ఆదిత్య హృదయం పరమ పవిత్రం

ఆదిత్య హృదయం పరమ పవిత్రం

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ 

జయావహం జపేన్నిత్యం మక్షయం పరమం శుభం 

సర్వమంగళ మాంగల్యం సర్వ పాప ప్రణాశనమ్ 

చింతాశోక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమమ్

పాపాలను, శాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుష్షును పెంచే అక్షర సాధనం ఆదిత్య హృదయం. ఈ అమోఘమెన స్తోత్రరాజాన్ని శ్రీరామచంద్రునికి అగస్త్య మహర్షి మంత్రాలవంటి మాటలలో వివరించాడు. ఆరోగ్య భాగ్యమును సకల సంపదలను ప్రసాదించే వానిగా, ప్రత్యక్షదైవముగా సూర్య భగవానుడు పేరు ప్రఖ్యాతి కాంచినాడు. ఆదిత్య హృదయం మహా పవిత్రమైన గ్రంథం. శ్రీమద్‌ రామాయణ మహాకావ్యంలో యుద్ధకాండలో 105వ సర్గలో సూర్య భగవానుని స్తుతికి 'ఆదిత్య హృదయం' అని నామకరణం చేశారు. వీటిలో ఆదిత్య నామం శ్రీరామాయణ కర్త అయిన వాల్మీకి మహర్షికి చాలా ఇష్టం. ఆదిత్యులు 12 మంది. అందులో విష్ణువు ముఖ్యుడు. ఆదిత్యులలో ''నేను విష్ణువు''ను అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. ''ఆదిత్యానా మహం విష్ణుం''. అందువల్ల ఆదిత్య హృదయంను విష్ణువు స్తోత్రంగా భావిస్తారు. ఆదిత్య హృదయం విశేష పుణ్యప్రదమైనది. దీనిని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా పారాయణం చేస్తే యిహలోకాన అన్ని రకాల సంపదలు, పరమున పుణ్య లోకములను పొందును. సంతానం లేనివారు 'ఆదిత్య హృదయం'ను నిత్యం పారాయణం చేసినచో వారికి సంతానం కలుగును. న్యాయ వివాదాలలో చిక్కుకొని కోర్టుల చుట్టు తిరుగుతూ సతమతం అయ్యేవారు దీనిని పారాయణం చేసిన వారికి విజయం కలుగుతుంది. దరిద్రంతో భాదపడుచున్న వారు అనునిత్యం పారాయణం చేస్తే వారికి సకల అష్ట ఐశ్వర్య సంపదలు కలుగుతాయి. అనారోగ్య రుగ్మలతో బాధపడుచున్నవారు ఆదిత్య హృదయం పారాయణం చేసినచో వారి రోగాలు మాయమగును. నిరుద్యోగులు పారాయణం చేస్తే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు పారాయణం చేసినచో పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆదిత్య హృదయం రామ, రావణ సంగ్రహములో వెలువడింది. అమోఘమైన తపశ్శక్తి కలిగిన రావణాసురున్ని వధించడానికి శ్రీరామునికి శక్యం కాలేదు. రావణుడు చావు లేకుండునట్లు అనేక వరాలు పొందడం వల్ల శ్రీరామునకు రావణాసుర వధ వీలుకాలేదు. శ్రీరాముడు ఎన్ని అస్త్ర శస్త్రములను ప్రయోగించినా రావణుడు చావలేదు. దీనితో శ్రీరాముడు చింతాక్రాంతుడై ఉండెను. రామరావణ యుద్ధాన్ని చూడటానికై దేవతలతో కలిసి ఆగస్త్య మహాముని శ్రీరాముని చేరుకొని యిట్లనియే 'ఓ రామా! నీకు మహా పవిత్రమైన రహస్యమును చెప్పెదను వినుము. దీనివల్ల నీవు యుద్ధమున రావణున్ని సులభంగా జయించగలవు. మహా పుణ్యప్రదం, జయప్రదం, మంగళకరం, శుభకరం, సమస్త పాపాలను నశింపజేయు, దీర్ఘ ఆయుష్షును కలుగజేయు ఆదిత్య హృదయం నీకు ఉపదేశించెదను. దీనిని నీవు భక్తి శ్రద్ధలతో పఠించిన యెడల యుద్ధములో సులభంఆ జయించెదవు' అని మంత్రమును ఉపదేశించెను. బ్రహ్మ మొదలగు సమస్త దేవతలు, అనగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, తొమ్మండుగురు ప్రజాపతులును, దేవేంద్రుడు, కుబేరుడు, మృత్యువును, యముడును, చంద్రుడును, సముద్రుడును అను వీరందరును ఇతడే. పితృదేవతలు, అష్టవసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని మొదలగు వారిలో సూర్యుడే అంత ర్యామియై ఉన్నాడు. బంగారు రూపం గల అందం గర్భమందు గలవాడు. బంగారంతో సమానమైన అంత:కరణ గలవాడవును, చల్లనివాడవును, శత్రుసంతా నములను పోగొట్టువాడవును, లోకమునకు వెలుతుతురు కలుగజేయు వాడువును, అదితియొక్క కుమారుడవును, మంచును పోగొట్టువాడవును అగు నీకు భక్తితో నమస్కరించి స్తోత్రమును చేయుచున్నాను. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే నాలుగు వేదములయొక్క సారం అయిన వాడవు. సమస్త వేదాలును నీవే అయిన వాడువును సముద్రజలముపై శయనించు వాడవును. దక్షిణాయనమున వింధ్య పర్వత మున సంచరించువాడవును అయిన నిన్ను భక్తి శ్రద్ధలతో సేవించుచున్నాను అని శ్రీరాముడు అనెను.

సమస్త నక్షత్రములకును, గ్రహములకును అధిపతివయిన వాడవును లోకమునకు ఆధారభూతుడవును, స్వర్గం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలతో ఉండు ఆకాశం, దిక్కులు, భూమి, సముద్రం అన్నీ నీ వీర్యముచే నిలిచి ఉన్నవి. ఇంద్రుడు, ధాత, భృగుడు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, ఆర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు అను పేరు గల 12 ఆదిత్యులలో అంతర్యామి అయిన నీకు భక్తితో నమస్క రిస్తున్నాను. ప్రళయ కాలమున ఈశ్వరుడు ఈ జగత్తును నాశనం చేయగా మరల సృష్టించి, కిరణములచే లోకానికి తాపమును కలుగజేసి వర్షాలను కురిపించి సర్వజయాలను కలుగజేసి వర్షాలను కురిపించి సర్వ జయాలను కలుగజేసే నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈవిధంగా ఆదిత్య హృద యమును మూడుసార్లు పఠించగా ఆ పరమాత్ముడు ఆనందించినవాడై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పులకాంకిత శరీరుడై శ్రీరాముని జూచి ''ఓ రామా! రావ ణునకు అంత్య కాలము సంప్రాప్తించినది ఆలస్యం చేయక త్వరపడుము'' అని ఆశీర్వదించాడు. త్వర అనే మాట ఆదిత్యుని నోట వెలువడిన వెంటనే రావణ సంహారం జరిగి లోక కల్యాణం జరుగుతుంది. బయటి శత్రువులనే కాక అంతశ్శత్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయం అమోఘమైన అక్షర సాధనం అని ఉపదేశించాడు. తాను వెలుగతూ ప్రపంచానికి వెలుగును ప్రసాదించే భాస్కరుని నమ్ముకుంటే ఏమి లోటు ఉండదనెను

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!