కఠోపనిషత్ -By Vvs Sarma

కఠోపనిషత్ - 1By Vvs Sarma
అప్పుడప్పుడు మనం భగవద్గీతను గురించీ, మహాభారతం గురించీ, పురాణాలగురించీ చెప్పుకుంటున్నాము. వీని మూలగ్రంధాలగురించి తెలుసుకోవాలి. అవి వేదాలు. సంహితా, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అనేవి వేదభాగాలు. మొదటి మూడు భాగాలు యజ్ఞము, ఉపాసనా మార్గాల గురించి చెబుతాయి. ఉపనిషత్తులు జ్ఞానాన్ని ఇస్తాయి. వేదము యొక్క అంతరార్థాన్ని చెబుతాయి. భగవద్గీతను శ్రీకృష్ణుడు అన్నిఉపనిషత్తుల సారంగా, క్లుప్తంగా చెప్పాడు. మనకి మతం, పరమాత్మ, జ్ఞానం, గురించి వేధించే సంశయాలను నివారించుకోవాలంటే ఉపనిషత్తులే శరణ్యం. చిన్నదీ, అత్యంతగూఢమైనది, శ్రేయోదాయకమైన మార్గాన్ని చూపేది, కఠోపనిషత్తు. చిన్న పురాణకథలా కనుపిస్తూ, అద్భుతమైన సత్యాలను ఆవిష్కరిస్తుంది.
ఉపనిషత్ అనే పదం ఉప+ని+ సత్ (సద్), సత్ అనే పదానికి ముందుచేరిన రెండు ఉపసర్గల నుండి వస్తుంది. గురువు సమీపములో కూర్చుని సద్వస్తువునిగురించిన జ్ఞానాన్ని గ్రహించడం దీని అర్థం. మానవ జీవితంలో తప్పనిసరిగా ఎదురయ్యే ఘట్టం మృత్యువు. దీనికి సంబంధించిన జ్ఞానాన్ని, నాచికేతుడనే మునికుమారునికి మృత్యుదేవతయైన యమధర్మరాజు ఈయడం దీనిలోని విషయం. ప్రతి వ్యక్తికీ ఉండే సహజ లక్షణం తన మృత్యువును గురించిన భయం, సన్నిహితులమరణం గురించిన దుఃఖం. మరణానంతరం ఏమిటి? అనేది ప్రశ్న. మన విశ్వాసాలుతప్ప, అనుభవించి మనవద్దకు తిరిగివచ్చి మరణానంతరం మన గతి (ప్రయాణం) గురించి చెప్పేవారుండరు.

కఠోపనిషత్ – 2
మనం మృత్యువుని రెండు రకాలుగా భావిస్తాము - కాల మృత్యువు, అకాలమృత్యువు. దేవాలయంలో తీర్థమిచ్చేటప్పుడు "అకాలమృత్యుహరణం" అని పూజారి అంటాడు. కాలమృత్యువుని తప్పించలేరు. ప్రార్థన, జపములు, సుముహూర్తములు మొదలైన వాటివలన అపమృత్యువుకు నివారణోపాయములున్నాయి. ఇప్పుడు మన వార్తాపత్రికలలో వచ్చే వార్తలన్నీ అపమృత్యువులకు సంబంధించినవే. అది ఈ కాలపు సమాజంలోని అధర్మ వర్తనకు నిదర్శనం. మనం ఆత్మ శాశ్వతమనీ, కర్మఫలంగా పునర్జన్మ వస్తుందని నమ్ముతాం. కాని ఈ జన్మకు, రాబోయే ఉత్తరజన్మకు మధ్యయున్న ఆవరణ సామాన్యులు ఛేదింపలేనిది. ఉత్తర జన్మను గురించిన అజ్ఞానం వలన, మనకి ఉత్తర జన్మయేలేదన్న వాదం ఒక పలాయన వాదంగా ఉపయోగిస్తుంది. మన పురాణాలలో అసురులు మృత్యువును జయించడానికి తపోమార్గాన్ని ఎన్నుకున్నారు. సాధారణంగా వారు తపస్సుచేసినది బ్రహ్మను గురించి. మృత్యువును జయించే ఆ వరం సాధ్యం కాదని తెలిసినప్పుడు, వారు అనేక నిబంధనలతో కూడిన మరణం ఎన్నుకున్నారు. ఈ విధంగా తమ మృత్యువును బహుకాలం వాయిదా వేయడమే వారి ఉద్దేశ్యం. అనేక సంఘటనలు కలిస్తేనే వారి మరణం సంభవిస్తుంది. హిరణ్య కశిపుడు, రావణుడు వంటి వారలు దీనికి ఉదాహరణలు. రెండో రకం వారు యోగులు.వారు స్వచ్ఛంద మరణం వంటి విద్యలను సాధిస్తారు. మహాభారతంలో భీష్ముడు, ఆధునిక కాలంలో త్రైలింగస్వామి దీనికి ఉదాహరణలు. కఠోపనిషత్తు ఉద్దేశ్యమేమిటి? ఋషులు ఏమిచెప్పదలచారు? మనుష్యుడు సాధించగలిగిన మృత్యుంజయత్వమేమిటో దానికి మార్గమేమిటో సూచన ప్రాయంగా ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది. మృత్యుంజయత్వమంటే శరీరంలో శాశ్వతముగా ఉండడం కాదు. ఇది పరానికి సంబంధించినది. అంటే జనన మరణ చక్రం నుండి తప్పించుకునే మార్గాన్ని చెబుతుంది. మృత్యుభయాన్ని తొలగిస్తుంది. ఈ ప్రయత్నంలో సాధకుడు మార్గ మధ్యంలో మృత్యువాతబడినా, ఆ ప్రయత్నం వృథా కాదన్న ఆశ్వాసన ఇస్తుంది. నాచికేతుని పరంగా చెప్పబడిన ఈ విద్య నచికేతవిద్య అని పిలువబడుతుంది.
"ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మవిద్యాచార్యాయ నచికేతసే చ" నచికేతునికి బ్రహ్మవిద్యాచార్యుడైన సూర్యకుమారుడు-మృత్యుదేవతకు నమస్కారము. అది ఉపనిషత్తు ప్రారంభం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!