భానుమతీ రామకృష్ణ


భానుమతీ రామకృష్ణ

భానుమతి 1925 వ సంవత్సరము సెప్టెంబరు నెలలో ప్రకాశం జిల్లా ఒంగోలు లో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య , శాస్త్రీయ సంగీత ప్రియుడు మరియూ కళావిశారదుడు.

భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడట. హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.

ఆమె 1943 , ఆగష్టు 8 న తమిళ , తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడినది. వీరి ఏకైక సంతానం భరణి . ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.

భానుమతి గారు అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. విజయావారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రి ని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించింది..

భానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా నిర్వర్తించి శభాష్అనిపించుకున్నది .

1956 నందు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము

మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు , పల్నాటియుద్ధం అను తెలుగు సినిమాలకు)

అన్నాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు.

తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ, ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు

1966 లో ఆమె వ్రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.

ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.

1975 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది.

1984 లో కలైమామణి బిరుదుతో తమిళనాడు నందలి ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.

బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984 ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.

1984 లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.

1986 లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.

1986 లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.

2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలయిన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో ఒకటి భానుమతి ది.

2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు బాష్పాంజలి ఘటించారు.



భానుమతి రచనలు

అత్తగారి కథలు

నాలో నేను

అత్తగారూ, నక్సలైట్లూ

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!