నెయ్యిలేని కూడు.......విశ్వధాభిరామ వినురవేమ

నెయ్యిలేని కూడు

నెయ్యిలేని కూడు నీఆన కసవది
కూరలేని తిండి కుక్క తిండి
ప్రియము లేని కూడు పిండంపు కూడురా


భావము:
నెయ్యి లేని భొజనము గడ్డితో సమానము.కూరలేని తిండి కుక్క తిండితో సమానం. ప్రేమతో పెట్టని భోజనం పిండాకూడుతో సమానం. నెయ్యిలేకపొయినా ,కూరలేకపొయినా తిండి పెట్టండి పర్వాలేదు, కాని పెట్టెదేదయినా ప్రేమతొ పెట్టండి.అప్పుడే పెట్టినవారికీ పుణ్యము వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది.కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం,పెట్టేవారి ఆప్యాయత,ప్రేమ ముఖ్యం అంటున్నాడు ఈ పద్యములో వేమన.


చెప్పులోని రాయి చెవిలోని జోరీగ

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వధాభిరామ వినురవేమ

భావము:
పిల్లల నుంచి పెద్దల వరకు తెలిసిన ఈ పద్యము, వేమన శతకానికే
మకుటాయమానము.సామాన్యుల నుండి మాన్యుల వరకు అందరికీ ఇబ్బందులు
సమానము.చెప్పులో రాయి దూరినా,చెవిలో జోరీగ రొద పెట్టినా, కంటిలో నలుసు
పడినా ,కాలిలో ముల్లు గుచ్చుకున్నాకలిగే బాధ అనుభవైహికవేద్యమే తప్ప
అనిర్వచనీయము.వీటన్నిటికీ మించి ఇంటిలోని ఇల్లాలు సాధింపు,సతాయింపు ఇంకా
ధుర్భరము.వక్రీకరణము లేని ఇన్ని వాస్తవాలు చెప్పాడు కాబట్టే ఇప్పటికీ వేమన ప్రజాకవిగా
జనాల హృదయాల్లో నిలిచిపోయాడు.


తనువులస్థిరమని ధనములస్థిరమని

తనువులస్థిరమని ధనములస్థిరమని
తెలుపగలడు తాను తెలియలేడు
చెప్పవచ్చు పనులు చేయుట కష్టమౌ
విశ్వధాభిరామ వినురవేమ

భావము:
ఈ శరీరం,ఈ ధనం అన్నీ అశాశ్వతం అని డాంబికుడు పది మందికీ చెబుతాడే తప్ప,తాను
మాత్రం ఆ సత్యాన్ని విశ్వసించి ఆచరించడు. చెప్పడం తేలికే ఆచరించడమే కష్టము
అంటున్నాడు ఈ పద్యములో వేమన.చెప్పింది చేసి చూపించేవాడే ఆదర్శ
గురువు,కానివాడు మానవ సమాజానికే బరువు అని ఈ పద్య భావము. వేషభాషలతో
జనాన్ని మోసం చేస్తున్న వారికి ఈ పద్యము ఒక చురక, మోసపోతున్నవారికి ఒక
హెచ్చరిక.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!