మోడి.

మోడి
మోడి అనునది ఒక జానపద కళా రూపం. మోడి అనగా మంత్ర, తంత్ర విద్యను ప్రదర్శించడం. ఫలాన రోజున ఫలాన పల్లెలొ మోడి ఎత్తుతారు అని ముందుగానే సమాచారం ఇచ్చి వుంటారు. ఇద్దరు మంత్ర గాళ్ళ మధ్యన పోటి ఈ మోడీ. మంత్రాలతో ఎత్తులకు పైయెత్తులు వేసి ఒకరి నొకరు అడ్డు కుంటుంటారు. చివరకు ఎవరో ఒకరు గెలుస్తారు. ఈ గారడి విద్య యాబై ఏళ్ళ క్రితమే మరుగైనది. ఇప్పుడెక్కడా మచ్చుకైనా జరగడము లేదు. నేటి తరం వారికి మోడి అంటే ఏమాత్రం తెలియని పరిస్థితి.
పూర్వ కాలంలో యదార్థంగా జరిగిన ఒక మోడి కళా విన్యాసం:
ఒకసారి మారేపల్లి సిద్దయ్య అనే ఒక పెద్దమనిషి వుండేవాడు. అతడేమి పెద్ద మాత్రికుడు కాదు కాని అతని ఆహార్యం మాత్రం మంత్రగాడిలాగే వుంటాడు. పెద్ద గడ్డం, మెడలో రుద్రాక్షలు, మొహాన వీభూతి రేఖలపై పెద్ద కుంకుం బొట్టు. అతను ఒక సాధారణ సాదుజీవనం గడుపుతూ భార్యా పిల్లలతో ఆ వూర్లోనే కాపురం వుండేవాడు. ప్రతిరోజు రాత్రులందు భజనలు చేసుకుంటూ వుండేవాడు. అతని తోడుకు కొంత మంది సాదువులు వచ్చి పాటలు పాడుతుండే వారు. వారు ఎక్కువగా బ్రంహంగారి తత్వాలు పాడు తుండే వారు. పిల్లల సంతోషార్థం చిన్న చిన్న ట్రిక్కులు, మంత్రాలు చేస్తుండే వాడు. బయటి వూరినుండి ఒక మంత్ర గాడు వచ్చి సిద్దయ్యతో తాను మోడి ఎత్తతానని మాట కట్టుకున్నాడు. సిద్దయ్య మోడి కట్టడి చేసే టట్టు, పరా వూరి మంత్రగాడు మోడి ఎత్తే టట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఊరి బయట ఒక పందిరి వేశారు. దానిముందు ముగ్గు పిండితో, బొగ్గు పిండి తోను దయ్యం ముగ్గులేసి మధ్యలో కుంకుమ, పశుపు, వేసి అక్కడక్కడా కోసిన నిమ్మకాయలను వేశారు. పందిరి ముందు బార కొక్కటి చొప్పున ఏడు చిన్న గుంతలు త్రవ్వారు. మొదటి గుంత త్రవ్వు తుండగా జానెడు లోతులోనె ఒక చింత వేరు అడ్డు పడింది. సిద్దయ్యకు ఒక ఆలొచన వచ్చింది. దాని ప్రకారం .... ఎద్దుల మెడకు కట్టే ఒక పలుపు తాడు తెచ్చాడు, పలుపు తాడు రెండు చివరలను ఒకటిగా కట్టి అక్కడ ఒక బంతిలాగ వుంటుంది. ఆ పలుపు తాడును గుంతలో కనబడిన చింత వేరుకు బందించి దాని కొసన వున్న బంతి మాత్రము పైకి పెట్టి దానికి పసుపు, కుంకుమ పూసి, అక్కడ రెండు నిమ్మకాయలు కోసి వేసినారు. దాని తర్వాత గుంతలో ఒక కోడి గుడ్డును, మోడో గుంతలో ఒక కొబ్బరి కాయను, ఆ తర్వాత ఒక నిమ్మకాయను ... .... ఇలా ప్రతి గుంతలోనూ ఒక వస్తువును వుంచి వాటిని మంత్రంతో కట్టడి చేశాడు. కట్టడి అంటే వాటి దగ్గరకి ఎవరైనా వస్తే రక్తం కక్కుకుని పడిపోతారు, లేదా ఇంకో పెద్ద ఉపద్రవం ముంచు కొస్తుంది. ఇదంతా చేసి మంత్ర గాడిని మోడి ఎత్తమని చాలెంజ్ చేశాడు.
మంత్ర గాడు పాముల బుర్ర వూదుతూ పాములాగా మెలికలు తిరుగుతూ వింత విన్యాసాలు చేస్తూ మొదటి గుంత వద్దకు వచ్చి దాని చుట్టు తిరిగి అందులోని వస్తువును తీయడానికి ప్రయత్నించి క్రింద పడిపోయాడు. వల్ల్ంతా దురద పెట్టి నట్లు వళ్ళంతా గోక్కుంటున్నాడు. తన శిష్యుడు వచ్చి ఏదో మంత్రించిన పొడిని చల్లుతాడు. అంతట తన బాధలను పోగొట్టుకొని తిరిగి పాములబుర్ర వూదుతూ.... మొదటి గుంతలో నున్న వస్తువును అతి కష్ణంగా తీసి వేశాడు. ఆ తర్వాత రెండో గుంత.... అందులో కోడి గ్రుడ్డు వుంది. ఆ గుంత చుట్టూ పాముల బుర్ర వూదుతూ అనేక విన్యాసాలు చేసి గుడ్డును తీయడానికి ప్రయత్నించగా ఆ గుడ్డు పిల్లగా మారి ఎగిరి పోతుంది. దానివెంబడి పడి పట్టుకొస్తాడు. మరో గుంత వద్దకు రాగానే దాని చుట్టూ మంటలు వ్వాపించాయి. దాన్ని అర్ప బోతే ఎంతకూ ఆరదు. మరో గుంతలోనున్న వస్తువును తీయబోతే అది పామై అతని చేయిని చుట్టుకుంటుంది. మంత్రం తో దానిని కట్టడి చేసి సంచిలో వేసి కట్టేస్తాడు. మరో గుంతలో చేయి పెట్టగానే అనేక తేళ్ళు బయటకు వస్తాయి. వాటి నన్నిటిని తన మంత్ర విద్యతో అచేతనం చేసి మరో సంచిలో పడేస్తాడు. ఇంతలో ఎవరో వాతలు పెట్టినట్టు వళ్ళంతా వాతలు తేలుతాయి. రక్తం కక్కుకుని నేలమీద పడి ఇక వీడి పని ఇంతే అనేంతగా విలవిల్లడి పోతాడు మంత్ర విద్యల ప్రభావంతో. అంతలో అతని శిష్యుడు వచ్చి ఏవో మంత్రాల వేసి రక్షిస్తాడు. మరలా పాముల బుర్ర పట్టుకొని వూదుతూ తిరుగుతాడు. ఇలా అన్ని గుంతల వద్దా అనేక పడరాని పాట్లు పడి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అవతలి వ్వక్తి మంత్రాలను చిత్తు చేస్తూ ఏడో గుంత వద్దకు వచ్చాడు. పశుపు, కుంకుమ పూసిన ఆ బంతి లాంటి వస్తువో అతనికి అర్థం కాలేదు. మారేపల్లి సిద్దయ్య మాత్రం ముగ్గు మధ్యలో కూర్చొని మంత్రాలు వల్లిస్తూనే వున్నాడు. అతని మంత్రాలు ఫలించి ఎదుటి మంత్రగాడి మంత్రాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి., ఈ గుంతల్లో పెట్టే వస్తువులు ఒకె విధంగా వుండవు.. ఒక్కో మంత్రగాడు ఒక్కోవిధంగా వస్తువులనేర్పాటు చేస్తాడు. కప్ప, పాము, పావురము, కాకి, తొండ వంటి ప్రాణులు, కొబ్బరికాయ,నిమ్మకాయ, మరెన్నో వింత వస్తువులు వుంటాయి.
ఎంత ప్రయత్నించినా ఆ బంతి లాంటి పదార్థము బయటకు రాలేదు. ఎన్నిమంత్రాలు వేసినా ఫలించ లేదు. చివరకు ఆ మంత్ర గాడు తన ఓటమిని అంగీకరించాడు. ప్రేక్షకులనుండి తలా కొంత ధనం భహుమానంగా ఇస్తారు ఇద్దరి మంత్ర గాళ్ళకి. ఆ విధంగా మోడి ముగుస్తుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!