో అతన్ని పట్టి ఆపి దృఢస్వరంతో “ఎవరికైనా శుభం కలిగించే మార్గాలు తన వృద్ధి, మిత్రుల వృద్ధి, వాళ్ల మిత్రుల వృద్ధి కలగటం, శత్రువులకి ఈ మూడు విధాలుగానూ వృద్ధి జరక్కపోవటం అనేవి. అందుకు వ్యతిరేకంగా జరక్కూడదు. అందువల్ల తన మిత్రులకి కీడు జరగబోతుంటే మైత్రిపరుడైన పరాక్రమశాలి దాన్ని ఆపుతాడు. పాండవులు మనకి పరమమిత్రులు, ముఖ్యంగా మన మేనత్త కొడుకులు, దుర్మార్గుల చేత అవమానాల పాలైనవాళ్లు. వీళ్ల మంచి కోరటం నీ కర్తవ్యం. నిండుసభలో తను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చటానికి భీముడతని తొడలు విరగ్గొట్టాల్సొచ్చింది, చేసిన ప్రతిజ్ఞలు చెల్లించటం రాజులకి పరమధర్మమని అందరూ అంగీకరించిందే కదా? పైగా భీముడి గదకి అతని తొడలు విరుగుతాయని మైత్రేయ మహాముని శాపం కూడ, అది తప్పుతుందా? అది భీముడి తప్పెలా ఔతుంది? కోపం ఉపశమించు, పాండవుల అభివృద్ధి మనకు సమృద్ధిని కలిగిస్తుందని గ్రహించు” అని అన్నని శాంతింపజెయ్యటానికి ప్రయత్నించాడు.


దానికి బలరాముడు మండిపడ్డాడు “ధర్మార్థ కామాలు ఆ వరసలో సాధించాలి గాని అర్థకామాల కోసం ధర్మాన్ని బలిచ్చేవాడు అవినీతి పరుడనిపించుకుంటాడు. మునిశాపం అన్నావ్, ప్రతిజ్ఞ అన్నావ్. అవి అధర్మమార్గానే జరగాలా? ధర్మంగా జరపొచ్చు కదా?” కృష్ణుడతన్ని అనునయిస్తూ “లోకమంతా నిన్ను ధర్మనిరతుడివని, మంచిచెడుల్ని ఎంచగలిగినవాడివని, కోపం లేనివాడివని ఎప్పుడూ పొగుడుతుంటుంది, నీకీ కోపం తగదు. తన ప్రతిజ్ఞ చెల్లించటానికి ఇతను చేసిన పని అధర్మం కాదు. పైగా దుర్యోధనుడేం ఎదురుగా నిలబడి యుద్ధం చెయ్యటం లేదుగదా ఇది జరిగినప్పుడు? అదో గొప్పతనంగా పైకెగిరి కొట్టబోతుంటే తనని తను కాపాడుకోవటానికి భీముడలా గద విసరాల్సొచ్చింది, అలా చెయ్యకుండా అతన్ని తన్నులు తిని చావమన్నావా? భీముడి ప్రతిజ్ఞ సంగతి దుర్యోధనుడికి తెలీందా? తెలిసి కూడ తనని తను కాపాడుకోకపోతే అది భీముడి తప్పా? కలియుగం కూడ దగ్గరపడింది, ఇలాటి వాటిని అధర్మవర్తనలుగా అనుకోకూడదు. అసలు, పుట్టిన దగ్గర్నుంచి ఏదో ఒక కపట మార్గాన వీళ్లని చంపటానికి ప్రయత్నించిన ఈ దుర్మార్గుణ్ణి కపటంగా కొట్టటం తప్పే కాదు. పాండవ యాదవ వంశ వర్ధనుడు అభిమన్యుణ్ణి వీడు ఎలా అధర్మయుద్ధంలో చంపాడో తెలిసి కూడ నువ్విలా అనటం భావ్యం కాదు” అని అనేక రకాల తర్కాల్తో సర్దిచెప్పాడు.


ఇవేవీ బలరాముణ్ణి శాంతింప జెయ్యలేక పోయినయ్. మొహాన గంటు పెట్టుకుని అందర్నీ ఈసడించుకుంటూ “ఇలాటి పనికి మాలిన గెలుపు గెలిచి భీముడు కీర్తి మూట గట్టుకోనీ, రణధర్మం తప్పకుండా ధర్మయుద్ధం చేసిన దుర్యోధనుడికి ఉత్తమగతులు కలక్కతప్పదు” అని గట్టిగా చెప్పి పరుగున వెళ్లి తన రథం ఎక్కి ద్వారక వైపుకి సాగిపోయాడు. పాండవులు, పాంచాలురు, యాదవులు – అక్కడున్న వాళ్లంతా చిన్నబోయారు. వాళ్ల గుండెలు జారిపోయినయ్. విషాదవదనాల్తో నేలచూపులు చూస్తూ నీరసంగా వుండిపోయారు.


కృష్ణుడు వాళ్లని హుషారు పరచటానికి పూనుకున్నాడు. ధర్మరాజుతో “బంధునాశకుడు, పాపాత్ముడు దుర్యోధనుడు. వాడి తొడలు విరిచి తలదన్నాడు భీముడు. ఇది నిజంగా అధర్మమేనా, ఆలోచించి చూడు. భీముడి ప్రతిజ్ఞలో వాడి తల తన్నటం అనే అంశం కూడ ఉందని గుర్తు తెచ్చుకో” అని చెప్పిచూశాడు. దానికి ధర్మరాజు “బంధువులంతా మరణించారని బాధలో వున్న నాకు భీముడిలా రారాజు తలతన్నటం ఎలా ఉంటుందో నువ్వూ ఆలోచించు. కాకుంటే ఆ దుర్యోధనుడి వల్ల ఇన్నాళ్ల కష్టాలు తలుచుకుని భీముడలా చెయ్యటమూ అసంగతం కాదు. ఏమైనా ఇంకా పుణ్యపాపాల చింత ఎందుకు, పోనిద్దాం” అని సర్దుకున్నాడు.


అర్జునుడు మాత్రం అందుకు ఒప్పుకోలేక మౌనంగా వుండిపోయాడు. భీముడు ఆనందంగా అన్నని “దుర్మార్గులైన దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు అంతా అంతరించారు. మన పగ తీరింది. ఇంక నువ్వు హాయిగా రాజ్యం పాలించు” అని అభినందించాడు. ధర్మరాజు కూడ తమ్ముడి భుజబలాన్ని పొగిడాడు. పాండవపక్షం వాళ్లంతా కోలాహలంగా పరస్పరం ప్రశంసించుకుంటూ శంఖాలు, భేరులు, ఇతర వాయిద్యాలు మోగిస్తూ సంబరాలు చేసుకున్నారు. పాంచాల వర్గం అంతా భీముణ్ణి ఆకాశానికెత్తుతూ పొగిడారు.


ఐనా ఇంకెవరికైనా దుర్యోధనుణ్ణి అధర్మంగా పడేశారని అనుమానంగా ఉందేమోనని కృష్ణుడు అందర్నీ ఉద్దేశించి ప్రసంగించాడు – “భీముడు ధర్మం తప్పి వీణ్ణి కొట్టాడని ఎవరూ అనుకోవద్దు. ఆవంతైనా అనుమానం లేకుండా ద్రౌపదిని దురవమానం చేసిన దుర్యోధనుణ్ణి కేవలం తన తండ్రి భాగం ఇవ్వు చాలు అనడిగాడు ధర్మరాజు. అందుక్కూడ ఒప్పుకోలేదు వీడు. విదురాదులు ఎంతగానో చెప్పిచూశారు, ఐనా తన పట్టు వదల్లేదు. అలాటి వాణ్ణి తన ప్రతిన చెల్లించుకోవటానికి భీముడు తొడలు విరగ్గొట్టటం ఎందుకు ధర్మం కాదో మీరే ఆలోచించుకోండి. దీనంగా పడున్నాడు కదాని వీడి పాపాల్ని మనం మర్చిపోకూడదు. వాడి మీద దయ చూపకూడదు. పదండి, పదండి, రథాలెక్కండి” అని బోధించాడు.


అంతా చూస్తూ వింటూ వున్న దుర్యోధనుడు ఇంక ఆగలేకపోయాడు. చేతుల మీద బలం మోపి శరీరం పైభాగం పైకెత్తి దెబ్బ పడితే కోపంతో చూసే మహాభుజంగంలా తల ఎత్తి కృష్ణుణ్ణి తీక్షణంగా చూస్తూ “కంసుడి బానిస కొడకా, నువ్వేదో పత్తిత్తులాగా ఉపన్యాసాలిస్తున్నావే, అధర్మంగా నా తొడలు విరగ్గొట్టమని అర్జునుడి చేత సైగ చేయించావ్, శిఖండి పేరు చెప్పి అర్జునుడి చేత భీష్ముణ్ణి పడేయించావ్, ధర్మరాజు చేత అబద్ధం చెప్పించి ద్రోణుణ్ణి చంపించావ్, రథం భూమిలో కుంగినప్పుడు కర్ణుణ్ణి కొట్టించావ్, ఇంకొకరితో యుద్ధం చేస్తున్న భూరిశ్రవుణ్ణి దొంగచాటుగా పడగొట్టించావ్, దొంగచీకటి అడ్డుపెట్టుకుని సైంధవుణ్ణి చంపించావ్. లేకుంటే మీరంతా ఎప్పుడో చచ్చేవాళ్లు. ఇన్ని చేసి ఇప్పుడు నీతులు చెప్పకు” అంటూ విషం కక్కాడు.


కృష్ణుడు ఏమాత్రం వెనకాడకుండా “బాలుడిగా వున్నప్పుడే భీముణ్ణి పాముల్తో కరిపించావ్, నీళ్లలో ముంచావ్, చంపటానికి రకరకాలుగా ప్రయత్నించావ్. కుంతి, కొడుకులు నిద్రలో ఉన్నప్పుడు లక్కయింటికి నిప్పు పెట్టించావ్, అజాతశత్రుడు ధర్మరాజు సంపదల్ని మాయాజూదంలో అపహరించావ్, అంతటితో ఆగకుండా పాంచాలిని పదిమంది ముందు పరాభవించావ్. అప్పుడే నీకీ గతి పట్టించాల్సింది, ఐనా వీళ్లు ఓర్పుతో జూదం నియమాల ప్రకారం చేసి వచ్చి నన్ను సంధికి పంపితే సూదిమొనంత కూడ ఇవ్వనన్నావ్. అదే నీకీ గతి పట్టించింది. నీ లోభం వల్ల ఏ పాపమూ ఎరుగని భీష్మ ద్రోణులకి ముప్పు తెచ్చిపెట్టావ్.


ఏవో అధర్మాలు చేశామన్నావే, సరిగా విను. శిఖండి, ధృష్టద్యుమ్నులు పుట్టిందే భీష్మ ద్రోణుల్ని చంపటానికి. అది జరక్కుండా ఆపటానికి మనమెవరం? ఎంతోమందితో యుద్ధం చేసి అలిసిపోయి ఊగులాడుతున్న సాత్యకిని భూరిశ్రవుడు చంపబోతుంటే చూస్తూ వూరుకుంటామనుకున్నావా? ఎందరో మహావీరులు కలిసి అన్యాయంగా బాలుడు అభిమన్యుణ్ణి చంపితే అందుక్కారణమైన దుర్మార్గుడు సైంధవుణ్ణి, అందునా అరణ్యంలో ద్రౌపదికి అవమానం చెయ్యబోయినవాణ్ణి, చంపకుండా వదిలేసి అర్జునుణ్ణి అగ్ని ప్రవేశం చెయ్యనిస్తామనా నీ ఉద్దేశం? మీ పాపాలన్నిటికి మూలమైన కర్ణుడి రథం భూమిలో కుంగితే అది పైకి లేచేవరకు అర్జునుడు ఎదురుచూస్తూ కూచోవాలా? బ్రాహ్మణశాపం ప్రకారం వాడు చచ్చేవరకు అది పైకి లేవదే మరి? నీ తొడలు విరగ్గొడతానని భీముడు ప్రతిజ్ఞ చెయ్యటం నీకు తెలియని విషయం కాదు గదా, మరి అలా ప్రతిజ్ఞ చేసిన వాడు తొడలు విరగ్గొట్టకుండా వీపున గుద్దుతాడనుకున్నావా? ఇంకా నయం, శల్యుణ్ణి కూడ అధర్మంగానే చంపామనలేదు నువ్వు. పాండవులెప్పుడూ అధర్మపరులు కారు. ఘోషయాత్రలో గాని, గోగ్రహణ సందర్భంలో గాని నిన్ను చంపటానికి అవకాశం వున్నా చంపలేదు గదా? కురువంశం నాశనం కావటానికి కారణం నువ్వే, మరెవరూ కారు. నీ మూలానే, నీ దుర్నీతి వల్ల, నీ అసూయ వల్ల, నీ లోభం వల్ల ఇంతా జరిగిందని గ్రహించు. ఎందుకీ వ్యర్థపుమాటలు?” అని జాడించాడతన్ని.


దుర్యోధనుడు నిర్వికారంగా “వేదాలు చదివా, యాగాలు చేశా, అనేకమంది రాజులు కొలిచే రారాజుగా వెలిగా, శత్రువుల గుండెల్లో నిద్రపోయా, చివరికి బంధుమిత్రుల్తో ఆనందంగా స్వర్గానికి పోతున్నా. నీదృష్టిలో ఎలాటివాడినైతే నాకేం? మీరే రోజూ పశ్చాత్తాపంతో ఏడుస్తూ బతుకులు ఈడుద్దురు గాని” అన్నాడతనితో.


ఆ మాటలకి అతని మీద పుష్పవృష్టి కురిసింది, దేవదుందుభులు మోగినయ్, చల్లగాలులు సువాసనల్తో మెల్లగా వీచినయ్. అదంతా చూసిన పాండవులకి అప్పటివరకు జరిగిన యుద్ధం కొత్తగా కనిపించింది, శత్రువుల్లో ముఖ్యులందర్నీ అధర్మంగా చంపామనే అనుమానం పట్టుకుంది. మొహాలు వేలాడినయ్.


అది గమనించాడు కృష్ణుడు. “భీష్మ ద్రోణాదుల్ని కపటమార్గాల్లో ఓడించామని మీకు చింత వద్దు. మీరు కేవలం నిమిత్తమాత్రులు. వాళ్లు ఉగ్రాస్త్రవేదులు, మహావీరులు. వాళ్లని చంపటం సామాన్యమైన విషయం కాదు. కనక అవసరానికి తగ్గ ఉపాయాలు చూసి ఇదంతా నేనే చేయించా. పైగా ఇలా జరగాలని విధిరాత, అలా జరిగింది. అంతే. దైవఘటనల్ని తప్పించటం మీ పనా? ఇది సంతోషసమయం, విచారానికి కాదు. మనం అనుకున్నది సాధించాం. అది ముఖ్యం. పొద్దుపోతున్నది, పదండి. విడుదులకెళ్లి విశ్రాంతి తీసుకుందాం” అని హడావుడి చేస్తే అప్పటికి వాళ్ల మొహాల్లో కాస్త కళవచ్చింది. కృష్ణుడు ముందుగా పాంచజన్యం పూరిస్తే తర్వాత అందరూ వాళ్ల శంఖాలూదారు.


అక్కణ్ణుంచి పాండవులు, కృష్ణుడు, సాత్యకి కౌరవశిబిరాలకి వెళ్లారు. మిగిలిన వాళ్లంతా విశ్రాంతి కోసం వాళ్ల వాళ్ల శిబిరాలకి వెళ్లారు. అందరూ మర్నాడు హస్తినాపురానికి వెళ్లటానికి నిర్ణయించుకున్నారు.


కౌరవశిబిరానికి వెళ్లి పాండవులు దుర్యోధనుడి నివాసం ప్రవేశించారు. అక్కడి పరిచారకులు, కోశాగారాధ్యక్షులు వచ్చి ధర్మరాజుని ఆహ్వానించారు. అందరూ రథాలు దిగుతుంటే కృష్ణుడు ముందుగా అమ్ములపొదుల్ని, గాండీవాన్ని దూరంగా పెట్టించి అర్జునుడు దిగాక తను దిగుతానని చెప్పాడు. అర్జునుడలాగే చేశాడు. పగ్గాల్ని నొగల్లో ఉంచి చివరగా దిగాడు కృష్ణుడు. అతను దిగిన వెంటనే గుర్రాల్తో సహా ఆ రథం మండిబూడిదైంది. “ఇది ద్రోణ కర్ణుల అస్త్రాగ్నుల ప్రభావం. వాటి ప్రభావాన్ని దాచి రథం దగ్ధం కాకుండా కాపాడానిన్నాళ్లూ. ఇప్పుడిక యుద్ధం ఐపోయింది గనక వాటి ప్రభావం బహిర్గతమైంది” అని వివరించాడు కృష్ణుడు.


ధర్మరాజుని కౌగిలించి అతనితో “నేను ఉపప్లావ్యానికి వచ్చినప్పుడు నువ్వు అర్జునుణ్ణి రక్షించమని నాకప్పగించావ్, అందుకు నేనూ ఒప్పుకున్నా. ఆ పని నెరవేర్చానిప్పుడు. ఇక ముందు జరపాల్సిన కార్యక్రమం గురించి ఆలోచించు” అని చెప్పాడు. ధర్మరాజు కూడ “నువ్వు లేకుంటే యుద్ధంలో గెలవటం మాకసాధ్యం. వ్యాసమహాముని ముందే చెప్పాడు నువ్వెటు వుంటే అటు విజయం కలుగుతుందని. ఇదంతా నీ ప్రసాదం తప్ప మా గొప్పతనం కాదు” అని పొగిడాడతన్ని.


అందుకు కృష్ణుడు, “నిజానికి ఈ విజయానికి కారణం విజయుడే. అతనికి శివుడు అస్త్రాలిచ్చినప్పుడు నా అంత వాడివి కమ్మని దీవించాడు, ఆ మాట అబద్ధమౌతుందా? ఏదో గురువులని, బంధువులని శత్రువుల మీద జాలిపడి చంపటానికి వెనకాడుతుంటే అతని అనుమానాల్ని తొలిగించటమే నేను చేసింది. ఒక్కసారిగా చంపటానికి ఇష్టం లేక ఇన్నాళ్లూ ఇదో ఆట లాగా సాగించాడు గాని అతను తల్చుకుంటే త్రిలోకాల్ని నాశనం చెయ్యటానికి నిమిషమున్నర పట్టదు. పక్కనుండి సరైన మార్గం చెప్పటమే నా పని, చేసిందంతా తనే” అని అర్జునుడి శస్త్రాస్త్రసంపదల్ని పొగిడాడు.


ఇలా సుఖసల్లాపాలాడుకుంటూ వాళ్లు కౌరవ భాండాగారాన్ని, మిగిలున్న చతురంగ బలాల్ని, పరిచారవర్గాల్ని వశం చేసుకున్నారు. కొంతసేపటి తర్వాత కృష్ణుడు వాళ్లతో “ఈ పాడుబడిన చోట మనం రాత్రి గడపటం మంచిది కాదు, ఎక్కడన్నా శుభ్రంగా వున్న బయలుకి వెళ్లి నిద్రచేద్దాం” అని చెప్పి అంతకు ముందే తన సారథి దారుకుడు తన రథాన్ని సిద్ధం చేసి తీసుకొస్తే దాని మీద బయల్దేరాడు. మిగిలిన వాళ్లూ వాహనాలు చూసుకుని అతన్ననుసరించారు. ఓఘవతి అనే ఒక పుణ్యనది దగ్గర్లో వుంటే దాని తీరాన ఆ రాత్రికి విడిది చేశారు వాళ్లు.


ఇంతలో ధర్మరాజు, తము అధర్మమార్గాన దుర్యోధనుణ్ణి పడగొట్టిన విషయం విని గాంధారి తమని శపిస్తుందని భయపడి ఆమెని శాంతింపజెయ్యటానికి కృష్ణుణ్ణి హస్తినకి వెళ్లమని ప్రార్థించాడు. కృష్ణుడా పనికి ఒప్పుకుని వెంటనే బయల్దేరి వేగంగా ధృతరాష్ట్ర మందిరానికి వెళ్లి తన రాకని చెప్పిపంపి అతని అనుమతితో లోపలికి ప్రవేశించాడు. అప్పటికే అక్కడ వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని ఓదారుస్తూ కనిపించాడు. కృష్ణుడు వినయంగా అతనికి సాష్టాంగనమస్కారం చేశాడు. ధృతరాష్ట్ర గాంధారులకు ప్రణామాలు చేశాడు.


వ్యాసుడు కులపతి గనక ఆయన ఎదట నేలమీదే కూర్చుని వున్నాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు వెళ్లి తనూ అతని పక్కన కూర్చుని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని అనునయిస్తూ కళ్లనుంచి దుఃఖబాష్పాలు రాలుతుండగా బిగ్గరగా విలపించాడు. తర్వాత ఆ దగ్గర్లో వున్న కనకకలశాల నీళ్లతో ముఖం కడుక్కుని ఎలుగు రాచిన గొంతుతో “అయ్యయ్యో, అకారణంగా వంశమంతా నాశనం ఐపోతున్నది. మహాత్ములు పాండవులు ఈ పరిస్థితి రాకుండా వుండటానికి ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయారు. అప్పటికీ సంధి కూర్చమని నన్ను పంపటం, అప్పుడు జరిగిన సంగతులన్నీ నీకు తెలిసినవే. ఐనా, జూదాలు ఆడటం, వాటిలో గెలవటం కొత్త విషయాలా, కాని గెలిచినంత మాత్రాన పుణ్యకాంతల్ని జుట్టుబట్టి కొలువులోకి ఈడ్పించి గుడ్డలూడదియ్యబోవటం ఎప్పుడైనా ఎక్కడైనా విన్నామా, కన్నామా? అంత జరిగినా కూడా పాండవులు పన్నెండేళ్లు అడవుల్లో తిరిగారు, ఏడాది పాటు విరాటుడి రాజ్యంలో పడరాని పాట్లు పడ్డారు. అంతా అయాక ఒక్కొకరికి ఒక్కో ఊరిస్తే చాలునన్నారు. దానిక్కూడా ఒప్పుకోలేదే నీ కొడుకులు? నువ్వూ వాళ్లకి వంత పాడావు గాని విదురాది మహనీయులు వెయ్యిమంది చెప్పిన మాటలు పెడచెవిన పెట్టావ్. కాలోపహతులు మేలేదో కీడేదో తెలుసుకోలేరు గదా, ఇప్పుడిక అనుకుని ప్రయోజనమేమిటి? పాండవులు కల్మషం లేనివాళ్లు, నీపట్ల ఆదరణ వున్నవాళ్లు. నీకు నమస్కరించి వేడుకుంటా, వాళ్ల మీద మీరు కోపం వుంచుకోవద్దు. నీకూ గాంధారికీ ఇక పరలోకక్రియా కలాపాలు చేసేదీ వాళ్లేనని గుర్తుంచుకో. వాళ్లకి శుభం కలగాలని కోరుకో. జరిగినదానికి ధర్మరాజు ఎంతగా బాధపడుతున్నాడో మాటల్లో చెప్పటం అసాధ్యం” అని ధృతరాష్ట్రుడితో చెప్పి, గాంధారి నుద్దేశించి ఇలా అన్నాడు కృష్ణుడు.


“రాజలోకంలో ఎక్కడా నీలాంటి మహాగుణవతి మరొకరు లేరు. రాజులంతా వింటుండగా కొడుక్కి ఎన్నో మంచిమాటలు చెప్పావ్, అది నా మనసుకి నాటి ఇప్పటికీ ఎప్పుడూ గుర్తొస్తూనే వుంటుంది. లోకవృత్తం సరిగా తెలీని చపలుడు గనక దుర్యోధనుడు ఆ మాటలు పెడచెవిని పెట్టి పరిస్థితులు ఇక్కడికి తీసుకొచ్చాడు. నువ్వప్పుడే చెప్పావ్ నీ మాటలు వినకపోతే కీడు జరుగుతుందని, విన్నాడా? సరిగ్గా నువ్వు చెప్పినట్టే జరిగింది. ఇందులో పాండవుల తప్పు లేదని నీకు తెలుసు. వాళ్ల మీద నీకు కోపం వద్దు. నువ్వలిగి చూస్తే త్రిలోకాలు భస్మం ఔతయ్. నిన్ను ప్రార్థిస్తున్నా, వాళ్ల మీద దయచూపు”. దానికామె, “ఔను, నువ్వన్నది నిజమే” అని ఒప్పుకుని, “ఇక ఈ అంధుడు, వృద్ధుడు, దీనుడైన రాజుకి నువ్వూ పాండవులే దిక్కు” అని చీరచెంగు మొహానికి అద్దుకుని బిగ్గరగా ఏడ్చింది. సాంత్వన వాక్యాల్తో ఆమెని, ధృతరాష్ట్రుణ్ణి సముదాయించాడు కృష్ణుడు.


ఇంతలో అతనికి హఠాత్తుగా అశ్వత్థామ, అతని పౌరుషం గుర్తుకొచ్చినయ్. దిగ్గున లేచాడు. వ్యాసుడికి, ధృతరాష్ట్రుడికి ప్రణమిల్లి అతనితో “అశ్వత్థామకి పాండవుల మీద అమితకోపం వస్తుంది, ఆ కోపంలో అతనేం అఘాయిత్యం చేస్తాడో ! నేను త్వరగా వెళ్లాలి, నాకు అనుమతివ్వండి” అంటే వాళ్లంతా నిజమేనని అతన్ని వీడ్కొలిపారు. వ్యాసుడు ఇంకొంత సేపు వాళ్లతో ఉండి కృష్ణుడి మాటల ప్రకారం చెయ్యమని ఉపదేశించి అంతర్థానమయాడు.


కృష్ణుడు అతివేగంగా ప్రయాణించి ఓఘవతీ తీరానికి చేరుకుని తను చేసివచ్చిన పని ధర్మరాజుకి వివరించాడు. దుర్యోధనుడు పడ్డ విషయం వాళ్లకింకా తెలియదని, తనూ చెప్పలేదని, ఏదో చుట్టపుచూపుగా వచ్చినట్టు ప్రవర్తించి ఈ యుద్ధమంతటికీ దుర్యోధనుడే కారణమని, పాండవుల మీద ఎలాటి కోపమూ తెచ్చుకోవద్దని మెత్తగా చెప్పి వాళ్లని శాంతపరిచానని క్లుప్తంగా వినిపించాడు.


వైశంపాయనుడు ఇదంతా జనమేజయుడికి చెప్పి ఇక సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్న కథనాన్ని మళ్లీ కొనసాగించాడిలా –


పాండవులు దుర్యోధనుడున్న మడుగు దగ్గరకి వచ్చేటప్పటికి నేను ఆ దగ్గర్లోనే ఉన్న ఒక పొదలో నక్కిచూస్తున్నానని చెప్పా కదా, దుర్యోధనుణ్ణి బయటికి రప్పించి వాళ్లంతా పొలికలనికి నడిచి వెళ్లేప్పుడు నేనూ వాళ్ల వెనకే అక్కడికి వెళ్లా. ఆ తర్వాత అతను తొడలు విరిగి పడ్డాక పాండవపక్షం వాళ్లంతా సంబరాలు చేసుకుంటూ అక్కణ్ణుంచి వెళ్లారని కూడ చెప్పానిదివరకే.


అప్పుడు నేను ఏడుస్తూ దీనంగా మట్టిలో పడివున్న నీకొడుకు దగ్గరికెళ్లా. అతను నన్ను చూసి కన్నీళ్లు కారుస్తూ “చతుస్సముద్రవేలావలయితమైన సామ్రాజ్యాన్ని పాలిస్తుండగా చూసిన కళ్లతోటే నన్నీ హీనస్థితిలో చూస్తున్నావ్, విధివైపరీత్యం ఏమని చెప్తాం? ఐతే, యుద్ధంలో పాండవులు చేసిన అధర్మాలన్నీ మనవాళ్లందరికీ వివరించి చెప్పాలి నువ్వు. మన మహారాజు, రాణులు యుద్ధపుతగువులు తీర్చగలుగుతారు. వాళ్లకి ప్రత్యేకించి చెప్పాలి నువ్వు, పాండవులెలా ఇంతకుముందు భీష్మ, ద్రోణ, భూరిశల్య, కర్ణుల్ని అధర్మమార్గాన చంపారో, ఇప్పుడు నన్నెలా పాపకర్ముడై భీముడు తొడల మీద కొట్టాడో. అలాగే అశ్వత్థామ, కృప, కృతవర్మలకి కూడ ఈ విషయాలన్నీ వివరించి చెప్పు. పాండవులని మించిన మోసకారులు ఈ భూమ్మీద లేరని, చేతిలో గుండెకాయ పెట్టినా వాళ్లని నమ్మొద్దని నామాటగా చెప్పు. దుర్యోధనుడు ఎవరికీ తలవంచకుండా జీవించి, పదకొండక్షౌహిణుల సైన్యాన్ని శాసించి, బంధువుల్ని, మిత్రుల్ని ఎంతో సమ్మానించి, చివరికి శమంతకపంచక స్థలంలో వీరమరణం పొంది ఉన్నతగతులకి వెళ్తున్నాడని చెప్పు” అని అప్పగింతలు పెట్టాడు నాకు.


ఇంతలో అతని గురించి విని ఆ చుట్టుపక్కల వాళ్లు ఎంతోమంది దుర్యోధనుణ్ణి చూట్టానికి వచ్చారు. వాళ్లందరికీ అవే మాటలు చెప్పి పాండవుల దుష్కృత్యాల్ని వినిపించాడతను. వాళ్లదంతా విని ఏడుస్తూ వెళ్లారు, వాళ్లలో కొందరు అశ్వత్థామ, మిగిలిన వాళ్లు ఎక్కడున్నారో కనుక్కుని వాళ్లకీ వార్తనందిస్తే ఆ రథికత్రయం పరుగుపరుగున రారాజు దగ్గరికి వచ్చింది.


దూరాన్నుంచే దుర్యోధనుణ్ణాస్థితిలో చూసి దుఃఖిస్తూ, వణుకుతూ వచ్చి అతని చుట్టూ కూర్చున్నారు ముగ్గురూ. అశ్వత్థామ అతని దీనదశకి పెద్దగా రోదించాడు. దుర్యోధనుడతన్ని ఓదార్చాల్సొచ్చింది. వాళ్లు అతన్ని వదిలి వెళ్లాక జరిగిన వ్యవహారమంతా చెప్పమని నన్ను పురమాయిస్తే అంతా వాళ్లకి వివరించి చెప్పాన్నేను. అంతా విని అశ్వత్థామ ప్రళయకాల లయకారుడిలా కోపంతో ఊగిపోయాడు. “ఆ దుర్మార్గులు నా తండ్రిని దారుణంగా చంపినప్పుడు కూడ నాకింత కోపం కలగలేదు. ఇప్పుడే వెళ్లి నా మహోగ్రాస్త్ర పరంపరల్తో ఆ పాండవుల్ని, పాంచాల బలగాల్తో సహా మట్టుబెట్టి వస్తా, ఇదే నీకు మాటిస్తున్నా, నన్ను పంపు” అని కురురాజు అనుమతి కోరాడతను.


ఆ మాటలకెంతో ఆనందించాడు దుర్యోధనుడు. కృపాచార్యుణ్ణి ఓ కలశంలో నీళ్లు తెమ్మని కోరాడు. అతను మమ్మల్ని చూట్టానికి వచ్చి వున్న ఆశ్రమ మునికుమారుల్ని ప్రార్థించి కలశం తెప్పించి దాన్నిండా నీళ్లు నింపి తెచ్చాడు. ఆ నీళ్లతో అశ్వత్థామని తన సేనాపతిగా అభిషేకించమని కోరాడు దుర్యోధనుడు. అతనలాగే చేశాడు. అశ్వత్థామ ఆ గౌరవానికి పులకించిపోయి దుర్యోధనుణ్ణి ప్రీతిగా కౌగిలించుకుని సింహనాదం చేశాడు.


కృప, కృతవర్మలు చెరోపక్క నడవగా మహోగ్రరూపంతో పాండవశిబిరాల వైపుకి బయల్దేరాడు అశ్వత్థామ.


వాళ్లలా వెళ్లి శిబిరాల దాపుకి వచ్చేసరికి అక్కడంతా కోలాహలంగా వుంది. యుద్ధంలో జయం కలిగిన సంరంభంలో అంతా ఆడుతూ పాడుతూ తింటూ తాగుతూ తిరుగుతున్నట్టనిపించింది వాళ్లకి. ఆ సమయంలో అక్కడికి వెళ్తే వాళ్లంతా కలిసి మూకకట్టుగా మీదపడే అవకాశం వుందని గ్రహించి ముందుగా ఎక్కడైనా దూరంగా వెళ్లి కర్తవ్యం ఆలోచిద్దామని వాళ్లు అడవిలో కొంతదూరం ప్రయాణించి అక్కడొక మడుగు దగ్గర ఆగారు. సూతులు గుర్రాల్ని నీళ్లకి వదిలారు.


సూర్యాస్తమయం ఐంది. సాంధ్యసమయ కృత్యాలు నిర్వర్తించి ఒక మర్రిచెట్టు దగ్గర కూర్చున్నారు ముగ్గురూ. ఆకాశాన చుక్కలు పొడిచినయ్, వాళ్ల మనసుల్లో విషాదమేఘాలు కమ్ముకున్నయ్. తమ సైన్యంలో మహావీరులంతా ఎలా మరణించారో తల్చుకుంటూ వాళ్ల గురించి మాట్లాడుకుంటూ అలాగే నేల మీద ఒరిగారు. బాగా అలిసిపోయినందువల్ల కృపుడు, కృతవర్మ అలాగే నిద్రలోకి జారిపోయారు. అశ్వత్థామ మాత్రం కోపాతిశయం వల్ల నిద్రరాక పైకి చూస్తూ పడుకున్నాడు.


అతనలా చూస్తుండగా చీకటిముద్దలాటి ఒక గుడ్లగూబ ఎగురుతూ వచ్చిందక్కడికి. ఆ చెట్టు మీద అనేక కాకిగూళ్లున్నయ్. గుడ్లగూబ మెల్లగా శబ్దం చెయ్యకుండా ఆ గూళ్ల దగ్గరికి చేరి మంచి నిద్రలో వున్న ఆ కాకుల్ని కొన్నిటికి గొంతులు పిసికి, కొన్నిటికి కాళ్లు విరిచి, కొన్నిటి రెక్కలు పీకి, కొన్నిటి పొట్టలు చీల్చి, కొన్నిటిని నోట్లో వేసుకుని ఎముకలు నమిలి, అన్నిట్నీ స్వాహా చేసేసింది. అంతా అయాక ఆనందంగా ఒళ్లు విరుచుకుని రెక్కలు కొట్టింది.


అశ్వత్థామ అదిచూసి ఉత్తేజితుడయ్యాడు. “ఈ పక్షి నాకు ఉపదేశమివ్వటానికే వచ్చిందిలా. నిద్రలో వున్న నా శత్రువుల్ని చంపే మార్గం ఇదే, ఇంతసేపూ నాకు తట్టనే లేదు. రారాజుకి నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఇదొక్కటే దారి. నేరుగా వెళ్లి తలపడి పాండవులంత శక్తివంతుల్ని జయించటం నాకు సాధ్యమయే పని కాదు. పైగా ఇప్పుడు కాదు, తర్వాత వాళ్లని ఎలాగోలా చంపుదామంటే అప్పటిదాకా దుర్యోధనుడు బతికుండకపోవచ్చు. వేరేదారి లేనప్పుడు నిద్రలో వున్న శత్రువుల్ని చంపటం శాస్త్రసమ్మతం కూడాను. ఇదే తక్షణకర్తవ్యం” అని నిర్ణయించుకుని మామని, కృతవర్మని నిద్రలేపాడు అశ్వత్థామ.


అలాటి ఆతురతరుణాన సైతం నిద్రావశులైనందుకు లజ్జ పడుతూ లేచారు వాళ్లు. అశ్వత్థామ వాళ్లకి పాండవుల ఘోరాల్ని మరోసారి గుర్తుచేసి, “ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి” అనడిగాడు. దానికి కృపాచార్యుడు “ఏపనికైనా సాహసంతో పాటు దైవబలం కూడ తోడు రావాలి. ధర్మం తప్పని పనికి దైవం సాయం చేస్తుంది. కనక మనం తొందర పడకుండా ఏం చేసినా ధర్మమార్గాన చేద్దాం. దుర్యోధనుడు అవివేకి, మంచివాళ్లైన పాండవుల్ని అవమానాల పాలు చేశాడు, ఎవరి మాటలూ వినక ఇంత చేటు తెచ్చిపెట్టుకున్నాడు. మనం ముందు హస్తినకి వెళ్లి ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు కలిసి ఆలోచించి ఏం చెయ్యమని మనల్ని ఆజ్ఞాపిస్తారో అలా చేద్దాం” అని సలహా ఇచ్చాడు.


అశ్వత్థామకది రుచించలేదు. “ఈ ధర్మపన్నాలకిది సమయం కాదు. దివ్యాస్త్రమహిమోన్నతుడైన తండ్రిని యుద్ధంలో అధర్మంగా చంపిన నీచుడు సంబరాలు చేసుకుంటుంటే శాంతంగా వుండటం నావల్ల కాదు. యుద్ధంలో గెలిచామని ఆదమరచి ఆయుధాల్లేకుండా నిర్భీతిగా నిశ్చింతగా నిద్రపోతుంటారు శత్రువులంతా. వాళ్లని ముక్కలుముక్కలుగా నరకటానికి ఇంతకుమించిన మంచితరుణం దొరకదు. నేను వెళ్లి నా శస్త్రాస్త్రాల్తో ధృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాలయోధుల్ని, పాండవుల్ని కత్తికో కండగా నరికి పోగులు పెట్టి అప్పుడు శుచినై వెళ్లి నా తండ్రికి అంత్యక్రియలు చేస్తా. ఇదే నా నిశ్చయం” అని తేల్చిచెప్పాడతను.


కృపుడు అతన్ని అనునయిస్తూ “తప్పకుండా శత్రువుల్ని జయిద్దాం, నీ మాటకి తిరుగులేదు. ఐతే బాగా అలిసిపోయివున్నావ్, సరిగా నిద్రలేదు. కాసేపు పడుకో. తెల్లవారగానే లేచి వెళ్దాం, శత్రువుల అంతు చూద్దాం. దివ్యాస్త్రవిదుడివి నువ్వు, బాహుబలంలో కూడ నీకు దీటెవరూ లేరు. రెండో ద్రోణుడివి. కృతవర్మా, నేనూ కూడ తక్కువ వాళ్లం కాదు. మనం ముగ్గురం కలిసి కృతనిశ్చయులమై మీద పడితే ఎలాటి సైన్యాలూ మనల్ని అడ్డుకోలేవు. కాబట్టి నువ్వు ధనువుని పక్కనబెట్టి కవచం తీసేసి కాసేపు హాయిగా నిద్రపో. పొద్దున్నే వెళ్లి వాళ్లో మనమో తేల్చుకుందాం” అని బోధించాడతనికి.


అశ్వత్థామ “మామా, నా మంచికోసమే నువ్వింతా చెప్తున్నావ్. ఐనా, మనం లేనప్పుడు మనరాజుని శత్రువులు ధర్మవిరుద్ధంగా కొట్టిన తీరు వింటే రాతిగుండెల వాళ్లకైనా కన్నీళ్లు కరుగుతయ్. అతను నాకు మిత్రుడు, ఎంతో మంచి చేసినవాడు. నేనిలా సిగపువ్వాడకుండా వుంటే అతనలా అన్నిపాట్లు పడటం విన్న నాకు నిద్రెలా వస్తుంది చెప్పు? పైగా పగలు వెళ్లి పాండవులతో తలపడదామంటావే, కృష్ణార్జునుల రక్షణలో వున్న వాళ్లని జయించటం ఎవరివల్లౌతుంది? ఇలా రాత్రివేళ వెళ్లి చంపటం తప్ప వేరే మార్గం లేదు. నా మనసు మార్చటానికి ప్రయత్నించకు. వాళ్లందర్నీ చంపి వచ్చాకే నాకు నిద్ర” అని బదులిచ్చాడు.


కృపాచార్యుడు వదలకుండా “నిద్రపోయేవాళ్లు పీనుగుల్తో సమానం. అలాటివాళ్లని చంపితే నరకానికి పోతావ్. మహాస్త్రవిదుల్లో మేటివే, ఇంతవరకు ఎలాటి మచ్చలేని వాడివే, ఇప్పుడీ దారుణమైన పని చెయ్యటం నీకు తగదు. సూర్యోదయమయాక సూర్యతేజుడివై శాత్రవవధ చేద్దువు” అని మళ్లీ చెప్పాడతనికి. అశ్వత్థామకి ఓర్పు పూర్తిగా నశించింది. “దయచేసి నాకింకేమీ చెప్పొద్దు. యుద్ధంలో జరిగిన అధర్మాలు తల్చుకుంటుంటే నా మనసు కుతకుతలాడుతుంది. నేను చెయ్యబోయే పని వల్ల నాకు కీటకజన్మ వచ్చినా పరవాలేదు, నేను అన్నిటికీ సిద్ధమే” అని కృతనిశ్చయుడై దిగ్గున వెళ్లి రథం ఎక్కాడు.


అతన్ని వారించటం అసంభవమని తేలిపోయింది కృపుడికి. “మమ్మల్ని వేరుగా చేసి నువ్వొక్కడివే వెళ్లటం భావ్యం కాదు. రారాజు పనికి ముగ్గురమూ ఒకే అభిప్రాయంతో వుందాం. మేమూ నీతో పాటే” అన్నాడతనితో. అశ్వత్థామ ఆనందించాడు. “ముందుగా నేవెళ్లి ధృష్టద్యుమ్నుణ్ణి కుక్కచావు చంపుతా. మీరూ మీకు తోచిన విధంగా చేద్దురు గాని, పదండి” అని కదిలాడు. పాండవసేనా శిబిరాల్ని కార్చిచ్చులాగా కాల్చటానికి బయల్దేరారా ముగ్గురు రథికులు.


ముగ్గుర్లోనూ ముందుగా శిబిరాల దగ్గరికి చేరుకున్నాడు అశ్వత్థామ.


అప్పుడొక మహాభూతం అతని ఎదుట నిలబడింది. అది విలాసంగా బుజమ్మీద వేసుకున్న శార్దూలచర్మం నుంచి ఇంకా రక్తం కారుతూనే వుంది. మహాసర్పాలు జంధ్యాల్లాగా వేలాడుతున్నయ్. విశాలమైన నోట్లోంచి వికృత నిశిత దంష్ట్రలు వెళ్లుకొచ్చినయ్. వేలకొద్ది కళ్లు వెలుగులు చిమ్ముతున్నయ్. ఒకేసారి ఉగ్రంగా, సుందరంగా, ఉజ్జ్వలంగా ఉన్న ఆ భూతం ఎవరూ కన్నదీ విన్నదీ కాదు. దాన్ని చూస్తే కొండలకైనా భయం వెయ్యాల్సిందే. దాని నోరు, కళ్లు, ముక్కులు, చెవులు అన్నిటినుంచి మంటలెగిసి మింటినంటుతున్నయ్. దాని తేజోపుంజాన్నుంచి శంఖ, చక్ర, గదా హస్తులైన విష్ణురూపులనేకులు బయటికి వస్తున్నట్టనిపించిందతనికి.


ఆ భయంకరాకారాన్ని చూసి ఏమాత్రం భయపడలేదు అశ్వత్థామ. వింటిని సారించి భల్లముఖ బాణవర్షాన్ని కురిపించాడు. ఐతే భూతం అన్నిటినీ అనాయాసంగా మింగేసింది. ఒక ఉగ్రశక్తిని విసిరాడతను. అది భూతానికి తగిలి విస్ఫోటనాలు రగిలిస్తూ ముక్కలుముక్కలై నేలరాలింది. మహోగ్ర ఖడ్గాన్ని బలంగా విసిరాడు. అదా భూతాన్ని తాకి దూదిపింజలా ఎగిరిపడింది. తోమరాల్ని, చక్రాల్ని ఎడతెగకుండా ప్రయోగించాడు. చిరునవ్వుతో వాటన్నిటిని గుటుక్కున మింగింది భూతం. అతను తగ్గకుండా మహాశక్తివంతమైన గదని బాహుబలమంతా ఉపయోగించి వేశాడు. సునాయాసంగా దాన్నీ మింగింది భూతం.


అశ్వత్థామకి ఇంకేం చెయ్యాలో తోచలేదు. ఇది తను చెయ్యబోతున్న అధర్మకార్యానికి దైవం కలిగిస్తున్న ఆటంకమా అని కాసేపు సందేహించాడు. దృఢచిత్తంతో శివుణ్ణి ధ్యానించాడు. రథం దిగి నేలమీద కూర్చుని మహాశివ ప్రార్థన చేశాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తే భూతనాథుణ్ణి నానా భూతోపహారాల్తో అర్చిస్తానని భావించుకున్నాడు. అతనికెదురుగా ఒక బంగారు వేదిక తోచింది. దాన్లో అగ్ని ప్రజ్జ్వరిల్లుతుంది. శివుడికి ఆత్మసమర్పణం చెయ్యటానికి నిశ్చయించుకున్నాడతను.


అతని నిశ్చయాన్ని పరీక్షించటానికా అన్నట్టు అనేక వికృతాకారులు అతనికి కనిపించారు. మృగాల శిరసులు, రకరకాల శరీర వర్ణాలు, వేలంత పొడవు నుంచి పర్వతాలంత వున్నవాళ్లు, అన్ని రకాల వికృతులూ వాళ్లలో వున్నయ్. వాళ్లు ఆడుతూ పాడుతూ తాగుతూ గెంతుతూ కపాలాల బంతులాడుతూ వికృతశబ్దాలు చేస్తూ అగుపించారు. అశ్వత్థామ ఎలాటి భయమూ లేకుండా చిరునవ్వుతో రథమ్మీది కోదండం అందుకుని దాని సాయంతో ఆ కుండం లోని చిచ్చులోకి దూకాడు. తన శరీరాన్ని కాల్చటానికి సరిపడే ఇంధనం అక్కడ లేకపోవటాన్ని గుర్తించి తిరిగి రథమ్మీదికి వచ్చి అక్కడున్న ఆయుధాలన్నీ కుండంలో వేసి అవి భగభగమండుతుంటే మహాదేవుణ్ణి ధ్యానిస్తూ ఊర్ధ్వబాహుడు, మహితాకారుడు, ఘనసమాధినిష్టుడు ఐ దాన్లో తిరిగి దూకాడు.


అలా దూకినా అతన్ని అగ్ని అంటనేలేదు. శివుడు ప్రత్యక్షమై ప్రీతితో అతన్ని పలకరించి “కృష్ణుడు నాకు, నేను అతనికి ప్రియం చేసేవాళ్లం కనక భూతరూపంలో నీకు అడ్డం వచ్చాను. నీ ధైర్యాన్ని పరీక్షించటానికి ఇలా అనేక రూపాల్లో ప్రయత్నించాను. కృష్ణుడికి నా కర్తవ్యం నెరవేర్చాను. పాంచాలురందరికీ కాలం తీరింది. ఇదిగో ఈ మహనీయ ఖడ్గం ఈ పనిలో నీకు సహకరిస్తుంది” అని ఒక ఉజ్జ్వలమైన ఖడ్గాన్నతనికిచ్చి అతనికి తెలియకుండా తేజోరూపంలో అతన్నావేశించాడు భూతనాథుడు. భూతం మింగిన ఆయుధాలన్నీ యధాపూర్వంగానే అతని రథం మీద వున్నయ్. రథం ఎక్కి శిబిరాన్ని చేరాడతను. ఇంతలోనే కృప కృతవర్మలు కూడ వచ్చి కలుసుకున్నారు.


అనేక శరాసనాలు, ఆయుధాలు తన రథం మీద వేసుకుని లోపలికి ప్రవేశించాడు అశ్వత్థామ. వాళ్లిద్దర్నీ వాకిలి దగ్గరే వుంచి బయటికి వచ్చే వాళ్లని నిర్దాక్షిణ్యంగా చంపమని చెప్పాడు. అదివరకు చారులు చెప్పినప్పుడు తను విన్న గుర్తుల ఆధారంగా ముందుగా ధృష్టద్యుమ్నుడి మందిరం వైపుకి కదిలాడు.


పగటి యుద్ధాన అలిసి పోయి, శత్రువులంతా చచ్చారని భయం తీరి, శిబిరాల్లో ఆదమరిచి నిద్రపోతున్నారంతా. దారి చూసుకుంటూ మెల్లమెల్లగా సాగాడు అశ్వత్థామ. ధృష్టద్యుమ్నుడి మందిరం ప్రవేశించాడు. అక్కడ అందమైన తెరలు వేలాడుతున్నయ్, మేలైన చాందినీలు మెరుస్తున్నయ్, దివిటీలు వెలుగులు చిమ్ముతున్నయ్. మెత్తటి పాన్పు మీద గాఢనిద్రలో వున్నాడు గురుద్రోహి. పట్టరాని క్రోధంతో పాదాల్తో నేలని తన్ని వాణ్ణి నిద్ర లేపాడు అశ్వత్థామ. ధృష్టద్యుమ్నుడు దిగ్గున లేచాడు గాని గాఢనిద్ర మూలాన అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదతనికి.


అశ్వత్థామ విల్లు పక్కన పెట్టి అతని మీద లంఘించి జుట్టు పట్టుకుని మెడని వెనక్కి విరిచి కిందికి ఈడ్చిపారేశాడు. రొమ్ముని మోకాల్తో మోదాడు. గుద్దుల్తో మొహాన్ని పచ్చడి చేశాడు. ధృష్టద్యుమ్నుడు అచేతనంగా పడ్డాడు. కళ్లు తేలేసి చూస్తున్నాడు. అశ్వత్థామ వింటిని తీసుకుని దాని తాటిని ఊడలాగాడు. ధృష్టద్యుమ్నుడి మెడకి చుట్టి మెలిపెట్టాడు. రొమ్ముని మెడని రెండుకాళ్లతో కుమ్ముతూ పైశాచికంగా తాటిని లాగసాగాడు. ధృష్టద్యుమ్నుడికి ఊపిరాడటం లేదు, కెక్కుకెక్కుమని శబ్దాలు తప్ప నోట మాట పలకటం లేదు. అతికష్టం మీద పదం పదం చొప్పున “బాణంతో చంపి నన్ను పుణ్యగతికి పోనివ్వు, ఎంత పగవాడినైనా ఇది కనీసధర్మం” అనగలిగాడు. అశ్వత్థామ కరగలేదు. “గురుద్రోహివి, నీకు ఉత్తమగతులా? కుత్సితంగా చంపావ్ నా తండ్రిని, నిన్నూ అలాగే చంపుతా” అని అతని గొంతు నులుముతుంటే అక్కడ వున్న వాళ్లంతా నిద్రలేచీ భయంతో నిశ్శబ్దంగా వుండిపోయారు. ధృష్టద్యుమ్నుణ్ణి కాళ్లతో, పాదాల్తో, ముష్టిఘాతాల్తో గుద్దిగుద్ది క్రూరంగా చంపాడు. గిలగిల కొట్టుకుని నెత్తురు కక్కుకుంటూ గాల్లో కలిశాడతను.


అలా అతన్ని చంపి పగదీర్చిన తృప్తితో అల్లెతాటిని తీసి వింటికి అమర్చాడు. ఒక బాణాన్ని సంధించి బైటికొచ్చి చిరునవ్వుతో రథం ఎక్కాడు. ముఖ్యమైన వాళ్ల మందిరాల కోసం చూస్తూ కదిలాడు.


ఇంతలో ధృష్టద్యుమ్నుడి మందిరంలో గగ్గోలుగా ఏడుపులు లేచినయ్. చుట్టుపక్కల వాళ్లంతా లేచి ఏమైందని పరిగెత్తుకొచ్చారు. “మనిషో రాక్షసుడో తెలీదు, ఎవడో ఒక్కడే వచ్చి ధృష్టద్యుమ్నుణ్ణి చంపి రథమ్మీద వెళ్తున్నాడు” అని చెప్పారు అక్కడివాళ్లు. చేతికి దొరికిన ఆయుధాలు తీసుకుని అశ్వత్థామ వెంటపడ్డారు కొందరు. అతను అదొక ఆటలా వాళ్లందర్నీ తన బాణాలకి బలిచ్చాడు. అక్కణ్ణుంచి ఉత్తమౌజుడి మందిరం చేరాడు. శివుడిచ్చిన కత్తిని తీసుకుని లోపలికి వెళ్లాడు. అతను మేలుకుని పాన్పు మీదే వుంటే ధృష్టద్యుమ్నుడి లాగానే జుట్టుపట్టి కిందికి ఈడ్చి పడేసి అతన్ని చంపినట్టే పశువులాగా కొట్టి బాది చంపాడు. ఆ దగ్గర్లో మరో పాన్పు మీద నిద్రిస్తున్న యుధామన్యుడు అతన్ని ఎవడో రాక్షసుడనుకున్నాడు. ఐనా భయపడకుండా అశ్వత్థామనొక గదతో మోదాడు. ఆవేశంలో వున్న అశ్వత్థామ దానికేమాత్రం చలించకుండా వెనక్కి తిరిగి వాణ్ణీ వాడి అన్నని చంపినట్టే కొట్టి చంపాడు.


అలా ఆ అన్నదమ్ముల్ని వధించి రెట్టించిన ఉత్సాహంతో రక్తధారలు కారుతున్న కత్తితో ఒక్కో మందిరంలోకి వెళ్లి కనిపించిన వాళ్లని కనిపించినట్టే నరికేశాడు. నిద్రలో వున్న వాళ్లని, సగం మేలుకున్న వాళ్లని, లేచి ఆయుధాల్తో ఎదుర్కున్న వాళ్లని, తనతో పోరాడిన వాళ్లని – అందర్నీ ఒకేరీతిగా నరికి పోగులేశాడు. అక్కణ్ణుంచి ఏనుగులు, గుర్రాల శాలలకి దారితీశాడు. ఆ జంతువులన్నిట్నీ విచక్షణారహితంగా నానా అంగాలూ నరికాడు. పీనుగుపెంటలు పోశాడు. యుద్ధ సామాగ్రులు నిలవచేసే పెద్ద భవంతుల్లోకి వెళ్లి కనిపించిన వాళ్లందర్నీ కత్తికి బలిచ్చి నాశనం చేశాడు. అలా పక్కపక్కనున్న మందిరాల్లోకి నడిచెళ్లి, దూరంగా వున్న వాటికి రథం ఎక్కి వెళ్లి, క్షణక్షణానికి పెరుగుతున్న ఉత్సాహంతో విజృంభించి శత్రువుల రక్తంతో కత్తికి దాహం తీరుస్తూ సాగాడు. అప్పుడతను రక్తసిక్తమైన శరీరంతో నడుస్తున్న రాక్షసుడిలా వుంటే అతని కత్తి ఘోరాకారమైన రాక్షసిలా అతన్నంటిపెట్టుకుని వుంది. పాంచాల మందిరాలన్నీ తిరిగి దీక్షగా మారణహోమం సాగించాడతను.


అక్కణ్ణుంచి చేది సైన్యాలున్న చోటికి వెళ్లి అదే కార్యక్రమాన్ని కొనసాగించాడు. ఆ సైన్యాన్నీ సమూలంగా నాశనం చేసి పాండవులుండే రాజమందిరాల వైపుకి బయల్దేరాడు. అక్కడ శిఖండి, ద్రౌపదేయులు, ప్రభద్రక, మత్స్య బలగాల్ని సమకూర్చుకుని వచ్చి శస్త్రాస్త్రాల్తో అతన్ని తాకారు. లేళ్ల గుంపుని చూసిన సింహంలా అతను వాలూ కత్తితో వాళ్లమీదికి దూకాడు. చిత్ర విచిత్ర విన్యాసాల్తో ఆ బలాల్ని చెదరగొట్టి ధర్మరాజు కొడుకు ప్రతివింధ్యుణ్ణి రెండు ముక్కలుగా నరికాడు. అదిచూసి శోకంతో భీముడి కొడుకు శ్రుతసోముడు గుర్రాన్నెక్కి వచ్చి ఒక ఈటెతో అతన్నెదుర్కున్నాడు. అశ్వత్థామ లెక్కచెయ్యకుండా అతన్నీ, గుర్రాన్నీ ఒకే దెబ్బకి చంపాడు. నకులుడి కొడుకు శతానీకుడు భీకరమైన చక్రంతో అతని వక్షాన్ని రక్తం చిప్పిల్లేలా మోదాడు. దానికి తట్టుకుని నిలబడి బలమైన వేటుతో అతని తల నరికాడు అశ్వత్థామ. సహదేవుడి కొడుకు శ్రుతసేనుడు పరిగెత్తుకొచ్చి అతని మీద గద విసరబోతే అశ్వత్థామ వాడి మెడమీద తల లేకుండా చేశాడు. అర్జునుడి కొడుకు శ్రుతకీర్తి అతని మీద బాణవర్షం కురిపించాడు. అశ్వత్థామ ఆ బాణాలన్నిట్నీ అలాగే అతని శిరస్సునీ ఖండించాడు.


ఇలా ద్రౌపదేయులు ఐదుగురూ పరలోకాలకి ప్రయాణం కట్టటంతో ప్రభద్రకులు, శిఖండి వీరావేశంతో అతన్ని చుట్టుముట్టారు. అన్ని రకాల ఆయుధాల్ని అతని మీద ప్రయోగించారు. ఐతే అశ్వత్థామ ప్రభద్రకుల్ని నరుకుతూ వీరవిహారం చేశాడు. ఖడ్గంతో శిఖండి శిరస్సుని రెండు ముక్కలు చేశాడు. దొరలంతా అశ్వత్థామ దారుణవధల్లో క్రూరంగా మరణించినా వెనక్కితిరక్కుండా మిగిలిన సైన్యాలతనితో తలపడినయ్. కాని అతను శివమెత్తినట్టు దొరికిన వాళ్లని దొరికినట్టు అందిన అవయవాల్ని అందినట్టు ఖండిస్తూ చించిచెండాడుతుంటే నిలవలేక విచ్చిపోయినయ్. బతికిన వాళ్లు తలపాగాలు జారిపోతున్నా పట్టించుకోకుండా బయటికి పరుగులు పెట్టారు. అలా వాకిలి దగ్గరికి వచ్చిన వాళ్లని ఎంత ప్రాధేయపడుతున్నా వదలకుండా రాక్షసావేశంతో కృప కృతవర్మలు కత్తుల్తో, భల్లాల్తో ఊచకోత కోశారు, ఎవరూ ప్రాణాల్తో బయటపడకుండా చేశారు.


శిబిరంలో ప్రాణంతో వున్న జీవి లేకుండా చేసి సంతృప్తిగా బయటికి వచ్చాడు అశ్వత్థామ. ఒళ్లూ, కత్తీ శత్రువుల రక్తంలో మునిగివున్నయ్. కత్తి కూడ అతని శరీరంలో ఒక భాగం ఐంది.


అతను లోపలికి వెళ్లేముందు ఎంత నిశ్శబ్దంగా వున్నాయో ఇప్పుడూ అంతే నిశ్శబ్దంగా వున్నయ్ పాండవశిబిరాలు. అప్పుడే తెలతెలవారుతున్నది.


దుర్యోధనుడితో అన్న మాట అలా నిలుపుకున్న అశ్వత్థామ బయటికి వచ్చి కృప, కృతవర్మల్ని కలుసుకున్నాడు. “పాంచాలురంతా పరలోకాలకి పోయారు. పాంచాలి కొడుకులూ వాళ్లతో కలిశారు. చేది, మత్స్య, ప్రభద్రక బలాలు మనిషి మిగలకుండా మడిసినయ్. అసలు గుర్రం, ఏనుగు, మనిషి అని తేడా లేకుండా అన్నీ నాశనం ఐనయ్. పాండవులు ఐదుగురూ, కృష్ణుడు, సాత్యకి ఎటుపోయారో తెలీదు; తప్పించుకున్నారు. శివుడి అనుగ్రహం, మీ ఇద్దరి సహాయం మనకార్యాన్ని విజయవంతంగా పూర్తిచేయించినయ్” అని ఆవేశంగా చెప్పాడు వాళ్లతో.


ఐతే వాళ్లిద్దరూ రాక్షసుల్లా తము చేసిన నీచప్పని తల్చుకుని సిగ్గుపడుతూ అతని ఉత్సాహంలో పాలుపంచుకోలేకపోయారు. అతనికి తమ పశ్చాత్తాపం చూపించటానికి ఇష్టం లేక మొక్కుబడిగా మాత్రం అతన్ని పొగిడారు. ఈ విషయం అంతా వినటానికి దుర్యోధనుడింకా బతికే వున్నాడో లేడో అని హడావుడిగా అతని దగ్గరికి బయల్దేరారు ముగ్గురూ.


అక్కడ దుర్యోధనుడు చావుకి దగ్గర్లో వున్నాడు. ఊపిరి సన్నగిల్లుతున్నది. శరీరంలో కదలికలు తగ్గుముఖం పట్టినయ్. దిక్కులేక దీనంగా నేలమీదే పడి వున్నాడు. ఆ స్థితిలో అతన్ని చూసేసరికి వాళ్ల గుండెలు తరుక్కుపోయినయ్. రథాల మీంచి కిందికి దూకి ధనుస్సులు విసిరి పారేసి కన్నీళ్లు ధారలుగా కారుతుంటే అతన్ని చేరుకున్నారు. అతని శరీరాన్ని తాకిచూశారు. “రారాజా, మేం ఎవరమో గుర్తించగలవా?” అని ఏడుస్తూ పలకరిస్తే అతను అతికష్టం మీద కళ్లు తెరిచాడు. అతని వంకే చూస్తూ అశ్వత్థామ గద్గదకంఠంతో “గదాయుద్ధంలో నీతో సమానులెవరూ లేరని నిరూపించావ్, ఒక దుర్మార్గుడి అధర్మ వర్తనతో ఇలా నిస్సహాయుడివై నేల మీద పడ్డావ్. రాజధర్మాన్ని చివరివరకు నిర్వర్తించి పుణ్యలోకాలకి ప్రయాణం కట్టబోతున్నావ్. బలరాముడు తన శిష్యులందర్లో నువ్వే అగ్రగణ్యుడివని ఎప్పుడూ అంటుంటాడు, ఆ మాట నువ్వు నిలబెట్టావ్. అధర్మయుద్ధంలో నిన్ను ఓడించటానికి కృష్ణుడు, అర్జునుడు, భీముడు కలిసి కుట్రచెయ్యాల్సొచ్చింది. భీముడు చేసిన పనిని చూస్తూ కూడ అతన్ని దండించలేకపోయాడే ధర్మరాజు, అతనూ ఒక రాజేనా? పైకి వేషాలే గాని అతనికి లోపలంతా కుత్సితమే. ఇలాటి గెలుపు వల్ల వాళ్లు ఏం బావుకుంటారు? వాళ్ల కీర్తికి కళంకం తెచ్చిపెట్టుకున్నారు. నీకు యశస్సు, వాళ్లకి మాయని మచ్చ దక్కినయ్. లోకానికి నీ ఔన్నత్యం తెలిసింది.


నేను తిన్న తిండి, కట్టిన బట్ట, చుట్టాల పెట్టుపోతలు, చేసిన దానాలు, యాగాలు, అన్నీ నువ్విచ్చిన సంపదల మూలానే. ఇన్నాళ్లూ కొండంత అండగా నిలబడ్డ నువ్వు పుణ్యలోకాలకి పోతుంటే ఒళ్లు దాచుకుని బతికేవున్నా, నేనూ ఒక సేవకుణ్ణేనా? ఇప్పుడు నీతో రాలేకపోతున్నా నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోగలిగా, నీ విరోధుల్ని నాశనం చేశా. నువ్వు నా తండ్రిని చూసినప్పుడు తనకి ద్రోహం చేసిన ఆ నీచుడు ధృష్టద్యుమ్నుణ్ణి పశువుని చంపినట్టు చంపానని చెప్పు. నా బదులుగా ఆయన్ని నువ్వు కౌగిలించుకో. నీ చెవులకి అమృతం పోసేట్టు నేను చేసిన పని చెప్తా విను. రాత్రివేళ శత్రుశిబిరాలు ప్రవేశించి ముందుగా ఆ పాపాత్ముడు ధృష్టద్యుమ్నుణ్ణి పశువునిలా చంపా. తర్వాత వాడి చుట్టాలందర్నీ ఊచకోత కోశా. ద్రౌపది కొడుకుల్ని ఒక్కణ్ణి వదలకుండా వరసపెట్టి నరికా. ఆ ప్రదేశం అంతా పీనుగుల పెంటలు పోశా. ఏనుగులు, గుర్రాలు, మనుషులు అని చూడకుండా బతికున్న దాన్నల్లా చంపా. పాండవపంచకం, కృష్ణుడు, సాత్యకి నాకు దొరకలేదు గాని మిగతా వాళ్లు ఒక్కరు కూడ మిగల్లేదు. ఈ ఇద్దరు మహావీరులు నాకు తోడుగా ఈ మారణహోమాన్ని దిగ్విజయం చేశారు” అని వివరించాడు.


ఆ మాటలు విని దుర్యోధనుడికి ప్రాణం లేచొచ్చింది. నాలిక్కి బలం వచ్చింది. “నువ్వూ, ఈ యోధులు కలిసి నా శత్రువులకి కలిగించినంత నష్టం భీష్ముడు గాని ద్రోణుడు గాని కలిగించలేకపోయారు. మొనగాడనుకున్న కర్ణుడు గాని, అతన్ని కూడ మించిన శల్యుడు గాని సాధించలేని దాన్ని నువ్వు సాధించావ్. మీరు నాకు ప్రీతి కలిగించారు, కృతకృత్యులయారు. సుఖంగా జీవించండి. మళ్లీ స్వర్గంలోనే మన పునర్దర్శనం” అని చెప్పి తృప్తిగా కన్నుమూశాడు నీ కొడుకు.


వాళ్లతన్ని వదల్లేక వదల్లేక వదిలి దుఃఖంతో పొగుల్తూ రథాలెక్కి వెళ్లిపోయారు. తెల్లవారింది. వ్యాసుడు నాకిచ్చిన వరం దుర్యోధనుడి మరణంతో ముగిసిపోయింది. అక్కడ నేను చూసినదంతా నీకు వివరించి చెప్పటానికి నేనిలా వచ్చాను” అని తన భారతయుద్ధ కథనాన్ని ముగించాడు సంజయుడు.


“ఆ తర్వాత పాండవులు ఏం చేశారు?” అని వైశంపాయనుణ్ణి జనమేజయుడు కుతూహలంగా అడిగాడు. అతను ఇలా చెప్పుకొచ్చాడు.


సూర్యోదయం కావటంతో ధర్మరాజు తమ్ముల్తో కృష్ణ సాత్యకుల్తో కూర్చుని వున్నాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడి సారథి అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. అశ్వత్థామ ఒక్కడే శిబిరాల్లోకి వచ్చి ఎలా నిద్రలో వున్న అందర్నీ దయాదాక్షిణ్యాలు లేకుండా చంపి శవాల గుట్టలు పోశాడో వినిపించాడు. తను కృతవర్మ చేతిలో పడితే అతను సూతుడనే దయతో తనని వదిలేశాడని, అలా బతికి బయటపడి రాగలిగానని చెప్పాడు.


అదివిన్న ధర్మరాజు శోకావేశంతో మూర్ఛపోయి కిందపడ్డాడు. అందరూ కలిసి అతన్ని పట్టుకుని మూర్ఛతేర్చారు. అతను ఏడుపుగొంతుతో “శత్రువులందర్నీ, వాళ్ల బంధుమిత్రుల్తో సహా చంపి రాజ్యం సంపాయించామని ఇక్కడ నేను ఆనందిస్తుంటే అక్కడ మనవాళ్లందరూ విరోధుల చేతిలో మూకచావు చచ్చారు. నేను గెలిచినట్టా ఓడినట్టా? లోకం ఏమనుకుంటుంది? భీష్ముడి ప్రతాపాగ్ని జ్వాలల నుంచి బయటపడి, ద్రోణుడి సునిశితబాణపరంపరలకి తట్టుకుని, రాధాతనయుడి ఘోరాస్త్ర శస్త్రాలకి చిక్కకుండా నిలబడి, చివరికిలా కొందరు దుండగుల చేతుల్లో బిడ్డలంతా బలయ్యారే ! సముద్రమంతా దాటుకుని వచ్చి పిల్లకాలవలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నట్టయింది కదా. తండ్రి చావుతోనే దుఃఖిస్తున్న పాంచాలి ఇప్పుడు కొడుకులు, తమ్ముళ్లు అంతా ఒకేసారి మరణించారని విని ఎలా తట్టుకోగలుగుతుంది? తనకెప్పుడూ రానంత కష్టం ఇప్పుడు వచ్చిపడింది” అని ఎంతగానో బాధపడ్డాడు.


ద్రుపదుడు, విరాటుడు మరణించాక వాళ్ల భార్యల్ని అనునయించటానికి సుభద్రని, కోడళ్లని వెంటబెట్టుకు వెళ్లిన ద్రౌపది అప్పుడు ఉపప్లావ్యంలో వుంది. ధర్మరాజు నకులుణ్ణి పిలిచి మంచి త్వరితమైన గుర్రాల్ని తీసుకుని అక్కడికి వెళ్లి ద్రౌపదిని, ఆమె బంధువర్గంలోని స్త్రీలందర్నీ తీసుకుని విడిదులకి వెళ్లమని చెప్పాడు. వాళ్లక్కడికి చేరేసరికి ఇటునుంచి కూడ అందరమూ అక్కడికి చేరతామని చెప్పాడతనికి. నకులుడు బయల్దేరి వెళ్లాడు.


పాండవులు, కృష్ణుడు, సాత్యకి శిబిరాలకి వెళ్లి అక్కడ జరిగిన దారుణాన్ని కళ్లారా చూశారు. శవాలై వికృతాకారాల్తో పడున్న కొడుకులు, బంధువుల్ని చూసి పాండవులు, కృష్ణుడు మూర్ఛపోయారు. సాత్యకి అతిప్రయత్నం మీద అందర్నీ తెలివిలోకి తెచ్చాడు. కొడుకులు ఒక్కొక్కర్ని చూసుకుంటూ ధర్మరాజు గోలుగోలున ఏడ్చాడు. చివరికి ఏడుపు ఆపి కొడుకులు, బంధువులకి చెయ్యవలసిన అగ్నికార్యాలు చేశాడు. అందరూ ద్రౌపది రాక కోసం ఎదురుచూస్తున్నారు.


అక్కడ ద్రౌపది నకులుడి నుంచి కొడుకులు, తమ్ముల చావు గురించి విని గుండెలవిసేలా ఏడ్చింది. స్త్రీలంతా కలిసి విడిదులకి వచ్చారు. ద్రౌపది దూరాన్నుంచే ధర్మరాజుని చూసి ఆక్రందనలు చేస్తుంటే నకులుడామెని చెయ్యిపట్టి రథం దించాడు. మిగిలిన స్త్రీలు కూడ వాహనాలు దిగి ఆమెను చుట్టుకున్నారు. తూలుతూ కొన్ని అడుగులు వేసి పడిపోయింది ద్రౌపది. భీముడు పరుగున వెళ్లి ఆమెని పట్టిలేపి ధర్మరాజు దగ్గరికి ఎత్తుకెళ్లాడు.


అప్పుడామె అతిప్రయత్నం మీద లేచి నిలబడి కన్నీళ్లు ధారలుగా పారుతుంటే ” సామ్రాజ్యం దక్కింది, నా కొడుకులంతా నీకు చేదోడువాదోడుగా వుంటూ కళ్లెదుటే తిరుగుతుంటే చూద్దామనుకున్న నా కలలు కల్లలయినయ్. అమేయపరాక్రమశాలి సుభద్ర కొడుకూ యుద్ధానికి బలయ్యాడు. ఎన్ని భోగాలు కలిగినా వాటి కోసం బిడ్డల్ని పోగొట్టుకుంటామా? గాఢనిద్రలో వున్న నా కొడుకుల్ని నీచంగా చంపిన ఆ పాపాత్ముడు అశ్వత్థామ బతికుంటే నాకు శాంతి లేదు. ఇప్పుడే భీముణ్ణి పంపి వాణ్ణి చంపించకపోతే నేను ప్రాయోపవేశం చేసి మరణిస్తా, వేరే దారే లేదు” అని తెగేసి చెప్పింది ధర్మరాజుతో.


అతనూ “రాచబిడ్డలు యుద్ధంలో మరణించటం పుణ్యగతులకి దారి అని నీకు చెప్పనక్కర్లేదు. బిడ్డల కోసం బాధపడకు. ఆ పాతకుడు అశ్వత్థామని చంపటం నాకూ అభిమతమే. ఐతే వాడు అడవులు పట్టి పోయినట్టున్నాడు, వాణ్ణి చంపినట్టు నీకు తెలిసేదెలా?” అంటే ద్రౌపది “వాడి దగ్గర సహజమైన శిరోమణి ఉన్నదని విన్నా, దాన్ని తీసుకొచ్చి నాకు చూపిస్తే అప్పుడే నేను ప్రాణాల్తో వుంటా” అని నొక్కి చెప్పిందతనికి. భీముణ్ణి చెయ్యితట్టి “రాజధర్మం పాటించి వెళ్లి ఆ పాపిని చంపి రా. నా శోకాన్ని తగ్గించి ప్రాణాన్ని కాపాడు. లక్కయిల్లు కాలినప్పుడు చూపించిన పౌరుషాన్ని, మహోగ్రంగా అడ్డుకున్న హిడింబాసురుడి మీద చూపిన చొరవని, యక్షులు చుట్టుముడితే ఓడించి సౌగంధికా పుష్పాన్ని తెచ్చిన బాహుబలాన్ని, నీచ కీచకుడి మీద సాగించిన విక్రమాన్ని కలగలిపి, మనల్ని గెలిచానని విర్రవీగుతున్న ఆ అశ్వత్థామని మట్టిగరిపించు” అని అతన్ని ప్రోత్సహించింది.


అంతకు ముందు ధర్మరాజు ద్రౌపదితో అన్న మాటలు తను అశ్వత్థామ మీదికి వెళ్లటానికి అనుమతిగా అర్థం చేసుకున్నాడు భీముడు. వెంటనే రథాన్ని సిద్ధం చెయ్యమని నకులుణ్ణి కోరాడు. అతనూ అశ్వత్థామ అంతు చూడటానికి ఉవ్విళ్లూరుతూ రథం సిద్ధం చేసి, ఆయుధాల్ని ఎక్కించి తనే సారథ్యానికి పూనుకున్నాడు. ఇద్దరూ శిబిరాన్ని వదిలి రథాల గుర్తులు చూసుకుంటూ వెళ్లి దార్లో కనిపించిన వాళ్లని అశ్వత్థామ ఎటు వెళ్లాడో కనుక్కోసాగారు. అతను కృప, కృతవర్మల్తో కలిసి హస్తినాపురం వైపుకి వెళ్లి మళ్లీ గంగాతీరానికి తిరిగొచ్చి అక్కడ కృపుణ్ణీ, కృతవర్మనీ వదిలి తనొక్కడే వ్యాసమహాముని ఆశ్రమం వైపు వెళ్లి అక్కడే వుంటున్నాడని విన్నట్టు కొందరు చెప్పారు. అటు దారితీశాడు భీముడు.


అక్కడ భీముడిలా బయల్దేరిన వార్త విని కృష్ణుడు ధర్మరాజుతో “ఇలా భీముడొక్కడే అశ్వత్థామ మీదికెళ్లటం ప్రమాదకరం. ద్రోణుడు బ్రహ్మశిరోనామకం అనే దివ్యాస్త్రాన్ని అశ్వత్థామ కిచ్చాడు. అది భూమి మొత్తాన్ని దహించగలిగేంత శక్తివంతమైంది. అదే అస్త్రాన్ని అర్జునుడిక్కూడ ఇచ్చాడు. ఐతే అశ్వత్థామకి అర్జునుడి అస్త్రనైపుణ్యమంటే అసూయ వున్నదని, జాగ్రత్తగా వుండకపోతే అతను దాన్ని పాండవుల మీద ప్రయోగిస్తాడని భయపడ్డాడు ద్రోణుడు. అందుకని కొడుకుతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అస్త్రాన్ని మనుషుల మీద ప్రయోగించొద్దని, అలా చేస్తే తనకే గొప్ప అశుభం జరుగుతుందని వివరించాడు. ఎలాటి ఆపదలు వచ్చినా అది తప్ప వేరే ఉపాయాల్తో బయటపడమని నొక్కిచెప్పాడు. అంత చెప్పినా వీడు తన మాట వినడని లోపల అనుకున్న విషయం పైకే అనేశాడు. అది విని అశ్వత్థామ ఎంతో బాధపడ్డాడు కాని తండ్రి మాటల్ని మాత్రం పూర్తిగా మనసు కెక్కించుకోలేదు.


వీడెలాటివాడో చెప్పటానికి ఇంకో చిన్న ఉదాహరణ ఇస్తా. మీరు అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో ఒకసారి ద్వారకకి వచ్చి తనకి నా చక్రాన్నిస్తే తను నాకు బదులుగా బ్రహ్మశిరోనామకాన్ని ఇస్తానన్నాడు. ఎందుకంటే ఆ చక్రంతో ఈ యుద్ధంలో నన్నూ అర్జునుణ్ణీ ఓడించాలని వాడి కోరికట. దానికి నేనేమో, అతిథిగా వచ్చిన నీ దగ్గర నేనేమీ కోరను, నా ఆయుధాల్లో నీకు ఇష్టమైంది ఏదో ఒకటి తీసుకో అని చెప్పా. వాడు ఆనందంగా వెళ్లి చక్రాన్ని ఎత్తటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొంచెమైనా కదిలించ లేకపోయాడు. నా అన్నదమ్ములు గాని, నాకు అత్యంత ప్రేమపాత్రుడైన అర్జునుడు గాని ఏనాడూ నా చక్రం కావాలని అడగలేదు. అలాటిది ఆ బ్రహ్మశిరోనామకం వల్ల కలిగిన గర్వంతో వాడు నా చక్రాన్ని కోరుకున్నాడు. అలాటి వాడు ఇప్పుడు భీముడి మీద దాన్ని ప్రయోగించటానికి ఏమాత్రం వెనకాడడు. మనం వెంటనే బయల్దేరి వెళదాం” అని సాత్యకిని, సహదేవుణ్ణి శిబిరం దగ్గర వుంచి ధర్మరాజుని, అర్జునుణ్ణి తన రథం మీద ఎక్కించుకుని తనే సారథ్యం వహించి బయల్దేరాడు కృష్ణుడు.


కృష్ణ సారథ్యంలో ఆ ఉత్తమాశ్వాలు వేగంగా వెళ్లి భీముడి రథాన్ని కలుసుకున్నయ్. ఐతే వాళ్లు తనని అశ్వత్థామ మీదికి వెళ్లకుండా ఆపటానికి వచ్చారని భీముడు వాళ్ల మాటలు వినకుండా ముందుకు దూసుకుపోయాడు. అక్కడ నదీసమీపంలో శిష్యబృందం మధ్యలో వ్యాసభగవానుడు వుంటే ఆయనకి మనసులోనే నమస్కరించుకుని చుట్టూ చూశాడు. కొంచెం దూరంగా ఒంటినిండా బూడిద పూసుకుని పద్మాసనంలో కూర్చుని కనిపించాడు అశ్వత్థామ. మహాకోపంతో ధనుస్సుకి బాణాన్ని సంధించాడు భీముడు. “ఓరి బ్రాహ్మణాధమా, ఇంతలోనే బూడిద పూసుకుని ముక్కుమూసుకు కూచుంటే మునివై పోతాననుకున్నావా? ఈ దొంగవేషాలు చాలుగాని ధనుస్సు తీసుకో, యుద్ధానికి బయల్దేరు” అని అతన్ని సవాలు చేశాడు.


ఎదురుగా భీముణ్ణి, అతని వెనకనే వస్తున్న కృష్ణార్జునుల్ని చూశాడు అశ్వత్థామ. అర్జునుడి దివ్యాస్త్ర వైభవాన్ని తల్చుకున్నాడు. అసూయతో అతని మనసు భగ్గుమంది. వెంటనే బ్రహ్మశిరోనామకాన్ని చేతిలోని దర్భల్లోకి ఆవాహన చేసి “ఈ అస్త్రంతో పాండవులన్నవాళ్లు మిగలకుండా నశించిపోవాలి” అని నిశ్చయించి ప్రయోగించాడు. ఆ మహాదివ్యాస్త్రం ప్రళయభీకరంగా ప్రపంచాన్నంతటినీ భస్మీభూతం చెయ్యటానికి అగ్నిజ్వాలల నాలుకలు చాస్తూ బయల్దేరింది.


కృష్ణుడు త్వరితంగా “అర్జునా, అర్జునా, అది బ్రహ్మశిరోనామకం, వేరే అస్త్రం ఏదీ దాన్ని ఆపలేదు. దాన్ని వెంటనే బ్రహ్మశిరోనామకంతోనే నాశనం చెయ్యాలి, త్వరపడు” అంటే అర్జునుడు గబాల్న రథం దిగి నియతుడై ఆచార్యుణ్ణి మనసులో స్మరించుకుని శరాన్ని సంధించి ముందుగా అశ్వత్థామకి ఎలాటి కీడు కలక్కూడదని, తర్వాత తనకీ తన వారికీ శుభం కలగాలనీ కోరుకుని అస్త్రదేవతలకి నమస్కరించుకుని అస్త్రం అస్త్రంతో ప్రతిహతం కావాలని భావించుకుని ప్రయోగించాడు. ఆ అస్త్రం అశ్వత్థామ ప్రయోగించిన దాన్ని ఆక్రమించబోతే అది దొరక్కుండా ఇంకా ప్రజ్జ్వరిల్లింది. అలా ఆ రెండు అస్త్రాల మధ్య జరుగుతున్న ఘోరసమరానికి సముద్రాలు అల్లకల్లోలమయినయ్, భూమి కంపించింది, కులపర్వతాలు కదిలినయ్.


అప్పుడు నారదముని వ్యాసుణ్ణి సమీపించాడు. వాళ్లిద్దరు కలిసి ప్రళయం సృష్టిస్తున్న ఆ అస్త్రాల్ని ఆపటానికి అర్జున, అశ్వత్థామల మధ్య నిలబడ్డారు. “మీకన్న ముందు వచ్చిన ఎంతోమంది మహాత్ములు ఎన్నో యుద్ధాలు చేశారు కాని ఎవరైనా ఇలాటి అస్త్రాల్ని మనుషుల మీద ప్రయోగించటానికి సాహసించారా? మీరిద్దరూ మహావీరులు, మీకిది ఉచితం కాదు” అని చెప్పారు వాళ్లిద్దరితో. అర్జునుడు వాళ్లతో “కేవలం అతను ప్రయోగించిన అస్త్రాన్ని ఆపటానికే నేను ప్రయోగించా, మీరు కోరితే ఇప్పుడే ఉపసంహరిస్తా. ఐతే నేను ఉపసంహరిస్తే ఆ పాపాత్ముడు మమ్మల్ని సంహరించవచ్చు. కనక మా క్షేమాన్ని మీ దృష్టిలో పెట్టుకోండి” అని అప్పటికప్పుడే తన అస్త్రాన్ని ఉపసంహరించాడు.


ధృతరాష్ట్ర మహారాజా, అలా బ్రహ్మశిరోనామకాన్ని ఉపసంహరించటం చాలా గొప్ప విషయం. తపం, బ్రహ్మచర్యం, దానం, సత్యం ఉన్న ఆ అర్జునుడికి సాధ్యం ఐంది తప్ప ఇతరులకి ఆ మహోగ్రాస్త్రాన్ని వెనక్కి తిప్పటం అసాధ్యం. ఒకవేళ ఎవరైనా సాహసించి వారించినా అది వాళ్ల తలనే నరుకుతుంది. గురుభక్తి, వ్రతయుక్తి పుష్కలంగా వున్న అర్జునుడే అలా తిప్పి బతగ్గలిగాడు. మునులిద్దరూ అతని శక్తికి విస్తుపోయారు.


ఇక అశ్వత్థామ కూడ తన అస్త్రాన్ని మరలుద్దామని చూశాడు కాని అదతనికి సాధ్యం కాలేదు. దీనుడై వ్యాసుణ్ణి చూశాడు – ఆ మహాముని ఏదైనా ఉపాయం ఆలోచించలేకపోతాడా అని. అతనితో “రారాజుని అధర్మ యుద్ధంలో చంపిందే కాక ఈ భీముడు నన్ను చంపటానికీ సిద్ధమయాడు, మీరంతా చూశారు. పరాభవం వల్ల, ప్రాణభయం వల్ల ఆలోచన లేకుండా నేనీ మహాస్త్రాన్ని ప్రయోగించా; ఐతే ఇది పాండవ వంశనాశనం చెయ్యకుండా ఆగదు. నాకెలాటి పాపాలు చుట్టుకున్నా చుట్టుకోనీ” అని నిక్కచ్చిగా చెప్పాడు.


వ్యాసుడతన్ని సూటిగా చూస్తూ “నీ తండ్రి అర్జునుడి మీది వాత్సల్యం వల్ల అతనికీ అస్త్రాన్నిచ్చాడు. అతను కూడ నీ అస్త్రాన్ని ఉపసంహరించటానికే తనూ వేశాడు కాని నీకు కీడు తలపెట్టి కాదు. మేం వద్దంటే తన అస్త్రాన్ని తను వెనక్కి తీసుకున్నాడు. అలాటి అస్త్రవిద్యావిశారదుణ్ణి చంపటం నీ తరమౌతుందా? అవసరమైతే నీ అస్త్రాన్ని అతని అస్త్రం ఆపుతుంది. అదీగాక, మనుషుల మీద ఈ అస్త్రాన్ని వేస్తే వేసిన వాళ్లకి అశుభం కలుగుతుంది. ఇంకా, ఒకడు ప్రయోగించి, మరొకడు తన అస్త్రాన్ని ఉపసంహరిస్తే ఆ దేశానికి పన్నెండేళ్లు అనావృష్టి కలుగుతుంది. కాబట్టి, పాండవుల్ని, నిన్ను, ఈ దేశాన్ని రక్షించే మార్గం చెప్తా, విను. నువ్వు నీ అస్త్రాన్ని ఉపసంహరించి నీ శిరోమణిని అర్జునుడి కివ్వు. నిన్ను ప్రాణాల్తో వదిలి వాళ్లు వెళ్తారు. ఇప్పటికిది అన్ని విధాల శ్రేయస్కరమైన సంధి మార్గం” అని బోధించాడు.


అది అశ్వత్థామకి మింగుడు పడలేదు. “రత్నాలు కావాలంటే పాండవులకి ఇప్పుడేం కొదవ? కౌరవభాండాగారంలో వున్న సంపదంతా వాళ్లదే. ఇకపోతే ఈ శిరోమణి వల్ల సర్పభయం గాని, తస్కరభయం గాని, రాక్షసభయం గాని, దేవభయం గాని వుండవు; ఆకలిదప్పులు, నిద్ర, రోగాలు దాపులకి రావు. నాలాటి వాడికి ఇది అవసరం కాని వాళ్లకెందుకు? ఐనా నీ మాట శిరోధార్యం. మణిని నీకిస్తా, నీకు న్యాయం అనిపించింది చెయ్యి. ఇక నా అస్త్రం పాండవుల్ని వదిలి పాండవేయ పత్నుల గర్భాల్ని మాత్రం విచ్ఛిన్నం చేసి శాంతిస్తుంది” అని మరో దారి సూచించాడు.


వ్యాసుడు దానికి “అలాగే చెయ్యి; కాని మరీ అత్యాశకి పోకు” అన్నాడు. వ్యాసుడి ఉద్దేశం అది కేవలం పాండవ పత్నుల గర్భనాశనంతో ఆగాలని, పాండవుల కొడుకుల పత్నుల్ని వదిలెయ్యాలని అని అశ్వత్థామకి అర్థం ఐంది. ఐతే దాని గురించి మళ్లీ వాదం ఎందుకని, వ్యాసుడి మాటలకి అంగీకరించినట్టు నటించి తను చెయ్యదల్చుకుంది తను చేద్దామని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం వ్యాసుడు గ్రహించాడు. అది కృష్ణుడూ గ్రహించాడని వ్యాసుడు గ్రహించాడు. కృష్ణుడు మాట్టాడబోతున్నాడని తను మౌనం వహించాడు.


అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో “పాండవుల కొడుకులందర్నీ చంపావ్, అది చాలక ఇప్పుడు వాళ్ల పత్నుల గర్భాల్ని కూడ చంపాలని చూస్తున్నావ్, పాపాన పోతావ్. కనీసం వాటిలో ఒకదాన్నైనా వదిలెయ్” అన్నాడు కఠినంగా. అశ్వత్థామ ఉద్రేకంగా అతనితో “నీ పక్షపాత బుద్ధి చూపించుకున్నావ్. ఉత్తర గర్భాన్ని రక్షించాలని నీ ప్రయత్నం. నేను ఎవర్నీ వదలను, నా అస్త్రం అన్ని పిండాల్నీ నాశనం చెయ్యాల్సిందే” అని పట్టుబట్టాడు. కృష్ణుడు దానికి “అభిమన్యుడి తేజాన్ని మోస్తున్నది ఉత్తర. నువ్వేం చేసినా సరే నేనా బిడ్డని బతికించి దీర్ఘాయువిస్తా” అని బదులిస్తే అశ్వత్థామ నవ్వి “అస్త్రదగ్ధుణ్ణి నిజంగానే నువ్వు బతికించగలిగితే అప్పుడు నీ గొప్పతనం బయటపడుతుందిలే” అని హేళన చేశాడు.


కృష్ణుడు కోపంగా “బాలఘాతివైన నువ్వు తినటానికి తిండి దొరక్క తోడెవరూ లేక దుర్గంధరక్తంతో శరీరం కుళ్లిపోతుంటే మూడువేల ఏళ్లు తిరుగుతావ్ పో. అభిమన్యుడి కొడుకుని నేను రక్షిస్తా, అతను పరీక్షిత్తు అనే పేరుతో కృపాచార్యుడి దగ్గర ధనుర్వేదం చదివి సర్వశస్త్రాస్త్రాలు పొంది ఎంతో కాలం పాలిస్తాడు. అతని కొడుకు జనమేజయుడు మహాశక్తి సంపన్నుడై రాజ్యం పాలించటం కూడ నువ్వు చూస్తావ్. నా మహిమ ఏమిటో చూడాలన్నావుగా, చూద్దువు గాని” అన్నాడతనితో.


వ్యాసుడు కూడ “బ్రాహ్మణుడివై వుండీ క్రూరుడివై, నా మాటల్ని లక్ష్యపెట్టకుండా పాపానికి పూనుకున్నావ్, కృష్ణుడన్నట్టే ఔతుంది నీ గతి. నా ఎదట ఉండొద్దు, పో” అని ఈసడిస్తే అశ్వత్థామ “నువ్వు ఎప్పటికీ మనుషుల్లోనే ఉంటావు పో” అని అతనికి ప్రతిశాపం ఇచ్చి “నీ దగ్గరలోనే నేనూ ఉంటా” అని చెప్పి శిరోమణిని పాండవులకిచ్చి తపోవనానికి పోయాడు. పాండవులు, కృష్ణుడు ఆ మునులకి నమస్కరించి వేగంగా వెనక్కి తిరిగారు.


ఏడుస్తున్న ద్రౌపది దగ్గరికి వెళ్లి ఆమె చుట్టూ కూర్చున్నారు. ధర్మరాజు ఆజ్ఞతో భీముడు మణిని ఆమెకిచ్చాడు. “యుద్ధం పూర్తయింది, శత్రువులంతా చచ్చారు. నీకీ దుఃఖం తగదు. యుద్ధం అన్నాక చావులు తప్పవు. నువ్వు ధైర్యంగా వుంటేనే ధర్మరాజు రాజ్యం చెయ్యగలిగేది. ధృతరాష్ట్రుడి వంశాన మగపురుగు లేకుండా చేశా, దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగా, దుర్యోధనుడి తొడలు విరిచి తలని కాలితో తన్నా. ఇది మనకి ఆనందసమయం, దీన్ని శోకమయం చెయ్యకు. గురువు కొడుకు గనక అశ్వత్థామని చంపకుండా వదిలాడు అర్జునుడు. ఐతే వాడిప్పుడు జీవచ్ఛవం. ఇక మనకి ఎదురు లేదు. ధర్మరాజు నిర్మలయశస్సుతో పాలించబోతున్నాడు” అని ఎంతో అనునయంగా చెప్పాడామెకి. మెల్లగా ద్రౌపది మొహంలో కళవచ్చింది. అరిచేతిలో వున్న మణిని ఆదరంగా చూసింది. “దీన్ని చూడటంతో నా మనస్సు కుదటపడింది. ఈ మహనీయమణిని ధరించే అర్హుడు ధర్మరాజే” అని దాన్నతనికిస్తే అతను ప్రీతితో దాన్ని తలమీద ధరించాడు.


అశ్వత్థామ దగ్గరికి వెళ్లినప్పుడు జరిగిన వృత్తాంతమంతా ధర్మరాజు వివరంగా అందరికీ వినిపించాడు. అప్పటికే ఒక్క ఉత్తర తప్ప మిగిలిన పాండవకాంతలందరికీ గర్భస్రావాలైనయ్. ఉత్తరని కూడ అశ్వత్థామ అస్త్రం బాధించింది గాని అదామెకి గాని మరెవరికి గాని తెలియకుండా చేశాడు కృష్ణుడు తన ప్రభావంతో.


ధర్మరాజు అశ్వత్థామ ఒక్కడే శిబిరాల్లోకి వచ్చి అంతమంది వీరాధివీరుల్ని ఎలా చంపగలిగాడని ఆశ్చర్యంగా అడిగితే కృష్ణుడు అది శివుడి అనుగ్రహమని, అశ్వత్థామ గొప్ప భక్తితో శివార్చన చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడని, అందుకే అలా విజృంభించి అంత నాశనం చెయ్యగలిగాడని వివరించాడు.


ఇదంతా వింటున్న జనమేజయుడికి కొన్ని సందేహాలు కలిగినయ్. “సంజయుడు దుర్యోధనుడి చావు గురించి చెప్పాక ధృతరాష్ట్రుడేం చేశాడు? అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ, దుర్యోధనుడి చావు తర్వాత హస్తినాపురం వైపుకి వెళ్లి మళ్లీ అంతలోనే వెనక్కి తిరిగారని చెప్పావు కదా, ఎందుకలా చేశారు?” అని అడిగాడతను వైశంపాయనుణ్ణి. వైశంపాయనుడు ఇలా చెప్పుకొచ్చాడు.


సంజయుడి మాటలు విని ధృతరాష్ట్రుడు విలపిస్తూ కూర్చున్నాడు. అది చూసి సంజయుడు “అందరూ పోయాక ఇంకిప్పుడు వగచి ప్రయోజనం ఏముంది? ఐనా ఎవరి గురించని ఏడుస్తావ్, పోయిన వాళ్లలో ఎవరు తక్కువ వాళ్లు – మొత్తం పద్దెనిమిది అక్షౌహిణుల వాళ్లు మంటగలిశారే? ఇప్పుడు కర్తవ్యం వాళ్లకి అగ్నికార్యాలు నిర్వర్తించటం, నీ వాళ్లకి తిలోదకాలివ్వటం. పొలికలనికి వెళ్దాం పద” అని సలహా చెప్పాడు. ఐనా వినక ధృతరాష్ట్రుడు నేలమీద పడి దొర్లుతూ కొడుకుల్ని తలుచుకుని విలపించసాగాడు.


విదురుడతనికి శరీరాలు క్షణభంగురాలని, రాచధర్మాన్నాచరించి స్వర్గాన్ని చేరిన వారి కోసం ఏడవటం తగదని ఎంతగానో హితోక్తులు చెప్పాడు. వ్యాసమహాముని కూడ వచ్చి జరిగినదంతా విధికృతమని తను ఒకప్పుడు దేవసభలో ఉండగా భూదేవి అక్కడికి వచ్చి భారం తగ్గించమని నారాయణుణ్ణి ప్రార్థిస్తే ఆయన ధృతరాష్ట్రుడనే రాజుకి నూరుగురు కొడుకులు పుడతారు, వారి వల్ల గొప్ప యుద్ధం సంభవించి నీ భారం తీరుతుందని ఆమెని ఊరడించి పంపాడని వివరించి చెప్పాడు. పాండవుల్ని తన కొడుకులుగా భావించుకుని శేషజీవితం గడపమని బోధించాడు. చివరికి ధృతరాష్ట్రుడు శాంతించి వ్యాసుడి మాటలు పాటించటానికి ఒప్పుకున్నాడు.


కొంతసేపటి తర్వాత పొలికలనికి వెళ్లటానికి స్త్రీలందర్నీ సిద్ధం చెయ్యమని ఆజ్ఞాపించాడు ధృతరాష్ట్రుడు. విదుర, సంజయులు పూనుకుని అందర్నీ తగిన వాహనాల మీద ఎక్కించి బయల్దేరించారు. హస్తినగరం అంతా అసూర్యంపశ్యలైన అతివల ఆర్తనాదాల్తో నిండిపోయింది. కన్నీళ్లు పెట్టనివారు నగరంలోనే లేరు. యుద్ధంలో పాల్గొనని ఇతరవృత్తుల వాళ్లు కూడ అందరూ వాళ్ల వెంట బయల్దేరారు. అలా ఒక కోసెడు దూరం వెళ్లేసరికి అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ వాళ్లకి ఎదురొచ్చారు. ధృతరాష్ట్రుణ్ణి చూసి కుమిలి ఏడ్చి దుర్యోధనుణ్ణి భీముడు అధర్మంగా కొట్టటం గురించి, అంతకు ముందు రాత్రి ముగ్గురూ వెళ్లి పాండవసేనలన్నిట్నీ నాశనం చెయ్యటం గురించి చెప్పి ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని ఊరడించి పాండవులు వచ్చి పట్టుకుంటారేమోననే భయంతో హడావుడిగా వెనక్కి తిరిగి గంగాతీరానికి వెళ్లారు. అక్కడ ముగ్గురూ విడిపోయి కృపుడు హస్తినాపురానికి, కృతవర్మ ద్వారకకి, అశ్వత్థామ వ్యాసాశ్రమానికి దారితీశారు. అక్కడ జరిగిన వ్యవహారం మనం ఇంతకుముందే విన్నాం.


ఇక ఆ ముగ్గురు వెళ్లిపోయాక వాళ్ల మాటలు తల్చుకుని ధృతరాష్ట్రుడికి మళ్లీ కొత్తగా దుఃఖం పుట్టుకొచ్చింది. అక్కడక్కడ ఆగుతూ మెల్లమెల్లగా పొలికలనికి సాగాడతను.

ఈలోగా ధృతరాష్ట్రుడి రాక గురించి విన్న ధర్మరాజు అతనికెదురుగా ప్రయాణమయాడు. కృష్ణుడు, సాత్యకి, తమ్ముళ్లు, ద్రౌపది, ఆమె దగ్గరి బంధువర్గంలో స్త్రీలు అతనితో బయల్దేరారు. హస్తినాపురం నుంచి తిరిగొచ్చిన యుయుత్సుడు కూడ వాళ్లతో వున్నాడు. అందరూ పొలికలనికి చేరుకున్నారు.


కౌరవస్త్రీలు శోకిస్తూ ధర్మరాజుని తిట్టిపోశారు. అతనూ పోయిన తనవాళ్లని తల్చుకుని ఏడుస్తూ వెళ్లి ధృతరాష్ట్రుడికి నమస్కరించాడు. అతను లోపల్లోపల వెగటుగా వున్నా పైకి మాత్రం ఆప్యాయంగా ధర్మరాజుని కౌగిలించుకున్నాడు. భీమార్జున నకుల సహదేవులు కూడ వరసగా వచ్చారని అతని పక్కనున్నవాళ్లు చెప్పారతనికి. భీముడి పేరు వినటం తోనే ధృతరాష్ట్రుడికి పట్టలేని కోపం కలిగింది. ఐతే ఇలా జరగబోతున్నదని ముందే గ్రహించి ఒక ఇనపవిగ్రహాన్ని చేయించి రహస్యంగా ఆ దగ్గర్లో వుంచిన కృష్ణుడు భీముణ్ణి వెళ్లనివ్వకుండా ఆ విగ్రహాన్ని ధృతరాష్ట్రుడి ముందుకి తోశాడు.


ధృతరాష్ట్రుడు మహాక్రోధంతో ఆ విగ్రహాన్ని తన బాహువుల్లో బంధించి పదివేల ఏనుగుల బలంతో దాన్ని అదుముకుని ముక్కలుగా విరిచాడు. చేతుల చర్మం తెగిపోతున్నా, వక్షాన ఎముకలు వంగుతున్నా, ముక్కులనుంచి రక్తం కారుతున్నా లెక్కచెయ్యలేదతను. తన కొడుకుని చంపిన వాణ్ణి చంపి పగతీర్చాననే తృప్తితో లోపల సంతోషం పొంగుతున్నా పైకిమాత్రం మెరమెచ్చుల కోసం హాహాకారాల్తో భీముడి గురించి ఏడవటం మొదలెట్టాడు.


కృష్ణుడు చిరునవ్వుతో “నువ్విలాటి పని చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే భీముణ్ణి నీ ముందుకి రానివ్వకుండా ఇనపవిగ్రహాన్ని పంపా. ఐనా నీకిదేం బుద్ధి, అతన్ని చంపితే పోయిన నీ వాళ్లు తిరిగొస్తారా? తప్పులన్నీ చేసింది నీ కొడుకు. అది గుర్తించి వీళ్లని అనుగ్రహంతో చూడు” అని చెప్పాడతనికి. రక్తసిక్తమైన అతని ఒంటిని పరిచారకులు నీళ్లు తెచ్చి తుడిచారు. ధృతరాష్ట్రుడు కూడ శాంతించాడు. “నీ మాటల ప్రకారమే చేస్తా, పాండవులు నాకు ప్రీతి కలిగించేట్టు నడుచుకుంటా” అని మాట ఇచ్చాడు.


అప్పుడు కృష్ణుడు భీమార్జున నకుల సహదేవుల్ని పిలిస్తే వాళ్లని కౌగిలించి ఆదరించాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు యుయుత్సుణ్ణి కూడ పంపాడు. ధృతరాష్ట్రుడతన్ని వాత్సల్యంతో అక్కున చేర్చుకున్నాడు. పాండవుల్ని గాంధారి దగ్గరికి వెళ్లమని పంపాడు.


కృష్ణుడితో కలిసి పాండవులు గాంధారి దగ్గరికెళ్లారు. ఆమె వాళ్లని దీవించటానికి నిరాకరించి ధర్మరాజుని శపించటానికి పూనుకుంటుంటే వ్యాసభగవానుడు ప్రత్యక్షమై “కోడల, కోడలా, శపించకు, శాంతించు. నా మాట విను. ఇతను ధర్మపరుడు. నీకు గుర్తుందో లేదో, దుర్యోధనుడు యుద్ధానికి బయల్దేరుతూ నిన్ను దీవించమంటే నువ్వు ధర్మం ఎటుందో అటే జయమౌతుందన్నావ్. ధర్మరాజు గెలిచాడు గనక నీమాట ప్రకారం ధర్మం అతని వైపే వుంది కదా. జరిగిన వాటి గురించి కాదు ఆలోచించవలసింది. వీళ్లూ నీ కొడుకులే, వీళ్ల మీద నీకు కోపం వద్దు” అని నచ్చజెప్పాడు. దానికామె “నాకు వీళ్ల మీద కోపం లేదు. ఇక కుంతికిలాగే మాకూ వీళ్లే కదా. యుద్ధంలో అందరి చావులూ నన్ను బాధించవు గాని గదాయుద్ధంలో నాభికి కింద కొట్టి దుర్యోధనుణ్ణి చంపటం మాత్రం నా గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటుంది” అన్నది.


భయంతో వణికిపోతూ భీముడామెకి నమస్కరించి, “అమ్మా, ధర్మమో అధర్మమో నాకు తెలీదు, ఆ పరిస్థితుల్లో ప్రాణభయంతో నేనలా చేశాను. నీకొడుకు గదాయుద్ధంలో ఎంతో నైపుణ్యం వున్నవాడు, అతనితో పోరాట్టం ఎంతో కష్టమైంది. అదీగాక, నీ కోడలికి నిండుసభలో వాళ్లంతా చేసిన అవమానాలు, తొడకొట్టి అన్నమాటలు నీకు తెలీనివి కావు. ఆ సందర్భంలో ఆవేశంలో నేను ప్రతిజ్ఞ చేశా, మరి దాన్ని తీర్చటం ఉత్తమక్షత్రియుడిగా నా ధర్మం కదా. ఐనా సంధి చెయ్యటానికి, ఈ యుద్ధం రాకుండా చెయ్యటానికి మేం ఎన్ని విధాలుగా ప్రయత్నించామో నీకు తెలుసు. ఒకసారి యుద్ధం అన్నాక మరి పగ తీర్చటానికి చెయ్యవలసినవన్నీ చేస్తాం కదా, నీకు తెలీని విషయమా?” అన్నాడు వినయంగా.


దానికామె “నువ్వన్నదంతా నిజమే, వాడికి సరైన చావే వచ్చింది, చచ్చాడు. కాని యుద్ధంలో ఎవరైనా శత్రువుల రక్తం తాగుతారా, నువ్వు తప్ప? రాక్షసులు చేసే పని చేశావే” అని ఎత్తిపొడిచింది.


భీముడిలా సమాధానం చెప్పాడు “సభలో వాడు ద్రౌపది జుట్టుపట్టి ఈడుస్తుంటే వీరావేశంలో అన్న మాటలే తప్ప నేను నిజంగా నెత్తురు తాగలేదు, తాగినట్టు నటించానంతే. యుద్ధంలో చుట్టూ కౌరవయోధానుయోధులు నా మీద పడటానికి సిద్ధంగా వుంటే వాళ్లని భయపెట్టాలని అలా రక్తం తాగినట్టు చేసి మొహానికి పూసుకున్నా తప్ప, నిజంగా తాగటానికి నేను రాక్షసుణ్ణా? అంత పాపినా తల్లీ?” అతనలా అంటే తిరిగి ఏమనాలో ఆమెకి తోచలేదు. “అంధులం మేము. మాకు చేయూతగా ఒక్కణ్ణంటే ఒక్కణ్ణి మిగిల్చలేకపోయారా? వందమందినీ చంపాలా? ఒక్కడుంటే ధర్మరాజుని రాజ్యం చెయ్యనివ్వడా?” అని ధర్మరాజు వైపుకి చూసింది.


భయంతో వణుకుతూ చేతులు మొగిడ్చి దీనంగా ధర్మరాజు ఆమె ముందుకెళ్లాడు. “అమ్మా, వీడే నీ కొడుకుల్ని చంపించిన పాపాత్ముడు, క్రూరుడు. శాపం పెట్టి దండించు తల్లీ. భూమ్మీద ఉన్న రాజుల్ని, వాళ్ల సైన్యాల్ని చంపటానికి కంకణం కట్టుకున్న దౌర్భాగ్యుడు వీడే, దండించు. బిడ్డల్ని, చుట్టాల్ని చంపుకున్న ఈ ద్రోహికి రాజ్యం ఎందుకు? భోగం ఎందుకు? శపించమ్మా, శపించు” అనేసరికి ఏమ్మాట్టాట్టానికీ నోరు రాక మౌనంగా వుండిపోయింది గాంధారి. ఐతే కళ్లకి కట్టుకున్న గుడ్డనుంచి వచ్చిన ఆమె చూపులు అతని కాలివేళ్లకి తగిలి బొబ్బలెక్కినయ్. అర్జునుడు భయంతో వెళ్లి కృష్ణుడి వెనక నిలబడ్డాడు. గాంధారి శాంతించి కుంతి దగ్గరికి వెళ్లమని పంపింది వాళ్లని.


కుంతి వాళ్లందర్ని తనివితీరా చూసుకుని కౌగిలించుకుని శరీరాలు తడిమి చూసి గాయాల్ని చేత్తో నిమిరి గోడుగోడున ఏడ్చింది. ఇంతలో ద్రౌపది కూడ శోకిస్తూ వచ్చి ఆమెని చుట్టుకుని గొల్లుమంది. ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని కిందపడి ఘోరంగా ఏడ్చారు. చివరికి తేరుకుని అందరు కలిసి గాంధారి దగ్గరికెళ్లారు. ద్రౌపది గాంధారికి నమస్కరిస్తే అందరూ మళ్లీ విలపించారు.


వ్యాసుడు ప్రత్యక్షమై అగ్నికార్యాలు తీర్చమని పాండవులకి, ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అలాగే గాంధారికి రణరంగం అంతా కనిపించే విధంగా దివ్యదృష్టిని కలిగించాడు. కాకులు గద్దలు రాబందులు చీల్చుకుపోయి, రాక్షసులు పీక్కుపోయి ఏ అవయవాలు ఎవరివో తెలియకుండా అక్కడ పడివున్న కొడుకుల్ని, మనవల్ని, బంధువుల్ని చూసి భోరుభోరున ఏడ్చింది గాంధారి. దుర్యోధనుడి శవం మీద పడి దీనంగా శోకించింది.


చివరికి కృష్ణుణ్ణి చూసి “ఎంతో శక్తివంతుడివి, వాక్చాతుర్యంలో దిట్టవి, నువ్వు తల్చుకుంటే ఈ యుద్ధం ఆపటం పెద్ద పని కాదు. ఐనా నా కొడుకుల్ని నాశనం చెయ్యటానికి పూనుకున్నావ్. ఇంతకింత అనుభవిస్తావ్. దాయాదుల మధ్య చిచ్చు రగిల్చి చంపించావు గనక నీ దాయాదులూ ఇలాగే కొట్టుకు చస్తారు. ఇప్పటికి సరిగ్గా ముప్పై ఆరేళ్లకి నువ్వూ దిక్కుమాలిన చావు చస్తావ్. మీ ఆడవాళ్లూ వీళ్ల లాగే గుండెలు పగిలేలా ఏడుస్తారు, ఇదే నా శాపం” అని మహాకోపంతో అన్నది గాంధారి.


చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు. “దీన్లో కొత్తేం వుంది, ఇదివరకే ముని శాపం వుంది. ఇలా చెప్పిందే చెప్పటం వల్ల నీకు ఒరిగిందేవిటి? యాదవుల్ని దేవతలు కూడ చంపలేరు, వాళ్లలో వాళ్లే కొట్టుకుచస్తారు. ఇక లేద్దాం, అవతల అగ్నికార్యాలు చెయ్యవలసిన పనుంది. ఐనా నీ కొడుకు ఎవరి మాటా వినక ఇంతకి తెచ్చుకుంటే దానికి నేనా బాధ్యుణ్ణి? ఇప్పటికైనా నిజం గ్రహించి శాంతించు” అంటే నోరెత్తలేకపోయిందామె.


కృష్ణుడి మాటలు విన్న పాండవులకి గుండెలు జారిపోయినయ్. వాళ్లు వాళ్ల జీవితాల మీద ఆశలొదులుకున్నారు.


కౌరవులకి ధర్మరాజు, ధృతరాష్ట్రుడు నిష్టతో చితులు పేర్పించి అగ్నిసంస్కారాలు చేశారు. మిగిలిన బంధువులకి విదురుడు, సంజయుడు అలాగే చేశారు. బయటివాళ్ల శవాల్ని గుట్టలుగా పేర్పించి సామూహిక దహనాలు చేశారు. ఆకాశమంతా పొగల్తో నిండిపోయింది.


అప్పుడు కుంతి అందరూ వింటూండగా పాండవుల్తో ఇలా చెప్పింది – “తన విల్లు కౌరవసామ్రాజ్యానికి పెట్టనికోటగా వుంచి, యుద్ధరంగంలో మిమ్మల్నందర్నీ ముప్పుతిప్పలు పెట్టిన కర్ణుడు రాధేయుడని అందరూ అనుకున్నారు, మీరూ అలాగే అనుకున్నారు. అది నిజం కాదు, అతను నా తొలిచూలు కొడుకు, సూర్యవరప్రసాది. అతనికి కూడ మీరు తిలోదకాలివ్వాలి” అని కర్ణుడి వృత్తాంతం అంతా వివరించింది.


అందరూ నిర్ఘాంతపోయారు. ధర్మరాజు తప్ప మిగిలిన పాండవులంతా నిశ్చేష్టులయారు. ధర్మరాజు తల్లడిల్లిపోతూ తల్లితో “కొంగున అగ్నిని మూటకట్టినట్టు ఇన్నాళ్లు ఈ విషయం ఎలా దాచావమ్మా? అర్జునుడు తప్ప అతన్నెదుర్కునే వీరుడు ముల్లోకాల్లో లేడే ! అతను మా అన్న అని నువ్వు చెప్పిన మాట అభిమన్యుడి మరణం కంటే, ద్రౌపదేయులందరి చావు కంటే నా గుండెని కోస్తున్నది. ఈ విషయం ముందే తెలిస్తే ఇంత మారణహోమం జరిగేది కాదు గదా” అని విలపించాడు. కౌరవకాంతలు కూడ అందరూ అది విని ఆక్రోశించారు.


పాండవులంతా భక్తితో కర్ణుడికీ తిలోదకాలిచ్చారు. ధర్మరాజు కర్ణుడి భార్యల్ని రప్పించి గౌరవించాడు. అతని కోసం అనేక పుణ్యకర్మలు చేయించాడు.


(సమాప్తం.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!