Vvs Sarma కఠోపనిషత్ – 3

Vvs Sarma
కఠోపనిషత్ – 3
చిరంజీవులు - మృత్యుంజయులు = మన పురాణములలో చిరంజీవులు, మృత్యుంజయులుగా ఉన్నవారి ప్రసక్తి ఉంది. ఆంజనేయుడు చిరంజీవి. భవిష్యత్ బ్రహ్మ అని పురాణం చెబుతుంది. అశ్వత్థామ చిరంజీవి, భవిష్యత్ వ్యాసుడని పురాణ వచనం. మార్కండేయ మహర్షి జన్మ సమయంలో ఈశ్వరుడు ఆయనకు ఇచ్చిన వయస్సు పరిమితి 16 సంవత్సరాలు. ఆ సమయం వచ్చినప్పుడు మృత్యుదేవత దర్శనం అయినది. ఈశ్వరునిపై ఆయనకు గల ప్రగాఢ విశ్వాసం, ఆయన శరణాగతి, ఆయన వయస్సును 16 సం.లోపుగా నిలిపివేశాయి. ఆయన ఆవయస్సులోనే స్థిరముగా నిలిచి చిరంజీవి అయ్యాడు. తన మృత్యువును తాను జయించాడు. తరువాత ఆఖ్యానం సావిత్రిది. ఆమె భర్తయైన సత్యవంతుడు ఆమె ఎదురుగానే క్రిందపడి మరణించాడు. అతని జీవుని కొనిపోవటానికి యముడు స్వయంగా వచ్చాడు. సావిత్రికి దర్శనం ఇచ్చాడు. యమపాశంతో సత్యవంతుని జీవుని యముడు గ్రహించడం ఆమెకు కనుపించినది. సావిత్రి తన సామాన్య నేత్రములతో యముడు తన భర్త జీవుని పాశబద్ధునిచేసి గ్రహించుట, చూచుట అసంభవము. ఆమె సహజ యోగిని అయి ఉండవచ్చును. తన శరీరము యథాస్థితిలో ఉండగానే చిత్తములో యమ దర్శనముచేసి అతనితో సంభాషించుట యోగప్రక్రియయే. ఆమె యమునితో వాదించి మూడు వరములు పొందినది. అవి లౌకికమైనవే. మామగారి చూపు, శత్రువులచే అపహరింపబడిన ఆయన రాజ్యము, మూడవది పలువురు పుత్రులు. (యముడు ఆలోచించకుండా వరంఇచ్చాడా?) యముడు సత్యవంతుని ప్రాణాన్ని తిరిగి ఇస్తాడు. సావిత్రి ఆమెతండ్రికి వరపుత్రిక. తాను ప్రాణంతో ఉండి యముణ్ణి చూడగలిగినది. వాదించి భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకోగలిగినది. ఇది యోగమే. సావిత్రి వేరొకరి మృత్యువును జయింపగలిగినది. భగవంతుడైన శ్రీకృష్ణుడు గురుదక్షిణగా కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన సాందీపని కుమారుని ప్రాణాలు తిరిగితీసుకొని రావడం మూడవ కథ. కఠోపనిషత్తులోని నచికేతసునిది అందరికంటె విలక్షణమైనది. అందరికీ అవసరమైన మృత్యుంజయత్వ సాధనావిధానాన్ని మృత్యుదేవత నుండే గ్రహించి ఈ జగత్తుకు ఇచ్చాడు. మనకు గురుతుల్యుడు.
ఆధునిక కాలంలో కొందరు యోగులు శరీరమునుండి కొంత సమయము బయటకు వచ్చిన అనుభవమును (O.B.E. Out of body experience) వర్ణించారు. రమణ మహర్షికి ఒకరోజు తాను మరణిస్తున్న భావము కలిగినది. ఆత్మ శరీరమునుండి బయటకు వచ్చి, తన దేహమును తాను చూచుకొని ఆత్మ శరీరమునుండివేరని తెలుసుకున్నది. ఆ శరీరమును దహనము చేసినను, అది తనను బాధించదని, తాను శరీరమునుండి వేరు వస్తువని మహర్షి తెలుసుకొనిరి. షిర్డి సాయిబాబా ఆత్మ మూడు రోజులు శరీరమును వదలిన అనుభవము ఆయన చరిత్రలో ఉన్నది. ఇవి చాల ప్రత్యేకమైన అనుభవాలు; తమ పూర్వ జన్మ సాధనల వలన ఆయా జీవులకు అనుభవమైన విషయాలు. ఇవి అన్యులకు అనుభవంలోనికి రావు. 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!