బుద్ధిమతాం వరిష్టం"!

బుద్ధిమతాం వరిష్టం"!

.


భారతీయులకు హనుమంతుణ్ని వివరంగా పరిచయం చేసిన కావ్యం- 

వాల్మీకి రామాయణం! 

ఒక భీష్ముడు, ఒక దశరథుడు, ఒక విశ్వామిత్రుడు తెలిసినంత బాగా మనకు- 

మన సొంత తాత ముత్తాతల గురించి తెలియదు. 

అందుకు కారణం- వ్యాసవాల్మీకులు.

వారి పాత్ర చిత్రణా చాతుర్యం కారణంగా- ఆయా పాత్రలతో మనకు గట్టి పరిచయం, చనువు ఏర్పడ్డాయి. . 

నిజానికి వాల్మీకి రామాయణంలో హనుమంతుడు భక్తుడే తప్ప, భగవంతుడు కాడు. శ్రీరామచంద్రుణ్ని సైతం భగవంతునిగా వాల్మీకి పేర్కొనలేదు. 'పురుషోత్తముడు' అన్నాడంతే! 'అంజనానందనం వీరం- జానకీ శోకనాశనం' అన్నంత వరకే వాల్మీకి చిత్రణ.

దాన్ని అందిపుచ్చుకున్న అన్నమయ్య 'బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి సేతల హనుమంత!' అన్నాడు. 

భక్తి, వినయం, వివేకం, బలం, ధైర్యం, వాక్పటిమ, సమయజ్ఞత వంటి ఉన్నతోన్నత గుణాల మేలు కలయికగా వాల్మీకి హనుమను పరిచయం చేశాడు. ఆ చిత్రణ భక్తుల గుండెల్లో ఎంతటి బలమైన ముద్రవేసిందంటే- యత్రయత్ర రఘునాథకీర్తనం, తత్రతత్ర కృత మస్తకాంజలి... ఎక్కడెక్కడ శ్రీరామనామం వినవస్తున్నా- అక్కడక్కడల్లా వినయంగా తలవంచి, చేతులు మోడ్చి, ఆనంద బాష్పాలు చిందించే హనుమంతుడు సాక్షాత్కరించడం మొదలైంది.

నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన పిల్లవాణ్ని 'ఆంజనేయ దండకం చదువుకుని పడుకో నాన్నా... భయం లేదు' అంటూ వీపుమీద జోకొట్టిన అమ్మ చేతిస్పర్శలా, ఓదార్పు వచనంలా- 

హనుమ అనే భావన ధైర్యం చెబుతూ వచ్చింది. చెలిమి చేసిన వానర సహచరులకీ, చేరదీసిన ప్రభువు సుగ్రీవుడికీ, ఆరాధ్యదైవమైన శ్రీరాముడికీ సైతం సహాయపడిన 'అభయ' ఆంజనేయుడు తమ పాలిట సర్వభద్రంకరుడన్న గట్టి విశ్వాసం భక్తుల్లో వ్యాప్తిచెందింది.

ఉదాత్తమైన వ్యక్తిత్వంతో విశేషంగా ఆకర్షించి, భక్తుల హృదయాల్లో దేవునిలా ఎదిగిపోయిన హనుమకు ఎంతో ప్రాచుర్యం లభించింది.

లక్ష్మణుడికీ, భరతుడికీ ఎక్కడా విడిగా గుడులు లేవు. 

హనుమ శ్రీరాముడికన్నా అధిక సంఖ్యలో తన పేరిట మందిరాలు వెలసిన చరిత్రను సొంతం చేసుకున్నాడు. దివ్య దేవాలయ ప్రాంగణం వంటి రామాయణంలో సుందరకాండను గర్భగుడిగా స్థిరపరచి, దాన్ని నిత్య పారాయణకాండగా మలిచాడు. వానరుడై జన్మించి, భక్తునిగా పరిచయమై, దైవంగా ఎదిగినవాడు హనుమంతుడు. 

సముద్రాన్ని లంఘించే ఘట్టంలో ఆయన నందీశ్వరుడిలా ఉన్నాడని (గవాంపతి రివాబభౌ), చారణాచరితేపథి... చారణా మార్గంలో పయనిస్తున్నాడని వాల్మీకి చేసిన వర్ణనల్లో రహస్య సంకేతాలను ఆకళించుకున్న భక్తుల గుండెల్లో ఆయన త్రివిక్రముడిలా ఎదిగాడు. 

రాముడికి బదులుగా ఆయన పాదుకలను సింహాసనంపై ఉంచి, భరతుడు రాజ్యపాలనా బాధ్యతలను వహించిన విషయం మనం రామాయణంలో చదివాం. 

కేంద్ర సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు పొందిన లక్నోలోని సర్దార్‌ భగత్‌సింగ్‌ కళాశాల సరిగ్గా ఆ విధానాన్నే అమలుచేస్తోంది.

ఆ కళాశాల పాలకమండలి తమ ఛైర్మన్‌గా ఆంజనేయ'స్వామి'ని ఎన్నుకుని తీర్మానం చేశారు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ స్వామిపేరు మీద జరుగుతాయి. పాలకమండలి సమావేశాల్లో స్వామికి ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేశారు. స్వామి ప్రతినిధిగా ఉప ప్రధాన అధికారి వివేక్‌ కాంగ్రి అధికారిక నిత్యవిధులు నిర్వహిస్తారు.

రామలక్ష్మణులకు లక్ష్యసాధనలో దారి చూపించిన ఆంజనేయుడు తమ సంస్థ విజయాలకు తప్పక దారి చూపిస్తాడని వారు గట్టిగా నమ్ముతున్నారు. 

దేవుడు దేనియందు ప్రతిష్ఠితుడై ఉన్నాడన్న ప్రశ్నకు వేదం గొప్ప జవాబు చెప్పింది. స భగవః కస్మిన్‌ ప్రతిష్ఠితః- ఇతి స్వే మహిమ్ని!- 

ఆయన తన మహిమలోనే ప్రతిష్ఠితుడై ఉన్నాడు అంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!