స్వీయపరిశీలన!......(శ్రీరమణమహర్షి )

స్వీయపరిశీలన!......(శ్రీరమణమహర్షి )

.

రాత్రి 'భగవాన్ బోధ' అన్న పుస్తకమును కొద్దిగా చదివాను. 

ఆ పుస్తక ముఖచిత్రంపై శ్రీరమణులుతో పాటు ఓ కొటేషన్ -

"సంకల్పాలు తలెత్తినప్పుడే ద్వైతం కనబడుతుంది.

అహం మూలాన్వేషణే ఈ ద్వైతభ్రాంతిని పోగొట్టుతుంది.

ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం ఆత్మను పొందటం కాదు,

అహంకారాన్ని పోగొట్టుకోవడం"

శ్రీరమణులు సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు ఇందులో...

గ్రంధాలు ఏ గందరగోళం వుండనక్కరలేనిచోట గందరగోళాన్ని సృస్టిస్తాయి. ఉదాహరణకు అవి పంచభూతములు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు, పంచఉపప్రాణాలు, పంచకోశములు, పంచీకరణం, చిదాభాసుడు, కూటస్తుడు, సూక్ష్మశరీరం, కారణశరీరం, చిజ్జడగ్రంది, విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ఇలా కొండవీటి చాంతాడు లాగా వివరించుకుంటూ పోతూ, ఇవన్నీ సాధకుడు బట్టీ పెట్టవలననియు, తెలుసుకోవలననియు, ఇదే జ్ఞానమనియు అర్ధమొచ్చేలా వుంటాయి. ప్రారబ్ధం, సంచితం,ఆగామి అంటూ ఏవేవో వివరిస్తాయి. నిజానికి ఆత్మానుభవంనకు ఇవన్నీ అవసరమా?

.

అద్వైతం, ద్వైతం, విశిష్టద్వైతం, నిరాకారం, సాకారం, జాగృతి, చైతన్యం...... ఓహో... ఒకోదానిగురించి ఎన్నో వివరణలు, విశ్లేషణలు చదివి వుంటారు. కానీ అంతర్ముఖులు కాలేక పోతున్నారెందుకని?

.

శాస్త్రాలా అంతిమ లక్ష్యం "మనోనిగ్రహమే" అని ఒకసారి తెలుసుకున్నతర్వాత అంతూపొంతూ లేకుండా వాటిని అధ్యాయనం చేస్తూ, చర్చిస్తూ కూర్చోవడం నిరర్ధకం కాదా?

.

వేదాలు, శాస్త్రాలు, గ్రంధాలు, ఇవన్నీ కూడా సర్వోన్నతశక్తి వుందని తెలిపేందుకు, అది ఆత్మగా భాసిల్లుతుందని చెప్పేందుకు, దానికి దారి చూపేందుకు మాత్రమే ఉపకరిస్తాయి. వాటియొక్కసారం మనం ఆత్మస్వరూపులమే అని చెప్పడమే. వాటి ప్రయోజనం, ముఖ్యోద్దేశం ఇదే. అది అర్ధమై కూడా ఇంకా పుస్తకాల్లో మునిగిపోవడం ఎందుకు? ఆత్మవిచారణ చేయక వాటిని గురించే మాట్లాడుకోవడం ఎందుకు?

.

ఆధ్యాత్మికసాధన అంతరంగమునకు సంబందించినది. అది అంతరములోనే జరగాలి. నీకై నీవే నీలోనే దానిని అనుభవించాలి. అంతేకానీ, అధ్యాయనం ద్వారా ఆత్మని తెలుసుకోలేవు.బయట చర్చించి పట్టుకోగాలవా? బాహ్యముగా అన్వేషించగలవా? ఇది తెలిసి కూడా వీటి మధ్యే ఎందుకుండిపోతున్నావ్?

ఎన్నోరకాలుగా (శ్రవణం,గ్రంధ పఠనం మొ..) ఎంతో జ్ఞానం పొందివుంటారు. అయినా భాదపడ్తున్నారు, ఎందుకని? మనస్సుని ఆత్మలో నిలపడమే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్నిఆచరణలో పెట్టలేకపోవడం వలనే దుఃఖ పడ్తున్నారని గ్రహించరెందుకని?

.

ధర్మాచరణ, సత్సాంగత్యం, సత్ కర్మలు,సద్భావనల వలన సత్వగుణమును పొంది వుంటారు. అయినా దుఃఖిస్తున్నారెందుకని? ఇంకా మనస్సుని తగిలించుకొని వుండడంవలనే. లోచూపు అలవర్చుకొని అసలైనదానిని పట్టుకోక ఎందుకు ప్రయాసపడతారు?

............. ఇంకా చాలా వున్నాయి, చివరగా కొన్ని పేజీలయందు జ్ఞానం గురించి ఉంది. కానీ చదవలేకపోయాను....... 

అప్పటికే నాలో ఏదో మధనం...... అంతర్మధనం........ స్వీయపరిశీలన......... 

ఆధ్యాత్మిక చర్చల్లో చిక్కుకోకు. శాస్త్రాల్లో శోధించకు. నీ లక్ష్యం ఒక్కటే - అది ఆత్మానుభవం(ఆత్మసాక్షాత్కారం). దానిపైనే నీ దృష్టినంతా పెట్టు. ఆత్మవిచారణే దీనికి సరైన మార్గం అన్న రమణమహర్షి మాటలు చదివిన దగ్గరనుండి ఒకింత స్వీయపరిశీలన........

భగవంతుడు, భక్తి, సృష్టి, సాధన, ధ్యానం, ధర్మాచరణములు, మనస్సు, మాయ....... వీటి గురించి తోటిసాధకులతో చర్చిస్తూ, పుస్తకాల్లో చదువుతూ,ఆధునిక మాధ్యమాలు(టి.వి, నెట్)ద్వారా తెల్సుకుంటూ, చాలావరకు ఆచరణలో పెడుతున్నాను. కానీ కాలం కరిగిపోతుందే తప్ప ఆత్మనుభవం కలగడం లేదెందుకని........ అన్న ఆలోచన......

అప్పుడు స్పురించింది..... నేను ఇప్పుడిప్పుడే(గత ఇదు,ఆరేళ్ళుగా) ఆధ్యాత్మికపయనం ప్రారంభించిన సామాన్య సాధకురాలిని. ఓ పరిపక్వ స్థాయిలో వున్న సాధకులకు అర్ధమయ్యే రమణబోధలను నేను అర్ధంచేసుకోలేనని. అవి అర్ధమవ్వాలంటే నా సాధన చాలదని. అంతటి జ్ఞానసారము గ్రహించే శక్తి నేనింక పొందలేదని. ఆ అనుభవం పొందాలంటే అందుకు ఎంతో ప్రయత్నించాలని. ఆత్మవిచారణ, అంతర్వీక్షణ ఎలా చేయాలో నాకు తెలియదు. తెలిసేటట్లు చేయమని ఆ భగవంతున్ని ప్రార్ధన చేస్తున్న మూగగా. 

భగవంతుడు, ప్రార్ధన చేయడమంటే........ భగవంతుడు, నేను వేర్వేరు.... ద్వైతభావనంటే ఇదే.... 

భగవంతుడు, నీవు వేర్వేరు కాదని రమణుల బోధ........ దేహంలో "నేను"న్నంతవరకు, ఆ "నేను" అనుభూతికి వచ్చేంతవరకు ఈ ద్వైతభావన తప్పదనుకుంటాను. 

కానీ, సాధన ధృడపడేంతవరకు, మనస్సును జయించేంతవరకు సద్గ్రంధ పఠనం చేయాలి. వేద పురాణేతిహాసాల్నీ అధ్యాయనం చేయాలి. మహాత్ముల ప్రవచనాల్ని ఆకళింపు చేసుకోవాలి. నిరంతర స్మరణ, శాస్త్రచర్చ, సత్సంగం వుండాలి. అప్పుడే ఆధ్యాత్మిక అవగాహన ఏర్పడుతుందని నా భావన.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!