పోతన - శ్రీమద్భాగవతం ! (ప్రహ్లాద చరిత్ర)

పోతన - శ్రీమద్భాగవతం !

(ప్రహ్లాద చరిత్ర)

.

ఇందుగలడందులేడని 

సందేహము వలదు చక్రి సర్వోపగతుండు

ఎందెందు వెదకి చూచిన

అందందే గలడు దానవాగ్రణి వింటే!

.

రాక్షసరాజయిన హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి అంటే ద్వేషం. కాని అతడి కొడుకు ప్రహ్లాదుడికి మాత్రం విష్ణువంటే మహాభక్తి కావడం వల్ల ఎప్పుడూ శ్రీహరినే ధ్యానించేవాడు. దాంతో కొడుకుపైన హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. ఎన్ని విధాలుగా చెప్పినా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని మానుకోకపోవడంతో నిజంగానే శ్రీహరి అంతటా ఉన్నాడా? అని కొడుకును ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానమే ఈ పద్యం. 

.

తాత్పర్యం: విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సందేహం అక్కరలేదు. ఆయన అన్నిచోట్లా ఉంటాడు. ఎక్కడ వెతికితే అక్కడే కనపడతాడు. 

ఓ రాక్షసరాజా! ఇది సత్యం. 

ఈ పద్యంలో, ‘ఇందు, అందు, ఎందెందు, అందందే’ అనే పదాలు వచ్చాయి. 

ఇవన్నీ ఒకేలాంటి పదాలు కావటం వల్ల వినడానికి చాలా హాయిగా ఉంటాయి. 

అంతేకాదు ఇలాంటివి నేర్చుకోవటం కూడా తేలిక.

.

చదివించిరి నను గురువులు

చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్ నే

చదివినవి కలవు పెక్కులు

చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!

.

పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని పద్యం ఇది.

హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని విద్యాభ్యాసం కోసం గురువులైన చండామార్కుల వారి దగ్గర చేర్చుతాడు. కొంతకాలం గడిచాక, 

కుమారుడు ఎంతవరకు చదువుకున్నాడో తెలుసుకుందామనే ఉద్దేశంతో 

ఆశ్రమానికి వచ్చి, కొడుకును ప్రశ్నిస్తాడు.

ఆ ప్రశ్నకు జవాబుగా ప్రహ్లాదుడు చెప్పినదే ఈ పద్యం...

.

భావం: తండ్రీ! గురువులైన చండామార్కులవారు నన్ను బాగా చదివించారు. 

ధర్మానికి, అర్థానికి సంబంధించిన ముఖ్యశాస్త్రాలన్నీ చదివాను. అంతేకాదు ఇంకా చాలా విషయాలు కూడా చదివాను. చదువులలో దాగి ఉన్న విషయాలన్నిటినీ తెలుసుకున్నాను.

ఈ పద్యంలో ప్రహ్లాదుడు ‘చదువులలో మర్మమెల్ల’ అన్న మాటను... అన్ని విద్యలలోనూ దాగి ఉన్నది భగవంతుడైన విష్ణుమూర్తి మాత్రమే అనే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని పలుకుతాడు. ఇందులో ‘చదువు’ అనే పదం నాలుగు పాదాలలోనూ ఉంది. అందువల్ల నేర్చుకోవడానికి ఇబ్బంది లేకపోవడమేగాక, వినడానికి కూడా ఇంపుగా ఉంటుంది.

.

చదువనివాడజ్ఞుండగు 

చదివిన సదసద్వివేక చతురత కలుగున్

చదువగ వలయును జనులకు

చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రీ!

.

రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునితో చదువు 

యొక్క విశిష్ఠత గురించి చెప్పిన సందర్భంలోనిది ఈ పద్యం. ఇ

ది పోతన భాగవతంలోని ప్రహ్లాదచరిత్రలోనిది. 

.

భావం: నాయనా ప్రహ్లాదా! చదువుకోనివాడు అజ్ఞాని అవుతాడు. బాగా చదువుకుంటే సత్, అసత్ అంటే ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు బాగా అర్థమవుతాయి. అందుకే అందరూ శ్రద్ధగా చదువుకోవాలి. అది కూడా గురువుల దగ్గరకు వెళ్లి మాత్రమే చదువుకోవాలి. కాబట్టి మన కులగురువులైన చండామార్కుల వారి దగ్గర నిన్ను చదివిస్తాను.

.

ఈ పద్యంలో చదువుకోవడం ఎంత అవసరమో చెబుతూ, అది గురువుల దగ్గర 

చదువుకోవాలనే విషయాన్ని తెలియచేశాడు పోతన. రాక్షసరాజయినప్పటికీ 

హిరణ్యకశిపునికి గురువుల పట్ల గౌరవం ఎక్కువ. 

ఈ పద్యంలో ‘చదువు’ అనే పదాన్ని వాడుతూ, పిల్లలంతా ఎందుకు 

చదువుకోవాలో చక్కగా వివరించాడు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!