ఊర్మిళాదేవి నిద్ర !

ఊర్మిళాదేవి నిద్ర !

.

సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిపెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. 

ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు. 

వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. 

ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. 

అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది. కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు. అలా ఒంటరిగా వదిలివేయబడ్డ ఊర్మిళా, అడివికి వెళ్ళిపోతున్న లక్ష్మణుడూ ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకిస్తాడు. ఊర్మిళ తన మెలకువని లక్ష్మణుడికిస్తుంది. తన భర్త అడివిలో ఉన్న పధ్నాలుగేళ్ళూ ఊర్మిళ నిద్రపోతుంది. లక్ష్మణుడు ఆ పధ్నాలుగేళ్ళూ పూర్తిగా మెలకువగానే ఉంటాడు. ఊర్మిళ భర్తృవిరహాన్ని అనుభవించనక్కర్లేకుండా, లక్ష్మణుడు తన భార్య జ్ఞాపకాన్ని మరిచిపోనక్కర్లేకుండా ఈ చమత్కారమైన ఊహ చేశారు తెలుగు ఆడవాళ్ళు.

.

ఊర్మిళాదేవి నిద్ర సరిగ్గా ఈ రకంగా నిర్మించబడింది. పాట ప్రారంభంలో శ్రీరాముడి పొగడ్తతో మొదలౌతుంది.

శ్రీరామభూపాలుడూ పట్టాభిషిక్తుడై కొలువుండగా

భరత శతృఘ్నులపుడూ సౌమిత్రి వరుస సేవలు సేయగా

మారుతాత్మజులప్పుడూ రాఘవుల జేరి పాదములొత్తగా

సుగ్రీవుడాకొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా

… …

సకలదేవతలు గొలువా ఉదయాన పుష్పవర్షము గురిసెను

రామరాజ్యం అంతా సక్రమంగా ఉంది. అందరూ ఆనందిస్తున్నారు.

ఆ సమయంలొ సీతాదేవి వచ్చి రాముడివైపు తిరిగి “రామమచంద్రా, మనం అడివికి వెళ్తున్నపుడు, లక్ష్మణుడితోపాటు ఊర్మిళ కూడా వొస్తానంది, అందుకు లక్ష్మణుడు ఒప్పుకోలేదు,

అప్పటినించి ఆవిడ నిద్ర పోతోంది. లక్ష్మణుడిని వెళ్ళి ఆమెను లేపమనండి.” అని

సవినయంగా మనవి చేస్తుంది. తాము అడివికి వెళ్ళిన రోజు మొదలుకొని ఊర్మిళ నిరంతరాయంగా నిద్రపోతోందని రాముడికి అప్పుడే తెలుస్తుంది.

వెంటనే తమ్ముణ్ణి వాళ్ళావిడ దగ్గరికి పంపిస్తాడు, ముందు ఊర్మిళని నిద్రలేపి ఆవిడని సంతోషపరచమని. రామాజ్ఞ శిరసావహించి లక్ష్మణుడు అప్పుడు భార్య దగ్గరికి వెళతాడు.

నిద్రపోతున్న ఊర్మిళ చీర సవరించి, ఆవిడ పక్కనే కూర్చుంటాడు. ప్రేమగా ఆవిడతో మాట్లాడడం మొదలు పెడతాడు.

కొమ్మ నీ ముద్దుమొగమూ సేవింప కోరినాడే చంద్రుడూ ….

అమృతధారలు కురియగా పలుకవే ఆత్మ చల్లన చేయవే

అ నిద్రలో తన గదిలోకి ఎవరో పరపురుషుడు ప్రవేశించాడనుకుంటుంది ఊర్మిళ.

తన్ను తా మరచియున్న ఆకొమ్మ తమకమున వణకదొడగే

ఆవిడ శరీరం భయంతో వణకడం మొదలవుతుంది.

ఊర్మిళ మొదట్లో ఆ ఆగంతక వ్యక్తిని గౌరవంగా ‘అయ్యా మీరెవ్వరయ్యా’ అంటూ ప్రశ్నిస్తుంది.

తరవాత తనకున్న మగతోడు చాలా బలమైనదని నిబ్బరంగా చెప్పి అతన్ని భయపెట్టచూస్తుంది. ఊర్మిళ తన మగతోడుగా చెప్పుకున్న పేర్ల వరస చూడండి.

మాతండ్రి జనకరాజూ వింటె మిము ఆజ్ఞసేయక మానడూ

మా యక్క బావ విన్నా మీకిపుడు ప్రాణముల హాని వచ్చూ

మాయక్కమరది విన్నా మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో

హెచ్చయిన వంశానికీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ

కీర్తి గల ఇంట బుట్టీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ

అంటే ఆ బాధ తన శరీరానికీ మనసుకీ కలగబోయే దారుణమైన హింసగురించి కాదు – తాను మెట్టిన ఇంటికీ, పుట్టిన ఇంటికీ రాబొయే అపకీర్తి గురించి. స్త్రీ ఇలాంటి హింసకి గురి అయితే, లోకం ఆవిణ్ణే నిందిస్తుంది. అప్పటికి, ఇప్పటికీ కూడా తెలుగు లోకపు స్థితి ఇదే. ఇక తనకున్న ఒకే ఒక అవకాశం ఆ దుర్మార్గుడికి మంచి బుద్ధి కలిగేలా చెయ్యటం.

ఒకడాలి కోరిగాదా ఇంద్రునికి ఒడలెల్ల హీనమాయే

పరసతిని కోరి గాదా రావణుడు మూలముతొ హతమాయెనూ

ఆడతోడా బుట్టరా మావంటి తల్లి లేదా మీకును

లక్ష్మణుడు అనే మాటలకి ప్రతిగా ఆమె అనే మాటలు వింటే మనకి ఒక్కసారిగా బుర్ర తిరిగిపోతుంది.

శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?

జనకునల్లుని గానటే? భూమిలో జనకులనగా నెవ్వరు?

శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?

సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ] సృష్టిలో నేను యెరుగ

ఎంతో మర్యాద గల కుటుంబంలో చాలా కట్టుబాట్ల మధ్య పుట్టిన శీలవతి యైన స్త్రీ

ఇలా బరితెగించి మాట్లాడుతుందా! అందులోనూ జనకుడంటే ఎవడు,

రాముడంటే ఎవడు, సీతంటే ఎవతె అని తృణీకారంగా మాట్లాడుతుందా!

ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఊర్మిళ కష్టాలకి కారణమైనవాళ్ళు వీళ్ళే. తన కూతుర్ని జాగ్రత్తగా రక్షించగలడో లేదో అనే ఆలోచనైనా లేకుండా ఈ చేతగాని లక్ష్మణుడి చేతిలో పెట్టాడు తనని తన తండ్రి. అధికార స్థానంలో ఉన్న తన బావగారు రాముడు, తన భార్యని తనతో తీసికెళ్తున్న పెద్ద మనిషి, తమ్ముడు బానిసలా తనతో పాటు అడివికి వచ్చేస్తుంటే, అయ్యో నీ భార్య ఏమయి పోతుంది, ఆమెను కూడా నీతో బాటు తీసుకొనిరా – అని అనలేకపోయాడు. సొంత అక్కగారు సీత కూడా తన చెల్లెలేమై పోతుందో అనే ఊహ లేకుండా సగర్వంగా మొగుడితో అడివికి పరిగెత్తింది. ఊర్మిళని ఒక్కత్తెనూ వదిలిపెట్టవద్దని లక్ష్మణుడికీ, రాముడికీ చెప్పగల స్థానంలో ఉన్నది ఆవిడే. ఈ విధంగా కుటుంబంలో తనని కాపాడగల వాళ్ళందరూ తన మానానికి తనని వదిలేశారు.

దీన్ని బట్టి చూస్తే ఆ కుటుంబంలో ఊర్మిళ లోపల్లోపల ఎంత కుమిలిపోయి ఉంటుందో మనం ఊహించుకోచచ్చు.

లక్ష్మణుడు చేసేదేమీ లేక హఠాత్తుగా ఆవిడకి మెలకువ వచ్చే మాటలు చెప్పడం మొదలు పెడతాడు. నిన్ను ఊర్మిళ అంటారు, కనీసం ఆ మాట కాదనకు అని ప్రాధేయపడతాడు. అడివిలో సీతాదేవిని రావణాసురు డెత్తుకుపోయాడనీ, రాముడూ తనూ యుద్ధంచేసి సీతను రక్షించామనీ చెబుతాడు. ఇలాంటి విపత్కరమైన సంఘటన గురించి హఠాత్తుగా చెప్తే ఆవిడ నిద్ర లేచి మామూలుగా మాట్లాడుతుందని లక్ష్మణుడి అలోచన. కాని ఈ మాటలేవీ ఊర్మిళ మీద పనిచెయ్యవు.

అప్పుడు లక్ష్మణుడు దీనంగా, ‘నువ్వు నన్ను వదిలేస్తే నాకు లోకంలో అపకీర్తి వస్తుంది,’ అంటాడు. ఇది ఆ సమాజంలో ఆడవాళ్ళు అనే మాట. మొగుడు వదిలేస్తే పెళ్ళానికి అపకీర్తి వస్తుంది. మగవాడు హాయిగా ఇంకో పెళ్ళి చేసుకుంటాడు.

లక్ష్మణుడు ఊర్మిళను ఇంకా ప్రాధేయపడతాడు. తాను ఆమె భర్తనని ఇంకా ఆ డొంకతిరుగుడు మాటల్లోనే మళ్ళా మళ్ళా చెబుతాడు. నిద్రలో ఊర్మిళ కోపంగా మాట్లాడిన మాటలు తన కర్థమయ్యాయని, కోపాన్ని తగ్గించుకోమని తాను ప్రార్థిస్తున్నానని చెప్పడానికి ఈ పాటలో ఈ పునరుక్తులు సూక్ష్మ సూచికలు. ఊర్మిళ లేకపోతే తాను బ్రతకలేననీ ఈ పధ్నాలుగేళ్ళూ తనకి నిద్రాహారాలు లేవనీ మొరపెట్టుంటాడు.

నిన్ను బాసినది మొదలూ ప్రాణసఖి నిద్ర హారములెరుగనే

నీవు లేవకయున్ననూ ఓ సఖీ ప్రాణములు నిలుపలేనే

స్త్రీలు తమ భర్తల నించి వినాలని తపించే ప్రియమైన మాటలు ఇవి.

అప్పటికీ ఊర్మిళ కరుణించకపోతే లక్ష్మణుడు చివరికి ఏడుస్తూ తనని తాను చంపుకోడానికి కత్తి తీస్తాడు. ఆ చప్పుడుకి ఊర్మిళ హఠాత్తుగా నిద్ర లేస్తుంది. లేచి భర్త కాళ్ళ మీద పడుతుంది. ఆత్మహత్య వీరపురుష లక్షణం కాదు. కాని, ఈ కథలో లక్ష్మణుడు వీరపురుషుడు కాడు.

పాటలో నిద్ర మత్తులో ఉన్న ఊర్మిళ వేరు, నిద్ర మేల్కొన్న ఊర్మిళ వేరు. నిద్ర మేల్కొన్న ఊర్మిళ భార్య లాగ ప్రవర్తించాలి. అయినా ఆ ఊర్మిళ కూడా ఒక పక్క తను భర్త మీద చూపించవలసిన గౌరవాన్ని చూపిస్తూనే తన కోపాన్ని వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల మూడోవారు ఎవ్వరూ లేరని, తన పడకగదిలో భర్తతో మాట్లాడుతోందని ఒక్కసారి గమనించండి. ఈ సందర్భంలో సమిష్టికుటుంబం లోని స్త్రీలకు కూడా తమ భర్తలతో మాట్లాడటంలో కొంత స్వేచ్ఛ ఉందని మనకు తెలుసు.

మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చే

మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండే

చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా

“మా తండ్రి జనకుడు తెలియక, మీరు చాలా పౌరుషం గలవారని నమ్మి మీకు నన్నిచ్చి పెళ్లిచేశాడు. మీరేమో ఇంకొకళ్ళ మీద మనస్సు పెట్టి, నన్ను నలుగురిలో చిన్నబుచ్చారు,” అని ఇప్పుడు ఊర్మిళ స్పష్టంగా తన భావాన్ని చెప్తుంది. ఈ ఆరోపణలన్నీ లక్ష్మణుడు తలవంచుకుని వింటాడు. లోపల బాధపడతాడు. మళ్ళా తనకి ఊర్మిళంటే ఎంత ప్రేమో ఆమె నిద్రపోతున్నప్పుడన్న మాటలే మరోసారి అంటాడు. మొత్తం అంతటినీ కర్మ పేర తోసేస్తూ తాము ఎప్పుడో పూర్వజన్మలో చేసిన పనికి ఇప్పుడు ఫలితం అనుభవించామంటాడు.

కథ ఇప్పుడు పెరటి వాకిలి లోంచి మధ్యగదుల్లోకి వస్తుంది. పొరపొచ్చాల్లేకుండా ఒకరితో ఒకరు పరిహాసోక్తులు చెప్పుకుంటూ ఉండే సమిష్టి కుటుంబం ఇక తరువాతి కథ లోది. మొట్ట మొదటి సారిగా ఊర్మిళ ఆ కుటుంబానికి కేంద్రమౌతుంది. కౌసల్య ఊర్మిళకీ, లక్ష్మణుడికీ తలంటి, జలకాలాడించి, కొత్త బట్టలు కట్టి షడ్రుచులతో రాజయోగ్యమైన భోజనం వడ్డిస్తుంది. ఒకళ్ళ మీద ఒకరు చెణుకులు విసురుకుంటారు. ఈ మాట్లాటలో సీతా, శృతకీర్తీ, మాండవీ (శృతకీర్తి, మాండవుల పేర్లు ఈ పాటలో లేవు. కానీ ఉన్నాయని మనం ఊహించుకోవచ్చు) ఒక పక్షమైతే శాంత ఇంకొక పక్షమౌతుంది.

తలలెల్ల జడలు గట్టె ఉదరమున వెదురు మొలచీయుండెను

తల్లి యుండేటి విధమూ తలచితే తాళ శక్యము గాదయా

ఉదరమున వెదురు మొలవడం అంటే ఏమిటో నాకు బోధపడలేదు. అదీకాక, వాల్మీకంలో సీత తల జడలు కట్టి ఉందనీ లేదు. ఇది అలా ఉంచి, రావణుడితో రాముడి యుద్ధం ఒక్క పంక్తిలో తెమిల్చేసింది కవయిత్రి. యుద్ధాల మీద ఆడవాళ్లకి ఆసక్తి లేదు. కాని సీత అగ్నిప్రవేశం మాత్రం బలంగా నడుస్తుంది. సీతని అలంకరించి తీసుకురమ్మని అడిగి, తీరా ఆవిడ అక్కడికి వొచ్చేక, “పదినెలలు చెర యున్నదీ భామతో భాషించ” నని అంటాడు రాముడు. అప్పుడు సీత “ఒట్టి సత్యములేటికీ ఓ రామ చిచ్చు గావించు” మంటుంది. లక్ష్మణుడి మాటల్లో ‘ఆకాశమంత పొడవు మంటలో మా వదిన మాటలాడింది. జగము నిండిన యట్టుల, ఆ మంట తటాకంలా అయింది.’ ఈ కథ చెప్పినవాడు లక్ష్మణుడు. పెద్ద రామాయణాల్లో లక్ష్మణుడు చెప్పుకోలేని సున్నితమైన విశేషాలు ఈ రామాయణంలొ వుంటాయి. రామాయణంలో స్త్రీ పాత్రలతో పాటు, లక్ష్మణుడు కూడా ఒక బలహీన పాత్రే అని కవయిత్రి ఉద్దేశం.

కథ పూర్తయ్యేటప్పటికి మనం కూడా పడగ్గది లోంచి ఆడవాళ్ళ గుంపు లోకి వస్తాం. అంటే ఇంటి పెరట్లోకి వస్తాం. అక్కడ అమ్మలక్కలు మగవాళ్ళ మీద ఎన్ని విసుర్లైనా విసురుకోవచ్చు. అందుకే కవయిత్రి రాసిన ఆఖరి మాట:

అక్కరో వింటిరటరే నేడు మన చక్రధరునీ బుద్ధులూ

ఇది ఊర్మిళాదేవి నిద్ర కథ. కాని నిజానికి ఈ పాట సమిష్టికుటుంబాలలో ఆడవాళ్ళు ఎలాంటి ఊహలు చేశారో, రామాయణం ఎలా జరిగితే బాగుణ్ణనుకున్నారో మనకు చెప్పే పాట.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!